అక్రమ ప్రాజెక్టులను అడ్డుకోవడంలో సీఎం విఫలం
కేంద్ర మాజీ మంత్రి కోట్ల సూర్యప్రకాష్రెడ్డి
ఎమ్మిగనూరు టౌన్: తెలంగాణ ప్రభుత్వం కృష్ణానదిపై నిర్మిస్తున్న అక్రమ ప్రాజెక్టులను అడ్డుకోవడంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు విఫలమయ్యారని కేంద్ర మాజీ మంత్రి కోట్ల సూర్యప్రకాష్రెడ్డి విమర్శించారు. శుక్రవారం ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడుతూ అనుమతి లేకుండా కృష్ణాబెసిన్ నుంచి 150 టీఎంసీ నీటిని తెలంగాణ ప్రభుత్వం తోడేసుకునేందుకు ప్రాజెక్టులను నిర్మిస్తున్నా రాష్ట్ర ప్రభుత్వానికి చీమకుట్టినట్లైనా లేదన్నారు. ప్రాజెక్టులను అడ్డుకోకపోతే కృష్ణా పరీవాహక ప్రాంతం ఏడారిగా మారుతుందన్నారు. శ్రీశైలం డ్యామ్ ఎప్పుడు ప్రస్తుత డెడ్స్టోరేజీకి చేరుకోలేదని, దీనికి కారణం అక్రమ ప్రాజెక్ట్ల నిర్మాణమేనన్నారు. ఆర్డీఎస్ ఆనకట్టకు ఆంధ్ర వైపు ఉండే స్లూయీస్ను ఇప్పటికే మూసివేయడంతో మన ప్రాంతానికి నీరు సక్రమంగా అందడం లేదన్నారు. ఇప్పుడు ఆనకట్టు ఎత్తును కూడా పెంచితే కిందకు చుక్కనీరు రావన్నారు.
సాగునీటిని అందించి ఆయకట్టును పెంచే అవకాశం ఉన్న వేదావతి, గుండ్రెవుల, సిద్దాపురం, తదితర ప్రాజెక్టులను పూర్తి చేసే విషయంలో ముఖ్యమంత్రి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. విభజన చట్టం ప్రకారం హైదరాబాద్పై ఉమ్మడి రాజధానిగా పదేళ్లు మనకు అన్ని హక్కులు ఉన్నా సీఎం హడావుడిగా ఉద్యోగులను, కార్యాలయాలను అమరావతికి తరలించడం ఇబ్బందులకు గురి చేయడమేనన్నారు. సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ లక్ష్మీనారాయణరెడ్డి, కాంగ్రెస్ నాయకులు పార్థసారధిరెడ్డి, లక్ష్మీకాంత్రెడ్డి, కాశీంవలి, సుధాకర్శెట్టి, బషీర్అహ్మద్, కదిరికోట ఆదెన్న, తదితరులు ఉన్నారు.