రుక్మిణిని Unfollow చేసిన రిషబ్.. అసలేమైనట్టు..!
Breaking News
మరోసారి...
Published on Sun, 03/29/2026 - 04:27
తెలుగు పరిశ్రమలో ప్రస్తుతం రీ రిలీజ్ల ట్రెండ్ సాగుతోంది. గతంలో సూపర్ హిట్గా నిలిచిన చిత్రాలను రీ రిలీజ్ చేసేందుకు మేకర్స్ అమితాసక్తి చూపిస్తున్నారు. ఆయా హీరోల అభిమానులు, ప్రేక్షకులు కూడా వన్స్ మోర్ అంటూ ఆ సినిమాలను మరోసారి బిగ్ స్క్రీన్పై చూసేందుకు తెగ ఆసక్తి చూపిస్తున్నారు. అలాగే గత చిత్రాలను 4కె క్వాలిటీతో సరికొత్తగా అందిస్తుండటంతో ప్రేక్షకులు కూడా సరికొత్త అనుభూతిని పొందుతున్నారు. ప్రస్తుతం అల్లు అర్జున్ ‘రేసుగుర్రం’, మహేశ్బాబు ‘అతిథి’, ఎన్టీఆర్ ‘ఆంధ్రావాలా, ఊసరవెల్లి’, రవితేజ ‘కృష్ణ’, సిద్ధార్థ్ ‘ఓయ్’, శింబు ‘వల్లభ’ వంటి అరడజను పైగా సినిమాలు రీ రిలీజ్కి రెడీ అవుతున్నాయి. ఆయా చిత్రాల వివరాలేంటో ఓ లుక్ వేద్దాం...
పద్దెనిమిదేళ్ల తర్వాత...
హీరో రవితేజ ఈ వేసవిలో థియేటర్లలో ప్రేక్షకులకు నవ్వులు పంచనున్నారు. ఆయన హీరోగా నటించిన ‘కృష్ణ’ చిత్రం మే నెలలో రీ రిలీజ్ కానుంది. రవితేజ హీరోగా వీవీ వినాయక్ దర్శకత్వం వహించిన సినిమా ‘కృష్ణ’. ఈ మూవీలో త్రిష హీరోయిన్గా నటించారు. బ్రహ్మానందం, ఎమ్మెస్ నారాయణ, ముకుల్ దేవ్, గిరిబాబు, చంద్రమోహన్, సుధ, వేణు మాధవ్, సునీల్, జయప్రకాశ్ రెడ్డి, షాయాజీ శిండే, సత్యం రాజేశ్ ఇతర పాత్రలు పోషించారు. నిర్మాత డీవీవీ దానయ్య సమర్పణలో లక్ష్మీ నరసింహ విజువల్స్పై బి. కాశీ విశ్వనాథం నిర్మించారు.
రవితేజ మాస్ ఇమేజ్, వినాయక్ మాస్ క్రేజ్ ఈ మూవీకి ప్లస్ అయింది. రవితేజ, త్రిష, బ్రహ్మానందం మధ్య వచ్చే సన్నివేశాలు ఆడియన్స్ని కడుపుబ్బా నవ్వించాయి. 2008 సంక్రాంతి కానుకగా జనవరి 11న విడుదలైన ఈ సినిమా ఘనవిజయాన్ని సొంతం చేసుకుంది. చక్రి అందించిన సంగీతం ఈ మూవీ విజయంలో తన వంతు పాత్ర పోషించింది అనడం అతిశయోక్తి కాదు. మాస్ అండ్ కామెడీ ఎంటర్టైనర్గా రూపొందిన ఈ సినిమా రవితేజ కెరీర్లో వన్ ఆఫ్ ది బ్లాక్ బస్టర్ మూవీగా నిలిచింది. పద్దెనిమిదేళ్ల తర్వాత మే 8న ‘కృష్ణ’ మూవీ రీ రిలీజ్ అవుతోంది.
ఇదిలా ఉంటే... రవితేజ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘ఇరుముడి’. శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో ప్రియా భవానీ శంకర్ కథానాయికగా నటిస్తుండగా, రవితేజ కుమార్తె పాత్రను బేబీ నక్షత్ర పోషిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్పై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ ప్రస్తుతం హైదరాబాద్లో జరుగుతోంది. యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఈ చిత్రానికి జీవీ ప్రకాశ్కుమార్ సంగీతం అందిస్తున్నారు.
దేవుడా...
