-
డా. బీఆర్ అంబేద్కర్కు సీఎం జగన్ నివాళులు
సాక్షి, తాడేపల్లి: డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నివాళులు అర్పించారు. సమాజంలో అంటరానితనం నిర్మూలనకి అక్షరమనే ఆయుధాన్ని ఎక్కుపెట్టిన దార్శనికుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ అని సీఎం జగన్ పేర్కొన్నారు. ‘సమాజంలో అంటరానితనం నిర్మూలనకి అక్షరమనే ఆయుధాన్ని ఎక్కుపెట్టిన దార్శనికుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్. నిరుపేద, అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం తన జీవితాన్ని అంకితం చేసిన అంబేడ్కర్ గారిపై గౌరవాన్ని ఇనుమడింపచేస్తూ భావి తరాలకు గుర్తుండేలా విజయవాడలో మన ప్రభుత్వం 206 అడుగుల స్టాట్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ను ఏర్పాటు చేయడం రాష్ట్రానికే కాదు, దేశానికీ తలమానికం. ఈరోజు ఆ మహనీయుడి జయంతి సందర్భంగా ఘన నివాళులు’ అని సీఎం వైఎస్ జగన్ ‘ఎక్స్’ వేదికగా ట్వీట్ చేశారు. సమాజంలో అంటరానితనం నిర్మూలనకి అక్షరమనే ఆయుధాన్ని ఎక్కుపెట్టిన దార్శనికుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ గారు. నిరుపేద, అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం తన జీవితాన్ని అంకితం చేసిన అంబేడ్కర్ గారిపై గౌరవాన్ని ఇనుమడింపచేస్తూ భావి తరాలకు గుర్తుండేలా విజయవాడలో మన ప్రభుత్వం 206 అడుగుల… pic.twitter.com/Da4B5jWmQo — YS Jagan Mohan Reddy (@ysjagan) April 14, 2024 -
దేశ భవిష్యత్తుకు దిక్సూచి!
ప్రపంచ మేధావి, ఆలోచనాపరుడు, తత్వవేత్త, భారత రాజ్యాంగ నిర్మాణ కర్త డా‘‘ బీఆర్ అంబేడ్కర్ 133వ జయంతి ప్రపంచవ్యాప్తంగా స్ఫూర్తిని నింపుతున్న ఒక చారిత్రక ఉత్సవం. అంబేడ్కర్ నిరంతర అధ్యయనం, విశ్లేషణ, తర్కం, హేతు వాదం, మానవతావాదం; ఆర్థిక,సాంఘిక, రాజకీయవాదాలు; బౌద్ధ విప్లవ ప్రస్థానం... ఆయన విస్తృతినీ, వ్యాప్తినీ, ప్రాపంచిక తాత్విక దృక్పథాన్నీ మనకు సాక్షాత్కరింప జేస్తున్నాయి. ఆయన ఒక వాల్టేర్ లాగా, రూసో లాగా ప్రపంచానికి ఒక నూతన దర్శనాన్ని అందించారు. ఆయన వ్యక్తిత్వంలో విద్యా జ్ఞానం, పరిశోధన, నైతికత, విమోచన కలిసి నడుస్తాయి. ఆయన బహుభాషా నిష్ణాతులు. మరాఠా భాష ఎంత బలంగా వచ్చో ఇంగ్లీషు, జర్మనీ కూడా అంతే నిశితంగా వచ్చు. ఆయన ఒక భాషా నిఘంటువు. ఆయన విద్యాభ్యాసంలో ఒక యుద్ధ ప్రక్రియ ఉంది. ఆయన ఆర్థిక శాస్త్ర నిపుణులు. అంబేడ్కర్ అపారమైన జ్ఞాపక శక్తి కలవారు. రాజ్యాంగ సభ డిబేట్స్లో కొన్ని వందల అంశాలు చూడకుండా చెప్పగలిగే వారు. ఆయన వాక్చాతుర్యా నికీ, వాదనా పటిమకూ, విషయ పరిజ్ఞానానికీ బాబు రాజేంద్ర ప్రసాద్, జవహర్లాల్ నెహ్రూ, సర్దార్ వల్లభాయ్ పటేల్, రాజాజీ వంటి వారు అచ్చెరువొందేవారు. అంబేడ్కర్ సున్నితమైన హాస్య చతురుడు. చక్కని చిరునవ్వుతో ఆయన కళ్ళు మెరుస్తూ ఉండేవి. ఆయన చూపుడు వేలు ప్రపంచానికి ఓ ప్రశ్నోపనిషత్తు వంటిది. అంబేడ్కర్ 1913లో న్యూయార్క్లోని కొలంబియా విశ్వవిద్యాలయంలో విద్యార్థిగా, పరిశోధకుడిగా ‘బ్రిటిష్ ఇండియాలో ప్రొవెన్షియల్ ఫైనాన్స్ పరిణామం’ అనే థీసిస్ రాసి ఎందరి మెప్పునో పొందారు. 1916లో లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్లో డాక్టరేట్ పట్టా పుచ్చు కోవడం కోసం రాత్రింబవళ్లు శరీరం శుష్కించే వరకూ చదివారు. విద్య పట్ల అంబేడ్కర్ దృక్పథాన్ని గమనిస్తే ఆయన విద్య అంటే కేవలం అక్షరాస్యత అనో, చదువనో అనుకోలేదని స్పష్టమ వుతుంది. విద్య మనిషిని సంపూర్ణంగా మార్చగలిగే సాధనమ న్నది అంబేడ్కర్ నమ్మకం. ఈ విషయంలో ఆయనపై బౌద్ధ ధర్మ ప్రభావం ఉన్నట్లు అనిపిస్తుంది. బుద్ధుడి బోధనలు, తాత్విక చింతన కేంద్రంగానే అంబేడ్కర్ విద్యను అభ్యసించారు. విద్య పర మార్థం ప్రజ్ఞ, కరుణ, సమత అనీ, ఈ త్రిగుణాలు పెంపొందించినప్పుడే విద్యకు పరిపూర్ణత చేకూరుతుందనీ అంబేడ్కర్ భావించారు. సమాజంలో విద్య ద్వారా చైతన్యం వస్తుందన్న ఉద్దేశంతో ఆయన విద్యా వ్యాప్తి కోసం 1945 నుంచి ఒక ఉద్యమం ప్రారంభించారు. ‘పీపుల్స్ ఎడ్యుకేషన్ సొసైటీ’ పేరుతో ఒక సంస్థను ఏర్పాటు చేసి, అనేక విద్యాలయాలు, కళాశాలల ఏర్పాటుకు కృషి చేశారు. జ్ఞానం, కరుణ అనేవి తాను స్థాపించిన సొసైటీ ప్రధాన లక్ష్యా లుగా పేర్కొన్న అంబేడ్కర్ ‘హక్కుల సాధన కోసం చదువుకోండి! సంఘటితం కండి! పోరాడండి! మీపైన మీరు విశ్వాసం పెంచుకోండి! ఏ రకంగా కూడా మనకు ఓటమి ఉండదు. ఇది విజయం కోసం చేస్తున్న పోరాటం, స్వేచ్ఛ కోసం సాగిస్తోన్న యుద్ధం, ఈ యుద్ధం మనం కోల్పోయిన వ్యక్తిత్వాన్ని తిరిగిపొందడానికి చేస్తున్నది’ అని ఉద్బోధించారు. సామాజిక మార్పు పోరాటాల ద్వారా, పోరాటాలు విజ్ఞానం ద్వారా, విజ్ఞానం విద్య ద్వారా అందుతాయన్నది అంబేడ్కర్ మార్గం. అలాగే దళితులు చదువు కోవడం ద్వారా సంప్రదాయ వృత్తుల్లో స్థిరపడే అవకాశం ఉండదనీ, తద్వారా తమ తరతరాల కులవృత్తులు చేస్తున్నందువల్ల ఎదురవుతున్న చిన్నచూపు తప్పుతుందనీ అంబేడ్కర్ ఆలోచన. అంబేడ్కర్ మనుస్మృతి భావజాలానికి ప్రత్యామ్నాయంగా భారత రాజ్యాంగాన్ని రూపొందించారు. ఆయన పాండిత్యం, విజ్ఞత, మానవతా దృష్టి, బౌద్ధనీతి, సమ సమాజ భావన, భారత రాజ్యాంగంలో సముచితంగా సమన్వయించబడ్డాయి. అంబేడ్క ర్లో కుల నిర్మూలనా భావం, దార్శనికత, అహింసాతత్వం, భారతదేశాన్ని రక్తపాతం లేని దేశంగా సృష్టించగలిగింది. రాజ్యాంగంలో స్త్రీలందరికీ చదువుకునే హక్కు ఇవ్వటం ద్వారానూ, అçస్పృశ్యులందరికీ రిజర్వేషన్ కల్పించడం ద్వారానూ, శూద్రులందరికీ హక్కులు కల్పించడం ద్వారానూ ఆయన సమ సమాజ నిర్మాణానికి పునాదులు వేశారు. అంబేడ్కర్ విద్యా విప్లవంతో పాటు రాజకీయోద్యమాన్నీ నడిపారు. 1936 ఆగస్టులో దళిత జాతుల సముద్ధరణకు ‘ఇండిపెండెంట్ లేబర్ పార్టీ’(ఐఎల్పీ)ని ఆయన స్థాపించారు. ఈ పార్టీ బొంబాయిలో షెడ్యూల్డ్ కులాలకు కేటాయించిన పది హేను సీట్లలో పదమూడింటిని కైవసం చేసుకుంది. జనరల్ సీట్లను కూడా రెండింటిని కైవసం చేసుకుంది. ఆయన ‘లేబర్’ అనే పదానికి ‘అణగదొక్కబడిన’ అనే అర్థాన్ని రూపొందించారు. ఆర్థికంగా, సాంఘికంగా అణగదొక్కబడిన వారందరినీ ఈ పార్టీ లోనికి తేవడానికి ప్రయత్నించారు. రౌండ్ టేబుల్ కాన్ఫరెన్సుల్లో కాంగ్రెస్ వ్యవహరించిన తీరును బట్టి ఆ పార్టీ దళితులకు ప్రాతినిధ్యం వహించడం లేదని డా‘‘ అంబేడ్కర్ స్పష్టం చేశారు. ఆ పార్టీని విస్తృత పరచాలనే ఉద్దేశ్యంతో అంబేడ్కర్ 1942 జూలైలో ఆలిండియా షెడ్యూల్డ్ క్యాస్ట్స్ ఫెడరేషన్ (ఏఐఎస్సీఎఫ్) ను స్థాపించారు. ఆ సందర్భంగా దళితుల సాంఘిక, ఆర్థిక హక్కు లను సాధించడానికి వారికి రాజకీయ అధికారం కావాలని ప్రబోధించారు. 1962లో విడుదల చేసిన ప్రణాళికలో ఆయన తన వామ పక్షాల భావాలను ప్రకటించారు. భారతీయుడైన ప్రతివాడూ ఆర్థిక, సాంఘిక స్వాతంత్య్రాలను పొందాలని నొక్కి వక్కాణించారు. ప్రతి మనిషికీ నిర్భయంతో కూడిన స్వేచ్ఛను సాధించడం ప్రభుత్వ బాధ్యత అని ప్రతిపాదించారు. స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వాలను ప్రముఖంగా ప్రస్తావించారు. ఈ ప్రణాళిక అణగదొక్కబడ్డ వారి సాంఘిక సమానత్వాన్ని నొక్కి చెప్పింది. ప్రభుత్వ ఉద్యోగస్తులకు బీమా పథకాన్ని తప్పనిసరిగా అమలు జరపాలని కోరారు. ఏఐఎస్సీఎఫ్ నుండి రిపబ్లికన్ పార్టీ వరకు నడిచిన దారిలో దళితుల కోసం ఆర్థిక, సాంఘిక, రాజకీయ సమానతల కోసం తన శక్తిని ధారపోశారు. రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియాను పార్టీగా ప్రకటించక ముందే ఆయన పరి నిర్వాణం చెందారు. ఈ విధంగా అంబేడ్కర్ సామాజికంగా, సాంస్కృతికంగా, రాజకీయంగా, తాత్వికంగా, భారతీయ సమాజాన్ని పునః నిర్మించటానికి కృషి చేశారు. ఆయన ప్రపంచ మానవునిగా ఎదిగారు, ప్రపంచ తత్వవేత్తలలో ఒకరిగా నిలిచారు. భారతదేశానికి ఎనలేని కీర్తి తెచ్చారు. ఆయన నిర్మించిన రాజ్యాంగమే మన దేశ భవి ష్యత్తుకు దిక్సూచి. ఆయన మార్గంలో నడుద్దాం. డా‘‘ కత్తి పద్మారావు వ్యాసకర్త దళితోద్యమ నాయకులు ‘ 98497 41695 (నేడు డా‘‘ బీఆర్ అంబేడ్కర్ జయంతి) -
రాజ్యాంగమే సమ సమాజానికి దిక్సూచి
భారతదేశంలో రాజ్యాంగం అమలైన జనవరి 26 ఒక మహత్తరమైన పండుగదినం. భారత రాజ్యాంగం సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయాలను కలిగిస్తానని ప్రజలకు వాగ్దానం చేసింది. ఆలోచనా స్వేచ్ఛ, భావ ప్రకటనా స్వేచ్ఛ ఇస్తానని భరోసా ఇచ్చింది. సమాన హోదా, సమాన అవకాశాలు, సమైక్యతా భావన, సోదర భావన కలిగించడానికే రాజ్యాంగం రూపొందింది. సమతా భావాలను అంబేడ్కర్ రాజ్యాంగంలో పొందుపరిచారు. అమెరికా, బ్రిటన్ రాజ్యాంగాల నుంచి, ఫ్రెంచ్ విప్లవం నుంచి ఆయన స్ఫూర్తి పొందినా... బౌద్ధ తత్వంలోని ప్రేమ, కరుణ, ప్రజ్ఞ, మానవత్వం, సమానత్వం, స్వేచ్ఛ, తర్కం, ప్రశ్న వంటి అనేక భావాల్ని పొందుపర్చడం వల్లే, స్వాతంత్య్రం వచ్చిన తరువాత రక్తపాతం లేని సమాజంగా భారతదేశం రూపుదిద్దుకుంది. డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్... మహా మేధావి, ఆలోచనాపరుడు, లౌకికవాద శిఖరం, సమతా దర్శనకర్త, గొప్పవక్త, లోతైన రచయిత. ఆయన శైలిలో గాఢత, విశ్లేషణ బలంగా వుంటాయి. విద్యా సంపన్నమైన ఆయన భాషలో సరళత, అభివ్యక్తిలో సాంద్రత కనిపిస్తాయి. అంబేడ్కర్ మానవ హక్కుల పోరాట ధీరుడు. బౌద్ధంలో ఉన్న సామాజిక సమతా నీతిని రాజ్యాంగంలో పొందుపర్చారు. ఆయన జీవితంలో అస్పృశ్యతను ఎదుర్కోవడం ప్రధాన అంశం అయ్యింది. మానవోత్తేజితమైన, వైజ్ఞానికమైన ఎన్నో కార్యక్రమాల్లో అస్పృశ్యులకు చోటు లేకపోయిందని మథనపడ్డారు. అందువలననే అస్పృశ్యతా నివారణా చట్టం గురించి పోరాడారు. ఈ సమాజాన్ని అస్పృశ్యత లేని సమాజంగా రూపొందించాలని తపన పడ్డారు. దాని వల్ల ఎంతో మంది తమ ప్రతిభకు తగిన స్థానం లేక సంఘర్షణకు గురయ్యారు, అణచి వేయబడ్డారు. అంబేడ్కర్ ఒక తాత్వికుడు కూడా. కుల సమాజానికి ప్రత్యామ్నాయంగా కుల నిర్మూలనా సమాజాన్ని బోధించారు. అగ్రకుల రాజ్యాధికారంలో దళితులకు విముక్తి లేదని చాటారు. ప్రత్యామ్నాయ వ్యవస్థను రూపొందించుకోవడానికి రాజ్యాధికారం అవసరం అని ప్రబోధించారు. ఆయన రాజకీయ తత్వశాస్త్రం భావాత్మకమైంది కాదు... అది సాంఘిక, ఆర్థిక వ్యవస్థను పునర్నిర్మించగల సత్తా కలిగినది. బొంబాయి వంటి నగరాల్లో కూడా కులతత్వం వ్యాపించి ఉండ టంతో అంబేడ్కర్ సోదరులు అనేక ఇబ్బందులను ఎదుర్కొన్నారు. కుల తత్వపు గొడ్డలి వేటు వారిని చిన్నప్పుడే తాకింది. ఒకే పాఠశాలలో చదివే పిల్లలు ఒక కూజా నీళ్ళు తాగలేకపోవడం, తోటి విద్యార్థులు ఆ కూజాలోని నీళ్ళను పైనుంచి పోస్తే దోసిళ్ళు పట్టి త్రాగవలసి రావడం వంటి ఘటనలు అంబేడ్కర్ గుండెల్ని పిండివేశాయి. ఆ గాయాలే రాబోయే కాలంలో కుల నిర్మూలన గ్రంథం రాయడానికి పునాదులేశాయి. కేవలం నీటి దగ్గరే కాదు, భాష దగ్గర కూడా ఆయనకు అస్పృశ్యత ఎదురైంది. అంబేడ్కర్ హైస్కూల్లో ప్రత్యేక పాఠ్యభాగంగా సంస్కృతాన్ని కోరుకున్నారు. ఒక అస్పృశ్యుడు సంస్కృతం నేర్చుకోవడం ఏమిటని నిరాకరించారు. దాంతో పర్షియన్ భాషను తీసుకోవలసి వచ్చింది. కానీ సంస్కృతాన్ని స్వయంగా కష్టపడి నేర్చుకున్నారు. వాల్మీకి, వ్యాసుడు, కపిలుడు, లోకాయతులు ఇంకా ఎందరో బ్రాహ్మణేతరులు, క్షత్రియులు సంస్కృతంలో గ్రంథాలు రాశారు. ఎందరో పాశ్చాత్య పండితులు సంస్కృతం నేర్చుకుని, వేదాలు, ఉపనిషత్తులు, దర్శనాలు, కావ్యాలు, అన్నీ ఇంగ్లీషులోకి అనువాదం చేశారు. అంబేడ్కర్ కూడా వేదాలు, ఉపనిషత్తులు, దర్శనాలు అన్నింటినీ అధ్యయనం చేసి, వ్యాఖ్యానించారు. ఏ భాషైనా, ఏ మనిషైనా నేర్చుకోవచ్చని నిరూపించారు. అభివృద్ధిని తరచిచూస్తే... దేశం ఎంతగానో అభివృద్ధి చెందుతోందని ఇప్పుడు గొప్పగా చెప్పుకొంటున్నాం. కానీ గణతంత్ర దినోత్సవ వేళ కొన్ని కఠిన వాస్తవాలను మనం అంగీకరించాల్సి ఉంటుంది. 