'డాక్టర్లు డుమ్మా కొడితే కఠిన చర్యలు'
కొడంగల్ : వైద్యులు వారికి కేటాయించిన సమయాల్లో ప్రభుత్వ ఆసుపత్రుల్లో అందుబాటులో ఉండాలని జిల్లా డీఎమ్హెచ్ఓ దశరథ్ అన్నారు. గురువారం స్థానిక ప్రభుత్వాసుపత్రిని ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కొత్తగా ఏర్పడిన జిల్లాలో మెరుగైన వైద్య సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారని తెలిపారు. డాక్టర్లు ప్రభుత్వాసుపత్రిలో రోగులకు అందుబాటులో లేకపోతే చర్యలు తప్పవన్నారు. మందుల కొరత లేకుండా తెలంగాణా ప్రభుత్వం చర్యలు తీసుకుందన్నారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించి ఆదర్శంగా ఉండాలని వైద్యులకు, వైద్య సిబ్బందికి సూచించారు.