రిలీజ్ వెంటనే పెద్దికి జాన్వీ కపూర్ ఝలక్
Breaking News
గుప్పెడు పూలు... గుండెనిండా పరిమళం
Published on Sat, 06/06/2026 - 10:36
సాధారణంగా మల్లెలు అనగానే మగువలే గుర్తొస్తారు. ఇది తరతరాలుగా మహిళలకు, మల్లెలకు ఉన్న అనుబంధం. అలంకారానికి మాత్రమే కాక ఆహ్లాదం, ఆనందం, అనురాగాన్ని కూడా పంచుతాయి మల్లెలు. అన్నట్లు మహిళలు మల్లెలను ధరించేది తమకోసమే కాదు, తమను ప్రేమించే వారి కోసం కూడా! మల్లెలు ఏడాదిలో మూడు నాలుగు నెలలు మాత్రమే పూస్తాయి. అది కూడా వేసవి ఎండల్లోనే. అందుకే మల్లెల గురించి మరింతగా...
మనసుకు, మేనికి ప్రశాంతతను చేకూర్చడంతో పాటు తాజాదనాన్ని కలుగజేసే అద్భుతమైన సువాసన కారణంగా మల్లెపూలను మన దేశంలో పూలకే రాణిగా పరిగణించడంతో పాటు బెల్లె ఆఫ్ ఇండియా లేదా సువాసన రాణి అని కూడా సంబోధిస్తుంటారు.
తలకు..
మల్లెల్లోని సువాసన మనసుకు ఆహ్లాదాన్ని ఇవ్వడమే కాకుండా తలనొప్పిని కూడా తగ్గిస్తుంది. మల్లెల కషాయంతో కళ్లమంటలు, నొప్పులు తగ్గుతాయి. మల్లె పూలు, ఆకులతో కషాయం కాచి, వడగట్టి చల్లార్చాలి. అనంతరం రెండు వంతుల కషాయంలో ఒక వంతు నువ్వులనూనె, కొబ్బరినూనె, ఒక స్పూను బాదం నూనె కలపాలి. ఈ మిశ్రమంతో వారానికి రెండుసార్లు తలకు మర్దన చేస్తే ఉపశమనం లభిస్తుంది. కోపం, డిప్రెషన్ తదితర సమస్యలను దూరం చేసే స్వభావం మల్లెపూలకు ఉంది.
సువాసన వెదజల్లే పూలను తల దిండు పక్కన పెట్టుకుని పడుకుంటే.. మనసు స్థిమితమై హాయిగా నిద్ర పడుతుంది. మధుమేహులు మల్లెపూలతో చేసిన టీ తాగితే మంచిది. రక్తంలో చక్కెర స్థాయిని తగ్గించే గుణం వీటికి ఉంటుంది. కొబ్బరినూనెలో మల్లెపూలను రోజంతా నానబెట్టి, తర్వాత కాచి వడగట్టాలి. చల్లారాక తలకు మర్దనా చేసుకుంటే జుట్టు కుదుళ్లకు పోషకాలు అందుతాయి. అదేవిధంగా కొబ్బరినూనెతో మల్లెపూల రసాన్ని కలిపి తలకు రాసుకుంటే.. మంచి సువాసన వస్తుంది.
చుండ్రుతో బాధపడేవారు మల్లెపూల రసాన్ని మెంతులతో కలిపి తలకు పట్టిస్తే మంచి ఫలితం ఉంటుంది. మొటిమల వల్ల వచ్చే మచ్చలు పోగొట్టడంలోనూ మల్లెలు ఉపకరిస్తాయి. అంతేకాదు మల్లెపూలతో చేసిన పలు ఔషధాలు శరీరంపై ఏర్పడే కణితులను కూడా నివారిస్తాయని పరిశోధనల్లో తేలింది. మహిళలకు రుతుస్రావంలో తలెత్తే సమస్యలను కూడా ఇవి తగ్గిస్తాయట. అలాగే గర్భిణులకు సుఖ ప్రసవం అయ్యేందుకు ఇవి ఎంతో సహాయపడతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
మల్లెలు భాగస్వాముల మధ్య మానసిక ఆందోళనలను, బిడియాన్ని తొలగించి, మనోల్లాసం కలిగించే భావనలను ప్రేరేపిస్తాయట. అందుకే భారతీయ సంప్రదాయంలో మల్లెలకు పెద్ద పీట వేశారు. సాహిత్యంలోనూ మల్లెలకు ప్రముఖ స్థానం ఇచ్చారు.