2023 ప్రపంచ ఆకలి సూచీలో 125 దేశాల్లో ఇండియా 111వ స్థానంలో ఉంది. దేశంలో 81.35 కోట్ల మందికి ఇప్పటికీ ఉచిత బియ్యం పంపిణీ చేయాల్సి వస్తున్నదంటేనే దేశం ఎక్కడ ఉన్నదో అర్థమవుతుంది. కూడు, గూడు, బట్ట లేని ప్రజలు ఇంకా ఉన్నప్పుడు రాజ్యాంగం అమలవుతున్నట్టా అనే ప్రశ్న ఎదురవుతుంది. అంబేడ్కర్ భూమిని జాతీయం చెయ్య మన్నారు. కానీ అదేమో కార్పోరేట్ చేతుల్లోకి వెళ్లిపోతోంది. ఇతర దేశాల నుంచి దిగుమతి అవుతున్న తిండి గింజల వల్ల ఇక్కడి వ్యవసాయం సంక్షోభంలో వుంది. ఇతర దేశాల నుంచి దిగుమతి అవుతున్న వస్త్రాల వల్ల చేనేత పరిశ్రమ కుంటుపడింది. భారతదేశంలో పేదరికం ఎందుకు ఉందంటే రాజ్యాంగాన్ని నూటికి 90 శాతం ఉల్లంఘించడం వల్లనే అని చెప్పొచ్చు. ప్రజలు ఇప్పటికీ అనారోగ్యంతో కునారిల్లుతున్నారు. పారిశుద్ధ్య వ్యవస్థ దెబ్బతింది. కేంద్ర ప్రభుత్వం పారిశుద్ధ్యంపై దృష్టి పెట్టినా, ఎన్నో పట్టణాలు ఇంకా మురికి కూపాలుగానే వున్నాయి. వందశాతం బహిరంగ మల విసర్జన రహిత రాష్ట్రాలుగా ప్రకటించినవాటిల్లో కూడా 71 శాతం మేరకే నిరోధించగలిగారని జాతీయ గణాంక కార్యాలయ సర్వే వెల్లడించింది. ఇళ్లు, వ్యాపార, పారిశ్రామిక సముదాయాల నుంచి వ్యర్థ జలాలను శుద్ధి చేసిన తరువాతే బయటకు వదిలే నగరాలకు ‘స్వచ్ఛ సర్వేక్షణ్’ పోటీలో వాటర్ ప్లస్ సర్టిఫికేషన్ ఇస్తారు. ఆ వ్యవస్థ సరిగ్గా లేని నగరాలకూ పురస్కారాలు ఇవ్వడం... పోటీ నిష్పాక్షికతపై సందేహాలు లేవనెత్తుతోంది. ఇకపోతే రోడ్లు నెత్తుటిమయం అవుతున్నాయి. దేశవ్యాప్తంగా ప్రతి గంటకూ 53 రోడ్డు ప్రమాదాలు జరుగుతుంటే, 19 మంది మృత్యువాత పడుతున్నారని 2022 నాటి గణాంకాల్ని కేంద్ర సర్కారే ప్రస్తావిస్తోంది. అంతక్రితం ఏడాదితో పోలిస్తే ప్రమాదాల్లో 11.9 శాతం, మృతుల సంఖ్యలో 9.45 శాతం, క్షతగాత్రుల లెక్కలో 15.3 శాతం పెరుగుదల రహదార్ల రక్తదాహ తీవ్రతను కళ్లకు కడుతోంది. రోడ్డు ప్రమాద మృతుల్లో 18–45 ఏళ్ల వయస్కులే 69 శాతం దాకా ఉంటున్నారన్న వాస్తవం గుండెల్ని మెలిపెట్టేదే. కుటుంబ పోషణకు రోడ్డెక్కిన మనిషి అకాల మృత్యువాత పడితే, ఇంటిల్లిపాదీ రోడ్డున పడే దుఃస్థితి ఏటా లక్షల మంది అభాగ్యుల్ని దుఃఖసాగరంలో ముంచేస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా రహదారి ప్రమాద మృతుల సంఖ్య అయిదు శాతం దాకా తగ్గితే, అంతకు రెట్టింపు ఇండియాలో పెరగడం నిశ్చేష్టపరుస్తోంది. రహదార్ల మారణహోమానికి కారణమేమిటో సుప్రీంకోర్టే నియమించిన నిపుణుల కమిటీ పూసగుచ్చినా, సరికొత్త మోటారు వాహనాల చట్టం ద్వారా అవ్యవస్థను ఊడ్చేస్తున్నట్లు కేంద్రం ప్రకటించినా జరిగిందీ ఒరిగిందీ ఏమీ లేదు. వాహన వేగాన్ని 5 శాతం తగ్గించ గలిగినా ప్రమాద మరణాల్ని 30 శాతం దాకా నియంత్రించగల వీలుందని తెలిసినా ‘ఏడెనిమిది సెకన్లలోనే 100 కిలో మీటర్ల వేగం’ అందుకొనే శకటాలు ఎందుకు రోడ్డెక్కుతున్నట్లు? ఇకపోతే వాయు కాలుష్య భూతం భయపెడుతోంది. శారీరక మానసిక సమస్యలు పెంచి, ఏటా లక్షల కుటుంబాల్లో శోక సంద్రాల్ని ఉప్పొంగిస్తున్న వాయు కాలుష్య భూతం గర్భస్త పిండాల్ని సైతం కర్కశంగా కాటేస్తోంది. వాయు కాలుష్యంతో పోటీపడుతూ... గాలిలో, నీటిలో, భూమిపై అంతటా పరుచుకుంటున్న ప్లాస్టిక్ వ్యర్థాలు ఆరోగ్య, ఆహార రంగాల్లో పెను సంక్షోభం సృష్టిస్తున్నాయి. ప్లాస్టిక్ వ్యర్థాలు గాలిలో ఉన్నా, భూగర్భ జలాల్లోకి చేరినా ప్రమా దమే. అవి మనుషుల దేహాల్లోకి చొచ్చుకుపోయి, శరీర కణాలను దెబ్బతీస్తాయనీ, క్యాన్సర్ల ముప్పు పెచ్చరిల్లుతుందనీ ఇప్పటికే పలు దేశాల శాస్త్రవేత్తలు, పరిశోధకులు హెచ్చరించారు. అందుకే అంబేడ్కర్ ఆశయాలు రాజ్యాంగంలో ప్రతిఫలిస్తు న్నాయా అన్నది పెద్ద ప్రశ్నగా మిగిలింది. నిజానికి రాజ్యాంగంలో ఆయన ఆలోచనలు ప్రతిఫలిస్తే 100 శాతం అక్షరాస్యత ఏర్పడుతుంది. విద్య మహోన్నత స్థాయికి చేరుతుంది. ప్రపంచం గర్వించే మేధో సంపన్నులు ఆవిర్భవిస్తారు. పేదరిక నిర్మూలన జరిగి, సమ సమాజం ఏర్పడుతుంది. స్త్రీలు ఆత్మ రక్షణతో, పురుషులతో సమానంగా జీవించగలుగుతారు. యువత శక్తి సంపన్నులై సంపదను సృష్టించగలుగుతారు. నిరుద్యోగం, పేదరికం లేని సమ సమాజం ఏర్పడుతుంది. అందుకే రాజ్యాంగ మార్గంలో నడుద్దాం! డా‘‘ కత్తి పద్మారావు వ్యాసకర్త దళితోద్యమ నాయకుడు ‘ 98497 41695 -
స్టాట్యూ ఆఫ్ సోషల్ జస్టిస్: విజయవాడ ప్రతిష్ట ఆకాశమంత ఎత్తుకు..
మనం ఎవరిమైనా అమెరికాకు వెళ్లినప్పుడో, ప్రత్యేకంగా న్యూయార్క్ నగరానికి వెళ్లినప్పుడో స్టాట్యూ ఆఫ్ లిబర్టీని చూడాలని అనుకుంటాం. మనం ఆ నగరానికి వెళ్లామన్న సంగతి తెలిసిన స్నేహితులు కూడా లిబర్టి విగ్రహాన్ని చూసి వచ్చావా అని ప్రశ్నిస్తారు. ఇప్పుడు అమెరికానే వెళ్లనవసరం లేదు. ఆ స్థాయి విగ్రహాన్ని చూడాలంటే విజయవాడ నగరాన్ని సందర్శిస్తే చాలు. ఇక్కడ స్టాట్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ విగ్రహం అంతకన్నా గొప్పగా కనిపిస్తుంంది. కృష్ణానది ఆవల నుంచి సుమారు పది, పదిహేను కిలోమీటర్ల దూరం నుంచి కూడా ఈ విగ్రహం దర్శనమిస్తుంది. దేశ రాజ్యాంగ నిర్మాతగా వాసికెక్కిన డాక్టర్ BR అంబేడ్కర్ భారీ విగ్రహం అది. దేశంలోనే కాకుండా ప్రపంచంలోనే ఇంత ఎత్తైన ఆయన విగ్రహం మరొకటి లేదని ఏపీ ప్రభుత్వం తెలియజేసింది. విజయవాడ నగరానికి ఒక శాశ్వత చిరునామాగా, ఒక ప్రఖ్యాత టూరిస్టు కేంద్రంగా రూపుదిద్దుకునే అంబేడ్కర్ విగ్రహ ప్రాంగణం ఉన్న స్వరాజ్ మైదానం, ఇప్పుడు స్వేచ్చకు, సమానత్వానికి, సామాజిక న్యాయానికి ప్రతీకగా నిలవబోతుంది. ఇది వినడానికి ఎంత అద్భుతంగా అనిపిస్తుంది! మూడేళ్ల క్రితం వరకు విజయవాడలో ఇంత పెద్ద టూరిస్ట్ స్పాట్ వస్తుందని ఎవరూ ఊహించలేదు. కాని ఒక నేత సమర్ధతకు నిదర్శనంగా ఇది రూపొందింది. ఆయన ఎవరో కాదు.. ఏపీ ముఖ్యమంత్రి YS జగన్మోహన్ రెడ్డి అని వేరే చెప్పనవసరం లేదు. కేవలం ఒక విగ్రహం మాత్రమే కాకుండా మూడు అంతస్థులలో అంబేడ్కర్కు చెందిన వివిధ చిత్రపటాలు, డాక్యుమెంటరీలు, ఆయన గురించి తెలియచేసే సినిమాను వేయడానికి వీలుగా ఒక హాలు, ఎన్నో విశేషాలు అందులో కనిపిస్తాయి. 206 అడుగుల ఎత్తున తయారైన ఈ విగ్రహ ప్రాంగణం అంతా రంగు, రంగుల కాంతుల మధ్య అత్యంత ఆకర్షణీయంగా తయారైంది. అక్కడే పలు ఇతర సదుపాయాలు కూడా ఉంటాయి. నగర ప్రజలకే కాకుండా, విజయవాడ సందర్శించే టూరిస్టులకు కూడా అదొక విజ్ఞాన, వినోద కేంద్రంగా భాసిల్లబోతోంది. దేశ ప్రజలకు స్వేచ్చను, ప్రత్యేకించి బలహీనవర్గాలకు ఎంతో స్పూర్తిని ఇచ్చే ఈ విగ్రహ ప్రతిష్ట వైఎస్ జగన్మోహన్ రెడ్డి జీవితంలో ఒక మైలురాయిగా నిలుస్తుంది. తెలంగాణలో గత ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా అంబేడ్కర్ విగ్రహాన్ని ప్రతిష్టించినప్పటికీ, దానిని మించిన రీతిలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తీర్చిదిద్దింది. ఢిల్లీలో విగ్రహం తయారీతో పాటు హంగులను స్థానికంగా హనుమాన్ జంక్షన్కు చెందిన శిల్పిద్వారా చేయించడం కూడా హర్షించదగిన అంశమే. ఈ మధ్యకాలంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి సామాజిక సాధికార యాత్రలు నిర్వహిస్తున్నారు. అందులో వివిధ బలహీనవర్గాల ప్రజలకు ఇస్తున్న ప్రాధాన్యతను తెలియచెబుతున్నారు. ఆ క్రమంలో ప్రస్తుతం అంబేడ్కర్ విగ్రహాన్ని ప్రతిష్టించడం ద్వారా ఆంధ్రప్రదేశ్ బలహీనవర్గాల అభ్యున్నతికి కట్టుబడి ఉందని తెలియజేసినట్లయింది. కేవలం విగ్రహంతోనే అభివృద్ది అయిపోతుందని కాదు. కాని ఆ విగ్రహాన్ని చూస్తే వచ్చే చైతన్యం, అనుభూతి చెప్పనలవికానిది. ఏదో కొద్ది మంది అగ్రవర్ణ దురహంకారులకు తప్ప, సమానత్వం కోరుకునే ఎవరికైనా ఈ విగ్రహం చూడగానే ఒక అనుభూతి కలుగుతుంది. ఏపీలోని వివిద జిల్లాల నుంచి ప్రజలు తండోపతండాలుగా తరలివచ్చి ఈ విగ్రహాన్ని వీక్షించనున్నారు. గతంలో అమరావతి రాజధాని పేరుతో ఒక భ్రమరావతిని సృష్టించాలని భావించిన ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ఎక్కడో మారుమూల, ఎవరికి కనిపించని చోట అంబేడ్కర్ విగ్రహాన్ని ప్రతిష్టించాలని చూశారు. ఇందు కోసం కొన్ని కోట్ల రూపాయల వ్యయం చేశారు. అయినా ఆ ప్రాజెక్టు ముందుకు కదలలేదు. చంద్రబాబు హయాంలో చాలామంది అంబేడ్కర్ అభిమానులు ఎవరికి కనిపించని చోట విగ్రహం పెట్టడమేమిటని విమర్శించేవారు. అయినా అప్పట్లో చంద్రబాబు పట్టించుకోలేదు. చిత్తశుద్దితో చేసి ఉంటే అక్కడ విగ్రహం తయారై ఉండేదేమో! మొక్కుబడి కార్యక్రమంగా సాగించారన్న భావన ఉంది. తదుపరి వచ్చిన జగన్ ప్రభుత్వం మారుమూల అంబేడ్కర్ విగ్రహ ప్రతిష్ట కన్నా, విజయవాడ నడిబొడ్డున ప్రతిష్టించడం ద్వారా రాష్ట్ర ప్రజలనే కాక, దేశ వ్యాప్తంగా అభిమానులను ఆకర్షించవచ్చని భావించారు. ప్రపంచంలోనే ఒక గొప్ప మేధావిగా పేరుగాంచిన అంబేడ్కర్ విగ్రహంతో పాటు విజయవాడ నగరవాసులకు ఆహ్లాదంగా ఉండేలా అక్కడ వివిధ కార్యక్రమాలు చేపట్టాలని తలపెట్టారు. మూడేళ్ల నుంచి అందుకు సన్నాహాలు సాగించారు. నిజానికి ఆరు నెలల క్రితమే ఈ పనులు పూర్తి చేయాలని అనుకున్నారు కాని, సాధ్యపడలేదు. అయినా పనుల వేగం పెంచి జనవరి 19న ప్రారంభోత్సవానికి రంగం సిద్దం చేశారు. ఇది జగన్ సమర్ద నాయకత్వ లక్షణానికి దర్పణం పడుతుంది. 'చెప్పాడంటే చేస్తాడంతే!' అన్న నమ్మకానికి అనువుగా ఈ విగ్రహం ఏర్పాటు పూర్తి అయింది. సుమారు 22 ఎకరాల విస్తీర్ణంలో ఈ స్మృతివనం ఏర్పాటు అవుతోంది. ఇప్పటికే విజయవాడ నగరంలో బెంజ్ సర్కిల్ వద్ద, కనకదుర్గమ్మ గుడి వద్ద భారీ వంతెనలను పూర్తి చేసిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కృష్ణలంక ప్రాంతంలో నివసించే వేలాది మంది బీద ప్రజలకు పెద్ద ఊరట కల్పిస్తూ.. నది అంచున రిటైనింగ్ వాల్ నిర్మించింది. కిలోమీటర్ల కొద్ది నిర్మించిన ఈ వాల్ కూడా విజయవాడ అభివృద్ధికి మారుపేరుగా కనిపిస్తుంది. పద్నాలుగేళ్లపాటు ముఖ్యమంత్రిగా ఉండి చంద్రబాబు చేయలేని విశిష్టమైన పనులను చేపట్టి, పూర్తి చేయడం ద్వారా వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రజల మన్ననలు పొందగలుగుతున్నారు. అంబేడ్కర్ విగ్రహావిష్కరణ సందర్భంగా అందరికి ఆహ్వానం పలుకుతూ జగన్ ఇచ్చిన సందేశం కూడా హృద్యంగా ఉంది. ఆకాశమంతటి వ్యక్తిత్వంతో దేశగతిన మార్చిన వ్యక్తి బాబా సాహెబ్ అంబేడ్కర్ అని ఆయన ప్రశంసించారు. పెత్తందార్ల భావాలపై తిరుగుబాటుకు స్పూర్తి ఇచ్చేలా అంబరాన్ని తాకేలా ఈ సమాజిక న్యాయ మహాశిల్పం (స్టాట్యూ ఆఫ్ సోషల్ జస్టిస్) ఏర్పాటు అయిందని ఆయన వ్యాఖ్యానించారు. ప్రజలకు తన చేతితో ఒక దిశను చూపుతున్నట్లుగా అంబేడ్కర్ విగ్రహం నిజంగానే విజయవాడ ప్రతిష్టను అకాశమంత ఎత్తుకు తీసుకు వెళ్లిందని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఇంత బ్రహ్మాండంగా విగ్రహ ప్రారంభోత్సవం జరుగుతుంటే నిత్యం ఏడ్చే ఈనాడు, ఆంధ్రజ్యోతి తదితర ఎల్లో మీడియా యధా ప్రకారం పెత్తందారి, అగ్రవర్ణ దురహంకార మనస్తత్వంతో చెత్త కథనాలను ప్రచురించింది. నీచత్వానికి పరాకాష్టగా రామోజీ, రాధాకృష్ణలు వ్యవహరిస్తూ తమ మీడియాను దిగజార్చుతూ ఈ రోజు కూడా ఛండాలపు స్టోరీలు ఇచ్చి వైఎస్ జగన్మోహన్రెడ్డిపై తమ విద్వేషాన్ని వెళ్లగక్కారు. సుమారు నాలుగు వందల కోట్ల వ్యయంతో అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ విగ్రహాన్ని తీర్చిదిద్దిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి ఈ కీర్తి శాశ్వతంగా నిలిచిపోతుందని చెప్పడానికి ఎలాంటి సందేహం లేదు. -కొమ్మినేని శ్రీనివాస రావు, సీనియర్ పాత్రికేయులు -
సామాజిక బందీల విముక్తి ప్రదాత!
