పేదల భూముల్లో రాబందులు

పేదల భూముల్లో  రాబందులు - Sakshi


కొట్టేసిన లంక భూములు  1,250 ఎకరాలు

లబ్ధి చేకూరింది... 2,500 కోట్ల రూపాయలుట

కాజేసిన అసైన్డ్ భూములు 1,848 ఎకరాలు

లాభం  3,234 కోట్ల రూపాయలు




కానలలో కనిపించే రాబందులు కళేబరాలను మాత్రమే పీక్కుతింటాయి.. జీవం ఉన్నవాటి జోలికి రావు. రాజధానిలో వాలిన ‘భూ’ రాబందులు బతికి ఉండగానే బడుగురైతులను పీక్కుతింటున్నాయి.. పాపం-పుణ్యం ఆలోచించవు..  బినామీ పేర్లతో రైతుల భూములను బిట్లు బిట్లుగా కాజేసిన  భూ బకాసురులు అవి సరిపోక అసైన్డ్, లంక భూములను కాజేయడానికి అంతర్జాతీయ స్థాయి స్కెచ్ వేశారు.. రాజధానిని ప్రకటించి... సమీకరణ నాటకాలు మొదలుపెట్టడానికి మునుపే అసైన్డ్, లంక భూములపై ‘పెద్దలంతా’ కన్నేశారు.  పరిహారం ఇవ్వకుండానే లాక్కుంటారన్న ప్రచారాలతో పాటు సామదానభేద దండోపాయాలెన్నో ప్రయోగించారు. రైతులను భయపెట్టి.. వారంతట వారే అయినకాడికి పొలాలు అమ్ముకునేలా చేశారు. అంతా అయ్యాకపరిహారాలు, ప్యాకేజీలు ప్రకటించుకున్నారు. ఐదూపది లక్షలిచ్చి సొంతం చేసుకున్న భూములు ఇపుడు కోట్లు పలుకుతున్నాయి. దళిత రైతులపై కూడా ఇలాంటి మాయోపాయాలే ప్రయోగించి అసైన్డ్ భూములనూ మింగేశారు. ఆ భూముల రిజిస్ట్రేషన్లను ‘చట్టబద్ధం’ చేసేశారు.



ఇక జోన్‌ల పేరుతో చేసిన వంచన మరీ ఘోరం. అంతర్జాతీయ నిపుణులను నియమించి కోట్లు వెచ్చించి ‘మాస్టర్‌ప్లాన్’లు తయారుచేయించారు. బినామీలకు అచ్చివచ్చేలా నచ్చినచోట ఇష్టం వచ్చిన జోన్‌ను ప్రకటించుకున్నారు. వారి భూములున్న చోట్ల ‘డెవలప్‌మెంట్’ జోన్లు- పక్కా ‘కమర్షియల్’ జోన్లు. పేదరైతుల భూములున్న చోట గ్రీన్ జోన్లు. వారి భూముల ధరలు కోట్లకు చేరుకోగా రైతుల భూముల ధరలు లక్షలకు పడిపోయాయి. ధర లేకపోయినా అమ్ముకోకుండా కఠిన నిబంధనలు, వ్యవసాయం తప్ప మరో కార్యానికి పనికిరాకుండా కండిషన్లు అమల్లోకొచ్చాయి.  ఇదీ రాజధాని పేరుతో ‘పెద్దలు’ ఆడుతున్న రాక్షసక్రీడ..

 

రాజధాని ప్రాంతంలోని లంక భూములు, అసైన్డ్ భూములు తొలుత భూ సమీకరణలో లేవు.

‘భూ’ బకాసురుల కుట్రలు ఫలించే వరకు వాటిని పక్కనుంచారు..

పరిహారం ఇవ్వకుండా లాక్కుంటారని అనుచరులతో ప్రచారాలు చేయించారు

దాంతో నిజమేననుకుని రైతులు భయపడ్డారు.

భూములను వచ్చిన రేటుకు అమ్మేసుకున్నారు.

పెద్దలంతా బినామీ పేర్లతో 1249.54 ఎకరాల భూములను సొంతం చేసుకున్నారు.

ఆ తర్వాత లంక భూముల సమీకరణకు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది.

ఎకరా ధర రూ. 1.75 కోట్లు పలికింది.. ‘పెద్దలు’ రూ. 2,500 కోట్లకు పైగా లాభపడ్డారు.

అసైన్డ్ భూములూ అంతే.. బినామీ పేర్లతో 1,848 ఎకరాలు కైంకర్యం చేశారు.

ప్యాకేజీ ప్రకటించిన తర్వాత వాటి ధరలు అమాంతం పెరిగాయి.

ఎకరా రూ. 1.5కోట్లు నుంచి రూ. 1.75 కోట్లు పలుకుతున్నాయి. ‘పెద్దల’కు రూ. 3,234 కోట్లమేర లబ్ధి చేకూరింది.

 

పేద రైతుల పొట్టగొట్టిన గ్రీన్‌జోన్!


అమరావతిలో పెద్దలు వేసిన జోన్‌ల ‘పథకం’ పేద రైతుల పొట్ట కొట్టింది.

ఎకరా రూ. 4 కోట్లు ఉన్న భూమి ధర రాత్రికి రాత్రి రూ. 40 లక్షలకు పడిపోయింది.

రూ. 2 కోట్లు పలికిన భూమిని రూ. 20 లక్షలకు కూడా కొనేవాళ్లు లేరు.

విచిత్రమేమిటంటే పక్కపక్కనే ఉన్న భూములు కూడా ఇలా రకరకాల రేట్లు పలుకుతున్నాయి.

ఒకరి భూమి కోట్లు పలుకుతుంటే పక్కనే ఉన్న మరొకరి భూమి లక్షలకు కూడా కొనేవారు లేరు.

రాజధాని భూములను జోన్‌ల వారీగా వర్గీకరించిన ఫలితమిది.

ఏ జోన్‌లో ఏం రాబోతున్నదనే విషయాన్ని గోప్యంగా ఉంచి అనుయాయుల చేత భూములు కొనిపించారు...

బాబుగారి బినామీల భూములున్న చోట కమర్షియల్ జోన్.. పేదరైతుల భూములున్న చోట అగ్రికల్చర్ జోన్...

దాంతో బాబుల భూముల ధరలకు రెక్కలొచ్చాయి..అగ్రికల్చర్ జోన్‌లోని పేద రైతుల భూముల ధరలు పడిపోయాయి..

పెద్దల ఆర్జన వేల కోట్లకు పెరిగింది.. పేద రైతుల జీవితాలు ఊబిలో దిగబడ్డాయి... అదీ వాళ్ల స్కెచ్.

 

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top