నేటి నుంచి అమిత్ షా పర్యటన
నల్లగొండ జిల్లాలో కార్యకర్తలు, మేధావులతో భేటీ
- రెండేళ్ల ముందుగానే ఎన్నికల ప్రచారానికి షా శ్రీకారం
- రాష్ట్రంలో అధికారమే లక్ష్యంగా వ్యూహ రచన
- కిందిస్థాయి నుంచి బీజేపీ బలోపేతంపై దృష్టి
సాక్షి, హైదరాబాద్: సార్వత్రిక ఎన్నికలకు రెండేళ్ల ముందుగానే బీజేపీ జాతీయ అధ్య క్షుడు అమిత్షా రాష్ట్ర పర్యటన రూపంలో ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టనున్నారు. సోమవారం నుంచి బుధవారం వరకు నల్లగొండ జిల్లాలో చేపట్టనున్న ఈ పర్యటన రాజకీయవర్గాల్లోనే కాకుండా ఇతర రంగా లకు చెందిన ప్రముఖుల్లో ఆసక్తిని రేకెత్తి స్తోంది. మౌలికంగా రాష్ట్రంలో పార్టీని సంస్థా గతంగా పటిష్టం చేసేందుకు అమిత్షా ఈ పర్యటనకు వస్తున్నా, కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీకి అధ్యక్షుడిగా ఇది రాజకీయంగా అత్యంత ప్రాధాన్యాన్ని సంతరించుకోనుంది. ఒక జాతీయపార్టీ అధ్యక్షుడు మూడురోజుల పాటు ఒక జిల్లాలో క్షేత్రస్థాయిలో పర్యటించ డమే అరుదు. తెలంగాణలో బీజేపీని పోలింగ్ బూత్ స్థాయివరకు పటిష్టం చేసి, అధికారం లోకి వచ్చేందుకు అవసరమైన కార్యాచరణను రూపొందించడమే ఈ పర్యటన ముఖ్యోద్దేశం.
ఒంటరి పోరుకు సంకేతాలు..!
మారుతున్న బీజేపీ నాయకుల ఆశలు, ఆకాం క్షల మధ్య అమిత్షా పర్యటన మొదలు కానుంది. రాష్ట్రంలో పార్టీ ఒంటరిగానే పోటీ చేస్తుందని, టీఆర్ఎస్తో ఎలాంటి స్నేహ బంధం ఉండదనే సంకేతాలను ఇవ్వవ చ్చునని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. గతంలో సూర్యాపేట, వరంగల్లో జరిగిన బహిరంగ సభల్లో కేంద్ర ప్రభుత్వ నిధులను దారి మళ్లిస్తున్నారంటూ టీఆర్ఎస్ ప్రభుత్వంపై విమర్శలు చేసిన అమిత్షా, ఈ పర్యటన సందర్భంగా తన స్వరాన్ని మరింత పెంచవచ్చునంటున్నారు. అదేవిధంగా కాంగ్రెస్పార్టీని, వామపక్షాలను లక్ష్యంగా చేసుకుని తీవ్ర విమర్శలు చేయడంతో పాటు బీజేపీ ప్రధాన ప్రతిపక్షంగా, టీఆర్ఎస్కు ప్రత్యామ్నాయ పార్టీ ఎదుగుతుందనే స్పష్టమైన సంకేతాలను ఇస్తారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
ఎస్సీ, ఎస్టీ, బీసీలకు చేరువ..
మరోపక్క ఇప్పటివరకు పార్టీకి దూరంగా ఉన్న వివిధ సామాజికవర్గాలను దగ్గరకు తీసు కోవడానికి ఈ పర్యటన ఉపయోగప డుతుందనే భావనలో పార్టీ నాయకుల న్నారు. రాష్ట్రంలో 90 శాతం వరకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ ప్రజలున్నందున ఈ వర్గాలకు పార్టీ చేరువ య్యేలా, వారికి నమ్మకం కలిగించే చర్యలను చేపట్టనున్నారని చెబుతున్నారు. ముస్లిం రిజర్వేషన్లను 12 శాతానికి పెంచడం వల్ల బీసీలు, ఓబీసీలకు రాజకీయంగా, విద్యా, ఉద్యోగపరంగా జరగనున్న నష్టాన్ని వివరించడం, ఎస్సీలను ఏబీసీడీలుగా వర్గీకరించేందుకు కేంద్రం నుంచి సానుకూలతను తెలియజేయడం, ఓబీసీ కమిషన్కు రాజ్యాంగబద్ధత, ఎస్టీలను ఆదుకునే చర్యలు.., ఇలా ఆయా వర్గాలను మంచి చేసుకునే ప్రయత్నాలకు శ్రీకారం చుడతారని పార్టీ నాయకులు భావిస్తున్నారు
దళితుల ఇళ్లలో భోజనాలు..
అమిత్షా ఈ పర్యటనలో గ్రామస్థాయిలో ఇంటింటికి వెళ్లడం, పోలింగ్బూత్ కమిటీ సభ్యులతో సమావేశం, దళితుల ఇళ్లలో భోజనాలు, దాదాపు అన్ని జిల్లాలకు చెందిన మేధావులు, ప్రముఖులు, పార్టీ సానుభూతిపరులతో ప్రత్యేకంగా సమావేశం కావడం, రాష్ట్ర పార్టీ నాయకత్వానికి దిశానిర్దేశం, ఓబీసీ సంఘాలతో సమావేశం వంటి వాటిపై దృష్టి పెట్టనున్నారు.
3 పార్లమెంటు, 6 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో...
నల్లగొండ, భువనగిరి, హైదరాబాద్ లోక్సభ నియోజకవర్గాలు, మునుగోడు, నాగార్జునసాగర్, నల్లగొండ, నకిరేకల్, భువనగిరి, కార్వాన్ అసెంబ్లీ నియోజ కవర్గాలు, అలాగే నల్లగొండ జిల్లాలో 17 రెవెన్యూ మండలాల పరిధిలో అమిత్షా పర్యటించనున్నారు. నల్లగొండ జిల్లా పర్యటనను ముగించుకుని వచ్చే సందర్భంగా మార్గమధ్యంలో భువనగిరి లోక్సభ నియోజకవర్గ పరిధిలో అన్ని జిల్లాలకు చెందిన మేధావులతో (హైదరా బాద్, నల్లగొండ జిల్లాలు మినహా) ఆయన సమావేశం కానున్నారు. గతనెల 7వ తేదీనే హైదరాబాద్ లోక్సభ నియోజకవర్గ పోలింగ్బూత్ స్థాయి కార్యకర్తల సమ్మేళ నంలో ఆయన పాల్గొనాల్సి ఉండింది. అది వాయిదా పడడంతో ప్రస్తుత పర్యటనలో 24న సాయంత్రం మెహిదీపట్నంలో కార్యకర్తల సదస్సులో ఆయన పాల్గొంటారు.