జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్
Breaking News
వారు లేకుండా భారత్ ప్రపంచకప్ ఎప్పుడూ గెలవలేదు..!
Published on Mon, 03/09/2026 - 15:30
2023 వన్డే వరల్డ్ కప్ ఫైనల్లో ఎదురైన నిరాశను భారత జట్టు 2026 పొట్టి ప్రపంచకప్లో తుడిచిపెట్టేసింది. సూర్యకుమార్ యాదవ్ నాయకత్వంలో భారత జట్టు మెన్స్ టీ20 వరల్డ్ కప్ను కైవసం చేసుకుంది. ఇది భారత్కు మూడో టీ20 టైటిల్. మొత్తంగా ఐదో ప్రపంచకప్ (రెండు వన్డే, మూడు టీ20).
అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో నిన్న (మార్చి 8) జరిగిన ఫైనల్లో టీమిండియా న్యూజిలాండ్పై 96 పరుగుల తేడాతో జయభేరి మోగించి వరుసగా రెండో ఎడిషన్లో జగజ్జేతగా అవతరించింది.
కాగా, టీమిండియా వరల్డ్ కప్ విజయాల వెనుక ఓ ఆసక్తికరమైన విషయం దాగి ఉంది. 1983 వన్డే వరల్డ్కప్ విజయం నుంచి తాజాగా సాధించిన 2026 టీ20 ప్రపంచకప్ వరకు భారత్ గెలిచిన ప్రతి వరల్డ్ కప్లో ఒక సర్దార్ (పంజాబీ), ఒక కేరళ ఆటగాడు జట్టులో భాగమయ్యారు.
1983లో బల్విందర్ సంధూ (సర్దార్), సునీల్ వాల్సన్ (కేరళ)తో ఈ సంప్రదాయం మొదలైంది. 2007 (టీ20), 2011 (వన్డే) ప్రపంచకప్లలో శ్రీశాంత్ (కేరళ), హర్భజన్ సింగ్ (సర్దార్) కీలక పాత్ర పోషించారు. 2024, 2026 టీ20 వరల్డ్ కప్లలో సంజూ శాంసన్ (కేరళ), అర్ష్దీప్ సింగ్ (సర్దార్) ఈ ప్యాటర్న్ను కొనసాగించారు.
రాకింగ్ సంజూ
2026 టీ20 వరల్డ్ కప్లో సంజూ శాంసన్ అద్భుత ప్రదర్శనతో ప్లేయర్ ఆఫ్ ద టోర్నీ అవార్డు గెలుచుకున్నాడు. సెమీస్కు చేరాలంటే తప్పక గెలవాల్సిన సూపర్-8 మ్యాచ్లో వెస్టిండీస్పై అజేయమైన 97 పరుగులు (50 బంతుల్లో) చేసిన సంజూ.. సెమీస్లో ఇంగ్లండ్పై, ఫైనల్లో న్యూజిలాండ్పై తలో 89 పరుగులు చేసి జట్టును విజయపథంలో నడిపించాడు. ఈ టోర్నీలో సంజూ మొత్తం 5 ఇన్నింగ్స్ల్లో 321 పరుగులు సాధించాడు. 2024 ఎడిషన్లో సంజూ పూర్తిగా బెంచ్పైనే గడిపాడు. ఇది 1983లో వాల్సన్ పరిస్థితిని గుర్తు చేసింది.
షేకింగ్ సర్దార్
2024 ప్రపంచకప్లో టాప్ వికెట్ టేకర్గా (17 వికెట్లు) నిలిచి భారత్ టైటిల్ సాధించడంలో కీలకపాత్ర పోషించిన అర్షదీప్ సింగ్.. తాజా ఎడిషన్లోనూ (2026) ఇంచుమించు అదే తరహా ప్రదర్శనలతో (9 వికెట్లు) షేకింగ్ సర్దార్ అనిపించుకున్నాడు. అర్షదీప్ తన నిలకడ ప్రదర్శనలతో భారత్కు వరుసగా రెండు టీ20 టైటిళ్లు అందించడంలో ప్రధాన పాత్ర పోషించాడు.
Tags : 1