ప్రపంచంలోని వివిధ సమాజాలు తమకు నచ్చిన తాత్త్విక మార్గాల్లో ప్రయాణిస్తూ మనుగడ సాగించడం అనాదిగా వస్తున్నదే.. అయితే కొన్ని సమాజాల్లో అనేక సమూహాలు తమ ఇష్టానికి వ్యతిరేకంగా బందీలై కనీస మానవ హక్కులకూ దూరమయ్యాయి. భారతీయ సమాజంలోని అస్పృశ్యులూ, ఆదివాసులూ, మహిళలూ, ఇతర అణగారిన సమూహాల వారు అటువంటి వారిలో కొందరు. తత్త్వశాస్త్రానికి మూల జీవం మానవ దుఃఖ నివారణ. ఇందుకోసం బుద్ధుడు, సోక్రటీస్, మార్క్స్ వంటి వారు ఎంతగానో ప్రయత్నించారు. ఇటువంటి తాత్త్వికులను అధ్యయనం చేసి అంబేడ్కర్ తన ఉపన్యాసాలు, రచనల ద్వారా పీడిత, తాడిత జనుల ఉద్ధరణకు ప్రయత్నించారు. ఆయన ఫిలాసఫీ భారత రాజ్యాంగంలో స్పష్టంగా కనిపిస్తుంది. అంబేడ్కర్ ప్రాసంగికత నానాటికీ పెరుగు తుందనడానికి నవంబర్ 26వ తేది రాజ్యాంగ అవతరణ దినోత్సవం భారతదేశ వ్యాప్తంగా జరగడం వల్ల మనకు అర్థమౌతోంది. అంబేడ్కర్ సిద్ధాంతాలు ప్రపంచ తాత్త్వికులకు సమ తుల్యమైనవి, తులనాత్మకమైనవి కూడా. అంబేడ్కర్ రచనా వైవి ధ్యంలో సోక్రటీస్, ప్లేటో, బుద్ధుడు, అరిస్టాటిల్ ఉన్నారు. ‘జ్ఞానవం తుడైనవాడు తాను తెలుసుకున్నది ఇతరులకు చెప్పకపోతే మూర్ఖుడ వుతాడు’ అనే సత్యాన్ని సోక్రటీస్ చెప్పాడు. అందుకు రాజ్యానికి, దేశానికి భయపడని నిర్భీతి తత్త్వాన్ని ఆయన ప్రదర్శించాడు. అదే తత్త్వం అంబేడ్కర్లో మనకు కనిపిస్తుంది. అందుకు సత్యాన్వేషణ, ధీశక్తి, శాస్త్రీయ దృక్పథం, హేతుబద్ధత అవసరం. వాటిని సోక్రటీస్ స్థాయిలో ఆధునిక యుగంలో వ్యక్తీకరించిన వాడు అంబేడ్కర్. ఆయన ముఖ్యంగా వేదాలకూ, స్మృతులకూ ప్రత్యామ్నా యంగా భారత రాజ్యాంగ దర్శనాన్ని రూపొందించాడు. అందుకు బుద్ధుని తత్త్వం ఆయనకు వాహిక. ఆయన సమాజంలో మానవతా స్ఫూర్తిని నింపడానికి ప్రయత్నం చేశాడు. అందుకు కారణం ఆయన హృదయ భావం, ఆయన చాలా సున్నిత హృదయుడు. ఆయన సున్నితత్వంలో కరుణ వుంది, ప్రేమ వుంది, ఆత్మీయత వుంది. అంకిత భావం వుంది. ఈ గుణాలు నాయకుణ్ణి ప్రవక్తగా తీర్చిదిద్దాయి. అందుకే ఆయన అణ గారిన ప్రజల తరఫున మాట్లాడాడు. ఈ దేశంలో కోట్లాదిమంది ప్రజలు అస్పృశ్యత అనే శాపంతో క్రుంగిపోయారు. ప్రపంచంలో మరెక్కడా కనిపించని ఉపద్రవం ఇది. ప్రతి మానవుడికీ ఉండవలసిన ప్రాథమిక హక్కులు వారికి తిరస్క రించబడ్డాయి. నాగరికత, సంస్కృతి ఫలాల లబ్ధిని వారికి అంద నివ్వలేదు. అస్పృశ్యులే కాకుండా ఈ దేశంలో అంతే పెద్ద సంఖ్యలో ఆదిమ జాతులు, గిరిజన తెగలు ఉన్నాయి. నాగరిక, సాంస్కృతిక స్రవంతిలోకి తీసుకు వచ్చే ప్రయత్నం చేయకుండా వారిని ఆటవిక, సంచార జాతులలా తిరిగేలా వదిలి పెట్టారు కులీనులు. ఈ పరిస్థితిని మార్చడానికి ఆయన తన వాదాన్ని తాత్త్వికంగా మలిచాడు. కుల నిర్మూలనా వాదాన్ని ఇలా ప్రతిపాదించాడు. ‘‘కుల వ్యవస్థను సమర్థించడానికి వారసత్వం గురించీ, నరసంతతి శుద్ధి శాస్త్రం గురించీ చెత్తవాదన ఎంతో లేవనెత్తబడింది. నరవంశ శుద్ధిశాస్త్రం (యూజెనిక్స్) ప్రాథమిక సూత్రానికి కుల వ్యవస్థ అనుగుణంగా ఉంటే దానికి ఎవ్వరూ అభ్యంతరం చెప్పరు. ఎందు కంటే స్త్రీ పురుషులను వివేకంతో జత కలపడం ద్వారా జాతి అభి వృద్ధిని సాధించడానికి ఎవరూ అభ్యంతరం చెప్పరు. అయితే వివేక వంతమైన స్త్రీ, పురుష సంయోగాన్ని కుల వ్యవస్థ ఏ విధంగా సాధిస్తున్నదో అర్థం కావడం లేదు. కుల వ్యవస్థ ప్రకృతి విరుద్ధమైన ఒక కృత్రిమ వ్యవస్థ. అది చేస్తున్నదల్లా వివిధ కులాల స్త్రీ పురుషులు కులాంతర వివాహాలను చేసుకోకుండా నిషేధించడం. ప్రకృతి సిద్ధమై నది కాదది, ఒక కులంలో ఏ ఇద్దరు కలసి వివాహం చేసుకోవాలని ఉన్నదో నిర్ణయించే పద్ధతి కాదది. జాతి శుద్ధి శాస్త్రం దృష్ట్యా ఒక కులమే ఒక ప్రత్యేక మూల జాతి అయితే... ఉపకులాల పుట్టుక కూడా అదే విధంగా అయి వుండాలి. అయితే ఉప కులాల మూలం కూడా యూజినిక్సే అని నిజంగా ఎవరైనా వాదించగలరా? అలాంటి వాదన పూర్తిగా అసంగతం.’’ ఇకపోతే ఈ కులనిర్మూలన సిద్ధాంత ఆచరణకు మహాత్మాగాంధీ రాజకీయంగా మతవాద ధోరణితో అడ్డు వచ్చారు. అంబేడ్కర్ సాంఘికంగా కుల నిర్మూలనా వాది. ఆర్థికంగా స్టేట్ సోషలిజం ప్రతిపాదకుడు. రాజకీయంగా బహుజన రాజ్య నిర్మాణ దక్షుడు. ఈ మూడింటినీ సాధించడానికి ఆయన బుద్ధునిలో సంఘ వాదాన్నీ, మహాత్మా ఫూలేలోని సాంస్కృతిక విప్లవ వాదాన్నీ పోరాట ఆయుధాలుగా మలచుకున్నాడు. అందువల్ల ఆయన కుల నిర్మూలనా పునాదులపై పునర్నిర్మించే తత్త్వశాస్త్ర నిర్మాతగా ముందుకొచ్చాడు. జ్యోతిబా ఫూలే స్త్రీల కోసం చేసిన ఉద్యమం అంబేడ్కర్ను ఎంతగానో ప్రభావితం చేసింది. స్త్రీని విముక్తి చేయడం భారత పునరుజ్జీవ నోద్యమంలో ప్రధానాంశంగా ఆయన భావించాడు. హిందూ సంస్కరణవాదులు ప్రతిపాదించే పద్ధతిలో విధవా వివాహాలు, సతీసహగమన నిర్మూలన వంటి సంస్కరణల వలే కాక స్త్రీల హక్కులకు సంబంధించిన అంశం మీద ఆయన ఎక్కు పెట్టాడు. స్త్రీని భావ దాస్యం నుండి విముక్తి చేయడం, సాంఘిక, ఆర్థిక, సాంస్కృ తిక, రాజకీయ భాగస్వామ్యాన్ని పురుషులతో సమానంగా స్త్రీలకు కల్గించడానికి ఆయన తీవ్రమైన కృషి చేశాడు. అంబేడ్కర్ తనకు ముందున్న భారతీయ పాశ్చాత్య తత్త్వశాస్త్రాలన్నింటినీ చదివి భారత దేశ పున ర్నిర్మాణానికి పూనుకున్నాడు. అంబేడ్కర్లోని మరొక కోణం సామాజిక వ్యక్తిత్వ మనో విశ్లేషణ. ఈ ప్రత్యేకతను ప్లేటోలోని రచనా వైవిధ్యం, జ్ఞానతృష్ణ, సంభాషణా ప్రావీణ్యత, అంతరాంతర పరిశీలనల నుండి ఆయన సంతరించుకున్నారు. తత్త్వశాస్త్రానికి మూల జీవమైన మానవ దుఃఖ నివారణ పట్ల సోక్రటీస్ ఎంత వేదన పడ్డాడో, అంబేడ్కరూ అంత వేదన పడ్డాడు. వ్యక్తిగతమైన దుఃఖాన్ని అధిగమించి, సామాజిక దుఃఖాన్ని గుర్తించి, దాని నివారణ కోసం సిద్ధాంతపరంగా, ఆచరణ పరంగా కృషి చేసినవారు సోక్రటీస్, అంబేడ్కర్లు. ఎంత క్లిష్టతరమైన పరిస్థితులు వచ్చినా వారు సత్య నిరూపణ కోసం ముందడుగు వేస్తారు. ఇకపోతే అంబేడ్కర్ విద్యా తాత్త్విక వాది. ఆయన తన ప్రతిభా సంపత్తితో అçస్పృశ్యుల గురించి అనేక కమిషన్లకు వివరాలు అందించి అనేక హక్కులు సాధించాడు. ఏ పాఠశాల అయితే తనకు ప్రవేశాన్ని నిరాకరించిందో తనను తరగతి గదిలో బయట కూర్చో బెట్టి, బైట పాఠాలు చెప్పిందో, అదే భారతంలో తన ప్రజలను విద్యావంతులను చేయడానికి... అన్ని ప్రభుత్వ పాఠశాలల ద్వారాలు తెరిపించగలిగాడు. ఆయన ఒక్కడుగా ఒక సైన్యంగా పని చేశాడు. అంబేడ్కర్కు అధ్యయనంతో పాటు లోతైన అవగాహన, అనుభవం, ఆచరణ వున్నాయి. అందుకే ఆయన మాటలు సత్య నిష్టం అయ్యాయి. బుద్ధుని ధార్మిక సూత్రాలను, నీతి సూత్రాలను అంబే డ్కర్ రాజ్యాంగంలో అవసరం అయిన చోటంతా పొందుపరుస్తూ వెళ్ళాడు. ఈనాడు అంబేడ్కర్ రాజ్యాంగానికి ప్రత్యామ్నాయ వాదాలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ఇటీవల నవంబర్ 26న భారత రాజ్యాంగ దినోత్సవం అనే పేరు మీద భారత చరిత్ర పరిశోధనా మండలి (ఐసీహెచ్ఆర్) హిందూ పునరుద్ధరణవాద పత్రాన్ని రాష్ట్రాల గవర్నర్లకు, విశ్వవిద్యాలయాలకు పంపింది. అంటే అంబేడ్కర్ రాజ్యాంగ నిర్మాణ సూత్రాలను దెబ్బతీయాలనే ప్రయత్నం జరగు తోందన్న మాట! రాజ్యాంగం పీఠికలో చెప్పబడిన సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయాన్ని దెబ్బతీయాలనే ఒక పెద్ద ప్రయత్నం జరుగుతోంది. ఈ ప్రయత్నం బౌద్ధ యుగాన్ని దెబ్బతీయడానికి కౌంటర్ రివల్యూషన్గా వచ్చిన గుప్తుల కాలం నాటి మతోద్ధరణ వాదం లాగా వుంది. అంబేడ్కర్ రాజ్యాంగానికి ప్రత్యామ్నాయ వాదాన్ని ప్రచారం చేయా లనే పెద్ద ప్రయత్నం జరుగుతోంది. అయితే రాజ్యాంగంలోని సామా జిక సామ్యవాద భావాన్ని దెబ్బతీయలేరనేది కూడా మరో ప్రక్క రుజువవుతూ వస్తోంది. మతం ఎప్పుడూ తత్త్వశాస్త్రానికి ప్రత్యా మ్నాయం కాలేదు. మతం కొందరికే పరిమితమైంది. రాజ్యాంగం అందరిని సమన్వయీకరించుకుంటుంది. ఆ శక్తి దానికుంది. ప్రపంచ తాత్త్విక దృక్పథం నుంచి ఏర్పడింది రాజ్యాంగం. అంబేడ్కర్వాదులు, మార్క్స్వాదులు, లౌకికవాదులు, ప్రజా స్వామ్యవాదులు ఐక్యంగా అంబేడ్కర్ నిర్మించిన రాజ్యాంగ సౌధాన్ని తప్పక కాపాడుకుంటారు. ఈ యుగం అంబేడ్కర్ది. ఆయన నిర్మిం చిన తాత్త్విక సామాజిక మార్గంలో నడుద్దాం. డా. కత్తి పద్మారావు వ్యాసకర్త దళిత ఉద్యమ నాయకులు (ఈ వ్యాసం Dec 06, 2022 రోజున sakshi.comలో ప్రచురితమైనది) -
సామాజిక విప్లవ చైతన్యమూర్తికి నీరాజనం
విగ్రహాలు జాతి జీవన వికాస చారిత్రక ప్రతిబింబాలు. సమాజాన్ని చైతన్యపరచే విగ్రహాలు మౌన సందేశాలకు ప్రతిరూపాలు. భారతదేశం మినహా ప్రపంచదేశాల్లో ఇప్పటికి లక్షకు పైగా డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహాలు ఉన్నాయని అధికారిక అంచనా. ప్రపంచ దేశాలు అంబేడ్కర్ జ్ఞాన సంపదకూ, సమసమాజ నిర్మాణ రచనా చాతుర్యానికీ, సమయస్ఫూర్తి గల వాగ్ధాటికీ ముగ్ధులై నిత్య నీరాజనాలు పలుకుతున్నాయంటే అది భారతదేశానికి గర్వకారణం. అంబేడ్కర్ సమాజం కోసం జీవించాడు. సమాజ పురోగతి కోసం నిరంతర పోరాటం జరిపిన అసమాన ప్రతిభావంతుడు. తాను నేర్చిన విద్య, విజ్ఞాన సంపద అంతా సమాజం కోసమే వినియోగించాడు. దీన్నే ‘పేబాక్ టు ది సొసైటీ’ అంటారు. అందుకే ఆయన విధానాలను పలు దేశాలు అనుసరిస్తున్నాయి. ‘నా జీవన పోరాటమే నా సందేశం’ (మేరా జీవన్ సంఘర్ష్ హీ మేరా సందేశ్) అని చెప్పిన మాటలే విశ్వ సందేశంగా వినువీధుల్లో వినిపిస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు అంబేడ్కర్ విగ్రహాలు నెలకొల్పి తమకున్న గౌరవాన్ని చాటుకున్నాయి. అమెరికాలో మిచిగన్ విశ్వవిద్యాలయం (1993)లో ఒక విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. 2023 అక్టోబరు 14న మేరీలాండ్లో ‘స్టాట్యూ ఆఫ్ ఈక్వాలిటీ’ అనే పేర 19 అడుగుల ఎత్తయిన విగ్రహాన్ని నిలిపారు. 1996లో టొరంటో విశ్వవిద్యాలయం (కెనడా) కూడా అంబేడ్కర్ విగ్రహాన్ని ప్రతిష్ఠించుకొంది. ఇక బ్రిటన్లో చాలానే ఉన్నాయి. లండన్, బర్మింగ్ హామ్, మాంచిస్టర్లలో పలు విగ్రహాలను నెలకొల్పారు. అలాగే అంబేడ్కర్ చదివిన ‘లండన్ స్కూల్ ఆఫ్ ఎకనమిక్స్’ ముఖద్వారంలో 2000లో ఆయన విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. జర్మనీలోని బెర్లిన్, మ్యూనిక్, ఫ్రాంక్ ఫర్ట్లలో; జపాన్లోని టోక్యో, ఒకాసా, కొయెటోలల్లో; దక్షిణాఫ్రికాలోని జొహన్నెస్ బర్గ్, కేప్టౌన్, డర్బన్లలో; ఆస్ట్రేలియాలోని సిడ్నీ, మెల్బోర్న్, బ్రిస్బెయిన్ వంటి నగరాల్లో; న్యూజిలాండ్లోని ఆక్లండ్ తదితర ప్రాంతాల్లో, మారిషస్ (2018), శ్రీలంక (కొలంబో). నేపాల్ (ఖాట్మండు 2019), బంగ్లాదేశ్ (ఢాకా 2021), దుబాయ్తో సహా మరెన్నో దేశాల్లో అంబేడ్కర్ విగ్రహాలు నెల కొన్నాయి. తెలంగాణలో గతేడాది ఏప్రిల్ 14న అంబేడ్కర్ ముని మనుమడు ప్రకాష్ అంబేడ్కర్చే 125 అడుగుల ఎత్తయిన అంబేడ్కర్ విగ్రహం ఆవిష్కరించబడింది. లక్నోలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన పార్క్కు ‘డాక్టర్ భీమ్రావ్ సామాజిక్ పరిపర్తన్ స్థల్’గా నామకరణం చేసి అక్కడ ఆయన విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. ఈ ప్రదేశంలోనే జ్యోతిరావ్ ఫూలే, నారాయణగురు, బిశ్రా ముండా, శాయాజి మహరాజ్, కాన్షీ రామ్ విగ్రహాలున్నాయి. ఇక్కడే 124 ఏనుగుల విగ్రహాలు కొలువుదీరి సందర్శకులకు ఆహ్లాదం కలుగచేస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్లో లెక్కకు మించిన అంబేడ్కర్ విగ్రహాలున్నాయి. వీటికి తోడు విజయవాడ నడిబొడ్డున స్వరాజ్ మైదానంలో రాష్ట్రప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా రూ. 400 కోట్లకు పైగా ఖర్చుతో నిర్మించిన 206 అడుగుల విగ్రహాన్ని ఈ రోజు ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్రెడ్డి ఆవిష్కరిస్తున్నారు. ఈ విగ్రహపీఠం 81 అడుగుల ఎత్తు ఉంది. దానిపై ప్రతిష్ఠించిన 125 అడుగుల ప్రధాన విగ్రహంతో మొత్తం 206 అడుగుల అంబేడ్కర్ శిల్పం విజయవాడ నలుదిక్కులకూ కనిపిస్తూ, చూడగానే ఆకర్షించేలా ఉంది. ఈ విగ్రహ ప్రదేశం ఒక స్మృతివనంగా భాసిస్తుంది. మూడు అంతస్తులున్న విగ్రహం కింది భాగంలో నాలుగు ఏసీ హాల్స్ ఉన్నాయి. నాలుగు వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో మినీ థియేటర్, మ్యూజియం, మరో రెండు హాల్స్లో అంబేడ్కర్కు దక్షిణ భారతదేశంతో ఉన్న అనుబంధంతో కూడిన ఛాయాచిత్రాలు, మరో మ్యూజియం ఉంది. వీటికి తోడు రెండు వేలమంది కూర్చోవడానికి సరిపడే మరో ఓపెన్ ఎయిర్ థియేటర్తో పాటు అందమైన పార్కు, మరో అందమైన ఫౌంటెన్ సందర్శకులకు కనువిందు చేయనున్నాయి. విగ్రహం రంగు మాసిపోకుండా పాల్యూరెథేన్ కోటింగ్ వేయటం మరో ప్రత్యేకత! 15 మంది ఎక్కడానికి సరిపడ రెండు లిఫ్టులను ఏర్పాటుచేశారు. మూడు అంతస్తుల్లో నిర్మిత మైన ఈ ప్రదేశం ఒక పర్యాటక కేంద్రంగా వర్ధిల్లుతుందనటంలో ఎలాంటి అనుమానం లేదు. అంబేడ్కర్ విగ్రహ ప్రతి ష్ఠతో విజయవాడలో నూతన సాంస్కృతిక వికాసం మరింతగా వృద్ధిచెందుతుంది. దీనివల్ల సమాజ వికాసంతోపాటు దళిత అస్తిత్వానికీ, సర్వమత సామరస్యానికీ, సకల మానవ సౌభ్రాతృత్వానికీ మరింత దోహదం చేకూరుతుంది. ఈ విగ్రహ ప్రాంగణం నిత్యమూ విజ్ఞాన మేధామథనంతోపాటు సకల కళలు అభివృద్ధి చెందే సాంస్కృతిక కేంద్రంగా మారుతుంది. ఈ కేంద్రంలో ఏర్పరచే నూతన పుస్తక భాండాగారం పుస్తక ప్రియులకూ, పాఠకులకూ ఒక విజ్ఞాన వికాస కేంద్రంగా నిత్యం అందుబాటులో ఉంటుంది. అంబేడ్కర్ విగ్రహంతో పోరాటాల పురిటిగడ్డ విజయవాడ నగరానికి కొత్త అందాలు పురివిప్పుకుంటాయి. ఆయన జీవిత సందేశం అడుగడుగునా ప్రతిబింబించి ప్రగతిపథంలో పయనించే ప్రజలకు మార్గదర్శి కాగలదు. ఆచార్య గుజ్జర్లమూడి కృపాచారి, వ్యాసకర్త ప్రముఖ సాహితీవేత్త, 98481 23655 -
అంబేడ్కర్ విగ్రహాన్ని తాకే అర్హత జగన్కే ఉంది!
