Breaking News

టెక్‌ బుడగ పేలుతోందా?

Published on Wed, 05/31/2023 - 02:09

ఒక్క మైక్రోసాఫ్ట్‌ మాత్రమే కాదు... అమెజాన్, గూగుల్, ఫేస్‌బుక్‌ వంటి అనేక దిగ్గజ ఐటీ కంపెనీల తాజా పరిస్థితి సైతం ఇదే. వరుసగా ఉద్యోగాల్లో కోతలు పెడుతున్నాయి. ఒక్కసారిగా వేలాది మందిని తొలగిస్తున్నాయి. కోవిడ్‌ కాలంలో శరవేగంగా విస్తరించిన ఐటీ, ఆన్‌లైన్‌ సేవలతో లాభాలు పిండుకున్న టెక్‌ కంపెనీల అభివృద్ధి బుడగ ఇప్పుడు పేలడానికి సిద్ధంగా ఉందా? బేజారెత్తిన టెక్‌ కంపెనీల పరిస్థితికి కారణం ఏమిటి? భవిష్యత్తులో వాటి పునరుద్ధరణ జరిగే అవకాశం ఉందా?

‘‘రెండో డిజిటల్‌ విప్లవానికి నాంది పడింది. ప్రతి కంపెనీ, ప్రతి పరిశ్రమ ఆన్‌లైన్‌ సేవల వైపు మొగ్గుతోంది. ఇది మా కంపెనీకి లాభాలను ఒనగూర్చుతోంది’’
– ప్రపంచవ్యాప్తంగా కోవిడ్‌ ఆంక్షల వేళ మైక్రోసాఫ్ట్‌ సీఈఓ సత్య నాదెళ్ల్ల వ్యాఖ్య

‘‘కోవిడ్‌ తర్వాత పరిస్థితులను పునఃసమీక్షించుకోవాల్సిన అవసరం ఏర్పడింది. ఆర్థిక పరిస్థితులను చక్కదిద్దుకోవడం కోసం 10 వేల మంది ఉద్యోగులకు ఉద్వాసన పలకాల్సి వస్తోంది’’  - కోవిడ్‌ వ్యాప్తి తగ్గిన ప్రస్తుత తరుణంలో సత్య నాదెళ్ల చేసిన తాజా ప్రకటన

ఉద్వాసనల పర్వం..
కోవిడ్‌ కాలంలో అనుకోకుండా వచ్చి పడిన అవకాశంతో అభివృద్ధి పుంతలు తొక్కిన టెక్‌ సంస్థలు శరవేగంగా విస్తరణపర్వం మొదలుపెట్టాయి. ప్రపంచం నలుమూలలకు విస్తరించే క్రమంలో లక్షలాది మందికి ఉద్యోగాలు ఇచ్చాయి. అమెజాన్‌ ఒక్కటే 2022 సెప్టెంబర్‌ నాటికి ఏడాది మొత్తం 5 లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చింది. ఫేస్‌బుక్‌ మాతృ సంస్థ మెటాతోపాటు మైక్రోసాఫ్ట్, గూగుల్‌ వంటి ఐటీ దిగ్గజాలు కూడా లక్షలాది ఉద్యోగాలు కల్పించాయి.

గతేడాది చివరికి వచ్చే సరికి పరిస్థితులు మారడం మొదలైంది. లాభాల్లో కోత పడతుండటంతో కంపెనీలు ఉద్యోగులను తొలగించడం మొదలుపెట్టాయి. ఒక్క 2022లోనే టెక్‌ కంపెనీలన్నీ కలిపి 1,64,411 మంది ఉద్యోగులకు ఉద్వాసన పలికినట్లు లేఆఫ్స్‌ ఎఫ్‌వైఐ అనే సంస్థ సేకరించిన సమాచారంలో వెల్లడైంది. ఈ సంస్థ లెక్క ప్రకారం ఈ ఏడాది ఇప్పటికే 658 టెక్‌ కంపెనీలు 1,91,416 మంది ఉద్యోగులను తొలగించాయి. కేవలం టెక్‌ స్టార్టప్‌ కంపెనీలకు మాత్రమే నిధులు సమాకూర్చే సిలికాన్‌ వ్యాలీ బ్యాంక్‌ (ఎస్‌వీబీ) ఈ ఏడాది మార్చిలో కుప్పకూలడం ఐటీ కంపెనీలకు మరో శరాఘాతంగా పరిణమించింది.

