తిమిరంపై సమరం


దీపావళి జ్ఞాపకాలు ఆనందదాయకంగానే ఉండాలి కానీ...

 దేహం మీద గాయాలను చూసుకుని ఫలానా ఏడాది దీపావళి టపాకాయలు కాలుస్తున్నప్పుడు అంటూ...

 చేదు జ్ఞాపకాలను గుర్తు చేసుకునే పరిస్థితి రాకూడదు.

 అందుకే తగిన ముందు జాగ్రత్తలతోబాటు, ప్రమాదాన్ని ఎదుర్కొనేందుకు నిపుణుల సూచనలు, సలహాలు ఇవి...


 

దీపావళి గాయాలకు ప్రధానంగా దీపాలు, టపాకాయలు, ఇంటికి మంటలంటుకోవడం అనే మూడు కారణాలు ఉంటాయి. వెలుగుతున్న దీపానికి దుస్తులు తగిలి మంటలు వ్యాపిస్తాయి. అలాగే టపాకాయలు, కాకరపూల వంటి వాటి నుంచి వచ్చే నిప్పురవ్వలు దుస్తులమీద, ఒంటి మీద పడి ఒళ్లు కాలడం సాధారణంగా సంభవించే ప్రమాదం. ఇక కొన్ని సందర్భాల్లో వెలుగుతున్న దీపం ప్రమిద లేదా కొవ్వొత్తి ఒలికి పోయి కర్టెన్లు, సోఫాల వంటివి అంటుకుని మంటలు ఇల్లంతా వ్యాపించడంతో మంటల్లో చిక్కుకోవడం కూడా జరుగుతుంటుంది. వీటి బారిన పడకుండా కొన్ని ముందు జాగ్రత్తలు...

 

 టపాకాయలు కాల్చేటప్పుడు లో దుస్తులతోపాటు మొత్తం నూలు దుస్తులనే ధరించాలి. పట్టు వస్త్రాలు, నైలాన్‌వంటి సింథటిక్ దుస్తులను ధరించరాదు. వదులుగా విచ్చుకున్నట్లు ఉండే గాగ్రాలు వేసుకోరాదు. చీరలకు పల్లును నడుముకు చుట్టుకోవాలి. ఒళ్లు కాలిన వెంటనే దుస్తులను తొలగించాలి.

 

 అపార్ట్‌మెంట్‌ల దగ్గర నివసించే వాళ్లు రాకెట్‌లను కాల్చకూడదు. అవి దిశ మార్చుకుని ఇళ్లలోకి వెళ్లే ప్రమాదం ఉంటుంది.

 

 టపాకాయలు కాల్చే వేళలో ఎవరూ దుస్తులు బయట ఆరవేయకూడదు. నిప్పురవ్వలు పడి మంటలు వ్యాప్తి చెందవచ్చు.

 

 చిచ్చుబుడ్లు, బాంబులు ఇతర ఏ రకమైన టపాకాయ అయినా ఒకసారి కాల్చినప్పుడు వెలగకపోయినా, ఒత్తి వరకు వెలిగి ఆరిపోయినా దగ్గరగా వెళ్లి ఊదడం, కదిలించి చూడడం వంటి ప్రయత్నాలు చేయకూడదు.

 

 టపాకాయలు కాల్చేటప్పుడు పాదరక్షలు ధరించాలి.

 

ప్రథమ చికిత్స

గాయపడిన వాళ్లు భయంతో పరుగెడుతుంటారు. కానీ ఉన్నచోటనే నిలబడాలి. పరుగెత్తితే అగ్నికి వాయువు తోడయినట్లే. గాలిలోని ఆక్సిజన్ గాయాల తీవ్రతను పెంచుతుంది.

 

 గాయం మీద పదిహేను నిమిషాల పాటు నీటిని (చన్నీరు, వేడి నీరు పోయరాదు) ధారగా పోయాలి లేదా నీటి కుళాయి కింద పెట్టాలి. గాయమైన అరగంట లోపల ఈ చికిత్స జరగాలి. ఇలా చేయడం వల్ల వేడి తగ్గిపోతుంది. గాయం తీవ్రత తగ్గుతుంది. చర్మం మీద వేడి ఎక్కువ సేపు ఉంటే గాయం తీవ్రత పెరుగుతుంది. గాయం మీద నీటిని పోయడం అనే చిన్న జాగ్రత్త తీసుకోవడం వల్ల గాయం తీవ్రతను చాలా వరకు తగ్గించవచ్చు.

