మంగ్లీ సాంగ్ పై కేంద్రం సీరియస్
Breaking News
‘ఉస్తాద్ భగత్ సింగ్’ మూవీ రివ్యూ అండ్ రేటింగ్
Published on Thu, 03/19/2026 - 12:24
టైటిల్ : ఉస్తాద్ భగత్ సింగ్
నటీనటులు: పవన్ కల్యాణ్, శ్రీలీల, రాశిఖన్నా, పార్థిబన్ తదితరులు
నిర్మాణ సంస్థ: మైత్రి మూవీ మేకర్స్
నిర్మాతలు: నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి
రచన, దర్శకత్వం: హరీష్ శంకర్
స్క్రీన్ప్లే: కె. దశరథ్, రమేష్ రెడ్డి
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
నేపథ్య సంగీతం: తమన్
సినిమాటోగ్రఫీ: అయనంకా బోస్
ఎడిటర్: కార్తిక శ్రీనివాస్
విడుదల తేది: మార్చి 19, 2026
‘గబ్బర్ సింగ్’తర్వాత పవన్ కల్యాణ్-హరీష్ శంకర్ కాంబినేషన్లో వచ్చన రెండో చిత్రం ‘ఉస్తాద్ భగత్ సింగ్’. వాస్తవానికి 2020లోనే హరీష్-పవన్ సినిమా ఫిక్స్ అయింది. మైత్రీ మూవీస్ సంస్థలో సినిమా ఉంటుందని అధికారికంగా ప్రకటించారు కూడా. కానీ పవన్ రాజకీయాలలో బిజీ కావడంతో షూటింగ్ ఆలస్యం అయింది. ఎప్పుడో రిలీజ్ కావాల్సిన సినిమా ఉగాది పండగ సందర్భంగా నేడు(మార్చి 19) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.

కథేంటంటే..
తెలంగాణాలొని లింగయ్య గూడెం గ్రామానికి కొత్తగా వచ్చిన ఉపాధ్యాయుడు చంద్రశేఖర్(కేఎస్ రవికుమార్).. చిన్నయ్య అనే కుర్రాడినికి చేరదీసి పెద్ద చదువులు చదివిస్తాడు. చిన్నయ్య ప్రవర్తన, లక్షణాలను చూసి చిన్నప్పుడే ఉస్తాద్ భగత్ సింగ్ అని నామకరణం చేస్తాడు. కొన్నాళ్ల తర్వాత ఆ మాస్టరు రాష్ట్ర ముఖ్యమంత్రి అవుతాడు. భగత్ సింగ్ ఐపీఎస్ అధికారి అవుతాడు. అంతా సవ్యంగా సాగుతున్న సమయంలో సీఎంపై దాడి జరుగుతుంది. ఆ దాడి వెనుక మంత్రి నాగప్ప (పార్తిపన్) ఉన్నట్లు తెలుస్తుంది. తన గురువుని కాపాడుకునేందుకు ఉస్తాద్ భగత్ సింగ్ ఏం చేశాడు? నాగప్పతో ఉస్తాద్కు ఉన్న వైర్యం ఏంటి? ఆర్జే లీలా(శ్రీలీల) తో ఉస్తాద్కు ఉన్న సంబంధం ఏంటి? ఐపీఎస్గా విధులు నిర్వహించాల్సిన ఉస్తాద్.. సీఎంపై దాడి తర్వాత అడవి బాట ఎందుకు పట్టాల్సి వచ్చింది? భగత్ సింగ్ గతమేంటి? శ్లోక(రాశీ ఖన్నా) ఎవరు? తదితర విషయాలన్నీ తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
ఎలా ఉందంటే..
ఈ రోజుల్లో బలమైన కంటెంట్ ఉంటే తప్ప ప్రేక్షకులు థియేటర్స్కి వెళ్లడం లేదు. ఎంత పెద్ద స్టార్ ఉన్నా సరే.. కథలో కొత్తదనం లేకుంటే ఆ సినిమాను ఆదరించడం లేదు. ఇలాంటి రోజుల్లో దర్శకుడు హరీష్ శంకర్ రొటీన్ కథతో ‘ఉస్తాద్ భగన్ సింగ్’ తెరకెక్కించాడు. కథ, కథనం ఏమాత్రం కొత్తగా అనిపించదు. సినిమా చూస్తున్నంత సేపు పాత సినిమాల సన్నివేశాలన్నీ కళ్లముందు కదులుతాయి. స్క్రీన్ప్లే అయితే మరీ దారుణంగా ఉంది. ఒక్కచోట కూడా ఆసక్తికరంగా కథనం సాగదు. పైగా పవన్తో చేయించిన కామెడీ ట్రాక్ కూడా అంతగా వర్కౌట్ కాలేదు. నార్మల్ ఆడియన్స్ని పక్కన పెట్టు..కనీసం అభిమానులు ఆశించిన అంశాలు కూడా ఇందులో ఉండకపోవడం గమనార్హం.