సాక్షి, అమరావతి: భారతరత్న డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ భావజాలాన్ని పుణికిపుచ్చుకుని పరిపాలిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి 56 నెలలుగా ఆవిష్కరించిన సామాజిక మహా విప్లవంతో రాష్ట్రమంతటా సాధికారత ప్రతిధ్వనిస్తోంది. రాష్ట్రంలో ఏ రంగంలో చూసినా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు, మహిళలు సింహభాగం అవకాశాలతో దూసుకెళుతుండటం ఇందుకు నిదర్శనం. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజే సామాజిక న్యాయమంటే నినాదం కాదు.. అనుసరించాల్సిన విధానమని జగన్ స్పష్టం చేశారు. తొలి మంత్రివర్గం ఏర్పాటులోనే దీన్ని రుజువు చేశారు. అంబేడ్కర్ సిద్ధాంతాలను ప్రతి అడుగులో ఆచరిస్తూ సామాజిక న్యాయం చేయడంలో సీఎం జగన్ దేశానికే ఆదర్శంగా నిలిచారని సామాజికవేత్తలు ప్రశంసిస్తున్నారు. రాజ్యాధికారంలో వాటా.. 2019 ఎన్నికల్లో 50 శాతం ఓట్లు సాధించి 151 శాసనసభ స్థానాలు (86.28 శాతం), 22 లోక్సభ స్థానాల్లో (88 శాతం) వైఎస్సార్సీపీ విజయ ఢంకా మోగించింది. వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టగానే తొలి మంత్రివర్గం నుంచే సామాజిక విప్లవానికి శ్రీకారం చుట్టారు. 25 మందితో ఏర్పాటైన క్యాబినెట్లో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు చెందిన 14 మందికి (56 శాతం) స్థానం కల్పించారు. రాజ్యాధికారంలో సింహభాగం వాటా ఇచ్చారు. ఐదుగురు డిప్యూటీ సీఎంలలో నలుగురికి (80 శాతం) ఆయా వర్గాల నుంచే అవకాశం కల్పించారు. దేశ చరిత్రలో తొలిసారిగా ఎస్సీ మహిళను హోంశాఖ మంత్రిగా నియమించారు. శాసనసభ స్పీకర్గా బీసీ వర్గానికి చెందిన తమ్మినేని సీతారామ్కు అవకాశం కల్పించగా శాసన మండలి ఛైర్మన్గా రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా ఎస్సీ వర్గానికి చెందిన కొయ్యే మోషేన్ రాజుకు అవకాశమిచ్చారు. మండలి డిప్యూటీ ఛైర్ పర్సన్గా మైనార్టీ వర్గానికి చెందిన మహిళ జకియా ఖానంకు అవకాశమిచ్చారు. 2022 ఏప్రిల్ 11న పునర్వ్యవస్థీకరణ ద్వారా 25 మందితో ఏర్పాటు చేసిన మంత్రివర్గంలో సామాజిక న్యాయంలో ముఖ్యమంత్రి జగన్ మరో అడుగు ముందుకేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల వారికి ఏకంగా 17 మందికి (70 శాతం) మంత్రివర్గంలో స్థానం కల్పించారు. టీడీపీ అధికారంలో ఉన్న ఐదేళ్లలో బీసీ వర్గానికి చెందిన ఒక్కరిని కూడా రాజ్యసభకు పంపించలేదు. వైఎస్సార్ సీపీ అధికారంలోకి వచ్చాక రాష్ట్ర కోటాలో 8 స్థానాలు ఖాళీ కాగా అందులో నలుగురు బీసీలను (50 శాతం) సీఎం జగన్ రాజ్యసభకు పంపారు. శాసన మండలిలో వైఎస్సార్సీపీకి 43 మంది ఎమ్మెల్సీలు ఉండగా వీరిలో 29 మంది (68 శాతం) బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాల వారే కావడం గమనార్హం. 2014–19 మధ్య అధికారంలో ఉన్న టీడీపీకి 48 ఎమ్మెల్సీ స్థానాలు దక్కితే చంద్రబాబు కేవలం 18 పదవులు (37 శాతం) మాత్రమే బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు ఇచ్చారు. ఆర్థిక తోడ్పాటు.. సంక్షేమాభివృద్ధి పథకాల ద్వారా ఆర్థికంగా చేయూత ఇవ్వడం ద్వారా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలు ఆర్థిక సాధికారత సాధించేలా సీఎం జగన్ బాటలు వేశారు. నాలుగున్నరేళ్లలో సంక్షేమ పథకాల ద్వారా నగదు బదిలీ(డీబీటీ) రూపంలో రూ.2.46 లక్షల కోట్లను పేదల ఖాతాల్లో జమ చేయగా ఇందులో 75 శాతం నిధులు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకే చేరాయి. ఇక ఇతర పథకాల ద్వారా (నాన్ డీబీటీ) రూ.1.67 లక్షల కోట్ల మేర ప్రయోజనాన్ని చేకూర్చారు. డీబీటీ, నాన్ డీబీటీ ద్వారా పేదలకు రూ.4.13 కోట్ల మేర లబ్ధి కలిగింది. ఈ నిధులను సద్వినియోగం చేసుకున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలు ఆర్థిక సాధికారత సాధించాయి. పేద బిడ్డలకు పెద్ద చదువులు.. నాడు–నేడు ద్వారా ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్కు ధీటుగా అభివృద్ధి చేసిన సీఎం జగన్ పేద పిల్లలు ప్రపంచంతో పోటీ పడేలా ఇంగ్లీషు మీడియం బోధనను ప్రవేశపెట్టారు. విప్లవాత్మక సంస్కరణలతో నాణ్యమైన విద్య అందిస్తున్నారు. అమ్మ ఒడి, గోరుముద్ద, విద్యాదీవెన, వసతి దీవెన లాంటి పథకాల ద్వారా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలు విద్యా సాధికారత సాధించేందుకు మార్గం సుగమం చేశారు. స్వాతంత్య్రం వచ్చిననాటి నుంచి రాష్ట్రంలో ఇప్పటిదాకా 4 లక్షల ఉద్యోగాలను భర్తీ చేయగా అందులో గత 56 నెలల్లో భర్తీ చేసినవే 2.07 లక్షల ఉద్యోగాలున్నాయి. ఇందులో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకే 80 శాతం ఉద్యోగాలు దక్కాయి. దీన్ని పరిశీలిస్తే ఆయా వర్గాలు విద్యా సాధికారత సా«ధించినట్లు స్పష్టమవుతోంది. మహిళా సాధికారతలో అగ్రగామి.. వైఎస్సార్ ఆసరా, చేయూత లాంటి పథకాల ద్వారా సీఎం జగన్ మహిళలకు ఆర్థికంగా తోడ్పాటు అందించారు. రాష్ట్రంలో 30.76 లక్షల మంది అక్కచెల్లెమ్మలకు రూ.75,670 కోట్ల విలువైన ఇంటి స్థలాలను ఇవ్వడమే కాకుండా పక్కా ఇళ్లను సైతం నిర్మించి ఇస్తూ వారి సొంతింటి కలను సాకారం చేశారు. కేబినెట్ నుంచి స్థానిక సంస్థల వరకూ మహిళలకు సముచిత ప్రాధాన్యం ఇచ్చారు. హోంమంత్రిగా ఎస్సీ మహిళకు, మండలి డిప్యూటీ ఛైర్పర్సన్గా మైనార్టీ మహిళకు అవకాశం కల్పించారు. నామినేటెడ్ పదవులు, పనులు 50% మహిళలకే ఇవ్వాలని దేశ చరిత్రలో తొలిసారిగా చట్టం చేసి మరీ మహిళలకు న్యాయం చేశారు. మహిళా సాధికారతలో రాష్ట్రం దేశంలోనే అగ్రగామిగా నిలిచింది. స్థానిక సంస్థల్లో సంచలనం.. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ వర్గాలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ సీఎం జగన్ ఉత్తర్వులు జారీ చేస్తే దీనిపై చంద్రబాబు హైకోర్టులో టీడీపీ నేతలతో కేసులు వేయించారు. దాంతో బీసీలకు రిజర్వేషన్లు 24 శాతానికి తగ్గాయి. టీడీపీ కుట్రలు చేసి రిజర్వేషన్లు తగ్గించినప్పటికీ పార్టీ పరంగా తాము 34 శాతం కంటే ఎక్కువే ఇస్తానని సీఎం జగన్ ప్రకటించారు. ఆ మేరకు స్థానిక సంస్థలలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు అత్యధికంగా పదవులిచ్చారు. రాష్ట్రంలో 648 మండలాలకు ఎన్నికలు జరగ్గా 637 చోట్ల వైఎస్సార్సీపీ ఘన విజయం సాధించింది. మండల పరిషత్ అధ్యక్ష పదవుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు 67 శాతం ఇచ్చారు. 13 జిల్లా పరిషత్ ఛైర్మన్ పదవులలో ఏకంగా 9 పదవులు (69 శాతం) ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ వర్గాలకు ఇచ్చారు. రాష్ట్రంలో 14 మున్సిపల్ కార్పొరేషన్లలో వైఎస్సార్సీపీ విజయం సాధించింది. 14 మేయర్ పదవుల్లో 12 పదవులను (86 శాతం) ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు ఇచ్చారు. 87 మున్సిపాల్టీలలో ఎన్నికలు జరగ్గా 84 చోట్ల వైఎస్సార్సీపీ విజయం సాధించింది. ఇందులో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల వర్గాలకు 58 మున్సిపల్ ఛైర్మన్ పదవులు (69%) ఇచ్చారు. చారిత్రక చట్టం.. నామినేటెడ్ పదవుల్లో 50 శాతం బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు రిజర్వేషన్లు కల్పిస్తూ చారిత్రక చట్టం చేసి మరీ ఆయా వర్గాలకు ముఖ్యమంత్రి జగన్ పదవులు ఇచ్చారు. నామినేటెడ్ పదవుల్లో 50 శాతం ఆ వర్గాలకు రిజర్వేషన్ చేస్తూ చట్టం చేయడం దేశంలో ఇదే తొలిసారి. 196 వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్లను నియమించగా అందులో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు 117 పదవులు (60 శాతం) ఇచ్చారు. వివిధ ప్రభుత్వ కార్పొరేషన్లలో 137 ఛైర్మన్ పదవులలో 79 పదవులు(58 శాతం) ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు ఇచ్చారు. 137 ప్రభుత్వ కార్పొరేషన్ పదవులకు సంబంధించి 484 నామినేటెడ్ డైరెక్టర్ పదవులుంటే 280 పదవులు(58 శాతం) ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకే ఇచ్చారు. బీసీ వర్గాలకు ప్రత్యేకంగా 56 కార్పొరేషన్లు, ఎస్సీలకు ప్రత్యేకంగా 3 కార్పొరేషన్లు, ఎస్టీలకు 1 కార్పొరేషన్ ఏర్పాటు చేసి వాటికి ఆయా వర్గాల వారినే ఛైర్మన్లుగా నియమించారు. ఆ కార్పొరేషన్లలో ఆయా వర్గాలకు 684 డైరెక్టర్ పదవులు ఇచ్చారు. ఆలయ బోర్టులు, ఆలయ ఛైర్మన్ పదవుల్లో సగ భాగం బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలకే ఇచ్చారు. దాదాపు 7,006 ఆలయ బోర్డు మెంబర్ల పదవుల్లో 3,503 అంటే సగం బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలకే ఇచ్చారు. -
ప్రత్యామ్నాయ సాంస్కృతిక శిఖరం
ప్రపంచ మేధావిగా గుర్తింపు పొందిన అరుదైన భారతీయుడు డా‘‘ బీఆర్ అంబేడ్కర్. అమానవీయ పరిస్థితులను ఎదుర్కొంటూ, విద్యను ఆయుధంగా ఎంచి ఎన్నో ఉన్నత డిగ్రీలు పొంది దేశానికి రాజ్యాంగ రచనలో దీపధారి అయ్యారు. దళితులూ, ఆదివాసీలూ, మహిళలూ, ఇతర అణగారిన వర్గాలకు ఆయన ఒక ధైర్య వచనం. తన కాలంలోనే గాక, ఆ తరువాత కాలాన్నీ వెలిగించడానికి అక్షర సముచ్చయాన్ని నిర్మించిన మేధావి. భారత ఉపఖండంలో తన సౌజన్యం ద్వారా రక్తపాతాన్ని నివారించి, నిర్మాణాత్మక సామాజిక విప్లవాన్ని నడిపిన ప్రత్యామ్నాయ సాంస్కృతిక శిఖరం ఆయన. ఆ మహాను భావుడి జ్ఞాపకార్థం 125 అడుగుల భారీ విగ్రహాన్నీ, ఓ స్మృతి వనాన్నీ నిర్మించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రజారాశుల ఆదరణను చూరగొంటోంది. జనవరి 19వ తేదీన విజయవాడ ‘అంబే డ్కర్ నగర్’గా వెలుగొందుతుంది. ప్రత్యామ్నాయ సంస్కృతీ నిర్మాణంలో స్వాతంత్య్రం తర్వాత కశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు వెలుగొందిన అంబేడ్కర్ శిల్ప నిర్మాణం అత్యు న్నతమైంది, విస్తృతమైంది. దక్షిణ భారతదేశానికి నడిబొడ్డున ఉన్న విజయవాడలో 125 అడుగుల అంబేడ్కర్ విగ్రహ నిర్మాణం, ఆవిష్కరణ, స్మృతివన వికాసం చెరపలేని సంఘటనలు. అశోకుని సాంచీ స్తూపానికి ఎంత పేరు వస్తుందో విజయవాడలోని స్మృతివనానికీ అంతే పేరు వస్తుందనడం అతిశయోక్తి కాదు. బౌద్ధమతాన్ని స్వీకరించి బౌద్ధునిగా మహాపరినిర్వాణం పొందిన అంబేడ్కర్ జ్ఞాపకార్థం నిర్మించిన ఈ విగ్రహం కానీ, స్మృతివనం కానీ ప్రపంచ బౌద్ధ పర్యా టకులను ఆకర్షించడం తథ్యం. నిజానికి బౌద్ధానికి ఈ ప్రాంతం కొత్తేమీ కాదు. అశోకుని కాలంలోనే ఆంధ్ర ప్రదేశ్ ప్రాంతానికి బౌద్ధం విస్తరించింది. అమరావతి స్తూపం మొదటి దశ నిర్మాణాలు మౌర్యుల వాస్తు నిర్మాణాలనే పోలి ఉండటం, అనేక విద్దాంక నాణెములు (పంచ్ మార్క్డ్ కాయిన్స్) లభించడం, అశోకుని కాలపు నాటి బ్రాహ్మీ లిపిలోనే కొన్ని శాసనాలు లభించడాన్ని బట్టి ఆయన కాలంలోనే బౌద్ధం ఇక్కడికి వ్యాపించిందని చెప్పవచ్చు. అలాగే అప్పట్లోనే ఇవ్వాళ దళితులుగా వ్యవహరించ బడుతున్న జన సమూహాలు బౌద్ధాన్ని అవలంబించాయి. అమరావతి స్తూపంపై ఉన్న... ఓ చర్మకారుడు స్తూపానికి ఇచ్చిన దానాన్ని తెలియచేసే శాసనం ఇందుకు మంచి ఉదాహరణ. దళితులు, కులవృత్తులవారే ఆ నాటి స్తూప నిర్మాణానికి రాళ్లు, మట్టినీ మోశారు. అద్భుత శిల్పాలను మలిచారు. అందుకే