నిధుల కొరతతో అనేక కంపెనీలు మూతపడటమో, ఉద్యోగాలను తొలగించడమో చేశాయి. గతేడాది నవంబర్‌లో 11,000 ఉద్యోగాల కోతపెట్టిన మెటా... మళ్లీ ఈ ఏడాది మార్చిలో మరో 10 వేల మందిని తొలగించింది. అమెజాన్‌ 2022 నవంబర్‌లో 10,000 మంది, 2023 జనవరిలో 8 వేల మంది, మార్చిలో 9 వేల మంది ఉద్యోగులను తొలగించింది. యాక్సెంచర్‌ ఈ ఏడాదిలో ఇప్పటికే తన ఉద్యోగుల్లో 2.5 శాతం అంటే దాదాపు 19 వేల మందిని తొలగించింది.

ట్విట్టర్‌ను కైవశం చేసుకున్న తర్వాత ఆ సంస్థలోని 80 శాతం మంది ఉద్యోగులను తొలగించామని ఎలాన్‌ మస్క్‌ బీబీసీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. అంటే దాదాపు 6 వేల మంది ఉద్యోగులను తొలగించారు. కాగ్నిజెంట్‌ ఈ నెల 4న 3,500 మందిని తొలగించింది. మైక్రోసాఫ్ట్‌ గత ఐదేళ్లతో పోలిస్తే ఈ ఏడాది మొదటి క్వార్టర్‌లో అత్యల్ప ఆదాయం ఆర్జించింది. అమ్మకాలు 14 శాతం పడిపోయినట్లు సత్య నాదెళ్ల వెల్లడించారు. (వారెవ్వా టెక్నాలజీ.. ఫ్యూచర్‌ స్మార్ట్‌ఫోన్లు ఇలా ఉంటాయా?)

ఎందుకీ పరిస్థితి
టెక్‌ కంపెనీల తిరోగమ నానికి ఒక్కసారిగా వచ్చిపడ్డ అనేక పరిణామాలు కారణం. కృత్రిమ మేధ, ఆటోమేషన్‌ ఒక కారణమైతే రష్యా, ఉక్రెయిన్‌ యుద్ధం, ఆర్థిక మాంద్యం, డాలర్‌ విలువ పెరగడం, అధిక వడ్డీలు, స్థాయికి మించిన ఉద్యోగుల సంఖ్య వంటి కారణాలు టెక్‌ ప్రపంచాన్ని ఇప్పుడు అతలాకుతలం చేస్తున్నాయి. ముఖ్యంగా రష్యా–ఉక్రెయిన్‌ యుద్ధంతో మొదలైన ఆర్థిక మాంద్యం ఛాయలు క్రమేణా విస్తరిస్తూ ద్రవ్యోల్బణానికి ఆపై అధిక వడ్డీలకు దారితీశాయి.

ఈ పరిణామాలు చోటుచేసుకుంటున్న తరుణంలోనే కృత్రిమ మేధ, ఆటోమేషన్‌ ఉప్పెనలా వచ్చిపడి టెక్నాలజీ సంస్థల అభివృద్ధికి గండికొడుతున్నాయి. ఏఐ అత్యంత నాణ్యమైన, నమ్మకమైన ప్రత్యామ్నాయాలను సృష్టిస్తూ శరవేగంగా అన్ని రంగాలను కమ్ముకుంటోంది. ఇంతవరకు మానవ సంపదపై ఆధారపడి పనిచేస్తున్న టెక్‌ కంపెనీల ఉత్పాదనలను కృత్రిమ మేధ క్షణాల్లో అతిచౌకగా రూపొందిస్తుడటంతో ఆయా కంపెనీల ఆదాయంపై దెబ్బపడుతోంది. దాంతో గత్యంతరం లేక కంపెనీలు ఉద్యోగులను భారీగా తగ్గించుకొని ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్నాయి.

