ఆటో, వ్యాన్ ఢీ.. ముగ్గురు విద్యార్థుల మృతి
హైదరాబాద్: నెల్లూరు జిల్లాలో దారుణం జరిగింది. విద్యార్థులను తీసుకువెళ్తున్న ఆటోను, ఓ ప్రైవేటు స్కూల్ వ్యాన్ ఢీకొనడంతో ముగ్గురు చిన్నారులు మరణించగా, మరో 10 మంది గాయపడ్డారు. ప్రమాద వివరాలిలా ఉన్నాయి.
నెల్లూరు జిల్లా చిల్లకూరు మండలం తీపనూరు వద్ద ఎదురుగా వస్తున్న ఆటోను వ్యాన్ ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు చిన్నారులు అక్కడికక్కడే చనిపోగా, ఆస్పత్రికి తరలిస్తుండగా మరో విద్యార్థి ప్రాణాలు కోల్పోయాడు. మృతులందరూ యూకేజీ విద్యార్థులు. ఆటోలో ఎక్కువగా చిన్న పిల్లలు ఉండటంతో తీవ్రంగా గాయపడ్డారు. గాయపడినవారిని సమీపంలోని గూడూరు ఆస్పత్రికి తరలించారు. వీరిలో కొందరిని మెరుగైన వైద్యం కోసం నెల్లూరు తరలిస్తున్నారు. గాయపడిన విద్యార్థుల్లో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్యులు చెప్పారు. జాయింట్ కలెక్టర్ రేఖా రాణి ఘటన స్థలాన్ని పరిశీలించి బాధిత కుటుంబాలను పరామర్శించారు. మృతుల కుటుంబ సభ్యుల ఆక్రందనలతో ఆస్పత్రిలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
సంబంధిత వార్తలు