‘రేసు గుర్రం’ సినిమాలో దేవుడా అంటూ ఓ మేనరిజమ్తో హీరో అల్లు అర్జున్ పలికిన డైలాగ్ ఇప్పటికీ ప్రేక్షకులకు గుర్తుండే ఉంటుంది. మరోసారి ఆ మేనరిజాన్ని ప్రేక్షకులు చూడనున్నారు. అల్లు అర్జున్ హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించిన చిత్రం ‘రేసు గుర్రం’. ఈ సినిమాలో శ్రుతీహాసన్ హీరోయిన్గా నటించారు. బ్రహ్మానందం, ప్రకాశ్రాజ్, అలీ, పోసాని కృష్ణమురళి, తనికెళ్ల భరణి, రవి కిషన్, శ్యామ్, పవిత్రా లోకేష్, ప్రగతి ఇతర పాత్రలు పోషించారు. బేబి భవ్య సమర్పణలో లక్ష్మీ నరసింహ ్రపొడక్షన్స్పై నల్లమలుపు శ్రీనివాస్ (బుజ్జి), వెంకటేశ్వ రావు నిర్మించారు.
మాస్, యాక్షన్ , కామెడీ ఎంటర్టైనర్గా రూపొందిన ఈ సినిమా 2014 ఏప్రిల్ 11న విడుదలై, సూపర్ హిట్గా నిలిచింది. ప్రత్యేకించి అల్లు అర్జున్–శ్రుతీహాసన్ ఎనర్జిటిక్ డ్యాన్సులు ప్రేక్షకులకు కనువిందు కలిగించాయి. అల్లు అర్జున్ ఎనర్జిటిక్ యాక్టింగ్, శ్రుతీహాసన్ అమాయకత్వం ఈ సినిమాకి ప్లస్ అయ్యాయి. తమన్ అందించిన సంగీతం ఈ మూవీకి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
ఇన్స్పెక్టర్ కిల్బిల్ పాండేగా బ్రహ్మానందం ఏ స్థాయిలో ఆడియన్స్కి నవ్వులు పంచారో తెలిసిందే. అల్లు అర్జున్ హీరోగా నటించిన సూపర్ హిట్ సినిమాల్లో ఒకటైన ‘రేసు గుర్రం’ మూవీని ఆయన పుట్టినరోజు కానుకగా ఏప్రిల్ 8న రీ రిలీజ్ చేస్తున్నారు. క్రౌన్ మూవీస్ ద్వారా ఈ సినిమా గ్రాండ్గా విడుదల కానుంది. ఇందుకు సంబంధించిన ట్రైలర్ని కూడా విడుదల చేశారు.
తమ అభిమాన హీరో (అల్లు అర్జున్) పుట్టినరోజు అయిన ఏప్రిల్ 8న ‘రేసు గుర్రం’ రీ రిలీజ్ అవుతుండటంతో అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఇదిలా ఉంటే... ‘పుష్ప: ది రైజ్’ (2021), ‘పుష్ప 2: ది రూల్’ (2024) సినిమాలతో అంతర్జాతీయ స్థాయిలో క్రేజ్ సొంతం చేసుకున్న అల్లు అర్జున్ నటిస్తున్న తాజా చిత్రం ‘ఏఏ 22’ (వర్కింగ్ టైటిల్). తమిళ దర్శకుడు అట్లీ తెరకెక్కిస్తున్న ఈ మూవీలో బాలీవుడ్ నటి దీపికా పదుకోన్ హీరోయిన్గా నటిస్తున్నారు. కళానిధి మారన్ సమర్పణలో సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ పాన్ ఇండియా మూవీ షూటింగ్ ప్రస్తుతం ముంబైలో జరుగుతోంది. ఈ మూవీకి అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు.
అతిథి వస్తున్నాడు
ఈ వేసవికి మహేశ్ బాబు ‘అతిథి’ గా థియేటర్లలో సందడి చేసేందుకు వస్తున్నారు. ఆయన హీరోగా నటించిన చిత్రం ‘అతిథి’. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అమృతా రావ్ హీరోయిన్గా నటించారు. కోట శ్రీనివాసరావు, నాజర్, మురళీ శర్మ, ఆశిష్ విద్యార్థి, అజయ్, వేణుమాధవ్, రాజీవ్ కనకాల, ప్రగతి ఇతర పాత్రలు పోషించారు. ఘట్టమనేని రమేశ్ బాబు, రోనీ స్క్రూవాలా నిర్మించిన ఈ స్టైలిష్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ 2007 అక్టోబరు 18న విడుదలైంది. మహేశ్ బాబు మేకోవర్, స్టైలిష్ లుక్స్, యాక్షన్... వంటివన్నీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. మహేశ్ బాబును దర్శకుడు సురేందర్ రెడ్డి అల్ట్రా మోడ్రన్ లుక్లో ప్రజెంట్ చేశారు. లాంగ్ హెయిర్, ట్రెండీ కాస్ట్యూమ్స్, పవర్ఫుల్ డైలాగ్ డెలివరీతో మహేశ్ బాబు ప్రేక్షకులను కట్టిపడేశారు.
