పెద్దపల్లి జిల్లాలో హైటెన్షన్.. కొట్టుకున్న కాంగ్రెస్ నేతలు
Breaking News
సిటీలో కొడితే దుబాయ్లో తగిలింది!
Published on Sun, 01/11/2026 - 11:40
దుబాయ్ కేంద్రంగా మాఫియా నడిపించిన అలీ భాయ్, 2001లో హైదరాబాద్లోని టోలిచౌకి నుంచి పన్నెండేళ్ల సుమేధను తన అనుచరులతో కిడ్నాప్ చేయించాడు. ఆమె తండ్రికి ఫోన్ చేసి రూ.5 కోట్లు డిమాండ్ చేశాడు. ఆ చిన్నారిని రక్షించడానికి ఉన్నతాధికారులు ప్రత్యేక పోలీసు బృందాన్ని రంగంలోకి దింపారు. అలీ భాయ్ దుబాయ్లో ఉండటం; ఇక్కడి అనుచరుల ఆచూకీ తెలియకపోవడం; డిమాండ్ చేసిన మొత్తం చెల్లించకుంటే చిన్నారిని చంపేస్తామని బెదిరిస్తుండటంతో స్పెషల్ టీమ్ తీవ్ర ఒత్తిడికి లోనైంది. అప్పుడే తనదైన పంథాలో ఆలోచించిన ఓ అధికారి ఇక్కడ కొందరిని ‘టచ్’ చేసి ఆ సౌండ్ దుబాయ్కి వినిపించేలా చేశారు. దెబ్బకు దిగివచ్చిన అలీ భాయ్ సుమేధను సురక్షితంగా జహీరాబాద్లో విడిచిపెట్టించాడు. అప్పుడు ఏం జరిగిందంటే..!
మెదక్ జిల్లా జహీరాబాద్కు చెందిన సయ్యద్ అబిద్ హుస్సేన్ ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడి కుమారుడు. 1993లో దుబాయ్ వెళ్లి వ్యాపారం చేశాడు. అతడికి అక్కడే ముంబైకి చెందిన అబ్దుల్ ఖయ్యూం షేక్ అలియాస్ రాజ్, ఉత్తరప్రదేశ్లోని ఆజమ్గఢ్కు చెందిన అల్తాఫ్ ఆలం ఖాన్ అలియాస్ విక్కీతో పరిచయమైంది. మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీం గ్యాంగ్లో కీలకంగా వ్యవహరించిన ఛోటా రాజన్కు ఈ ద్వయం అనుచరులుగా వ్యవహరించింది. వీరి పరిచయంతో అబిద్ తన పేరును అలీ భాయ్గా మార్చుకుని విక్కీకి అనుచరుడిగా మారాడు. అంతటితో ఆగకుండా ఆ ద్వయంతో కలిసి బెదిరింపు వసూళ్లు, కిడ్నాప్లు చేయాలని పథకం వేశాడు. దీనికి వాళ్లు అంగీకరించడంతో దుబాయ్ నుంచే హైదరాబాద్తో పాటు ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర గుజరాత్, ఆంధ్రప్రదేశ్ల్లో కొన్ని నేరాలు చేశారు. అక్కడ నుంచే కథ నడిపించిన ఈ ముగ్గురూ ఇక్కడ అనుచరులను ఏర్పాటు చేసుకున్నారు.
దుబాయ్ నుంచి అలీ భాయ్ పథకం వేయడం; మిగిలిన ఇద్దరూ తమ అనుచరుల ద్వారా అమలు చేయడం; సెల్ ఫోన్, శాటిలైట్ ఫోన్ల ద్వారా టార్గెట్ను బెదిరించి డబ్బు వసూలు చేయడం– ఇలా కొన్నాళ్లు ఓ మాఫియా సామ్రాజ్యాన్నే నడిపారు. ఎక్కడిక్కడ స్థానిక రౌడీలతో సంబంధాలు ఏర్పాటు చేసుకుని హడలెత్తించారు. హైదరాబాద్ గోల్కొండ ప్రాంతానికి చెందిన మీర్జా అసద్ అలీ, మహ్మద్ నవీద్, బుద్వేల్కు చెందిన అహ్మద్ హుస్సేన్ తదితరులు అలీ భాయ్ కోసం పని చేశారు. అలీ భాయ్ 2001 మార్చి 23న జూబ్లీహిల్స్కు చెందిన బడా వ్యాపారి కుమార్తె సుమేధను కిడ్నాప్ చేయించాడు. అప్పట్లో తొమ్మిదో తరగతి చదవుతున్న ఆమె పాఠశాలకు వెళ్తుండగా టోలిచౌకిలో అపహరణకు గురైంది.