భారతదేశ చరిత్రలో మొదటి సాంస్కృతిక విప్లవం బౌద్ధం నుండే ప్రారంభమైందని చెప్పవచ్చు. హిందూ మతోన్మాదం బౌద్ధ శిల్పాలను, స్తూపాలను, చైత్యాలను, ఆశ్రమాలను హింసాత్మకంగా కూల్చివేసింది. కానీ మళ్లీ డా‘‘ బీఆర్ అంబేడ్కర్ శిల్పంలో ఒక ప్రత్యామ్నాయ ప్రకాశిత, విభాసిత శిల్ప కాంతులు వెల్లివిరుస్తున్నాయి. అంబేడ్కర్ విగ్రహమే ఒక విశ్వవిద్యాలయంలా ఉంటుంది. ఆయన వేలు ఒక ప్రశ్నోపనిషత్తు. ఆయన విగ్రహం విద్యా వికాసానికి నిలువెత్తు నిదర్శనం. ఆయన ప్రపంచ మానవుడు. లండన్ హౌస్ ఆఫ్ కామన్స్ ముందు డా‘‘ బీఆర్ అంబేడ్కర్ నిలువెత్తు విగ్రహం భారత దేశ వ్యక్తిత్వాన్ని ప్రకాశింపచేస్తుంది. లండన్ మ్యూజియం లైబ్రరీలో ఆయన చిత్రపటం ప్రపంచ మేధావుల పంక్తిలో మెరుస్తుంది. లండన్ ఇండియన్ హౌస్లో ఆయన బంగారు విగ్రహం ఆయన జీవన సాఫల్యానికి గుర్తుగా వుంది. అంబేడ్కర్ పోరాటం ద్వారానే అధికార ప్రతిష్ఠ జరుగుతుందని నొక్కి వక్కాణించాడు. దళితులను దేవుడిపైన లేక సూపర్ మ్యాన్ పైన ఆధారపడవద్దని హెచ్చరించాడు. ‘మీపై మీరు విశ్వాసం ఉంచుకొని నడవండి. ఎవరిపైనా ఆధార పడకండి. నిజాయితీగా ఉండండి. ఎప్పుడూ సత్యాన్ని ఆశ్రయించండి. దేనికీ లోబడకండి. ఎవరికీ తలవంచకండి’ అని అంబేడ్కర్ పిలుపు నిచ్చాడు. అంబేడ్కర్ ఒక ప్రవక్త, దార్శనికుడు. ఆయన ఒక జీవన వ్యవస్థల నిర్మాత. అణగారిన ప్రజల గుండె దివ్వెలు వెలిగించిన భానుడు. ఆయన జీవించిన కాలంలోనే గాక ఆ తరువాత కాలాన్నీ వెలిగించడానికి అక్షర సముచ్చయాన్ని నిర్మించిన మేధావి. జాన్డ్యూ యిని అధ్యయనం చేసిన అంబేడ్కర్ ప్రజాస్వామ్య లౌకికవాది. భారత ఉపఖండంలో తన సౌజన్యం ద్వారా, రక్తపాతాన్ని నివారించి, నిర్మా ణాత్మక సామాజిక విప్లవాన్ని ఆయన నడిపించారు. ఇకపోతే అంబేడ్కర్ పార్క్ను మాయావతి గవర్నమెంట్ 125 కోట్ల బడ్జెట్తో రూపొందించింది. ప్రత్యామ్నాయ సంస్కృతిని ఆ పార్కు విస్తరించింది. అంబేడ్కర్, మహాత్మాఫూలే, పెరియార్, నారాయణ్ గురూ, సాహూ మహరాజ్ వంటి వారినే కాకుండా ఉత్తర ప్రదేశ్లో ఉన్న ఎందరో పోరాట వీరుల విగ్రహాలను ఆ పార్క్లో ఆవిష్కరించారు. ప్రత్యామ్నాయ సంస్కృతికి ఆ పార్కు నిలువెత్తు సాక్ష్యంగా నిలబడింది. వ్యక్తిత్వ నిర్మాణానికి సాంస్కృతిక విప్లవ పునరుజ్జీవానికి సాహిత్యంతోపాటు శిల్పసంపద కూడా ఎంతో ఉప యుక్తం. కొన్ని శిల్పాలు మానవ మస్తిష్కాన్ని ప్రజ్వలింపచేస్తాయి. భారతదేశంలోని ఆర్కిటెక్చర్ ప్రపంచ దేశాల్లో ఉన్న ఆర్కిటెక్చర్లను సమన్వయం చేసుకుంది. భారతదేశానికి వలస వచ్చిన కుషానులు, అరబ్బులు, తురుష్కులు, పారసీకులు ఎందరో భారతీయ శిల్ప సౌందర్యానికి మురిసిపోయారు. వారి శిల్పనైపుణ్యాలు, భారతీయ శిల్ప నైపుణ్యానికి సమన్వయించారు. ‘గాంధార శిల్పం’ వంటివి రూపు దిద్దుకున్నాయి. మన అమరావతి శిల్పం ప్రపంచ ప్రఖ్యాతి గాంచింది. భారతదేశంలో ఈనాడు ప్రత్యామ్నాయ శిల్పసంపద అభివృద్ధి చెందు తోంది. లండన్ హౌస్ ఆఫ్ కామన్స్ ముందు ఉన్న డా‘‘ బీఆర్ అంబే డ్కర్ నిలువెత్తు విగ్రహం స్ఫూర్తితో ప్రతి ఊరిలో అంబేడ్కర్ విగ్రహం ఉండాలని ‘ఆంధ్రప్రదేశ్ దళిత మహాసభ’ కృషి చేసింది. అనేక గ్రామాలకు ఆ మహానుభావుడి విగ్రహాలను అందించింది కూడా! ఈ సందర్భంగానే అంబేడ్కర్ 150 అడుగుల విగ్రహాన్ని ఉమ్మడి రాష్ట్ర సచివాలయం ముందు నిలపాలని చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పోరాటం చేసింది. 40 రోజులు సచివాలయం ముందు ధర్నా చేసింది. అంబేడ్కర్ యువజన సంఘాలు, ప్రజా సంఘాలు, అన్ని పార్టీలూ సపోర్ట్ చేశాయి. అయితే అంబేడ్కర్ వ్యతిరేక భావ వాది, అగ్రవర్ణ కుల అహంకారి, రాజకీయ కపటి, మానవ వనరుల విధ్వంసకుడు, ప్రకృతి వనరుల దోపిడీదారు, నేర రాజకీయ కోవి దుడు, దళిత ద్రోహి నారా చంద్రబాబు నాయుడు అంబేడ్కర్ విగ్రహా నికి బదులు మహాత్మాగాంధీ విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన తర్వాత కేసీఆర్ తెలంగాణ సచి వాలయం ముందే అంబేడ్కర్ విగ్రహాన్ని నిర్మించారు. ఏపీలో జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం విజయవాడ నడిబొడ్డున అంబేడ్కర్ విగ్ర హానికి పూనుకొని నిర్మించింది. జనవరి 19వ తేదీన ఈ విగ్రహ ఆవిష్కరణ జరగడం ఒక చరిత్రాత్మక సంఘటన. అంబేడ్కర్ విగ్రహ నిర్మాణంతో విజయవాడకు ప్రత్యామ్నాయ సంస్కృతి ప్రజ్వలనం వస్తుంది. అంతేగాకుండా చైనా, టిబెట్, థాయ్లాండ్, జపాన్, జర్మనీ, బర్మా, శ్రీలంక దేశాల నుండి యాత్రికులు వస్తారు. ఇక విజయవాడ భారతదేశానికే తలమానికమైన నగరంగా వెలుగొందుతుంది. కుల, మత, జాతి, లింగ భేదాలు తరమబడతాయి. ప్రపంచంలో పేరెన్నిక గన్న నగరాల్లో ఒకటిగా కీర్తించబడుతుంది. విద్యావ్యాప్తి పెరుగుతుంది. ‘బోధించు, సమీకరించు, పోరాడు’ అనే అంబేడ్కర్ నినా దాన్ని ఈ నిలువెత్తు విగ్రహం పదే పదే గుర్తుచేసి ప్రజారాశులను చైతన్యవంతం చేస్తుంది. అంబేడ్కర్ స్మృతివనం ఏమి చెప్తుందంటే పిల్లల్ని విద్యావంతులు చేసుకోండి. కుల, మత భేదాలు లేని సమసమాజాన్ని నిర్మించుకోండి. హింసలేని కరుణ, ప్రజ్ఞ, నీతి, ఆత్మీయత, అనుబంధం కలిగిన భారత రాజ్యాంగ సూత్ర నిబద్ధమైన ఒక సమాజాన్ని నిర్మించుకోండని ఎలుగెత్తి చాటుతుంది. ఇక విజయవాడ అంబేడ్కర్ నగర్ అవుతుంది. ప్రపంచ కీర్తిని పొందుతుంది. అంబేడ్కర్ స్మృతివనంలోని లైబ్రరీ,అంబేడ్కర్ చిత్రపటాల దృశ్య మాలిక సందర్శనం, అంబేడ్కర్ సమా వేశ మందిరం ప్రపంచ పర్యాటకులకు దృశ్యమాన సౌందర్యం. జ్ఞానభాండాగార సదృశం. బహుముఖ వ్యక్తిత్వానికి నిలువెత్తు నిద ర్శనం. ఇక ఆంధ్రప్రదేశ్ ప్రపంచ పటంలో ఓ వెలుగుతున్న ప్రత్నా మ్నాయ వెలుగుల సంద్రం. ఆ వెలుగుల తరంగాలలో మనమూ ప్రకాశిద్దాం. ప్రజ్వరిల్లుదాం, ప్రమోదిద్దాం. ఇక పదండి ముందుకు అంబేడ్కర్ ఆశయాలతో... కత్తి పద్మారావు వ్యాసకర్త దళితోద్యమ నాయకుడు ‘ 98497 41695 (రేపు విజయవాడలో 125 అడుగుల అంబేడ్కర్ విగ్రహ ఆవిష్కరణ) -
‘అంబేద్కర్ ఆశయాల సాధనకు అనుగుణంగా సీఎం పాలన’
సాక్షి, తాడేపల్లి: ఈ నెల 19న విజయవాడలో జరిగే125 అడుగుల అంబేద్కర్ విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని డిప్యూటీ సీఎం రాజన్న దొర, బీసీ సంక్షేమం, సమాచార శాఖమంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ పిలుపునిచ్చారు. 139 కులాలకు సంబంధించి 56 బీసీ కార్పొరేషన్ల చైర్మన్లు, ఇతర కార్పొరేషన్లలోని బీసీ, ఎస్సీ, ఎస్టీ, బీసీ ఛైర్మన్లు, డైరక్టర్ల సమావేశం తాడేపల్లిలోలో బుధవారం జరిగింది. ఈ సమావేశానికి శాసనమండలి విప్, పార్టీ కేంద్ర కార్యాలయ ఇంచార్జ్ లేళ్ళ అప్పిరెడ్డి సమన్వయకర్తగా వ్యవహరించారు. అనంతరం రాజన్నదొర మాట్లాడుతూ.. రాజ్యాంగ నిర్మాత బాబాసాహేబ్ అంబేద్కర్ 125 అడుగుల విగ్రహం ఏర్పాటు ఆంధ్రప్రదేశ్కు గర్వకారణం అని అన్నారు. విజయవాడ నగరంలో నడిబొడ్డున ఆయన విగ్రహం ఏర్పాటు చేస్తూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీసుకున్ననిర్ణయం చరిత్రలో నిలిచిపోతుందని అన్నారు. అంబేద్కర్ సిధ్దాంతాలను, ఆశయాలను, లక్ష్యాలను నమ్మి సీఎం జగన్ సామాజిక న్యాయం చేస్తున్నారన్నారు. విజయవాడ నడిబొడ్డున అంబేద్కర్ విగ్రహం.. ఎంతో ఆనందం అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని నమ్మి దాన్ని ఆకళింపు చేసుకున్నారన్నారు. అంబేద్కర్ అడుగుజాడలలో నడుస్తున్నారని తెలిపారు. భారతదేశంలో ఎక్కడాలేని విధంగా స్వేచ్చా, స్వాతంత్ర్యానికి నిలువెత్తు నిదర్శనంగా ఉన్న అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం ప్రజలందరూ మెచ్చే నిర్ణయమని కొనియాడారు. సాధారణంగా దళితవాడలలో, పల్లెల్లో అంటే ప్రతి ఊరి చివరన కాలనీలలో కనబడే అంబేద్కర్ విగ్రహాలను సీఎం జగన్ విజయవాడ నడిబొడ్డున ఏర్పాటు చేయడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. అంబేద్కర్ ఆశయాల సాధనకు అనుగుణంగా సీఎం పాలన మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ మాట్లాడుతూ.. ఈ నెల 19 న విజయవాడలో 125 అడుగుల అంబేద్కర్ విగ్రహావిష్కరణను పండుగలా నిర్వహించాలని కోరారు. దేశంలో ఎక్కడా లేని విధంగా విగ్రహం కింద ఏర్పాటుచేస్తున్న వేదికతో కూడితే దాదాపు 195 అఢుగుల ఎత్తులో కారణజన్ముడైన అంబేద్కర్ విగ్రహం కనిపిస్తుందన్నారు. విజయవాడలో రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ విగ్రహం సగర్వంగా చూడవచ్చన్నారు. వివిధ దేశాలలో అధ్యయనం చేసి అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ఇంత పెద్ద భారత దేశ ప్రజాస్వామ్యాన్ని ఎల్లప్పుడూ పరిఢవిల్లేలా చేస్తోందన్నారు. అంబేద్కర్ ఆశయాల సాధనకు అనుగుణంగా ముఖ్యమంత్రి పరిపాలన సాగిస్తున్నారని పేర్కొన్నారు. ఆ ఘనత సీఎందే.. గ్రామసచివాలయాల పరిధిలో అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం గురించి ప్రచారం చేయాలని కోరారు. ఆ కార్యక్రమానికి ప్రజలు పెద్దఎత్తున తరలి వచ్చేవిధంగా ఏర్పాట్లు చేయాలన్నారు. ప్రజా ప్రతినిధులు పాలకులు కాదు సేవకుడు అని అంబేద్కర్ చెప్పిన మాటలను తూచ తప్పకుండా పాటిస్తున్ననాయకుడు సీఎం జగన్ అని ప్రశంసించారు. బీసీలకు 56 కార్పొరేషన్లను ఏర్పాటుచేసి వారిలో నాయకత్వ లక్షణాలను పెంపొందించింది జగన్ మాత్రమేనని చెప్పారు. జనరల్ కార్పొరేషన్ల ఛైర్మన్లుగా కూడా బడుగు,బలహీనవర్గాలను నియమించిన ఘనత ముఖ్యమంత్రిదేనని కొనియాడారు. -
అనుమానాలు వీడని అంబేడ్కర్ మరణం
బాబా సాహెబ్ డా‘‘ బీఆర్ అంబేడ్కర్ 1956, అక్టోబర్ 14న నాగపూర్లో లక్షల మంది అనుచరులతో హిందూ మతాన్ని వదిలి, బౌద్ధం స్వీకరించారు. నాగపూర్ నాగజాతి ప్రజలు జీవించిన భూమి గనుక,వారంతా బౌద్ధులు గనుక, తాను బౌద్ధం స్వీకరించడానికి నాగ పూర్ను ఎంచుకున్నానని ఆయన ప్రకటించారు. అంతే గాని, నాగ్పూర్లో ఆరెస్సెస్ వారి ప్రధాన కార్యాలయం ఉంది గనుక, వారి ప్రాముఖ్యం తగ్గించడానికి తను ఆ పట్టణాన్ని ఎంచుకోలేదనీ వివరణ ఇచ్చారు. అయితే,ఆ తర్వాత 52 రోజులకే (డిసెంబర్ 6) అంబేడ్కర్ కన్ను మూశారు. ఆయన మరణం వెనుక ఓ కుట్ర ఉందనీ, ఆయన మరణించిన నాటి నుండి నేటి దాకా ఒక ఆరో పణ ఉంది. ఆ ఆరోపణ నిజం కాదని అటు భారత ప్రభుత్వం గానీ, ఇటు ఆరోపణలు ఎదుర్కొన్న వర్గాలు గానీ ఆధారాలు, వివరణలు ప్రజల ముందు పెట్టలేదు. అందువల్ల అనుమానాలు అనుమానాల్లాగే ప్రజల మన సుల్లో సజీవంగా ఉన్నాయి. ఆ రోజుల్లో జీవించి ఉన్న ఇ.వి.ఆర్. పెరియార్ తన వార్తా పత్రిక ‘విడుదలై’లో ఇలా రాశారు. ‘డాక్టర్ అంబే డ్కర్ చనిపోయారని అకస్మాత్తుగా ప్రకటించడం వెనుక ఏదో కుట్ర ఉందని నాకు అనిపిస్తోంది. గాంధీ మరణం వెనుక ఏ కారణం, ఏ కుట్ర ఉన్నాయో అలాంటివే అంబేడ్కర్ చనిపోవడం వెనక ఉన్నాయని నేను బలంగా నమ్ముతున్నాను’ అంటూ చాలా వివరంగా రాశారు. మొత్తం మీద ఆయన వెలిబుచ్చిన ఆవేదనలోని సారాంశం ఏమిటంటే – గాంధీ మరణానికి కారకులెవరో, వారే అంబేడ్కర్ మరణాకి కూడా కారకులని! అందుకు అవకాశమిచ్చే పలు అంశాలు కూడా ఆ రోజుల్లో చాలా బయటికి వచ్చాయి. ‘తన తండ్రికి విషమిచ్చి తెలియకుండా చంపేశారని’ స్వయానా అంబేడ్కర్ కుమారుడు యశ్వంత్ ఒక అభిప్రాయం వెలిబుచ్చారు. అంబేడ్కర్ అభిమానులంతా యశ్వంత్ను బలపరిచారు. అంబేడ్కర్ మరణవార్త ఈ దేశ ప్రజలకు అనుమానాస్పదమైన వార్త అయింది. ‘తన తండ్రిది సహజ మరణం కాదనీ, హత్య అనీ – దోషులెవరో తేల్చాలనీ – అంబేడ్కర్ కుమారుడు యశ్వంత్ నాటి ప్రధాని నివాసం ముందు నిరసన వ్యక్తం చేశారు. ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అంబేడ్కర్ మరణం తర్వాత పదకొండవ రోజున, ఆయన అనుయాయులు ఢిల్లీ వీధుల్లో పెద్ద ఎత్తున ప్రదర్శన నిర్వహించారు. నాటి ప్రధాని, రాష్ట్ర పతులకు లిఖితపూర్వక నివేదికలు, విన్నపాలు అంద జేశారు. అంబేడ్కర్ మరణం వెనక ఏం జరిగిందో తేల్చాలని వారు డిమాండ్ చేశారు. నాటి ప్రధాని నెహ్రూ స్పందించి నిజనిర్ధారణ కమిటీని నియమించారు. కమిటీ భారత ప్రభుత్వానికి అందజేసిన రిపోర్టు ఆనాటి నుండి ఈనాటి వరకు ప్రజల ముందుపెట్టలేదు. ఒకవేళ రహస్యాలేవీ లేకపోతే, అది బయటపెడితే అన్ని అనుమానాలకూ తెరపడినట్ట య్యేది కదా! ఢిల్లీ పోలీస్ ఐజీ ఇచ్చిన వివరణను మాత్రం 1957 నవంబర్ 27 నాడు – అంటే దాదాపు సంవత్సరం తర్వాత, అప్పటి హోంమంత్రి గోవింద్ వల్లభ్ పంత్తో పార్లమెంట్లో ఒక ప్రకటనగా ఇప్పించారు. ‘అంబేడ్కర్ మరణం సహజమైందని’– ఆ ప్రకటన సారాంశం! అదొక కంటి తుడుపు ప్రకటన అని దేశ ప్రజలు ఆనాడే భావించారు. అసంతృప్తితో రగిలిపోయారు. ఆనాటి నుండి నిరసనలు వెల్లువెత్తుతూనే ఉన్నాయి. వ్యాసాలు, పుస్త కాలు ప్రచురింప బడుతూనే ఉన్నాయి. అసహనం, అసంతృప్తి ఏదోరకంగా బయట పడుతూనే ఉంది. తాజాగా ఈ మధ్యే 2021 జనవరి 26 నాడు నాగపూర్ ఆరెస్సెస్ ప్రధాన కార్యాలయం ముందు – అంబేడ్కర్ ఎలా చని పోయారో తేటతెల్లం చేయాలని పెద్దఎత్తున నిరసన ప్రదర్శన జరిగింది. జనవరి 26నే ఎందుకు ఎంచుకున్నా రంటే... ఆ తేదీన అంబేడ్కర్ రచించిన భారత రాజ్యాంగం అమలులోకి వచ్చింది గనుక! వారి పాత్ర లేకపోతే జనం వెళ్ళి వారి కార్యాలయం ముందు ఎందుకు నిరసన ప్రదర్శనలిస్తారూ? అర్థం చేసుకోవా ల్సిన విషయం! నెహ్రూజీ తొలి ప్రధాని అయ్యారు కాబట్టి, సోష లిజానికి, వైజ్ఞానిక ప్రగతికి ఆయన ప్రాధాన్యమిస్తూ వచ్చారు. అప్పుడు వీరి ఆటలు అంతగా సాగలేదు. అయినా, వారి లక్ష్యసాధనకు వారు నిరంతరం కృషి చేస్తూనే వస్తున్నారు. దాని ఫలితాలను నేడు కూడా మనం చూస్తూనే ఉన్నాం! అంబేడ్కర్ది సహజ మరణమా? లేక హత్యా అనేది ఆరోజుల్లో బయటికి రాలేదు. 67 ఏళ్ళ తర్వాత, ఆధారాలన్నీ చెదిరిపోయిన తర్వాత, ఇప్పుడు బయటికి వస్తుందన్న నమ్మకం లేదు గానీ – గతంలో జరిగిన కొన్ని వాస్తవాలు ఈ తరానికి తెలియజేయడం అవసరం అనిపించింది. అయితే,బాబా సాహెబ్ అర్ధంతరంగా వదిలేసిన కర్తవ్యాలనూ, రాజ్యాంగబద్ధమైన హక్కుల సాధననూ ఈ తరం యువతీ యువకులు ముందుకు తీసుకుపోవాల్సి ఉంది. ఈ పోరాటం నిరంతరం కొనసాగుతూ ఉండా ల్సిందే! డాక్టర్ దేవరాజు మహారాజు వ్యాసకర్త కేంద్ర సాహిత్య అకాడెమీ అవార్డు గ్రహీత (నేడు అంబేడ్కర్ వర్ధంతి) -
అస్తమించని మేధా సూర్యుడు
భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ప్రపంచ మేధావుల్లో అగ్రగణ్యులు. భారతదేశ పునర్నిర్మాణ దృష్టితో రాజ్యాంగాన్ని రూపొందించారు. ఆయన చెక్కిన రాజ్యాంగ శిల్పంలో ప్రపంచ మానవతా సూత్రాలన్నీ ఇమిడి ఉన్నాయి. లౌకిక భావన, ప్రజాస్వామ్య వ్యవస్థలలోని స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వాలను భారత ప్రజలకు లభించడానికి తీవ్రంగా కృషి చేశారు. ఆయన విశుద్ధంగా, వినిర్మలంగా, ద్వేష రహితంగా జీవించారు. అదే జీవన విధానం అందరికీ ఆచరణీయం. ఆయన సిద్ధాంతాలైన కుల నిర్మూలన, అస్పృశ్యతా నివారణ , ఆర్థిక సమత, మానవ హక్కులు, బహుజన సాధికారితలను సాధించడానికి మనందరం ముందుకెళ్ళాల్సిన చారిత్రక సందర్భమిది. అంబేడ్కర్కి పూర్వం, అంబేడ్కర్ తర్వాత అని భారతదేశ చరిత్రను మనం లిఖించాల్సి ఉంటుంది. అంబేడ్కర్కి పూర్వం భారతదేశం మనుస్మృతి రాజ్యం, వర్ణ వ్యవస్థ రాజ్యం, బ్రాహ్మణాధిపత్య రాజ్యం, లౌకికేతర రాజ్యం, అప్రజాస్వామిక రాజ్యం, నియంతృత్వ రాజ్యం. అంబేడ్కర్ భారత దేశం రూపురేఖలను మార్చారు. లౌకిక ప్రజాస్వామిక దేశంగా చేశారు. ఆయన భారత రాజ్యాంగ శిల్పంలో ప్రపంచ మానవతా సూత్రాలన్నీ ఇమిడి ఉన్నాయి. లౌకిక భావన ప్రజాస్వామ్య వ్యవస్థలలోని స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వాలను భారత రాజ్యాంగం ద్వారా భారత ప్రజలకు లభించడానికి కారకులయ్యారు. కులాతీత, మతాతీత రాజ్యాంగాన్ని రూపొందించి భారతదేశానికి కానుకగా సమ ర్పించారు. భారత దేశ భవిష్యత్తుకు ఆ రాజ్యాంగమే దిక్సూచి. అంబేడ్కర్ ప్రపంచంలోనే పేరెన్నిక గన్న మేధావి. తత్వవేత్త, దార్శనికుడు అని ఎవరిని అంటారు? ప్రపంచ గమన సూత్రాలను మార్చ గలిగిన వారినే అంటారు. అంబేడ్కర్కు ముందు ఒక బుద్ధుణ్ణి, ఒక మార్క్స్ను ప్రజలు తత్వవేత్తగా కొనియాడారు. ఆయన బుద్ధుని కంటే, మార్క్స్ కంటే కూడా విశిష్ట లక్షణాలు ఉన్న మేధావి. భారత దేశాన్ని పట్టి పీడిస్తున్న కుల సమస్యకు, అçస్పృశ్యతా నిర్మూలనకు నిర్మాణాత్మకమైన సిద్ధాంతాలు, సూత్రాలు అందించారు. అణగారిన ప్రజల హక్కుల సిద్ధాంతానికి కర్త అయ్యారు. అంతే కాక, దానికి చట్ట రూపాన్ని తీసుకొచ్చిన నిర్మాణ కర్త ఆయన. అంబే డ్కర్ పరినిర్వాణం 67వ ఏట అడుగు పెడుతున్నా ఆయన కీర్తి తరగ లేదు. ఆయన సిద్ధాంతాలు విశ్వవ్యాప్తమవ్వడానికి కారణం, ఆయన జీవితం అంతా అనంత పరిశోధన చేసి, కుల నిర్మూలన, అస్పృశ్యతా నిర్మూలనం, ఆర్థిక అసమానతల నిర్మూలనకు బాటలు వేయడమే. ఆయనలా విశుద్ధంగా, నిర్మలంగా, ద్వేష రహితంగా జీవించిన మేధావులు అరుదు. ఆయన భారత రాజ్యాంగ నిర్మాణాన్ని భారతదేశ పునర్నిర్మాణ దృష్టితో రూపొందించారు. అందుకు ఆయన తన ఆరోగ్యాన్ని పణంగా పెట్టారు. ఆయన విద్యార్జన గమ్యం అçస్పృశ్యుల ఉద్ధరణ. అదీ దళిత విద్యావంతులలో ఉండాల్సిన ఆదర్శం. దళిత విద్యార్థులు ఆ నిర్దేÔè కత్వం నుండి తప్పితే అంబేడ్కర్ మార్గాన్ని నిరోధించిన వారే అవు తారు. ఈ సత్యాన్ని ప్రతి అంబేడ్కర్వాది గుర్తుంచుకోవాలి. ఆయన లండన్లో ఉన్నప్పుడు కూడా తన మనస్సు మాత్రం భారతదేశ అస్పృశ్య సమాజం మీదే ఉండేది. భారతదేశంలో అస్పృశ్యుల కోసం పని చేస్తున్న సంఘాలు ఏమి చేస్తున్నాయా అని ఆయన ఎప్పటికప్పుడు తెలుసుకొంటూ ఉండేవారు. అంబేడ్కర్ విద్యార్థి దశ నుండే నాయకత్వ లక్షణాలను సంతరించుకున్నారు. నాయకుడు కేవలం తన వ్యక్తిగత జీవితం గురించి ఆలోచించడు. తన జాతి గురించే ఆలోచిస్తాడు. త్యాగపూరితంగా పనిచేయడం ద్వారా తన జాతీయుల మనసులను చూరగొంటాడు. నాయకుడు తన భావజాలాన్ని జాతికి అందించడానికి వాహికను రూపొందించుకుంటాడు. అది ఉత్తరాల ద్వారా కావచ్చు, పత్రికల ద్వారా గావచ్చు, సభలు, సమావేశాల ద్వారా గావచ్చు. ఆయన చేసిందీ అదే! ఆయన అనేక పత్రికల్లో రాయడమే కాక స్వయంగా ‘మూక్ నాయక్’, ‘బహిష్కృత్ భారత్’, ‘జనత’, ప్రబుద్ధ భారత్’ వంటి పత్రికలు స్థాపించి వాటి ద్వారా తాను చెప్పాలనుకున్నది నిర్భ యంగా, కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు. ఎన్నో సభల్లో ఉపన్యసించి అణగారిన వర్గాలను ఉత్తేజితులను చేశారు. నాటి ప్రభుత్వ పెద్దలకూ, రాజకీయ నాయకులకూ ఆయన రాసిన ఉత్తరాలు ఇప్పటికీ చారిత్రక ప్రాధాన్యం కలిగి ఉన్నాయి. అంబేడ్కర్ నిశిత పరిశీలకుడు. ముఖ్యంగా ఆయన పోరాటానికి పునాది పూర్తి కుల త్యాగ నిరతి. అందుకే పూర్వీకుల వీరోచిత గాథ లను వర్ణించారు. ఆయన క్రమశిక్షణతో కూడిన నిర్భయత్వాన్ని ప్రద ర్శిస్తూ వీరోచితమైన సాహసాన్నీ, మొక్కవోని నిబ్బరాన్నీ, ధైర్యాన్నీ కొనియాడదగిన నిశ్చితత్వాన్నీ ప్రదర్శించిన మహర్ సైనికులకు శాశ్వతమైన గుర్తింపును తెచ్చారు. ‘ఇద్దరిలో ఎవరి కీర్తి గొప్పదో చెప్పడం కష్టం. అది భారతీయ సైనికులదో లేక అంతటి విధేయతను, విశ్వాసాన్ని పొందేలా వ్యవహరించిన బ్రిటిష్ ఆఫీసర్లదా?’ (భారతీయ సైనికులలో అధికులు మహర్లు) అంటూ మేజర్ జె.టి. గోర్మన్ తన ‘హిస్టారికల్ రికార్డ్ ఆఫ్ ది సెకండ్ బెటాలియన్ ఫోర్త్ బాంబే గ్రెనెడీర్స్, 1796–1933’లో పేర్కొనడం ఈ సందర్భంగా గమనార్హం. అనతికాలంలోనే కోరెగాంవ్ చర్యకున్న ప్రాముఖ్యతను గుర్తించారు. కోరెగాంవ్లో మొదటి తూటా పేలిన స్థలంలో 65 అడుగుల ఎత్తు, 32 చదరపు అడుగుల వెడల్పు ఉన్న స్మృతి చిహ్నాన్ని నిర్మించాలని తల పెట్టారు. దీనికి 1821 మార్చి 26న పునాది రాయి వేశారు. ఈ దళం సాహసానికి స్మృతిగా ఈ స్తూపాన్ని నిర్మించారు. ఈ సాహసాన్ని కొనసాగించే ఉద్దేశంతో దీనిని నెలకొల్పారు. అస్పృశ్యులు అనబడినవారు వీరోచితమైన జాతులు అని అంబేడ్కర్ తన అస్పృశ్యుల వాడలో నిరూపించారు. పల్నాటి యుద్ధంలో తెలుగు నేలలో దళితులే పాల్గొన్నారు. కృష్ణదేవరాయల సైన్యంలో ఏనుగులను, గుర్రాలను నడిపింది దళితులే. ముఖ్యంగా పల్నాటి వీర చరిత్రలో కన్నమదాసు సైన్యాధ్యక్షుడు. ఆయన ఉపయోగించిన కత్తి ఇప్పటికీ కారంపూడిలో ఉంది. డా‘‘ అంబేడ్కర్ కృషి వలన అస్పృశ్యత ఒక నేరంగా రాజ్యాంగం పరిగణిస్తూ ఉంది. కాని భారతదేశంలో లక్ష లాది గ్రామాలలో ఇంకా అస్పృశ్యత వెన్నాడుతోంది. ఎన్నో హోట ళ్ళలో గ్లాసులు అస్పృశ్యులకు వేరుగా ఉంచుతున్నారు. కొన్ని ప్రభు త్వాలు ఊరికి దూరంగా ఇళ్ళు కట్టిస్తున్న సందర్భాలూ ఉన్నాయి. భారత రాజ్యాంగంలో 21వ ఆర్టికల్ను వివరిస్తూ డా‘‘ అంబే డ్కర్ ‘ప్రభుత్వ సొమ్మును మత బోధకులకు, మత కార్యకలాపాలకు ఉపయోగించరాదు. మత బోధలకు సంబంధించి స్వయంగా లేక ప్రయివేటు సంస్థల ద్వారా ప్రభుత్వం ఖజానా డబ్బును ఖర్చు చేయ డానికి వీలులేదు’ అని స్పష్టం చేశారు. దీనికి పూర్తిగా, భిన్నంగా ఈనాడు జరుగుతూ ఉంది. ప్రభుత్వ ప్రచార సాధనాలయిన రేడియో, టీవీ వంటివాటిలో మత ప్రచారం చేయడం రాజ్యాంగ విరుద్ధం. ఆనాడు అంబేడ్కర్ వివరించిన దానికి పూర్తి భిన్నంగా జరుగుతూ ఉంది. సెక్యులరిజం అంటే ‘మత ప్రమేయం లేని రాజ్యం’ అని అర్థం. ఈనాడు ప్రభుత్వం పూర్తిగా మతపరంగా వ్యవహరిస్తూ వుంది. ఇది భారత రాజ్యాంగ శిల్పి అంబేడ్కర్కూ, ఆయన ఆలోచనలకూ పూర్తిగా వ్యతిరేకమయిన విషయం. అందుకే రానురానూ అంబేడ్కర్ అవసరం పెరిగింది. ప్రపంచ వ్యాప్తంగా అంబేడ్కర్ మేధావిగా గుర్తింపు పొందారు. లండన్లోని ‘ఇండియా హౌస్’లో ఆయన బంగారు విగ్రహం ఉంది. బ్రిటిష్ పార్లమెంట్ ఎదురుగా ఆయన నిలువెత్తు విగ్రహం ఉంది. ఇక భారత్లో సరేసరి. ఇండియన్ పార్లమెంట్ ఎదురుగా ఆయన సము న్నత విగ్రహం వుంది. ఇవాళ హైద్రాబాద్ నడిబొడ్డులో అంబేడ్కర్ 125 అడుగుల విగ్రహం వెలుగులీనుతోంది. విజయవాడలో 125 అడుగుల విగ్రహం జనవరిలో ఆవిష్కరించబడుతుంది. ఆయన రాజ్యాంగ నిర్మాణ దక్షత, ప్రతిభా సామర్థ్యాలను గుర్తిస్తూ కశ్మీరు నుండి కన్యాకుమారి వరకు ఆయన విగ్రహాలు నిరంతరం వెలుస్తూనే ఉన్నాయి. ఈనాడు ఆయన భావజాల అవసరం చాలా ఉంది. మన మందరం ఆయన వర్ధంతికి నివాళిగా ఆయన సిద్ధాంతా లైన కుల నిర్మూలన, అస్పృశ్యతా నివారణ, ఆర్థిక సమత, మానవ హక్కుల పోరాట దీక్షలతో బహుజన సాధికారిత రాజ్యాధికార భావనలతో ముందుకెళ్ళాల్సిన చారిత్రక సందర్భమిది. డా‘‘ కత్తి పద్మారావు వ్యాసకర్త దళితోద్యమ నాయకుడు ‘ 98497 41695 (రేపు డా‘‘ బి.ఆర్. అంబేడ్కర్ వర్ధంతి) -
కోనసీమ జిల్లాకు అంబేడ్కర్ పేరు పెట్టడం చారిత్రక నిర్ణయం
-
పరిషత్తులో అంబేడ్కరే లేకుంటే?!