ముఖ్యంగా ఈ సినిమాలోని యాక్షన్ ఘట్టాలు, సురేందర్ రెడ్డి మార్క్ టేకింగ్ చాలా కొత్తగా అనిపించాయి. మెలోడీ బ్రహ్మ మణిశర్మ అందించిన సంగీతం ‘అతిథి’ సినిమాకు అతి పెద్ద బలం అని చెపొ్పచ్చు. అదే విధంగా మహేశ్ బాబు–అమృతా రావ్ మధ్య సన్నివేశాలు కూడా ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. దాదాపు 19 ఏళ్ల తర్వాత ఈ సినిమాను 4కె వెర్షన్న్లో రీ రిలీజ్ చేస్తుండటంతో అటు అభిమానుల్లో ఇటు ట్రేడ్ వర్గాల్లోనూ ఫుల్ క్రేజ్ నెలకొంది. మే 31 సూపర్ స్టార్ కృష్ణ జయంతిని పురస్కరించుకుని మే 29న ‘అతిథి’ సినిమా మరోసారి ప్రేక్షకుల ముందుకు వస్తోంది. అత్యాధునిక సాంకేతికతతో, మెరుగైన సౌండ్ క్వాలిటీతో వస్తున్న ‘అతిథి’ని చూసేందుకు ఘట్టమనేని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
కాగా మహేశ్ బాబు హీరోగా నటించిన ‘పోకిరి’, ‘ఒక్కడు’, ‘బిజినెస్ మేన్’, ‘మురారి’ వంటి చిత్రాలు ఇప్పటికే రీ రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే... మహేశ్ బాబు హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘వారణాసి’. రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో ప్రియాంకా చో్రపా, పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. శ్రీ దుర్గా ఆర్ట్స్, షోయింగ్ బిజినెస్ బ్యానర్లపై కేఎల్ నారాయణ, ఎస్ఎస్ కార్తికేయ ఈ మూవీ నిర్మిస్తున్నారు. యాక్షన్ థ్రిల్లర్గా రూపొందుతోన్న ‘వారణాసి’ తాజా షెడ్యూల్ హైదరాబాద్లో వేసిన ప్రత్యేకమైన వారణాసి సెట్లో జరుగుతోంది. 2027 ఏప్రిల్ 9న విడుదల కానున్న ‘వారణాసి’పై అంతర్జాతీయ స్థాయిలో ఫుల్ బజ్ నెలకొంది.
డబుల్ ధమాకా
హీరో ఎన్టీఆర్ పుట్టినరోజు కానుకగా తన అభిమానులకు డబుల్ ధమాకా ఇవ్వనున్నారు. మే 20న ఎన్టీఆర్ బర్త్ డే. ఈ సందర్భంగా ఆయన హీరోగా నటించిన ‘ఆంధ్రావాలా’, ‘ఊసరవెల్లి’ సినిమాలు రీ రిలీజ్ కానున్నాయి. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా నటించిన చిత్రం ‘ఆంధ్రావాలా’. ఈ మూవీలో రక్షిత హీరోయిన్గా నటించారు. రమాప్రభ, బ్రహ్మానందం, ఎమ్మెస్ నారాయణ, రఘుబాబు, వేణుమాధవ్, షాయాజీ శిండే, రాహుల్ దేవ్, బెనర్జీ, నాజర్, సంఘవి ఇతర పాత్రలు పోషించారు.
భారతి సమర్పణలో గిరి నిర్మించిన ఈ సినిమా 2004 జనవరి 1న విడుదలైంది. ఈ సినిమాలో ఎన్టీఆర్ తొలిసారి తండ్రీకొడుకుగా ద్విపాత్రాభినయం చేశారు. చక్రి అందించిన సంగీతం ఈ మూవీకి ప్లస్ అయింది. ఎన్టీఆర్, రక్షిత డ్యాన్స్లు ప్రేక్షకులకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ చిత్రం విడుదలై 22 ఏళ్లు దాటిపోయింది. మే 20న ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా ‘ఆంధ్రావాలా’ని రీ రిలీజ్ చేస్తున్నారు నిర్మాత గిరి.
ఎన్టీఆర్ హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించిన చిత్రం ‘ఊసరవెల్లి’. ఈ సినిమాలో తమన్నా హీరోయిన్గా నటించారు. ప్రకాశ్రాజ్, తనికెళ్ల భరణి, విద్యుత్ జమాల్, షాయాజీ శిండే, మురళీ శర్మ, ప్రభాస్ శ్రీను, జీవీ సుధాకర్ నాయుడు తదితరులు ఇతర పాత్రల్లో నటించారు. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర పతాకంపై బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మించిన ఈ సినిమా 2011 అక్టోబరు 6న రిలీజ్ అయింది. ఈ మూవీకి దేవిశ్రీ ప్రసాద్ తనదైన శైలిలో సంగీతం అందించారు. సుమారు పదిహేనేళ్ల తర్వాత ఈ సినిమా మరోసారి ప్రేక్షకుల ముందుకొచ్చేందుకు సిద్ధం అవుతోంది.
