అంబటి రాంబాబు దీక్ష వద్ద జడ శ్రావణ్ స్పీచ్
Breaking News
ఈ కోర్టే నకిలీది!
Published on Sun, 04/19/2026 - 00:09
నకిలీ డాక్టర్ల గురించి విన్నాం. నకిలీ లాయరు. నకిలీ జడ్జి గురించి చదివాం. ఫేక్ ఆఫీసర్లు.. డూప్లికేట్ ప్రొడక్టులు.. ఇవన్నీ మనకు తెలిసినవే. అయితే, గుజరాత్లో ఓ వ్యక్తి ఓ కొత్త మోసానికి తెరలేపాడు. ఏకంగా నకిలీ కోర్టే ఏర్పాటు చేశాడు.. ఏంటీ కోర్టా? అని ఆశ్చపోతున్నారా.. కోర్టే కాదు.. లాయర్లు, ఉద్యోగులు, తీర్పులు అన్నీ నకిలీనే...
సివిల్ కేసులు.. ఓ పట్టాన పరిష్కారం కావు. తరాలు మారినా ఎటూ తెగవు. ఏళ్లతరబడి ఎదురుచూపులు. కోర్టుల చుట్టూ ప్రదక్షిణలు తప్పవు. ఇలా తిరిగి. విసిగి వేసారిన వారినే లక్ష్యంగా చేసుకున్నాడు. ప్రభుత్వం నియమించిన ఆర్బిట్రేటర్ని అని చెప్పాడు.. కోర్టు సెటప్ వేసి నమ్మించాడు. కేసులు పరిష్కరించినట్టు, తీర్పులు చెప్పినట్టు నటించాడు. లక్షల్లో ఫీజులు గుంజాడు. ఐదేళ్ల పాటు ఈ దందా సాగించాడు.
ఓ కేసు వ్యవహారంలో ‘అసలు’ కోర్టుకు అనుమానం వచ్చి, ఆరా తీసింది. మోసం బట్టబయలైంది. ‘నకిలీ’ని కటకటాల్లోకి పంపింది. గుజరాత్లోని గాంధీనగర్లో ఈ ఉత్తుత్తి కోర్టు వెలిసింది. మోరిస్ శామ్యూల్ అనే వ్యక్తి ఈ మోసానికి పాల్పడ్డాడు. ఓ గదిలో కోర్టు సెటప్ ఏర్పాటు చేసి, జడ్జిగా గెటప్ వేశాడు. కొంతమంది నకిలీ లాయర్లు, ఉద్యోగులను నియమించుకున్నాడు.
భూమి వివాద బాధితులే లక్ష్యం
భూ సంబంధిత కేసుల్లో బాధితులను టార్గెట్ చేసేవాడు. అమాయకులను గుర్తించి, బుట్టలో వేసుకునేవాడు. ప్రభుత్వం తనను ‘అధికారిక మధ్యవర్తి’గా నియమించిందని నమ్మించేవాడు. కోర్టుల్లో కేసుల పరిష్కారానికి ఎక్కువ కాలం పడుతుందని, తాను త్వరగా పరిష్కారం చూపుతామని నమ్మించి..‘ఉత్తుత్తి’ కోర్టుకు రప్పించేవాడు.
ఐదేళ్ల పాటు కొనసాగిన మోసం
ఈ ఉత్తుత్తి కోర్టు కార్యకలాపాలు 2019 నుంచి 2024 వరకు కొనసాగినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. శామ్యూల్కు ఆర్బిట్రేటర్గా ఎటువంటి అధికారిక హోదా లేదని, ఐదేళ్లలో అనేక కేసుల్లో నకిలీ ఆదేశాలు జారీ చేశాడని గుర్తించారు. ప్రభుత్వ భూములను ప్రైవేట్ వ్యక్తుల పేర్లపై మార్చేలా కలెక్టర్లకు సైతం ఆదేశాలు ఇచ్చినట్లు ఆరోపణలు ఉన్నాయి. నకిలీ ఆర్బిట్రేటర్ కోర్టులో తన క్లయింట్లకు అనుకూలంగా ఆదేశాలు జారీ చేసేవాడు. ఆ తర్వాత ఆ నకిలీ క్లెయిమ్లను కోర్టులో సమర్పించి తన క్లయింట్లకు అక్రమ లాభం కలిగించేవాడు.
ఎలా బయటపడింది
ఈ ‘నకిలీ’ వ్యవహారం ఒక కేసు ద్వారా వెలుగులోకి వచ్చింది. శామ్యూల్ ఇచ్చిన తీర్పు కాపీని ఓ కేసులో అహ్మదాబాద్లోని సిటీ సివిల్ కోర్టులో సమర్పించగా, ఆ పత్రాలను పరిశీలించిన కోర్టు అధికారి అనుమానాస్పద అంశాలను గుర్తించారు. వాస్తవాలను పరిశీలించి, విచారణలో ఆ తీర్పు నకిలీదిగా తేల్చారు. పోలీసులకు ఫిర్యాదు చేశారు.
అరెస్ట్.. కేసుల నమోదు
పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అతని కార్యాలయంలో నకిలీ పత్రాలు, కోర్ట్ ఏర్పాటుకు సంబంధించిన ఆధారాలు స్వాధీనం చేసుకున్నారు. మోరిస్ శామ్యూల్ను అరెస్టు చేశారు. మోసం చేయడం, నకిలీ పత్రాలు తయారు చేయడం వంటి పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.
న్యాయవ్యవస్థపై ప్రజలకు అపారమైన విశ్వాసం ఉంది. ఆ నమ్మకాన్ని ఆధారంగా చేసుకుని శామ్యూల్ మోసానికి పాల్పడ్డాడు. ‘జాప్యాన్ని’ సాకుగా చూపి బాధితుల నిస్సహాయతను తనకు అనుకూలంగా మలచుకున్నాడు. చట్టపరమైన వ్యవహారాల్లో సరైన అధికారిక మార్గాలనే ఎంచుకోవాలని, అనుమానాస్పద వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఈ ఘటన రుజువు చేస్తోంది. అరుదైన మోసమే కాదు, అనేక ప్రశ్నలు లేవనెత్తే ఉదంతంగానూ దీన్ని న్యాయనిపుణులు పేర్కొంటున్నారు.
దిలీప్ మాదిరెడ్డి
Tags : 1