కరణం బలరాం వర్సెస్ గొట్టిపాటి

వేమవరంలో ఇద్దరి దారుణ హత్య


ఎమ్మెల్సీ బలరాం వర్గీయులపై ఎమ్మెల్యే గొట్టిపాటి వర్గీయుల దాడి



బల్లికురవ: ఎమ్మెల్సీ కరణం బలరాం, ప్రకాశం జిల్లా అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్‌ వర్గాల మధ్య వ్యక్తిగత కక్షలు భగ్గుమన్నాయి. బల్లికురవ మండలం వేమవరంలో ఓ వివాహానికి వెళ్లి వస్తున్న బలరాం వర్గీయులపై గొట్టిపాటి వర్గీయులు శుక్రవారం రాత్రి కర్రలతో దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. వారిలో ఇద్దరు మృతి చెందగా మిగిలిన వారు తీవ్ర గాయాలతో చిలకలూరిపేటలో చికిత్స పొందుతున్నారు.  గ్రామంలోని కరణం బలరాం వర్గీయులైన గోరంట్ల వెంకటేశ్వర్లు,  అంజయ్య (48),  పేరయ్య, యోగినాటి రామకోటేశ్వరరావు (40), ముత్యాలరావు, వీరరాఘవులు రెండు బైక్‌లపై రాజుపాలెం గ్రామంలోని బంధువుల ఇంట్లో జరిగిన వివాహానికి హాజరై తిరిగి స్వగ్రామానికి బయలుదేరారు.



గ్రామ కూడలికి రాగానే రవికుమార్‌ వర్గీయులైన మాలెంపాటి వెంకటేశ్వర్లు, గొట్టిపాటి మారుతి, శాఖమూరి సీతయ్య, మరో 40 మంది కర్రలతో బైకులపై వస్తున్న వారిపై దాడి చేశారు. దాడి జరిగిన ప్రాంతంలో రోడ్డుపై స్పీడు బ్రేకర్లు ఉండటంతో రెండు బైకులు స్లో అయ్యాయి. అది గమనించిన రవికుమార్‌ వర్గీయులు ఆరుగురి కంట్లో కారం కొట్టి కర్రలతో తీవ్రంగా దాడిచేసి వెళ్లిపోయారు. రక్తపు మడుగులో ఉన్న క్షతగాత్రులను ప్రైవేట్‌ వాహనాల్లో తొలుత చిలకలూరిపేట వైద్యశాలకు తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం గుంటూరుకు తరలిస్తుండగా, గోరంట్ల అంజయ్య, యోగినాటి రామకోటేశ్వరరావు మృతి చెందారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top