కత్తిరింపే లక్ష్యం!

కత్తిరింపే లక్ష్యం! - Sakshi


 శ్రీకాకుళం అగ్రికల్చర్:రుణమాఫీ..ఈ మాట వింటే అన్నదాత మండిపడుతున్నా డు. ఎన్నికల సమయంలో లేనిపోని హామీలిచ్చి ఆశలు కల్పించిన తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత మాఫీ విషయంలో సవాలక్ష ఆంక్షలు విధిస్తుండడంపై ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నాడు. వీలైనంత ఎక్కువ మంది రైతులకు మాఫీ వర్తించకుండా ఎగ్గొట్టేందుకు ప్రభుత్వం షరతుల మీద షరతులు విధిస్తుండడాన్ని తప్పుపడుతున్నారు. రుణం పొందినప్పుడు చాలా బ్యాంకుల్లో జరిగే పద్ధతికి భిన్నంగా రూపొందించిన 30 అం శాలతో కూడిన ప్రొఫార్మాను తాజాగా బ్యాంకులకు చంద్రబాబు సర్కార్ పంపింది.

 

 రుణమాఫీ లబ్ధిదారులను తగ్గించడమే లక్ష్యంగా ప్రభుత్వం నిబంధనలు పెట్టిందని రైతన్న ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. లబ్ధిదారుల సంఖ్యను వీలైనంతగా కుదించే యత్నంలో భాగంగానే 30 అంశాల ప్రొఫార్మాలో రైతుల వివరాలను బ్యాంకర్ల ద్వారా సేకరిస్తున్నార ని ఆరోపణలు వస్తున్నాయి. ప్రధానంగా ఆధార్, రేషన్‌కార్డులతో పాటు మొబైల్ నంబరు కూడా విధిగా ఇవ్వాలన్న నిబంధన పెట్టి.. వీటిలో ఏఒక్కటి లేకపోయినా రుణ మాఫీ జరిగే అవకాశం లేకుండా చేయూలని భావిస్తోంది. దీంతో రైతాంగంలో ఆందోళన మొదలైంది. ఈ వివరాల సేకరణతో పాటు జిల్లాలో ఎంతమందికి, ఎంత మొత్తం మాఫీ చేయాల్సి ఉందో ఈ నెలాఖరులోగా నివేదిక తయారు చేసేందుకు అధికారులు సన్నద్ధమవుతున్నారు.

 

 బంగారు రుణాలపై మెలిక

 జిల్లాలో సుమారు ఐదున్నర లక్షల మంది రైతులున్నారు. వీరిలో గత సీజన్‌లో సుమారు 4,33,200 మంది పంట రుణాలు, బంగారు రుణాలన్నీ కలిపి రూ. 1938 కోట్లు తీసుకున్నారు. వీటిలో బంగారు రుణాలు సుమారు రూ. 700 కోట్లు వరకు ఉన్నాయి. అయితే ఈ రుణాల మాఫీ అర్హత కోసం సేకరిస్తున్న 30 అంశాలలో ఒకటి బంగారు రుణాల రైతులకు మాఫీ వర్తించకుండా చేసేలా ఉంది. వడ్డీ రాయితీ రుణం కోసం బంగారం వస్తువుతో పాటు సెక్యూరిటీగా చూపించిన సాగు భూమి వివరాల నమోదు రైతుకు ఇబ్బందికరంగా మారింది.

 

 సాగు భూమిలో ఏ పంట వేశారో, ఆ పంటకు ఎకరాకు లభించే నిర్ధేశిక రుణ పరిధి మొత్తాని మాత్రమే వర్తింప చేయాలని నిబంధన పెట్టారు. సహజంగా పంట రుణాలకు మాత్రమే ఈ విధమైన నిర్ధేశిత రుణపరిధిలో మొత్తాన్ని లెక్కించి ఇస్తారు. బంగారం తనఖా పెట్టిన రుణాలకు సాగు భూమి పట్టా పుస్తకాలను సెక్యూరిటీ కోసం మాత్రమే బ్యాంకర్లు తీసుకుంటారు. కొన్ని బ్యాంకులైతే పట్టాదారుపాసు పుస్తకాలు చూపించకుండా రైతు సొంత పూచీకత్తుతోనే రుణాలి స్తాయి. ఇది ఎప్పటి నుంచో వస్తున్న ఆనవాయితీ. తాజా నిబంధనల ప్రకారం రుణం తీసుకున్న సమయంలో రైతు ఏ పంట వేశారో బ్యాంకులో నమోదు చేయకపోతే రుణమాఫీ వర్తించే అవకాశం లేదు.

 

 నెలఖారులోగా జాబితా సిద్ధం

 జిల్లాలో పంట, బంగారు రుణాలు కలిపి 1938 కోట్ల రూపాయల మేర రైతులు బ్యాంకర్లకు బకాయి పడినట్లు తాజాగా అధికారులు ప్రకటించా రు. రుణ మాఫీ చేస్తామని చంద్రబాబు ప్రకటించడంతో రైతులు బకాయిలు చెల్లించలేదు. తాజాతా రైతులతో పాటు అన్ని పక్షాల నుంచి ఒత్తిళ్లు పెరగడంతో ప్రభుత్వం రుణమాఫీకి సంబంధించి 174 జీవోను జారీ చేసింది. రైతు కుటుంబానికి గరిష్టంగా లక్షన్నర రూపాయల చొప్పున పంట రుణం మాఫీ చేస్తామని ప్రకటించింది. 30 అంశాలతో ఒక ప్రొఫార్మాను రూపొందించింది. రైతుల నుంచి వివరాలన్నింటినీ సేకరించి నెలాఖరులోగా జాబితాను సిద్ధం చేయాలని ఆదేశించింది. ఇదిలా ఉంటే 30 అంశాల్లో కొన్నింటి విషయాలు రైతుకు కనీసం తెలియదు. ఆధార్‌కార్డులు, రేషన్‌కార్డులు లేని వారు అనేకమంది ఉన్నారు. నేటికీ చాలా మం దికి ఫోన్ నంబర్లు లేవు. నమోదు చేయకపోతే వారికి రుణాలు రద్దయ్యే అవకాశం లేదు. అటువంటి వారి పరిస్థితి ఏమిటన్న విషయంపై స్పష్టత లేదు. దీంతో అన్నదాతల్లో ఆందోళన నెలకొంది.

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top