● జిల్లా మార్కెటింగ్ అధికారి పద్మావతి
కరీంనగర్రూరల్/చొప్పదండి: ధాన్యం తూకంలో కోతలేకుండా రైతులకు నష్టం జరగకుండా చూడాల్సిన బాధ్యత కేంద్రాల నిర్వాహకులపై ఉందని జిల్లా మార్కెటింగ్ అధికారి వి.పద్మావతి అన్నారు. శుక్రవారం కరీంనగర్ మండలం నగునూరు, చొప్పదండి మండలం కొలిమికుంట, గుమ్లాపూర్, భూపాలపట్నం, వెదురుగట్టలోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించారు. ఎండలు తీవ్రంగా ఉన్నందున ప్రతీకేంద్రంలో తాగునీరు, ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచాలని నిర్వాహకులకు సూచించారు. ప్యాడీక్లీనర్ల ద్వారా ధాన్యాన్ని శుభ్రపరుచుకోవాలని కోరారు. తూకంలో కోత లేకుండా చూడాల్సిన బాధ్యత నిర్వాహకులపై ఉందని, రైసుమిల్లర్లు ధాన్యం దింపుకోవడంలో ఇబ్బందులకు గురిచేసినట్లయితే సమాచారం ఇవ్వాలని సూచించారు. అనంతరం డీఎంవో చొప్పదండి మార్కెట్యార్డును సందర్శించారు. మొక్కజొన్న, పప్పు ధాన్యాలు, ధాన్యం కొనుగోళ్లను పరిశీలించారు. ఏపీఎం నర్మదతోపాటు స్థానిక పీఏసీఎస్, ఐకేపీ అధికారులు ఉన్నారు.