‘‘స్వాతంత్య్ర పోరాటంలో అంబేడ్కర్ పోషించిన పాత్రేమీ లేకపోవడం ఆయన అద్భుతమైన జీవన ప్రగతిలో అత్యంత వివాదాస్పదమైన అంశం’’ అంటాడు అశోక్ లాహిరి. ఇదొక్కటే కాదు లాహిరి పుస్తకం ‘ఇండియా ఇన్ సెర్చ్ ఆఫ్ గ్లోరీ’ అంబేడ్కర్ గురించి వెల్లడించిన నమ్మశక్యం కాని నిజం. రాజ్యాంగ పరిషత్తుకు అంబేడ్కర్ ఏనాడూ నేరుగా ఎన్నికవలేదన్నదీ అలాంటి వాస్తవమే. 1945–46 ఎన్నికల్లో అంబేడ్కర్ రాజ్యాంగ పరిషత్తుకు ఎన్నిక కాలేకపోయినప్పుడు ఆయనకు స్థానం కల్పించడం కోసం ముస్లిం లీగ్ శాసనసభ్యుడు జోగేంద్రనాథ్ మండల్ తన స్థానాన్ని త్యాగం చేశారు. అంబేడ్కర్ ఆనాడు పరిషత్తు సభ్యుడిగా లేకుంటే భారతదేశానికి ఎలాంటి రాజ్యాంగం తయారై ఉండేదో ఊహించండి. ప్రజాస్వామ్యానికి మాతృమూర్తి అని మనం నేడు చెప్పుకుంటున్న దేశం తన రాజ్యాంగ పితను కోల్పోయి ఉండేది. మన జాతిరత్నాల గురించి నిజంగా మనకు తెలుసునా? వాళ్లను మనం పీఠాలపై ప్రతిష్ఠించుకుని గౌరవించుకుంటాం. వారి గురించి తరచుగానూ, అనర్గళంగానూ మాట్లాడు కుంటూ ఉంటాం. వాళ్ల మాటల్ని కూడా యథాతథంగా స్వీకరించి మన జీవితాలకు బాటలు పరుచుకుంటాం. అయితే అదంతా వేరు, వాళ్ల గురించి తెలియడం వేరు. ఇటీవల నేను చదివిన ఒక పుస్తకం బి.ఆర్.అంబేడ్కర్ గురించి నాకు తెలియని అనేకమైన విషయాలను వెల్లడించింది. అవేవీ వాస్తవ విరుద్ధమైనవి కావు. అలాగే సుప్రసిద్ధమైనవి కూడా! అయితే అవి అందరికీ తెలిసిన మనిషిగా అంబేడ్కర్లో భాగమై ఉన్నవి కావు. ఎలాంటివంటే, నిజంగా ఆయనొక స్వాతంత్య్ర సమరయోధుడు కాదని మీకు తెలుసా? 1942 నుండి 1946 వరకు ఆయన వైస్రాయ్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లో కార్మిక శాఖ మంత్రిగా ఉన్నారు. అంతకు ముందు, 1931లో ఆయన: ‘‘బ్రిటిష్ వారి నుండి భారత ప్రజలకు తక్షణ అధికార మార్పిడి జరగాలని అణగారిన వర్గాలవారు (అప్పుడు షెడ్యూల్డ్ కులాలు అని పిలిచేవారు) నిరసించలేదు. నినదించలేదు. ఉద్యమించలేదు’’ అని వ్యాఖ్యానించి ఉన్నవారు. ఈ విషయాన్ని నేను అశోక్ లాహిరి పుస్తకం ‘ఇండియా ఇన్ సెర్చ్ ఆఫ్ గ్లోరీ’ నుంచి గ్రహించాను. ‘‘స్వాతంత్య్ర పోరాటంలో అంబేడ్కర్ పోషించిన పాత్రేమీ లేకపోవడం అన్నది ఆయన అద్భుతమైన జీవన ప్రగతిలో అత్యంత వివాదాస్పదమైన అంశం’’ అంటాడు అశోక్ లాహిరి. అది నన్నెంతో విస్మయానికి గురి చేసిందని నేను ఒప్పుకొని తీరాలి. అయితే ఇదొక్కటి మాత్రమే కాదు లాహిరి పుస్తకం బహిర్గతం చేసిన నమ్మలేని నిజం. అంబేడ్కర్ అసలు రాజ్యాంగ పరిషత్తుకు ఎన్నికే కాలేదని తెలుస్తోంది. 1945–46 ఎన్నికల్లో ఆయన పార్టీ ‘ఆలిండియా షెడ్యూల్డ్ క్యాస్ట్ ఫెడరేషన్’ (ఎస్.సి.ఎఫ్.) 151 రిజర్వుడు సీట్లలో కేవలం రెండింటిని మాత్రమే గెలుచుకుంది. ‘బాంబే ప్రొవిన్షి యల్ అసెంబ్లీ’ నుంచి ఎస్.సి.ఎఫ్. ఒకే ఒక్క సీటును గెలుచుకున్న ఫలితంగా అంబేడ్కర్ రాజ్యాంగ పరిషత్తు సభ్యుడు కాలేకపోయారు. దాన్ని మించిన పరాజయం... అంబేడ్కర్కు మద్దతు ఇచ్చేందుకు ఎవరూ సిద్ధంగా లేకపోవడం! ‘‘డాక్టర్ అంబేడ్కర్కు రాజ్యాంగ పరిషత్తు తలుపులతో పాటుగా కిటికీలు కూడా మూసి వేయబడ్డాయి’’ అని సర్దార్ పటేల్ ప్రకటించారు. ‘‘చూద్దాం... రాజ్యాంగ పరిషత్తులోకి అతడెలా ప్రవేశిస్తాడో’’ అని కూడా అన్నారు. ఆ పరిస్థితుల్లో ముస్లిం లీగ్ శాసన సభ్యుడు జోగేంద్రనాథ్ మండల్ కాస్తా అంబేడ్కర్ వైపు నిలబడ్డారు. అంబేడ్కర్ కోసం తన సీటును త్యాగం చేశారు. అలా మండల్తో పాటు ఒకరిద్దరు ఎస్సీ ఎమ్మెల్యేలు, ఒకటీ లేదా రెండు ఆంగ్లో–ఇండియన్ ఓట్లతో బెంగాల్ నుంచి అంబేడ్కర్ రాజ్యాంగ పరిషత్తుకు ఎన్నికయ్యారు.1947 జూలైలో మళ్లీ ఆయన ఇబ్బందుల్లో పడ్డారు. బ్రిటిష్ పార్లమెంటు భారత స్వాతంత్య్ర చట్టాన్ని ఆమోదించిన తర్వాత ఇండియాకు ఒకటి, పాకిస్థాన్కు ఒకటిగా రాజ్యాంగ పరిషత్తు విభజన జరిగింది. పర్యవసానంగా బెంగాల్ నుంచి అనేకమంది సభ్యులు తమ భారత రాజ్యంగ పరిషత్తు సభ్యత్వాన్ని కోల్పోయారు. వారిలో అంబేడ్కర్ ఒకరు. అయితే మళ్లొకసారి ఆయన్ని ఊహించని అదృష్టం కాపాడింది. కాంగ్రెస్ పార్టీతో విభేదాల కారణంగా ఎం.ఆర్. జయకర్ రాజీనామా చేయడంతో ఆయన స్థానం ఖాళీ అయింది. అంతేకాదు... ఈసారి భారతదేశంలోని ప్రముఖ రాజకీయ నాయకులు అంబేడ్కర్ సభ్యత్వా నికి తోడ్పాటును అందించేందుకు íసిద్ధమయ్యారు. వారిలో రాజ్యాంగ పరిషత్తు చైర్మన్ రాజేంద్ర ప్రసాద్ ఒకరు. అప్పటి బొంబాయి ప్రధానమంత్రి బి.జి.ఖేర్కు ఆయన లేఖ రాశారు. ‘‘ఏ ఇతర పరిగణనలతోనూ నిమిత్తం లేకుండా తన సేవలను ఎవరూ వదులుకోలేని విధంగా ఉన్న ఆయన పనితీరును మాత్రమే గుర్తిస్తూ రాజ్యాంగ పరిషత్తులో, వివిధ కమిటీలలో ఆయన నియామకానికి ప్రాధాన్యం ఇవ్వడం జరిగింది. ఆయన బెంగాల్ నుంచి ఎన్నిక య్యారని మీకు తెలిసిందే! ఆ ప్రావిన్సు విభజన వల్ల 1947 జూలై 14 నుంచి ఆయన తన రాజ్యాంగ పరిషత్తు సభ్యత్వాన్ని కోల్పోవలసి వచ్చింది కనుక వెంటనే ఆయనను ఎన్నుకోవలసిన అవసరం ఉంది’’ అని అంబేడ్కర్కు ఆసరాగా నిలిచారు. చివరికి పటేల్ కూడా అంబేడ్కర్ పట్ల తన వైఖరి మార్చు కున్నారు. అంబేడ్కర్కు సభ్యత్వం ఇప్పించేందుకు ఖేర్ను ఒప్పించడంతో పాటు, జయకర్ రాజీనామా వల్ల ఏర్పడిన ఖాళీని భర్తీ చేయ బోయిన జి.వి. మావలంకర్కు నచ్చజెప్పి, ఆయన్ని పక్కకు తప్పించ డంలో పటేల్ కీలకమైన పాత్ర పోషించారని లాహిరి రాశారు. అంటే దేశానికి ఇది త్రుటిలో తప్పిన ముప్పు. అంబేడ్కర్ కనుక ఆనాడు రాజ్యాంగ పరిషత్తులో సభ్యుడిగా లేకపోయుంటే ఎలాంటి రాజ్యాంగం తయారై ఉండేదో ఊహించండి. ప్రజాస్వామ్యానికి మాతృమూర్తి అని మనం నేడు చెప్పుకుంటున్న దేశం తన రాజ్యాంగ పితను కోల్పోయి ఉండేది. ఈ పుస్తకంలోని నమ్మశక్యం కాని వాస్తవాలు నాలా మీలోనూ జనింపజేసే అవకాశం ఉన్న ఒక ప్రశ్నను లేవనెత్తడం ద్వారా నేను ఈ వ్యాసాన్ని ముగిస్తాను. అంబేడ్కర్కు, బహుశా భారతదేశానికి కూడా మార్గనిర్దేశం చేసిన హస్తం ఏదైనా ఉండిందా? అంబేడ్కర్ మన రాజ్యంగ పరిషత్తులో భాగం అని నిర్ధారించడానికి ఎవరిదైనా, లేదా ఏదైనా గట్టిగా ప్రభావం ఉన్నట్లు కనిపిస్తోంది. వాళ్లెవరు? అది ఏమిటి? అన్నదే ఆ ప్రశ్న. వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్ -
ఘనంగా అంబేడ్కర్ జయంతి వేడుకలు
-
అంబేడ్కర్ ఆశయాలతో రాష్ట్రంలో సీఎం వైఎస్ జగన్ సుపరిపాలన
-
విగ్రహావిష్కరణకు ముఖ్య అతిథిగా అంబేడ్కర్ మనుమడు ప్రకాష్ అంబేడ్కర్
-
అంబేడ్కర్ చిత్రపటానికి నివాళులర్పించిన సీఎం వైఎస్ జగన్
-
పుత్తూరులో అంబేద్కర్ విగ్రహానికి మంత్రి ఆర్కే రోజా నివాళులు
-
దేశం గర్వించదగ్గ మేధావుల్లో అంబేడ్కర్ అగ్రగణ్యుడు :సీఎం జగన్
-
భాగ్యనగరం నడిబొడ్డున రాజ్యాంగ నిర్మాత విగ్రహం
-
హెలీకాఫ్టర్ పై నుంచి పూలాభిషేకం..అంబేద్కర్ విగ్రహావిష్కరణ..
-
యోధుడొకరు... విప్లవ వీరుడొకరు
భారతదేశ చరిత్రలో ఏప్రిల్ 14 ఒక మైలురాయి వంటిది. సమాజంలో మార్పు కోసం, సమాజ అభివృద్ధి కోసం మహాత్మా జ్యోతిబా ఫూలే, సావిత్రీబాయి ఫూలే, భగత్ సింగ్, సుభాష్ చంద్రబోస్, బాబూ జగ్జీవన్రామ్ వంటి ఎందరో మహనీయులు తమ జీవితాలను త్యాగం చేశారు. ఆ కోవకు చెందినవారే అయిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ జయంతి ఏప్రిల్ 14. ఈ తేదీకే ఇంకో ప్రాముఖ్యం కూడా ఉంది. యూనివర్సిటీలలోనే సమాజం మార్పుకు నాంది పడాలని విద్యార్థులను చైతన్య పరచిన విద్యార్థి నాయకుడు జార్జిరెడ్డి అమర వీరుడైన రోజు కూడా ఇదే! ఇద్దరి ఆశయం సమాజంలోని అసమానతల్ని నిర్మూలించడమే! అంతరాలు లేని మానవీయ సమాజాన్ని నిర్మించడమే! ప్రయాణించిన మార్గాలు వేరైనా, ఇద్దరూ అడుగడుగునా సమాజ హితం కోసం పోరాడిన వారే! అందుకే ఈ రోజుకు ఇంత ప్రాధాన్యం. చరిత్రపుటల్లో ఇంతటి ప్రత్యేక స్థానం. సమాజంలోని కుల వివక్ష, అంటరాని తనం నిర్మూలనకు అహోరాత్రులు శ్రమించి బడుగు బలహీన వర్గాలకు సమన్యాయం జరిగేందుకు అవసరమైన హక్కులను భారత రాజ్యాంగంలో పొందుపరిచినవారు అంబేడ్కర్. స్వతంత్ర భారతంలో సామాన్య ప్రజలకు స్వేచ్ఛా ఫలాలు అందకుండా పోతున్న సమయంలో సమాజంలోని అపసవ్య ధోరణులను అధ్యయనం చేస్తూ లాటిన్ అమెరికా దేశాల విప్లవ వీరుడు చేగువేరా స్ఫూర్తిగా యూనివర్సిటీలలోనే సమాజ మార్పుకు నాంది పడాలని విద్యార్థులను చైతన్య పరిచే పోరాటంలో మతోన్మాదుల చేతిలో బలి అయిన ఉస్మానియా అరుణతార జార్జిరెడ్డి. నేటి ‘ప్రగతిశీల ప్రజా స్వామిక విద్యార్థి సంఘం’ (పీడీఎస్యూ) స్థాపక కారకులు జార్జి రెడ్డి అమరుడైన రోజు, సామాజిక న్యాయం కోసం పరితపించిన రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్ జన్మదినం ఒకే రోజు కావడం యాదృచ్ఛికమే అయి నప్పటికీ.. స్ఫూర్తి చేతనలను ప్రేరేపించే ఒక ప్రత్యేక సందర్భం ఇది. అంబేడ్కర్ సమసమాజ స్థాపన కోసం పాటు పడితే, జార్జిరెడ్డి సామాజిక న్యాయం కోసం పోరాడిన విప్లవ వీరుడు. అంబే డ్కర్ ఒక ధ్రువతార అయితే, జార్జిరెడ్డి ఒక అరుణతార. ఇద్దరూ చరిత్రపుటల్లో ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పచుకున్న వారే. ప్రజల గుండెల్లో నిలిచి పోయినవారే. ఇద్దరి ఆశయాలు సమాజంలోని సమా నత కోసమే, అంతరాలు లేని మానవీయ సమాజం కోసమే. ఇద్దరూ ప్రపంచ స్థాయి మేధావులే. ప్రజల బాగోగుల కోసం, సంక్షేమం కోసం వారి అభివృద్ధి కోసం నిరంతరం ఆలోచించిన ఆలోచనాపరులే. సమాజ హితం కోసం అడుగడుగునా పోరాడిన వీర యోధులే. ప్రతి సంవత్సరం ఏప్రిల్ 14 నాలో ఒక సంఘర్షణను రేపుతుంది. ఒక సామాజిక విప్లవకారుని జననం, మరొక విప్లవకారుడు నేల కొరిగిన దినం! ఒకరిది పుట్టుక, ఒకరిది మరణం. ఇద్దరినీ ఒకే రోజు స్మరించుకోవడం సంఘర్షణ కాదా? ‘సమీకరించు, బోధించు, పోరాడు’.. అన్న నినాదంతో చైతన్యం కోసం పాటుపడిన వారు ఒకరు; ‘జీనా హైతో మర్నా సీఖో... కదం కదం పర్ లడ్నా సీఖో’ అనే నినాదం ఇచ్చి విప్లవ ఆదర్శాలను అందించిన సాహసోపేతమైన శక్తి ఒకరు. పుట్టినవారు మరణించక తప్పదు అని తెలిసినా, ఆ ఆలోచనకు ఒకింత బాధ కలుగుతూనే ఉంటుంది. కానీ అమరత్వం రమ్యమైనది. మనిషి తన కోసమే పుట్టి తన కోసమే మరణించడం సహజం. కానీ సమాజం కోసం, సమాజంలోని బాధితుల తరఫున గళమెత్తి, కలమెత్తి పోరాడి, పరుల కోసం మరణించడం రమ్యమైన అమరత్వం కాక మరేమవుతుంది? ఈ ఇద్దరు మహనీయులు కూడా ఉన్నత చదువులను అభ్యసించి ప్రతి క్షణం పేదవారి గురించే ఆలోచించి, ఏ మాత్రం స్వార్థం లేకుండా తమ అమూల్యమైన జీవితాలను ప్రజల కోసం త్యాగం చేశారు. ఇరువురి దారులు వేరైనా అంతిమ లక్ష్యం ఒక్కటే... మతోన్మాద మనువాద సంస్కృతికి వ్యతిరేకంగా పోరాటం సాగించడం. ‘‘మతములన్నియు మాసిపోవును, జ్ఞానమొక్కటి నిలిచి వెలుగును..’’ అని గురజాడ గారన్నట్లు జ్ఞానం ద్వారానే జీవితానికి వెలుగు అని, విద్య ద్వారానే అసమానతలు, అంతరాలు తొలగిపోతాయని ఇద్దరూ నమ్మారు. రిజర్వేషన్ ఫలాలు అందించి అణగారిన వర్గాలు విద్యాగంధానికి నోచుకునేలా అంబేడ్కర్ కృషి చేశారు. కులం అణచివేతలు, కుల దురహంకార పీడనలు లేని ఆత్మ గౌరవ సమాజం కోసం పోరాడిన సాంఘిక విప్లవకారుడు అంబేడ్కర్. దోపిడీ, పీడన లేని సమసమాజాన్ని కలలుగన్న విప్లవ స్వాప్నిక కార్యశీలి జార్జిరెడ్డి. ఇద్దరి జీవితం ప్రస్తుత సమాజానికి ఆదర్శ ప్రాయం, అనుసరణీయం. ఒకరు బాధిత కులంలో పుట్టి అన్యాయాలను, అక్రమాలను, అవమానాలను భరించి... కుల ఆధిపత్యా నికి, మతోన్మాదానికి వ్యతిరేకంగా పోరాడడానికి తమ జాతిని, బాధితులను పీడితులను చైతన్య పరిచారు. మరొకరు మధ్యతరగతి వర్గంలో జన్మించి, సౌకర్యవంతమైన జీవితాన్ని గడిపే అవకాశం ఉన్నప్పటికీ పేదల, శ్రామికవర్గ, గ్రామీణ కుటుంబాల నుంచి వచ్చిన విద్యార్థుల బాధలను అవగాహన పరచుకునేందుకు వారి స్థాయికి దిగి సాధారణ జీవితాన్ని అనుభవించిన విద్యార్థి. 