ఫ్యాన్స్ కోసమే అన్నట్లుగా పవన్లో స్టెప్పులు వేయించారు. కానీ కథలో అది ఇరికించినట్లుగానే అనిపిస్తుంది. డ్యాన్స్..డ్యాన్స్ అంటూ హీరోకి హైప్ ఇచ్చి.. ఆ సందర్భంలో పెట్టిన పాటకు సరైన స్టెప్పులే వేయించలేదు. అలాంటి అప్పుడు అంత హైప్ ఇవ్వడం ఎందుకో? మరోవైపు ‘ధేఖ్ లేంగే సాలా’సాంగ్ మిస్ప్లేస్ అయిన ఫీలింగ్ కలుగుతుంది.
ఇక ఈ కథకి టెర్రరిజం, సనాతన ధర్మం అంశాలను యాడ్ చేయడం కూడా ఇరికించినట్లుగానే అనిపిస్తుంది. హీరోని దృష్టిలో ఉంచుకోనే ఆయా సన్నివేశాలను యాడ్ చేశారనిపిస్తుంది. ఎలివేషన్ ఇస్తూ..ఏదో చెప్పేస్తే చాలు ఫ్యాన్స్ కనెక్ట్ అయిపోతారని భావించారేమో. అప్పుడే హీరో కామెడీ చేస్తాడు.. కాసేపటికే సీరియస్ అవుతాడు. ఆ లోపే మరో కొత్త పాయింట్ తెరపై వస్తుంది. వాటిలో ఏ ఒక్కటి కూడా ఆకట్టుకునేలా ఉండడకపోవడమే మైనస్. ఇక ముందు నుంచి ప్రచారం జరిగినట్లుగా ఈ కథ ‘తెరి’ సినిమాకు పూర్తిగా రీమేక్ కాకపోయినా.. హీరో పాత్రతీరుతో పాటు ఒకటి రెండు సీన్లు ఆ సినిమాను గుర్తు చేస్తాయి.
సీఎంపై దాడి చేసే సన్నివేశంతో కథ ఆసక్తికరంగా ప్రారంభం అవుతుంది. హీరో బాల్యం చూపిస్తే.. సీఎంతో అతనికి ఉన్న అనుబందాన్ని ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత శ్లోకగా రాశీ ఖన్నా ఎంట్రీ అయినప్పటి నుంచి కథనం రొటీన్గానే సాగుతుంది. ఇంటర్వెల్ సీన్ కూడా రొటీన్గానే ఉంటుంది. ఇక ద్వితియార్థంలో వచ్చే హీరో ప్లాష్ బ్యాక్ స్టోరీ కొంతమేర ఆకట్టుకుంటుంది. శ్రీలీల-పవన్ మధ్య వచ్చే సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. ముఖ్యంగా తొలి ప్రేమలో సినిమాలోని ‘ఈ మనసే..’ పాట రీమేక్ ఫ్యాన్స్కి అలరిస్తుంది. ఆ తర్వాత మళ్లీ రొటీన్గానే సాగుతుంది. ఫస్టాఫ్తో పోలిస్తే.. సెకండాఫ్ కాస్త బెటర్. మొత్తంగా మాత్రం ఉస్తాద్ .. రొటీన్ కమర్షియల్ ఎంటర్టైనర్. కొత్తదనం ఆశించి వెళితే..అభిమానులకు సైతం నిరాశ తప్పదు.

ఎవరెలా చేశారంటే..
నటనపరంగా మెప్పించేందుకు ఇందులో పవన్ కొత్తగా చేసిందేమి లేదు. ఈ తరహా పోలీసు పాత్రను ఆయన ఆల్రేడీ చేసేశాడు. ఓ పాటకు స్టెప్పులు వేయడం ఫ్యాన్స్కి కిక్ ఇస్తుంది. శ్రీలీల పాత్ర ఎంట్రీ సెకండాఫ్లో ఉంటుంది. అయినప్పటికే తన స్క్రీన్ ప్రజెన్స్తో ఆకట్టుకుంది. రాశీ ఖన్నా పాత్రకు నిడివి తక్కువే. అంతగా ప్రాధాన్యత కూడా లేదు. పార్తీబన్ విలనిజం జస్ట్ ఓకే. కేఎస్ రవికుమార్, కిల్లి క్రాంతి, శ్రీనాథ్ మాగంటితో పాటు మిగిలిన వాళ్లంతా తమ పాత్రల పరిధిమేర నటించారు. సాంకేతికంగా సినిమా పర్వాలేదు. దేవిశ్రీ ప్రసాద్ పాటలు ఓకే . తమన్ నేపథ్య సంగీతం కొన్ని చోట్ల సన్నివేశాలతో సంబంధం లేకుండా ఉంటుంది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లుగా ఉన్నాయి.
Tags : 1