Breaking News

ఉగాండా గతి మార్చిన భారత్‌

Published on Thu, 05/14/2026 - 13:46

అది 1972... గడియారపు ముళ్లు వేగంగా తిరుగుతున్నాయి. చేతిలో కేవలం తొంభై రోజుల గడువు. కళ్ల ముందే తాము ఎంతో కష్టపడి నిర్మించుకున్న సామ్రాజ్యాలు కుప్పకూలుతుంటే కట్టుబట్టలతో, కన్నీటి మూటలతో ఒక జాతి పరాయి దేశాల వైపు అడుగులు వేసింది. ఆనాడు ఉగాండా నేల విడిచి వెళ్లిన చాలా మందిలో తీరని వేదన. కానీ, కాలం పగ తీర్చుకోలేదు.. ఆ గాయాన్ని మాన్పేసింది.

అర్ధ శతాబ్దం గడిచింది. నాడు బహిష్కరించిన అదే మనుషులు, నేడు ఎర్ర తివాచీ పరిచారు. అప్పుడు అక్కడి నుంచి బయటకు వెళ్లిన వారే, ఇప్పుడు ఆ ఆర్థిక వ్యవస్థకు కీలకంగా మారారు. చక్కెర మిల్లులు, స్టీలు పరిశ్రమలు, బ్యాంకింగ్‌ వ్యవస్థ... ఇలా అన్ని రంగాల్లో భారతీయులు వ్యాపారం సాగిస్తూ దేశ వృద్ధికి తోడ్పడుతున్నారు.

90 రోజుల గడువు.. తరాల కష్టం బుగ్గిపాలు

1972 ఆగస్టులో ఉగాండా సైనిక పాలకుడు ఇడి అమీన్ తీసుకున్న నిర్ణయం ప్రపంచాన్ని విస్మయానికి గురిచేసింది. స్థానికులను దోపిడీ చేస్తున్నారనే సాకుతో దాదాపు 80,000 మంది భారత సంతతి ప్రజలను కేవలం 90 రోజుల్లో దేశం విడిచి వెళ్లాలని ఆదేశించారు. దశాబ్దాలుగా నిర్మించుకున్న వ్యాపారాలు, చక్కెర మిల్లులు, బ్యాంకులు, ఆస్తులను వదిలి వారంతా బ్రిటన్, కెనడా, భారత్‌లకు శరణార్థులుగా వెళ్లారు. ఫలితంగా ఉగాండాలో 90 శాతం వ్యాపారాలు మూతపడ్డాయి. సరఫరా గొలుసు కుప్పకూలి దేశం తీవ్ర ఆర్థిక సంక్షోభంలోకి వెళ్లింది.

గణాంకాలు ఇలా..

  • 1972-75 మధ్య ఉగాండా జీడీపీ 5% మేర పడిపోయింది.

  • 1972లో 740 మిలియన్ షిల్లింగ్‌లుగా ఉన్న ఉత్పత్తి 1979 నాటికి 254 మిలియన్లకు దిగజారింది.

ముసెవెని పిలుపుతో మారిన దశ

1986లో యోవేరి ముసెవెని అధికారం చేపట్టాక పరిస్థితి తలకిందులైంది. అమీన్ నిర్ణయాన్ని చారిత్రక తప్పిదంగా అభివర్ణించిన ఆయన, భారతీయులను తిరిగి రావాల్సిందిగా ఆహ్వానించారు. వారి ఆస్తులను తిరిగి ఇస్తామని హామీ ఇచ్చారు. ‘మనం పోగొట్టుకున్నది కేవలం వ్యక్తులను కాదు, దేశ ఆర్థిక పునాదులను. భారతీయులు ఉగాండా రక్తంలో భాగం’ అని యోవేరి ముసెవెని (అధ్యక్షుడు) అన్నారు.

ఆర్థిక సామ్రాజ్యాల పునరుద్ధరణ

తిరిగి వచ్చిన భారతీయులు వ్యాపారాలు చేయడంతోపాటు దేశ భవిష్యత్తును మార్చేశారు. ప్రస్తుతం ఉగాండా జనాభాలో కేవలం 1 శాతం కంటే తక్కువగా ఉన్న భారతీయులు దేశ ఆదాయపు పన్నులో 65 శాతం వాటాను అందిస్తున్నారంటే వారి ప్రాధాన్యత అర్థం చేసుకోవచ్చు.

సుధీర్ రుపారేలియా

బహిష్కరణ సమయంలో లండన్‌కు పారిపోయి చిన్న ఉద్యోగాలు చేసిన సుధీర్ కేవలం 25,000 డాలర్లతో తిరిగి వచ్చి నేడు ఉగాండాలోనే అత్యంత ధనవంతుడిగా ఎదిగారు. బ్యాంకింగ్, విద్య, రియల్ ఎస్టేట్ రంగాల్లో ఆయనది తిరుగులేని ముద్ర.