 

 గాయాన్ని శుభ్రం చేసి బర్నాల్, సోఫ్రామైసిన్, సిల్వర్ ఎక్స్ వంటి ఆయింట్‌మెంట్‌లు కానీ, స్వచ్ఛమైన తేనె, కొబ్బరి నూనె (ఏదో ఒకటి) రాసి నూలు వస్త్రంతో కప్పాలి.

 

 కాలిన గాయం బొబ్బలెక్కినట్లయితే పరిశుభ్రమైన సూదితో గుచ్చి బొబ్బల్లో నీటిని తొలగించాలి. నీరు తొలగించకపోతే గాయానికి ఇన్‌ఫెక్షన్ చేరుతుంది.

 

 గాయానికి జన్షన్ వయొలెట్, టూత్ పేస్టులను రాస్తుంటారు. ఇందులోని రసాయనాలు గాయం తీవ్రతను పెంచుతాయి. గాయం తీవ్రతను అంచనా వేయడం కష్టమవుతుంది.

 

 గాయపడిన వారికి గాలి విసురుతుంటారు. ఇలా చేస్తే నరాల చివర్లు (నర్వ్ ఎండింగ్స్) చైతన్యవంతమై నొప్పి పెరుగుతుంది.

 

ఎప్పుడు హాస్పిటల్‌కి తీసుకెళ్లాలి?

చేతులు, ముఖం మీద గాయమైనా, పొగను ఎక్కువగా పీల్చినా ఆసుపత్రికి వెళ్లి డాక్టర్ చేత చికిత్స చేయించుకోవాలి. అయితే చిన్న పిల్లలు, వృద్ధులు, ఇతర వ్యాధులతో బాధపడుతున్న వాళ్లు మాత్రం చిన్నపాటి గాయాలను కూడా నిర్లక్ష్యం చేయకుండా డాక్టర్ సలహా తీసుకోవడం మంచిది.

 

 - డాక్టర్ జ్ఞానేశ్వర్, ప్లాస్టిక్ సర్జన్, కేర్ ఆసుపత్రి

 

 అపోహ  

 కాలిన గాయం మీద నీటిని పోయరాదు. నీటిని పోస్తే బొబ్బలొస్తాయి.

 

 వాస్తవం

 నీటిని పోయడం వల్ల గాయం వేడి తగ్గి తీవ్రత తగ్గుతుంది. గాయం త్వరగా మానుతుంది.

 

కళ్లకు గాయం అయితే...


కంటికి చువ్వలాంటిది తగిలి గాయం అయినప్పుడు వెంటనే చేత్తో కంటిని రుద్దుతారు. ఇది చాలా ప్రమాదం. చేతికి అంటిన రసాయనాలు కంటికి తగిలి గాయం తీవ్రత పెరగడానికి, గాయం విస్తరించడానికి కారణం అవుతాయి. కంటికి గట్టిగా కట్టు కట్టకూడదు. ఇలా చేస్తే కంట్లో గుచ్చుకున్న నలుసు మరింత లోపలికి వెళ్లే ప్రమాదం ఉంటుంది. కాబట్టి గాయమైన కంటిని కప్పు లేదా షీల్డుతో కప్పి డాక్టర్ దగ్గరకు తీసుకెళ్లాలి.

 

 రసాయనాలు కంట్లో పడితే కంటిని పరిశుభ్రమైన నీటితో కడగాలి. కంటిని రుద్దకుండా దోసిలితో నీటిని తీసుకుని కంటికి తగిలేటట్లు చేస్తూ శుభ్రం చేయాలి.

 

 తీవ్రమైన గాయాలే కాక కంటికి ఏ చిన్న గాయమైనా సరే దానిని నిర్లక్ష్యం చేయరాదు. ఒకసారి కంటి వైద్యులను సంప్రదించి తగిన సూచనలు, చికిత్స చేయించుకోవాలి. ఈ చిన్న గాయం భవిష్యత్తులో దృష్టిలోపానికి దారి తీయకుండా ఉండడానికే ఈ జాగ్రత్త.

 

 పెద్దవాళ్లు దగ్గరుండి పిల్లల చేత టపాకాయలు కాల్పించాలి. చిన్నపిల్లల చేత చిచ్చుబుడ్లు, భూచక్రాలు, బాంబుల వంటి ప్రమాదకరమైన టపాకాయలను కాల్పించకూడదు.

 

 విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్లు, వైర్లు, ఇతర ఎలక్ట్రికల్ పరికరాల దగ్గర టపాకాయలు కాల్చకూడదు.

 

 టపాకాయలు కాల్చేటప్పుడు నీటి బకెట్‌ని కానీ, ఇసుక తొట్టెని కానీ దగ్గర ఉంచుకోవాలి. కాకరపూలు కాల్చిన వెంటనే ఆ ఇనుప కడ్డీలను నీటిలో లేదా ఇసుకలో వేయాలి.