మే 20న ఎన్టీఆర్ బర్త్ డేని పురస్కరించుకుని ఈ సినిమా రీ రిలీజ్కి ముస్తాబవుతోంది. ఇదిలా ఉంటే... ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘ఎన్టీఆర్నీల్’ (వర్కింగ్ టైటిల్). ‘కేజీఎఫ్, సలార్’ ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో రుక్మిణీ వసంత్ హీరోయిన్ . మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్స్పై కల్యాణ్ రామ్ నందమూరి, నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి, హరికృష్ణ కొసరాజు నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు ‘డ్రాగన్’ అనే టైటిల్ను పరిశీలిస్తున్నారు మేకర్స్. ఈ సినిమా జూన్ 25న ప్రేక్షకుల ముందుకు రానుంది.
వేసవిలో ఓయ్
‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా’ (2005) సినిమా ద్వారా తెలుగు పరిశ్రమకు పరిచయం అయ్యారు హీరో సిద్ధార్థ్. తొలి సినిమాతోనే హిట్ అందుకున్నారాయన. ఆ తర్వాత ‘బొమ్మరిల్లు’ (2006) మూవీతో సూపర్ డూపర్ హిట్ సొంతం చేసుకున్నారు. ఆ సినిమా తర్వాత ఆయన నటించిన తెలుగు చిత్రాల్లో ‘ఓయ్’ ఒకటి. ఆనంద్రంగా దర్శకత్వం వహించిన ఈ సినిమాలో షామిలి హీరోయిన్గా నటించారు.
సునీల్, అలీ, కృష్ణుడు, ఎమ్మెస్ నారాయణ, తనికెళ్ల భరణి, ప్రదీప్ రావత్, నెపోలియన్ తదితరులు నటించారు. డీవీవీ దానయ్య ఈ సినిమా నిర్మించారు. 2009 జూలై 3న విడుదలైన ఈ సినిమా యూత్ని బాగా ఆకట్టుకుంది. ప్రత్యేకించి యువన్ శంకర్ రాజా సంగీతం ఈ చిత్రానికి ప్లస్ అయింది. మ్యూజిక్ పరంగా ఈ మూవీ హిట్ అయ్యింది. మ్యూజికల్ రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్గా రూపొందిన ‘ఓయ్’ ఏప్రిల్ 17న రీ రిలీజ్ అవుతోంది. తెలుగులో ఆ మధ్య వరుస సినిమాలు చేసిన సిద్ధార్థ్ ప్రస్తుతం తమిళంలో బిజీ బిజీగా సినిమాలు చేస్తున్నారు.
వల్లభ సిద్ధం
శింబు హీరోగా నటించి, దర్శకత్వం వహించిన తమిళ చిత్రం ‘వల్లవన్’. ఈ మూవీలో నయనతార హీరోయిన్గా నటించగా, రీమా సేన్, సంధ్య, సంతానం, ప్రేమ్జీ, సత్యన్ ప్రధాన పాత్రలు పోషించారు. పీఎల్ తేనప్పన్ నిర్మించిన ఈ మూవీ తమిళంలో 2026 అక్టోబరు 21న విడుదలై, సూపర్ హిట్గా నిలిచింది. ఈ చిత్రాన్ని తెలుగులో ‘వల్లభ’ పేరుతో అనువదించి, రిలీజ్ చేశారు. 2006 నంబరు 11న తెలుగులో విడుదలైన ఈ చిత్రం ఇక్కడ కూడా అద్భుతమైన విజయం సొంతం చేసుకుంది.
రొమాంటిక్ యాక్షన్ డ్రామాగా రూపొందిన ఈ సినిమాలో నయనతార టీచర్గా, శింబు స్టూడెంట్గా నటించారు. టీచర్–స్టూడెంట్ మధ్య ప్రేమ నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద విజయాన్ని అందుకుంది. ప్రత్యేకించి యువతని భారీగా ఈ మూవీ థియేటర్లకు రప్పించింది. ఈ చిత్రానికి సంగీత దర్శకుడు ఇళయరాజా కుమారుడు యువన్ శంకర్ రాజా అందించిన సంగీతం ప్రత్యేకంగా నిలిచింది. కళాశాల ప్రేమకథ నేపథ్యంలో రూపొందిన ‘వల్లభ’ సినిమా మే 9న విడుదలవుతోంది.
పైన పేర్కొన్న సినిమాలే కాదు... మరికొన్ని చిత్రాలు కూడా రీ రిలీజ్కి ముస్తాబవుతున్నాయి.
– డేరంగుల జగన్ మోహన్
Tags : 1