మధ్వానీ గ్రూప్

గుజరాత్ నుంచి వలస వచ్చిన ముల్జీభాయ్ మాధ్వానీ స్థాపించిన ఈ సంస్థ నేడు తూర్పు ఆఫ్రికాలోనే అతిపెద్ద వ్యవసాయ-పారిశ్రామిక సంస్థగా ఎదిగింది. ‘కకీరా షుగర్ వర్క్స్’ ద్వారా లక్షలాది మందికి ఉపాధి కల్పిస్తూ 70,000 కంటే ఎక్కువ ఉద్యోగాలకు ఈ గ్రూప్ జీవనాధారంగా ఉంది.

మెహతా, ముక్వానో గ్రూప్స్

మెహతా గ్రూప్ అధినేత మహేంద్ర మెహతాకు భారత ప్రభుత్వం ‘ప్రవాసీ భారతీయ సమ్మాన్’ పురస్కారం ఇచ్చి గౌరవించింది. అలాగే ముక్వానో గ్రూప్ సబ్బులు, నూనెలు వంటి నిత్యావసర వస్తువుల ఉత్పత్తిలో ఎ​ంతో ఎదిగింది.

భారత్ - ఉగాండా సంబంధాలు

ప్రస్తుతం రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం 1.2 బిలియన్ డాలర్లను దాటింది. ఫార్మా, మౌలిక సదుపాయాలు, ఉక్కు, విద్య వంటి రంగాల్లో భారతీయ సంస్థల పెట్టుబడులు వెల్లువెత్తుతున్నాయి. చైనా పెట్టుబడులతో పోలిస్తే భారతీయ వ్యాపారవేత్తలు స్థానిక ప్రజలతో మమేకమై పాఠశాలలు, ఆసుపత్రులు నిర్మిస్తూ అక్కడ సామాజిక బాధ్యతను చాటుకుంటున్నారు.

అయితే, ఇప్పటికీ కొన్ని ప్రాంతాల్లో భారతీయుల ఆర్థిక ఆధిపత్యంపై కొన్ని వర్గాల్లో అసహనం ఉన్నప్పటికీ, ఇండియన్స్‌ లేని ఉగాండా ఆర్థిక వ్యవస్థను ఊహించడం అసాధ్యమని మెజారిటీ ప్రజల నమ్మకం. ఒకప్పుడు బహిష్కరణకు గురైన ఒక జాతి, అదే దేశానికి ఆర్థిక రక్షకులుగా మారడం అనేది ప్రపంచ చరిత్రలోనే అరుదైన దృశ్యం.

ఇదీ చదవండి: ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు కొత్త సమస్య

Videos

జై జగన్ జై జగన్!! దద్దరిల్లిన YSRCP ఆఫీస్

లోకేష్ జల్సాలు..స్పెషల్ ఫ్లైట్లో పుట్టపర్తికి..భారీ కాన్వాయ్ లో చక్కర్లు

2 వాహనాలతో మోదీ కాన్వాయ్ 8 వాహనాలతో లోకేష్ కాన్వాయ్

YSRCPలో చేరిన తరువాత మోపిదేవి శ్రీనివాసరావు ఫస్ట్ రియాక్షన్

తెలుగు రాష్ట్రాలకు తీపి కబురు ముందుగానే రుతుపవనాలు

మోపిదేవికి జగన్ హామీ..

జగన్ సమక్షంలో పార్టీలో చేరిన మోపిదేవి శ్రీనివాసరావు

రేపు పోలీసుల ముందుకు బండి.. హైకోర్టులో వాదనలు

బండి భగీరథ్ కు బిగ్ షాక్.. హైకోర్టు సంచలన కామెంట్స్

హైకోర్టు సంచలన కామెంట్స్.. బండి భగీరథ్ కు బిగ్ షాక్

Photos

+5

ఫారిన్ వెకేషన్‌లో మహేశ్ బాబు ఫ్యామిలీ.. (ఫోటోలు)

+5

కేన్స్ వీధుల్లో మెగా డాటర్ నిహారిక సందడి.. (ఫోటోలు)

+5

పొలిటికల్‌ స్టైల్‌ షో.. ఈ అదిరే లుక్స్‌ చూశారా?..

+5

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో సందడి చేసిన నటి ఊర్వశీ రౌతేలా (ఫొటోలు)

+5

చిత్తూరు గంగజాతర... కనులపండువగా అమ్మవారి దివ్యరూపం (ఫొటోలు)

+5

‘దూరదర్శని’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

విడాకుల రూమర్స్.. ట్రెండింగ్‌లో మౌనీరాయ్ (ఫొటోలు)

+5

అరుణాచలం ట్రిప్‌లో హీరోయిన్ అంజలి (ఫొటోలు)

+5

తెలంగాణ : కోరిన కోరికలు తీర్చే అద్భుత శక్తులు కలిగిన ఆలయం ఎక్కడో తెలుసా? (ఫొటోలు)

+5

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఆలియా భట్ (ఫొటోలు)