కవులు, గాయకులు, రచయితలు మల్లెపూల సొగసును, వాటి పరిమళాన్ని వర్ణిస్తూ ఎన్నో పాటలు రాశారు. రచనలు చేశారు. కవితలు అల్లారు. స్త్రీల సౌకుమార్యాన్ని మల్లెపూలతో పోల్చారు. ఏ రకంగా చూసినా మల్లెపూలు నిత్యజీవితంలో పరిమళాన్ని అద్దుతూనే ఉంటాయి. గాఢమైన వాసనతో గుండెను హత్తుకుంటూనే ఉంటాయి.
ఎన్నో పరిమళాలు
భారతదేశంలోని వివిధ ప్రాంతాల్లో ఈ పుష్పాన్ని విభిన్న రకాల పేర్లతో పిలుస్తుంటారు. మోగ్రా, మోతియా, చమేలి, మల్లి పూవ్వు, జాటి, మల్లిగే, జూహి, మోగ్రా లేదా పొద జాతి వక్షాల్లో మూన్లైట్ అని ఒక్కో ప్రాంతంలో ఒక్కో రకంగా పిలుస్తారు.
మొత్తం మీద మల్లెపూలలో 300 రకాలు ఉన్నట్టు అధికారికంగా నమోదైంది. మల్లెపువ్వుకి మల్లిక, మగేష్టము, మల్లియ, ప్రయ, శూన్య, ముద్గరము, హసంతి, చంద్రిక, సుభగ వంటి పేర్లెన్నో ఉన్నాయి. మరి ఇంత చరిత్ర, ఇన్ని పేర్లు ఉన్న మల్లెపూలలో నిత్యమల్లెలు, బొండు మల్లెలు, దొంతర మల్లెలు, కాగడ మల్లెలు, శంకు మల్లెలు, బొడ్డు మల్లెలు, నాగ మల్లెలు, కొండమల్లెలు, కంచె మల్లెలు, దేశవాళి మల్లెలు వంటి ఎన్నో రకాలు ఉన్నాయి.
అరోమా థెరపీ
మల్లెపూల వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయంటున్నారు ఆరోగ్య నిపుణులు. సబ్బులు, తలనూనె, సౌందర్య సాధనాల్లో కూడా మల్లెపూలను వాడుతున్నారు. అలాగే సుంగంధ మొక్కల ద్రవ్యాలతో చేసే అరోమాథెరపీలోనూ మల్లె పూలను వాడతారు.
కళ్లు అలసటగా ఉన్నప్పుడు మల్లెపూల రసంతో కంటి చుట్టూ మర్దన చేసుకుని పడుకుంటే ఉపశమనం లభిస్తుంది. అలాగే తాజా మల్లెలను మెత్తగా నూరి, తడిబట్టతో చుట్టి కళ్లమీద పెట్టుకుంటే, కళ్లలో నీరు కారడం, తడి ఆరిపోవడం వంటి సమస్యలను దూరం చేస్తుంది.
నపుంసకత్వం, శీఘ్రస్కలన సమస్యల పరిష్కారానికి కూడా మల్లెపూలు ఉపకరిస్తాయని అధ్యయనాలు చెబుతున్నాయి. మల్లెపూల రసాన్ని, గులాబీల రసంతో కలిపి ముఖానికి రాసుకుంటే చర్మం మృదువుగా ఉంటుంది. చర్మానికి అవసరమయ్యే విటమిన్–సి మల్లెపూలలో సమృద్ధిగా లభిస్తుంది.
– డి.వి.ఆర్.
(చదవండి: జేఈఈ అడ్వాన్స్డ్లో సత్తా చాటిన రిక్షాడ్రైవర్ కుమారుడు..!)
Tags : 1