టెక్‌ ప్రపంచాన్ని వేధిస్తున్న మరో కారణం ద్రవ్యోల్బణం. ప్రస్తుత ధరల స్థాయి గత 40 ఏళ్లలోనే అత్యధికం. పెరుగుతున్న వస్తువులు, సేవల ధరలతో వినియోగదారులు టెక్‌ కంపెనీల ఉత్పాదనలు, సేవలను భరించలేని స్థాయికి చేరుకుంటున్నారు. ధరలను అదుపు చేయడానికి ప్రభుత్వాలు వడ్డీ రేట్లను పెంచుతుండటం టెక్‌ కంపెనీలకు దెబ్బమీద దెబ్బగా పరిణమిస్తోంది. అమ్మకాలు తగ్గి ఆదాయం పడిపోతుండటం కంపెనీలు నడపడానికి రుణాలు తీసుకోలేక ఉద్యోగుల ఉద్వాసనకు ఉపక్రమించాయి.

కరోనా వేళ మార్కెట్‌ను సరిగ్గా అర్థం చేసుకోలేక, తమ అభివృద్ధి శాశ్వతమని భావించి అడ్డగోలుగా ఉద్యోగులను తీసుకున్నామని మెటా అధిపతి జుకర్‌బర్గ్, సేల్స్‌ఫోర్స్‌ అధినేత మార్క్‌ బెన్యాఫ్‌ ఒప్పుకున్నారు. టెక్‌ దిగ్గజాలకు భిన్నంగా యాపిల్‌ కంపెనీ మాత్రం ఉద్యోగ నియామకాల్లో సంయమనం పాటించింది. కోవిడ్‌ కాలంలో ఉద్యోగుల సంఖ్యను కేవలం 20 శాతమే పెంచుకుంది. దాంతో ఇంతవరకు ఉద్యోగులను తొలగించని టెక్‌ దిగ్గజం యాపిల్‌ ఒక్కటే. టెక్‌ ప్రపంచంలో ప్రస్తుతం చోటుచేసుకుంటున్న పరిణామాలు పాతికేళ్ల నాటి డాట్‌కామ్‌ బుడగను గుర్తుచేస్తోందని నిపుణులు అంటున్నారు.

ఏమిటీ డాట్‌కామ్‌ బుడగ?
గత శతాబ్దం చివర్లో ఇంటర్నెట్‌ వినియోగంలోకి వచ్చిన తరుణంలో దాని ఆధారంగా పుట్టుకొచ్చిన కంపెనీలు ఊహించని రీతిలో వృద్ధి చెందాయి. పేరు చివర డాట్‌కామ్‌ ఉన్న ప్రతి కంపెనీ విలువ వేలం వెర్రిగా పెరిగిపోయింది. 1995 నుంచి 2000 వరకు ఆన్‌లైన్‌ సేవల పేరిట వెలిసిన కంపెనీలన్నీ ఇబ్బడిముబ్బడిగా పెరిగి శతాబ్దం చివరికి వచ్చే సరికి గాలిబుడగలా పేలిపోయాయి. (Ravindra Jadeja వారెవ్వా జడేజా..అందుకో అప్రీషియేషన్‌ సూపర్‌ పిక్స్‌ వైరల్‌ )

ముందున్న కాలమంతా డాట్‌కామ్‌ కంపెనీలదే అని నిమ్మన వ్యక్తులు, సంస్థలు ఆయా కంపెనీల్లో భారీగా పెట్టుబడులు పెట్టాయి. ఉదాహరణకు 1994లో ఇంటర్నెట్‌ సేవలు అందించేందుకు ఏర్పడిన నెట్‌స్కేప్‌ అనే సంస్థ 1995లో అంటే కేవలం ఏడాది తరువాత పబ్లిక్‌ ఫండింగ్‌కు వెళ్తే ఒక్క రోజులోనే దాని మార్కెట్‌ క్యాప్‌ 278 కోట్ల డాలర్లకు చేరుకుంది. జనరల్‌ మోటార్స్‌కు ఈ విలువ సాధించడానికి 40 ఏళ్లు పట్టింది.

