జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్
Breaking News
అందరూ మ్యాచ్ విన్నర్లే!
Published on Tue, 03/10/2026 - 11:40
ప్రతిష్ఠాత్మక టీ20 ప్రపంచకప్ ముగిసింది. టీమిండియా ముచ్చటగా మూడోసారి పొట్టి ప్రపంచకప్ను కైవసం చేసుకొని ఆ ఘనత సాధించిన తొలి జట్టుగా రికార్డులకెక్కింది. ఈ నేపథ్యంలో మాజీ క్రికెటర్లు భారత క్రికెట్ జట్టుపై ప్రశంసలు కురిపిస్తూనే ఉన్నారు. తాజాగా పాకిస్థాన్ మాజీ క్రికెటర్ షాహిద్ అఫ్రిది కూడా టీమిండియాను పొగడ్తలతో ముంచెత్తాడు. జట్టులో అందరూ మ్యాచ్ విన్నర్లు కావడమే భారత్ టైటిల్ గెలిచేందుకు కారణమైందని అఫ్రిది తెలిపాడు. ఇదే విషయమై ఎక్స్ వేదికగా స్పందిస్తూ.. ‘ప్రపంచకప్ ముగిసింది. టైటిల్ గెలవడంలో టీమిండియాకు అర్హత ఉంది. జట్టు కాంబినేషన్ అద్భుతం. అంతేకాదు తుది జట్టులోని 11 మంది ఆటగాళ్లే కాదు బెంచ్ మీద ఉన్న ఆటగాళ్లు కూడా మ్యాచ్ విన్నర్లే. ఒకవేళ ఫైనల్కు ముందు తుది జట్టులో మార్పులు చేసి బెంచ్ నుంచి ఆడించినా భారత్ కప్ కొట్టేందుకు సిద్ధంగా ఉండేది. నిజానికి టోర్నీమొత్తం చాంపియన్ ఆటతీరును ప్రదర్శించారు.
సంజూ శాంసన్ ఒక అద్భుతం. తనదైన హిట్టింగ్తో ఇన్నింగ్స్లను నిర్మించడంలో కీలకపాత్ర పోషించేవాడు. అభిషేక్ శర్మ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. టోర్నీ ఆసాంతం విఫలమైనా కెప్టెన్ సూర్యకుమార్కు అభిషేక్పై ఉన్న నమ్మకం అతన్ని ఫైనల్ వరకు ఆడించింది. కీలకమైన ఫైనల్లో అభిషేక్ తనలోని అసలైన ఆటతీరును పరిచయం చేశాడు. ఇషాన్ కిషన్ కూడా తనదైన శైలిలో చెలరేగడం, ఆఖర్లో హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే హిట్టింగ్ జట్టుకు అదనపు ఆకర్షణ. ఇక బౌలింగ్ లో బుమ్రా అద్భుత ప్రదర్శనతో టోర్నీ ఆసాంతం బౌలింగ్ టీమ్ను తన భుజస్కందాలపై నడిపించాడు. కొత్త బంతి, పాత బంతి అనే తేడా లేకుండా, పదునైన యార్కర్లు సంధించి అతని బౌలింగ్ విలువను చాటిచెప్పాడు’ అని తెలిపాడు. ఇక ప్రపంచకప్లో పాకిస్థాన్ జట్టు చచ్చీచెడీ సూపర్-8కు చేరినప్పటికీ మూడు మ్యాచ్ల్లో కేవలం ఒక్క విజయం మాత్రమే నమోదు చేసి టోర్నీ నుంచి నిష్క్రమించింది.
చదవండి: పాక్ క్రికెటర్ సంచలన నిర్ణయం.. 24 ఏళ్లకే రిటైర్మెంట్
Tags : 1