లేఖ బయటకి వస్తే రాజకీయ ప్రకంపలను ఖాయం
Breaking News
పార్లమెంటే సుప్రీం.. ఉప రాష్ట్రపతి నోట మళ్లీ అదే తరహా వ్యాఖ్యలు
Published on Tue, 04/22/2025 - 13:56
న్యూఢిల్లీ: ఉప రాష్ట్రపతి, రాజ్య సభ చైర్మన్ జగదీప్ ధన్ఖడ్(jagdeep dhankhar) మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజ్యాంగపరమైన అంశాల్లో ఎన్నికైన ప్రజాప్రతినిధులే ‘అల్టిమేట్ మాస్టర్స్’ అని ఆయన పేర్కొన్నారు. రాష్ట్ర గవర్నర్ పంపిన బిల్లులకు రాష్ట్రపతి నిర్ణీత గడువులోపు సమ్మతి తెలపాలని సుప్రీంకోర్టు గడువు విధించడంపై ధన్ఖడ్ తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.
ఈ క్రమంలో.. మంగళవారం ఢిల్లీ యూనివర్సిటీలో ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మరోసారి అదే తరహా వ్యాఖ్యలు చేశారు. ‘‘ఎన్నికైన ప్రజాప్రతినిధులు జవాబుదారీతనంగా ఉండాలి. అది ఎమర్జెన్సీ విధించిన ప్రధాని అయినా సరే!. ప్రజలకు రక్షణ కల్పించేందుకే ప్రజాస్వామ్యం. రాజ్యాంగపరమైన అంశాల్లో ప్రజాప్రతినిధులే అల్టిమేట్ మాస్టర్స్. పార్లమెంట్ కంటే అత్యుత్తమమైనది ఉందని రాజ్యాంగంలో ఎక్కడా లేదు. కాబట్టి పార్లమెంటే సుప్రీం’’ అని అన్నారాయన.
ఈ సందర్భంగా మాజీ ప్రధానమంత్రి ఇందిరాగాంధీ విధించిన ఎమర్జెన్సీ సమయం గురించి కూడా ధన్ఖడ్ ప్రస్తావించారు. ఎమర్జెన్సీ సమయంలో ప్రాథమిక హక్కుల ఉల్లంఘన జరిగిందని ధన్ఖడ్ వ్యాఖ్యానించారు. ఇంతకు ముందు తాను చేసిన వ్యాఖ్యలపై వచ్చిన విమర్శలపై స్పందిస్తూ.. రాజ్యాంగ కార్యకర్తగా తాను మాట్లాడే ప్రతి మాట అత్యున్నత జాతీయ ప్రయోజనాలకు మార్గనిర్దేశం చేయబడుతుందని అన్నారు.
అంతకు ముందు.. ‘‘రాష్ట్రపతికి గడువు నిర్దేశించేలా న్యాయవ్యవస్థ వ్యవహరించడం తగదు. ప్రజాస్వామ్యశక్తులపై అణుక్షిపణిని సుప్రీంకోర్టు ప్రయోగించరాదు. ఇప్పుడు.. శాసనాలు చేయగలిగే జడ్జీలు మనకు ఉన్నారు! కార్యనిర్వాహక విధులూ వారే నిర్వర్తించేస్తారు. సూపర్ పార్లమెంటులా వ్యవహరిస్తారు. వారికి మాత్రం ఎలాంటి జవాబుదారీతనం ఉండదు. ఎందుకంటే దేశ చట్టాలు వారికి వర్తించవు’’ అని ఢిల్లీ హైకోర్టు జడ్జి నోట్ల కట్టల వ్యవహారాన్ని సుప్రీం కోర్టు రాష్ట్రపతికి బిల్లుల విషయంలో గడువు విధించడానికి ముడిపెడుతూ ధన్ఖడ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే ఓ సీనియర్ న్యాయవాది, పైగా ఉప రాష్ట్రపతి హోదాలో ఉండి ఆయన ఇలాంటి వ్యాఖ్యలు చేయడాన్ని ప్రతిపేక్షాలు సహా మేధో వర్గం తీవ్రంగా తప్పుబట్టింది.
మరోవైపు.. బీజేపీ నేతలు సహా ధన్ఖడ్ చేసిన వ్యాఖ్యలపై పరోక్షంగా సుప్రీం కోర్టు(supreme court) స్పందించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం తాము కార్యనిర్వాహక వ్యవస్థలో జోక్యం చేసుకుంటున్నామనే ఆరోపణలు ఎదుర్కొంటున్నామని, ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్రపతికి ఆదేశాలు ఇవ్వాలా? అని బెంగాల్లో రాష్ట్రపతి పాలన విధించాలని దాఖలైన పిటిషన్పై జస్టిస్ బీఆర్ గవాయ్ ధర్మాసనం వ్యాఖ్యలు చేసింది.
Tags : 1