2001 వచ్చే సరికి ఈ డాట్‌కామ్‌ కంపెనీల విలువ కేవలం ఊహాజనితమని అర్థమై అందరూ పెట్టుబడులు ఉపసంహరించుకోవడంతో ఈ కంపెనీలన్నీ కుప్పకూలిపోయాయి. న్యూయార్క్‌ స్టాక్‌ ఎక్సే్ఛంజ్‌ ‘నాస్‌డాక్‌’లో 1995 నుంచి 2000 వరకు క్రమేపీ స్టాక్‌ మార్కెట్‌ ఇండెక్స్‌ 800 శాతం పెరిగితే 2002 వచ్చే సరికి పెరిగిన మొత్తంలో 790 శాతం పడిపోయి దాదాపు మొదటికి వచ్చింది. దాంతో డాట్‌కామ్‌ బుడగ పేలిపోయింది.  (ఇలాంటి టెక్‌ వార్తల కోసం చదవండి సాక్షిబిజినెస్‌)

- దొడ్డ శ్రీనివాసరెడ్డి

Videos

భువనగిరిలో ఉద్రిక్తత ఎమ్మెల్యే, సీఎం రేవంత్ ఫ్లెక్సీపై నల్ల రంగు

పుష్ప శ్రీవాణి పై అంత నీచంగా ప్రవర్తిస్తారా? పోలీసుల ఓవర్ యాక్షన్... వరుదు కళ్యాణి అరెస్ట్

సుప్రీం కోర్టు కీలక నిర్ణయం..CJP నిరసనకారుల FIRలు రద్దు

పవన్ కళ్యాణ్ బర్త్ డే ఫ్లెక్సీ..జనసేన,టీడీపీ మధ్య కొట్లా

అడ్డంగా పడుకుని నీ పబ్లిసిటీ స్టంట్లు.. చంద్రబాబును ఏకిపారేసిన జడ శ్రవణ్

ఒకే ఇంట్లో 23 మృతదేహాలు 1000కి చేరిన మృతులు

YS జగన్ కు ఘన స్వాగతం

AP: మేము అస్సలు తగ్గం..! పల్లె-పల్లెకు రైతులతో వంట వార్పు కార్యక్రమం

ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి కుమారుడు అరెస్ట్

కొబ్బరికాయ కొట్టేస్తా. గుమ్మడికాయ కట్టేస్తా.. అప్పనంగా క్రెడిట్ నొక్కేస్తా...

Photos

+5

ట్రేడిషనల్ శారీలో బిగ్‌బాస్‌ బ్యూటీ ఆర్జే కాజల్.. ఫోటోలు

+5

మెరుపుతీగలా మారిపోయిన హెబ్బా పటేల్ (ఫొటోలు)

+5

తమిళ బ్యూటీ ఆండ్రియా పారిస్ ట్రిప్ (ఫొటోలు)

+5

హీరోగా రవితేజ తమ్ముడి కొడుకు.. 'మారెమ్మ' ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

అనిరుధ్ కన్సర్ట్ కోసం జోనితా గాంధీ రెడీ అయిందిలా (ఫొటోలు)

+5

కీర్తి సురేశ్ కలర్‌ఫుల్ ఓనం సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

యాపిల్ సీఈఓగా 15ఏళ్లు.. టిమ్ కుక్ అరుదైన (ఫోటోలు)

+5

పార్వతీపురం మన్యం జిల్లా...శిఖపరువులో జలసవ్వడి (ఫొటోలు)

+5

యుగానికొక్కడు.. మెస్సీ అరుదైన జ్ఞాపకాలు! (ఫొటోలు)

+5

‘ఐ యామ్‌ గేమ్‌’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌...ముఖ్య అతిథిగా నాగ్‌ అశ్విన్‌ (ఫొటోలు)