ఈ చిన్నారిని తీసుకువెళ్లిన అలీ భాయ్ అనుచరులు జహీరాబాద్లో సిద్ధం చేసుకున్న డెన్లో దాచారు. దుబాయ్ నుంచి చిన్నారి తండ్రికి ఫోన్ చేసిన అలీ భాయ్ తమ అధీనంలో ఉన్న సుమేధను సురక్షితంగా విడిచిపెట్టడానికి రూ.5 కోట్లు చెల్లించాలని డిమాండ్ చేశాడు. తాను దావూద్ ఇబ్రహీం ప్రధాన అనుచరుడినని, ఈ మొత్తాన్ని డాలర్ల రూపంలో సిద్ధం చేసి ఉంచాలని, ఎక్కడ ఇవ్వాలో చెప్తానని చెప్పాడు. పోలీసులకు ఫిర్యాదు చేసినా, నిర్ణీత సమయంలో డబ్బు చెల్లించకపోయినా చిన్నారిని చంపేస్తానంటూ బెదిరించాడు. ఈ వ్యవహారంలో విక్కీ సైతం సుమేధ తండ్రితో బేరసారాలు చేశాడు. అలీ భాయ్, విక్కీ బెదిరింపులకు భయపడని సుమేధ తండ్రి విషయాన్ని పోలీసుల దృష్టికి తీసుకువెళ్లారు.
అప్పటికే అలీభాయ్ వ్యవహారాలపై సమాచారం ఉన్న ఉన్నతాధికారులు సుమేధ కేసు డీల్ చేయడానికి ప్రత్యేక బృందాన్ని రంగంలోకి దింపారు. దీనికి నేతృత్వం వహించిన కీలక అధికారి తనదైన పం«థాలో ముందుకు వెళ్లారు. సుమేధను సురక్షితంగా తీసుకురావాలంటే అలీ భాయ్ని ఎమోషనల్గా డీల్ చేయాలని నిర్ణయించుకున్నారు. దీంతో ఓ బృందాన్ని జహీరాబాద్ పంపి అలీ పూర్వాపరాలు, ఆప్తుల వివరాలు ఆరా తీయించారు. అలీ భాయ్ అమితంగా అభిమానించే ఇద్దరు సమీప బంధువుల విషయం ఇలా పోలీసుల దృష్టికి వచ్చింది. ఏమాత్రం ఆలస్యం చేయని పోలీసులు వారిని హైదరాబాద్ తీసుకువచ్చారు. అప్పటికే శివార్లలో ఓ రహస్య సేఫ్ హౌస్ను సిద్ధం చేసి ఉంచారు. అలీ భాయ్ సమీప బంధువులను అక్కడకు తరలించిన పోలీసులు తమదైన ట్రీట్మెంట్ ప్రారంభించారు.
ఇక్కడ సేఫ్ హౌస్లో ఉన్న వారిని ఇంటరాగేషన్ చేస్తూ వారి అరుపులు, మాటల్ని ఫోన్ ద్వారా దుబాయ్లో ఉన్న అలీ భాయ్కి వినిపించారు. ఆ చిన్నారిని చిన్న గాయమైనా వీళ్లను ఎన్కౌంటర్ చేస్తామని, 24 గంటల్లో సుమేధ సురక్షితంగా తల్లిదండ్రుల వద్దకు చేరకుంటే మళ్లీ ఈ ఇద్దరు సన్నిహితులు నీకు కనిపించరంటూ అల్టిమేటం ఇచ్చారు. పోలీసులు ఇచ్చిన ఈ షాక్కు భయపడిన అలీ భాయ్ దిగి వచ్చాడు. సుమేధను వదిలి వెళ్లిపోవాలంటూ తన అనుచరులకు చెప్పి, జహీరాబాద్ చిరునామాను పోలీసులకు అందించాడు. హైదరాబాద్ అధికారుల ద్వారా సమాచారం అందుకున్న మెదక్ పోలీసులు సుమేధను సురక్షితంగా రెస్క్యూ చేశారు. ఆ తర్వాతే ప్రత్యేక బృందం అలీ భాయ్ సన్నిహితులను తమ సేఫ్ హౌస్ నుంచి బయటకు పంపింది.
దీంతో పాటు మరికొన్ని నేరాలు చేసిన అలీ భాయ్, విక్కీలను పోలీసులు దుబాయ్ నుంచి రప్పించారు. అలీ భాయ్ని 2007లో హైదరాబాద్, విక్కీని దీనికి ముందే పుణేకు డిపోర్ట్ అయ్యారు. అలీ భాయ్ని బలవంతంగా దుబాయ్ నుంచి తీసుకువచ్చిన తర్వాత సుమేధ కేసు విచారణ కోసం విక్కీని సైతం హైదరాబాద్కు తీసుకువచ్చారు. ఆ సమయంలో కేవలం ఇద్దరు అధికారులే వీరిద్దరినీ కోర్టులో హాజరుపరచి జైలుకు తరలించడానికి సిద్ధం అయ్యారు. ఎలాంటి సాయుధ ఎస్కార్ట్ లేకుండా కేవలం ఇద్దరు అధికారులు ఓ సుమోలో తీసుకువెళ్లడంతో ఆ ద్వయం కంగుతింది. తాము మాఫియా డాన్స్ అని, దావూద్ అనుచరులమని, ఇలా భద్రత లేకుండా తీసుకువెళ్తే ఎలా? అంటూ ప్రశ్నించింది. పోలీసులు ఇవేవీ పట్టించుకోలేదు. దీంతో ఓ దశలో ఇలా సింపుల్గా కోర్టుకు రావడానికి అలిగిన అలీ, విక్కీ తప్పనిసరి పరిస్థితిలో సుమో ఎక్కారు.
Tags : 1