ఏపీలో విద్యుత్ ఛార్జీలను పెంచితే ఉద్యమం తప్పదు: వైఎస్సార్ సీపీ

ఏపీలో విద్యుత్ ఛార్జీలను పెంచితే ఉద్యమం తప్పదు: వైఎస్సార్ సీపీ - Sakshi


హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీల పెంపు ప్రతిపాదనను చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వెంటనే విరమించుకోవాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. పెట్రోల్, డీజిల్ పై పెంచిన వ్యాట్ను తక్షణం ఉపసంహరించుకోవాలని ఓ ప్రకటనలో కోరింది.  ఏపీలో విద్యుత్ ఛార్జీలు పెంచరాదని గతంలో డిమాండ్ చేసిన చంద్రబాబు ఆ విషయం గుర్తుంచుకోవాలని సూచించింది. గత 10 ఏళ్ల టీడీపీ పాలనలో ప్రతి ఏటా కరెంట్ ఛార్జీలు పెంచే విధానాన్నే అనుసరించిందని ఎద్దేవా చేసింది.

 

వైఎస్ సీఎంగా ఉన్న కాలంలో ఏ ఒక్క కేటగిరిలో కూడా ఒక్క పైసా విద్యుత్ ఛార్జీలు పెంచలేదని గుర్తు చేసింది. వ్యాట్ ఎక్కువగా ఉన్న రాష్ట్రాల్లో ఏపీ కూడా ఒకటి అని చంద్రబాబు ప్రతిపక్షంలో ఉన్నపుడు వాదించిన విషయాన్ని గుర్తు తెచ్చుకోవాలని వైఎస్ఆర్ సీపీ పేర్కొంది. అయితే  పెట్రో ఉత్పత్తులపై మరో రెండు శాతం వ్యాట్ పెంచడం సిగ్గుచేటని విమర్శించింది. విద్యుత్ ఛార్జీలు ఒక్క పైసా పెంచినా చంద్రబాబును ప్రజలు వదిలిపెట్టే పరిస్థితి లేదని హెచ్చరించింది. విద్యుత్ ఛార్జీలు పెంపుపై ఏపీ సర్కారు ఒక్క అడుగు ముందుకు వేసినా, ఒక పైసా పెంచినా ఉద్యమం తప్పదని వైఎస్ఆర్ సీపీ హెచ్చరించింది.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top