పెత్తనం ‘ఆయన’ది కాదట!
సాక్షి కథనానికి వివరణ
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం : అటవీశాఖలో విశాఖకు చెందిన ఓ ఉన్నతాధికారే చక్రం తిప్పుతున్నారనీ, జిల్లా అధికారులకు కూడా ఎటువంటి సమాచారం లేకుండా నిర్ణయాలు తీసుకుంటున్నారని సాక్షి ఈ నెల 19న ‘అటవీశాఖలో ఆయనదే పెత్తనం’ శీర్షికన వచ్చిన కథనానికి జిల్లా అధికారులు స్పందించారు. అదంతా అవాస్తవమని బుధవారం ఓ ప్రకటన విడుదల చేశారు. దోనుబాయి ప్రాంతంలో 26 గుగ్గిలం చెట్లు నరికివేతకు బాధ్యుడైన డీఆర్ఓను సస్పెండ్ చేయగా ఆయన విశాఖ అధికారులను మచ్చిక చేసుకుని సస్పెన్షన్ ఎత్తివేయించుకున్నారు.
అయితే ఆయనకు మళ్లీ పోస్టింగ్ ఇచ్చారనడంలో వాస్తవం లేదని అధికారులు చెప్పారు. సాక్షిలో వచ్చిన కథనంలోని ఆరోపణల్లో కొన్ని తమ విభాగానికి సంబంధం లేదని పేర్కొంటూనే డీఆర్ఓ విషయంలో మాత్రం నిబంధనలను పాటిస్తున్నామని, ఆయన ఇప్పటివరకు సస్పెన్షన్లోనే ఉన్నారని శాఖాపరమైన చర్యలు తీసుకుంటున్నామనే అధికారులు చెప్పుకొచ్చారు. నిత్యం అడవులు, వన్య ప్రాణుల సంరక్షణ బాధ్యతలు వహిస్తూ అవాంఛనీయ సంఘటనలు జరిగితే సంబంధిత సిబ్బందిపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని మాత్రం హెచ్చరించారు.