ముగ్గురు విద్యార్థులు అదృశ్యం
పిఠాపురం (తూర్పుగోదావరి జిల్లా) : ఎనిమిదవ తరగతి చదువుతున్న ముగ్గురు విద్యార్థులు మూడు రోజులుగా కనిపించకుండా పోయారు. ఈ సంఘటన తూర్పుగోదావరి జిల్లా పిఠాపురంలో శనివారం వెలుగుచూసింది. వివరాల్లోకి వెళ్తే.. మండల కేంద్రంలోని ఆర్ఆర్బిహెచ్ఆర్ హైస్కూల్లో దుర్గాప్రసాద్, శ్రీను, బాలు అనే ముగ్గురు విద్యార్థులు ఎనిమిదవ తరగతి చదువుతున్నారు. కాగా వారు ముగ్గురు గత నెల 30వ తేదీ(జూలై 30) నుంచి పాఠశాలకు వెళ్లడంలేదు.
దీంతో పాఠశాల ప్రిన్స్పాల్ తల్లిదండ్రులకు ఫోన్ చేసి వివరణ అడగ్గా... పిల్లలు ఇంటి వద్ద కూడా లేరని, మూడు రోజులుగా కనిపించకుండా పోయారనే విషయం వెల్లడైంది. ముగ్గురిలో శ్రీను అనే విద్యార్థి మండల కేంద్రంలోని బీసీ హాస్టల్లో ఉండి చదువుకుంటున్నాడు. మిగిలిన ఇద్దరు ఇంటి వద్ద నుంచే స్కూల్కు వస్తున్నారు. కాగా ప్రిన్స్పాల్ శనివారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని విద్యార్థుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.