 

 విశాలమైన ఖాళీ ప్రదేశంలోనే కాల్చాలి. ఇలా చేయడం వల్ల టపాకాయల నుంచి వెలువడిన పొగ త్వరగా గాలిలో కలిసిపోతుంది. క్లోజ్‌డ్ ఏరియాలో కాల్చినప్పుడు పొగ ఆ ఆవరణలోనే తిరుగుతూ ఉండడం వల్ల ఆ గాలినే పీల్చడం వల్ల ఊపిరితిత్తుల సమస్య తలెత్తవచ్చు. ముఖ్యంగా చంటి పిల్లలకు, వృద్ధులకు, ఆస్త్మా పేషెంట్లకు ఇది చాలా ప్రమాదకరం.

 

 సాధారణంగా ఫస్ట్ డిగ్రీ బర్న్స్‌కి హాస్పిటల్లో చేరాల్సిన అవసరం ఉండదు. అవుట్ పేషెంటుగానే చికిత్స చేయించుకుని ఇంటికి వెళ్లిపోవచ్చు.

 

చెవికి వాటిల్లే ప్రమాదాలు




 బాణాసంచా కాల్చినప్పుడు వెలువడే శబ్దం, పొగ, రసాయనాలు రకరకాల దుష్ర్పభావాలకు కారణాలవుతుంటాయి. ఇతర ప్రభావాలెలా ఉన్నా శబ్దం ప్రతి ఒక్కరినీ బాధించే దుష్పరిణామం. ఇది స్వయంగా కాల్చే వారినే కాకుండా దూరంగా ఉన్న వారినీ వదలదు. శబ్దం వల్ల చంటిబిడ్డలు, పిల్లలు, గర్భిణులు, వృద్ధులు ఇబ్బందులకు గురవుతుంటారు. అకస్మాత్తుగా పెద్ద శబ్దాన్ని విన్నప్పుడు కలిగే అసౌకర్యాన్ని ఇంపల్స్ సౌండ్ ఎఫెక్ట్ అంటారు. దీని లక్షణాలు ఎలా ఉంటాయంటే...

 

 అకస్మాత్తుగా చెవి దిబ్బడ పడినట్లు ఉండడం (ఇయర్ బ్లాక్)

 

 చెవిలో నొప్పి, గుయ్ మంటూ శబ్దం వినిపించే టినిటస్ వంటివి రావచ్చు

 

 నరం దెబ్బతిని పూర్తిగా వినిపించకపోవడం

 

 ఇయర్ డ్రమ్ దెబ్బతినవచ్చు

 

 టెంపరరీ థ్రెషోల్డ్ షిఫ్ట్... ఈ స్థితిలో తాత్కాలికంగా వినికిడి లోపిస్తుంది. 16 - 48 గంటల్లో దానంతట అదే సర్దుకుంటుంది. ఈ కాలవ్యవధిలో తగ్గకపోతే చికిత్స తప్పనిసరి.

 

 జాగ్రత్తలు ఇలా!

 చెవిలో దూది పెట్టుకోవడం వల్ల ఏడు డెసిబుల్స్‌ను మాత్రమే నియంత్రించవచ్చు. దీపావళి టపాకాయల శబ్దం 100-120 డెసిబుల్స్ వరకు ఉంటుంది. కాబట్టి దూది వల్ల పూర్తిగా నియంత్రించడం సాధ్యం కాదు.

 

 చెవిలో ఏర్పడిన అసౌకర్యం తగ్గడానికి నూనెలు, నీళ్లు, ఇయర్ డ్రాప్స్ వేస్తుంటారు. ఇలాంటి ప్రయత్నాలేవీ చేయకుండా ఇఎన్‌టి నిపుణులను సంప్రదించాలి. మైక్రోస్కోప్, ఆడియోమెట్రీ పరీక్షలు చేసి చికిత్స చేయాల్సి ఉంటుంది.

 

బాణాసంచా కాల్చిన తర్వాత చేతులను శుభ్రంగా కడుక్కోవాలి. గొంతులో నీళ్లు పోసుకుని గార్గిలింగ్ చేయాలి.

 

పిల్లలు టపాకాయలను కాల్చిన చేతులతోనే ముక్కు, చెవులు, కళ్లను రుద్దుకుంటారు. ముక్కు దగ్గర రుద్దితే రసాయనాల ప్రభావం వల్ల ముక్కు నుంచి రక్తస్రావం అయ్యే ప్రమాదం ఉంటుంది.

 

 - డాక్టర్ ఇ.సి. వినయ్ కుమార్,  ఈఎన్‌టీ నిపుణులు

 

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top