మంత్రి ఇలాకాలో.. తమ్ముళ్ల కుమ్ములాట..!
- జెడ్పీటీసీ అనుచరుడిపై వేటు?
- సస్పెండ్ చేయాలంటూ మండల పార్టీ లేఖ
- మంత్రి సూచనలతోనే అంటూ ప్రకటన
చీపురుపల్లి: జిల్లాకు చెందిన ఏకైక రాష్ట్ర మంత్రి కిమిడి మృణాళిని సొంత నియోజకవర్గం కావడంతో జిల్లాలోనే ఆదర్శంగా ఉండాల్సిన స్థానిక తెలుగు తమ్ముళ్లు కుమ్ము లాటలకు దిగుతున్నారు. పార్టీ మండల ప్రెసిడెంట్, జెడ్పీటీసీలు ఒకరిపై మరొకరు కత్తులు దూసుకుంటుండడంతో నియోజకవర్గంలోని ఆ పార్టీలో పరిస్థితి నానాటీకీ తీసికట్టుగా తయారవుతోంది. తెలుగుదేశం పార్టీకి చెందిన జెడ్పీటీసీ మీసాల వరహాలనాయుడు, ఎంపీపీ భర్త, మండల పార్టీ ప్రెసిడెంట్ రౌతు కామునాయుడుల మధ్య విభేదాలు తారస్థాయికి చేరుకుంటున్నాయి.
ఒకే పార్టీలో ఉంటూనే ఇటీవల వీరిద్దరి మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. తాజాగా జెడ్పీటీసీ వరహాలనాయుడు ప్రధాన అనుచరుడు, అదే పార్టీకి చెందిన మాజీ ఎంపీపీ కర్రోతు శ్రీరామ్మూర్తి తమ్ముడు కర్రోతు రమణను ఏకంగా పార్టీ నుంచి బహిష్కరించేందుకు రౌతు కామునాయుడు సిద్ధమవడంతో పార్టీలో కుమ్ములాటలు ప్రారంభమయ్యాయని సర్వత్రా చర్చించుకుంటున్నారు. సాక్షాత్తూ స్థానిక ఎంఎల్ఏ, మంత్రి మృణాళిని సూచనలతోనే జెడ్పీటీసీ అనుచరుడిపై జిల్లా పార్టీకి ఫిర్యాదు చేసినట్లు కామునాయుడు స్పష్టం చేయడంతో వివాదం కొత్త మలుపు తిరిగింది.
ఒకే పార్టీలో ఉంటూ కార్యకర్తల కష్ట, సుఖాల్లో అండగా ఉండాల్సిన మండల స్థాయి పెద్దలే ఇలా కుమ్ములాడుకోవడంతో దిగువస్థాయి క్యాడర్లో తీవ్ర నైరాశ్యం అలుముకుంటోంది. ఇంతవరకు ఎంపీపీ, జెడ్పీటీసీల మధ్య మధ్యాహ్న భోజన పథకం నిర్వాహకుల విషయంలో విభేదాలు నెలకొన్న విషయం తెలిసిందే. తాజాగా మరో వివాదానికి కామునాయుడు తెరతీయడంతో నియోజకవర్గంలో ఎక్కడ చూసినా ఇదే చర్చ జరుగుతోంది. జెడ్పీటీసీ మీసాల వరహాలనాయుడు ప్రధాన అనుచరుడు, కర్రోతు రమణ తెలుగుదేశం పార్టీలో ఉంటూనే గడిచిన స్థానిక సంస్థలు, సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి సహకరించారని, ఓటు కూడా కాంగ్రెస్కు వేయమని చెప్పారని ఆయనతో బాటు వార్డు మెంబరు, ఆయన భార్య కర్రోతు దమయంతిని కూడా పార్టీ నుంచి సస్పెండ్ చేయాలంటూ పార్టీ జిల్లా అధ్యక్షుడు ద్వారపురెడ్డి జగదీష్కు కామునాయుడు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు.
అక్కడితో ఆగకుండా శుక్రవారం ఏర్పాటు చేసిన ప్రెస్మీట్లో కామునాయుడు ఒకడుగు ముందుకేసి కర్రోతు రమణను సస్పెండ్ చేసినట్లు ముందుగా ప్రకటించారు. మళ్లీ సర్దుకుని సస్పెన్షన్ విషయం పార్టీ జిల్లా అధ్యక్షుడు చూసుకుంటారని చెప్పారు. దీంతో జెడ్పీటీసీ వరహాలనాయుడు వర్గం కలవరం చెందినట్లు సమాచారం. దీనికి కౌంటర్గా మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు కామునాయుడుపై కూడా పలు ఆధారాలతో కూడిన ఫిర్యాదులు చేసేందుకు సన్నద్ధమవుతున్నట్లు తెలిసింది. జెడ్పీటీసీ వర్గీయులపై మండల పార్టీ అధ్యక్షుడు చర్యలకు తెరలేపిన పరిస్థితుల్లో ఏం జరుగుతుందో వేచి చూడాల్సిందే.