1972లో కామ్రేడ్ జార్జిరెడ్డిని ‘సంఘ్ పరివార్’లోని కొన్ని మతో న్మాద హిందూత్వ శక్తులు హత్య చేశాయి. నాటి పరిస్థితులే నేటికీ సమాజంలో కనిపిస్తున్నాయి. అంతేకాదు, పరిస్థితులు రోజురోజుకు దిగజారుతున్నాయి. నేడు కూడా మత మౌఢ్యాన్ని, మూఢనమ్మకా లను వ్యతిరేకిస్తూ ప్రజాస్వామిక భావాలను పెంపొందింప చేయడా నికి ప్రయత్నించిన, ప్రజా వ్యతిరేక విధానాలను ప్రశ్నించిన ప్రజా స్వామిక వాదులను కాల్చి చంపిన సందర్భాలు ఉన్నాయి. యూనివర్సిటీలలో అణగారిన వర్గాల విద్యార్థులు ఉన్నత స్థాయి పరి శోధనలు జరపడానికి లేకుండా వారిని అడ్డుకుంటూ, మానసిక క్షోభకు గురిచేసి బలవన్మరణానికి పాల్పడేలా ప్రేరేపించడం జరుగుతోంది. అదే సమయంలో సమాజాన్ని విచ్ఛిన్నం చేసే కుట్రలు పెరిగిపోతున్నాయి. విద్యను కాషాయీకరణ, వ్యాపారీకరణ చేసేందుకు ప్రభుత్వాలు ఆతురతను కనబరుస్తున్నాయి. అందుకే అన్న ట్లుగా ఆగమేఘాల మీద జాతీయ విద్యా విధానం ప్రవేశపెట్టి ప్రైవేటీకరణ విధానాలను ప్రోత్సహించేందుకు చర్యలు చేపట్టడం జరిగింది. ఆ విధానాలను సవరించాలని విద్యావేత్తలు, మేధావులు, ప్రజాస్వామిక వాదులు కోరినప్పటికీ వాటిని పెడచెవిన పెట్టి ఏకపక్షంగా బలవంతంగా అశాస్త్రీయ విద్యా విధానాన్ని అమలు చేయాలని ప్రయత్నించడం వల్ల బలహీన వర్గాలకు చెందిన విద్యార్థులు విద్యకు దూరమయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్, విద్యార్థి నాయకుడు జార్జిరెడ్డి ఆశించినట్టుగా ప్రజాస్వామిక, ప్రజాతంత్ర, శాస్త్రీయ విద్యా విధానం అమలు కావడం లేదు, అమలు చేసే పరిస్థితులు కూడా లేవు. అమలు చేయాలని అడిగే విద్యార్థిలోకం కూడా నేడు బలంగా లేదు. అయినా నిరుత్సాహ పడనవసరం లేదు. ప్రజాస్వామిక, మానవీయ విలువలు పెంపొంది ఆదర్శవంతమైన సమాజం రూపుదిద్దుకోవాలంటే అంబే డ్కర్, జార్జిరెడ్డిల ఆశయాలు నెరవేర్చే అవకాశం ప్రగతి శీలులందరికీ ఉంటుంది. చదువే ఆయుధంగా ప్రపంచ మేధావిగా గుర్తింపు పొంది బడుగువర్గాల బాగోగుల కోసం నిరంతరం శ్రమిస్తూ అవిరళ కృషి చేసిన అంబేడ్కర్ జీవితాన్ని; అన్యాయాలకు అక్రమానికి వ్యతిరేకంగా రాజీలేని పోరాటం చేసే స్వభావం, తప్పులేనప్పుడు ఎవరినైనా ఎది రించే సత్తా, తోటి వారి కోసం తన ప్రాణాలను సైతం అర్పించే త్యాగగుణం, సమ సమాజం కోసం పరితపించే మనస్తత్వం గల జార్జిరెడ్డి పంథాను ఆదర్శంగా తీసుకుని అనుసరించాలి. జార్జిరెడ్డి ఆందోళన , పోరాటాలతోపాటు నిరంతర అధ్యయనశీలిగా గడిపారు. పాతికేళ్ల జీవితంలో ప్రపంచ విప్లవాలను పట్టుదలతో పరిశీలించి విప్లవ మార్గాన్ని అనుసరించారు. ఆల్బర్ట్ ఐన్స్టీన్ వంటి ప్రజ్ఞ కలిగిన అపర మేధావి అతడు. భౌతిక శాస్త్రంలో గోల్డ్ మెడల్ సాధించి స్కాలర్ అయిన జార్జి రెడ్డి జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకొని, అంబేడ్కర్ ప్రబోధించిన విలువలతో నేటి యువత సామాజిక ప్రజా సమస్యల పట్ల అవగాహన పెంచుకోవాలి. శాస్త్రీయ విద్యా విధానం కోసం, ప్రజాతంత్ర విద్య కోసం పోరాడాలి. ఈ ఇద్దరు వీరులకు మనం ఇవ్వగలిగిన నిజమైన, ఘనమైన నివాళి ఇదే! తండ సదానందం వ్యాసకర్త టి.పి.టి.ఎఫ్. రాష్ట్ర కౌన్సిలర్ మొబైల్: 99895 84665 -
‘మూల’ సంస్కృతికి రక్ష అంబేడ్కరిజం
ప్రకృతి నుంచి నేర్చుకొంటూ ఎక్కడికక్కడ మానవ సమూహాలు తమవైన సంస్కృతులను అభివృద్ధి చేసుకున్నాయి. సాధారణంగా ఆహారావసరాలు తీర్చగలిగే నదీలోయల్లో విభిన్న సాంస్కృతిక విశిష్టతలతో కూడిన నాగరికతలు రూపుదిద్దుకొంటాయి. మన గోదావరి, కృష్ణా వంటి నదీలోయల్లో విలసిల్లిన ‘మూల సంస్కృతి’ ఇలా అభివృద్ధి చెందినదే. ఇక్కడి మూలవాసులు ఏ ప్రకృతి వనరులను ఉపయోగించుకుని వ్యవసాయం, టెక్నాలజీలను అభివృద్ధి చేసుకున్నారో... అవే ప్రకృతి శక్తులను దేవుళ్లుగా పూజించారు దేశం బయటి నుంచి వచ్చిన ఆర్యులు. వారే ఇక్కడివారిపై ‘రాక్షసులు’ అని ముద్రవేశారు. ఆ వైదిక సంస్కృతీ వాహకులు ఇప్పటికీ మూలవాసుల సంస్కృతిని కబళించే ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. భారతదేశం ఈనాడు సామాజిక, సాంస్కృతిక, ఆర్థిక ఘర్షణల్లో ఉంది. భారత రాజ్యాంగాన్ని ఉల్లంఘించే శక్తుల విజృంభణే ఇందుకు కారణం. ముఖ్యంగా ఆర్ఎస్ఎస్, విశ్వ హిందూ పరిషత్ వంటి మతతత్త్వ శక్తులు రాజ్యాంగేతర జీవనాన్ని కొనసాగిస్తూ... దానిని దేశం మీద రుద్దాలనే తాపత్ర యంలో ఉన్నాయి. కారణం వారు స్వాతంత్య్రానికి ముందు నుంచీ భారతదేశ సాంస్కృతిక, సాంకేతిక వ్యవస్థలకు విరోధులు కావడమే. నిజానికి భారతదేశ మూలాలు భౌతికవాద, హేతువాద, తాత్వికవాద భావజాలంలో ఉన్నాయి. భౌతిక వాదం, జీవశాస్త్రం, మానవ పరిణా మవాదాన్ని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సమన్వయించి హిందూ ప్రత్యా మ్నాయ వాదాన్ని రూపొందించారు. అందులో తత్త్వ శాస్త్రానికి ప్రాధాన్యమిచ్చి ఆధ్యాత్మిక వాదం ఒక ఊహాత్మక వైయక్తిక భావ జాలం నుండి రూపొందిందేననీ, అందుకే వేలకొద్ది దేవుళ్ళు భారత దేశంలో సృష్టించబడ్డారనీ ఆయన చెప్పారు. ఎంఎన్ రాయ్ తన ‘మెటీరియలిజం’ గ్రంథంలో శాస్త్రీయ భావ జాల చారిత్రక దృక్పథం గురించి వివరిస్తూ... భారతదేశమే భౌతిక తత్త్వ శాస్త్రాన్ని ప్రపంచానికి అందించిందని నొక్కి వక్కాణించారు. భారతీయ మూలవాసులు భౌతికవాద జీవులనీ; వారు నిçప్పునూ, నీరునూ, గాలినీ, శూన్యాన్నీ జీవితానికి అన్వయించుకున్న మహోన్నత శాస్త్రవేత్తలనీ ఆయన శాస్త్రీయంగా నిరూపించారు. మరీ ముఖ్యంగా సింధు నాగరికతలో వచ్చిన నదీ నాగరికత సంస్కృతి నుండి నదులకు కాలువలు నిర్మించే బృహత్తరమైనటువంటి ఇంజనీరింగ్ను దళితులు కనిపెట్టారు. అంబేడ్కర్ దళిత బహుజనులు ‘మొదటి ఇరిగేషన్ ఇంజ నీర్లు’ అని చెప్పారు. అందుకే భారతదేశ వ్యాప్తంగా సింధు, గంగ, బ్రహ్మపుత్ర, గోదావరి, కృష్ణా, కావేరి, సువర్ణ రేఖ, మహానది, పెన్నా, మహి, సబర్మతి, నర్మదా, తపతి వంటి ఎన్నో నదులకు ఆనకట్టలు కట్టి నదీ నాగరికతలనూ, వ్యవసాయ సంస్కృతినీ నిర్మించారు. ఈ నదులన్నింటినీ వైజ్ఞానిక దృష్టితో చూడకుండా దిగజార్చింది మత వ్యవస్థ. భారతదేశంలో అత్యుత్తమమైన నదుల్లో గోదావరి చాలా గొప్పది. ఈ నది ప్రవహించే ప్రాంతం ఎక్కువగా గుట్టలు, పర్వతాలు, లోయలు; ఎగువ, దిగువ ప్రాంతాలు; చిన్న చిన్న గుట్టలతో కూడి ఉంది. ఈ నది అంచుల్లో నివసించే వాళ్ళు గిరిజనులు, దళితులే. వారే ఈ నదీ వ్యవస్థను ఇప్పటికీ రక్షిస్తున్నారు. ఈ గోదావరి సంస్కృతికీ, హిందూ మత సంస్కృతికి సంబంధమే లేదు. సుమారు 1600 సంవత్సరాలు గోదావరి నదీ పరివాహక ప్రాంతాల్లో బౌద్ధ సంస్కృతి విలసిల్లింది. ఈ హిందూ వాద సంస్కృతి వచ్చిన తర్వాత ఈ నదీ నాగరికత మీద గొడ్డలి వేటు పడింది. గోదావరి తర్వాత గొప్ప సంస్కృతులు సృష్టించింది కృష్ణా నదీ పరివాహక ప్రాంతం. దీని పరీవాహక ప్రాతంలోనూ దళితులు, గిరిజ నులే అధికంగా జీవిస్తున్నారు. వీరే ఇక్కడ విలసిల్లిన సంస్కృతికి సృష్టికర్తలు. హిందూ సంస్కృతికీ, ఇక్కడి సంస్కృతికి కూడా ఎటువంటి సంబంధం లేదు. హిందూ సామ్రాజ్యవాదం నదీ సంస్కృతులను ధ్వంసం చేయాలనే పెద్ద ప్రయత్నంలో ఉంది. అంబేడ్కర్ అందుకే నదుల అనుసంధానానికి సంబంధించి ఉద్గ్రంథాలను రచించారు. ఆదివాసీల నుండీ, దళితుల నుండీ ఆయుధాలు ఉన్న అగ్ర వర్ణాల వారే భూమిని కొల్లగొట్టారని నిరూపించారు. అంబేడ్కర్ దళితుల, ఆదివాసీల జీవన సంస్కృతులన్నీ నదీ పరీవాహక వ్యవ సాయక అభివృద్ధిపై ఆధారపడి ఉంటాయని చెప్పారు. దీనికి తోడు సుదీర్ఘమైన సముద్ర తీర ప్రాంతంలో జీవిస్తున్న బెస్తలు, కొండల మీద గొర్రెలను మేపుకొని జీవిస్తున్న యాదవులు, తాటాకు కొట్టి గృహ నిర్మాణ సంస్కృతికి పునాదులు వేసిన గౌడలు, శెట్టి బలిజలు; వస్త్రాలు నేసి మానవ నాగరికతను కాపాడిన పద్మశాలీలు, దేవాంగులు, దళితులు... వీళ్లంతా కూడా నదీ నాగరికత సృష్టికర్తలే అని అంబేడ్కర్ చెప్పారు. మైనార్టీలపైనా, దళితులపైనా... ద్వేషం, మాత్సర్యం, క్రోధం కలిగి ఉండటం ఆర్ఎస్ఎస్ భావజాలంలో ప్రధానమైన అంశం. నిజానికి మైనారిటీలుగా చెప్పబడుతున్న ముస్లింలు కానీ, క్రైస్తవులు కానీ పరాయివారు కారు. హిందూమత అస్పృశ్యతను వారు భరించలేక ఇస్లాం మతాన్నీ, క్రైస్తవ మతాన్నీ తీసుకున్నవారే. ఆర్యులు మధ్య ఆసియా నుండి వచ్చారని రొమిల్లా థాపర్, డీడీ కోశాంబి, ఆర్ఎస్ శర్మ, బిపిన్ చంద్ర వంటి వారు తేల్చారు. ఆర్యులు మూల వాసులకు శత్రువులని అంబేడ్కర్ చెప్పారు. ఇకపోతే బౌద్ధం భారత ఉపఖండంలో జన్మించింది. సిక్కుమతం భారతదేశంలో పుట్టింది. ఆయా సందర్భాలలో చారిత్రకంగా వివిధ మతాలు స్వీకరించిన దళిత బహుజన మైనారిటీలను శత్రువులుగా చూడటం అశాస్త్రీయ విషయం. నిజానికి మూలవాసులైన దళితులు ఏవైతే ఉత్పత్తి సాధనాలుగా శాస్త్రీయ పరికరాలు కనిపెట్టారో వాటిని ఆర్యులు పూజించారు. అంటే మూలవాసుల కంటే వారు ఎంత వెనుక బడి ఉన్నారో మనకు అర్థం అవుతుంది. నాగరికతలో, మానవతలో, సౌజన్యంలో, ప్రేమలో, కరుణలో మూల వాసులది అద్వితీయమైన పాత్ర. ఆర్యులు మూలవాసుల సుగుణాలను అధ్యయనం చేయలేక పోయారు. మూలవాసులు ప్రకృతి వనరులను ఉపయోగించి నాగరి కతా నిర్మాణం చేస్తే... ఆర్యులు ఆ ప్రకృతి శక్తులను దేవుళ్లుగా కొలి చారు. వేదాల్లో ఉన్న దేవుళ్ళు అందరూ ఇందుకు ఉదాహరణ. మనిషి దేవుణ్ణి సృష్టించుకున్నాడు. కానీ ఆ దేవుడు మనిషి మీద ఆధిపత్యం వహిస్తున్నాడు. చివరకు మనిషిని బలిచ్చేవరకు ఈ మూఢ భక్తి పరిఢవిల్లింది. సాటి మనిషిలో ఉన్న జ్ఞానాన్నీ, హేతుభావాన్నీ నిరాకరించి దైవాధీన భావాన్ని అలవాటు చేసుకున్నాడు మానవుడు. తన తోటి మనిషిని ప్రేమించడం మానేసి, తను పూజించే దేవుణ్ణి కొనియాడమని బలవంతం చేశాడు. పూజించకపోతే వధించాడు. ఒక్కొక్క దేవుణ్ణి పూజించేవారు ఒక్కో సమూహంగా ఏర్పడ్డారు. ఇతర దేవుళ్లను పూజించే వారిని చంపడం ప్రారంభించారు. దీన్ని ‘దుష్ట శిక్షణ’ అన్నారు. వేదాల్లో తమ శత్రువులను చంపమని వాళ్ళ దేవత లను వేడుకొన్నారు ఆర్యులు. చివరకు దేవుళ్ళనే అవతార పురుషు లుగా కిందకు దించారు. మూలవాసులకు ‘రాక్షసులని’ పేరు పెట్టి వారిని హతమార్చటానికే ‘దశావతారాలు’ ఆవిర్భవించాయని ప్రచారం చేశారు. వేద కాలం నుంచే ఈ హననం, హత్యాకాండ, అణచివేత, దౌర్జన్యం, విధ్వంసం ప్రారంభమయ్యాయి. సంస్కృతిని, సంపదను మూలవాసులు సృష్టిస్తూ వెళ్లారు. ఆర్యుల వారసులు వీరిని వధిస్తూ, సంపదను ధ్వంసిస్తూ వెళ్లారు. ఈ చరిత్రను వక్రీకరించాలనే ఉద్దేశ్యంతోనే హిందూ మతవాద శక్తులు విద్యావ్యవస్థలో సిలబస్ను మార్చే ప్రయత్నం చేస్తున్నాయి. ఇందులో భాగంగానే ‘ద ఆరెస్సెస్: రోడ్మ్యాప్స్ ఫర్ ద 21సెంచరీ’ వంటి పుస్త కాలు విశ్వవిద్యాలయాల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం జరుగుతోంది. ఇకపోతే ఎన్నో విలువైన గ్రంథాలను హిందూత్వ శక్తులు నిరాక రించాలనీ, ధ్వంసం చేయాలనీ ప్రయత్నిస్తున్నాయి. కమ్యూనిస్టు భావాలకూ, సోషలిస్టు భావాలకూ, అంబేడ్కరిస్టు భావాలకూ భిన్నంగా వ్యవహరిస్తున్నారు. మూలవాసుల జీవన సంస్కృతులకు మూలమైన నదీ నాగరికతా సాంస్కృతిక విప్లవానికీ, రాజ్యాంగ మూల సూత్రాలకూ భిన్నంగా ఆ శక్తులు జీవిస్తున్నాయి. రాస్తున్నాయి. ప్రచారం చేస్తున్నాయి. అందుకే ఇప్పుడు అంబేడ్కర్ ఆలోచనలతో పునరుజ్జీవన ఉద్యమం, ప్రత్యామ్నాయ భావజాల ఉద్యమం ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది. అంబేడ్కర్ మార్గమే ఈనాటి సామాజిక జీవన సూత్రం కావాలి. డా‘‘ కత్తి పద్మారావు వ్యాసకర్త దళిత ఉద్యమ నేత ‘ 9849741695 -
తెలంగాణ: కొత్త సచివాలయ ప్రారంభానికి డేట్ ఫిక్స్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ కొత్త సచివాలయ ప్రారంభానికి ముహూర్తం ఖరారు అయ్యింది. శుక్రవారం సచివాలయ పనులను పర్యవేక్షించిన ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు.. ఈ మేరకు తేదీని వెల్లడించారు. ఏప్రిల్ 30వ తేదీన తెలంగాణ కొత్త సచివాలయం ప్రారంభించాలని తెలంగాణ సర్కార్ నిర్ణయించింది. అలాగే.. ఏప్రిల్ 14వ తేదీన అంబేద్కర్ జయంతి సందర్భంగా భారీ అంబేద్కర్ విగ్రహాన్ని, జూన్ 2వ తేదీన తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంలో అమరవీరుల స్థూపాన్ని ఆవిష్కరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. సచివాలయ పనులు దాదాపు ముగింపు దశకు చేరుకున్న విషయం తెలిసిందే. ఈ తరుణంలో సచివాలయ పనులను పర్యవేక్షించడంతో పాటు అక్కడి రోడ్లను సైతం ఆయన పరిశీలించారు. ఈ కార్యక్రమంలో సీఎస్తో పాటు పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
డా.బీఆర్ అంబేద్కర్ విగ్రహ పనులను పరిశీలించిన ఏపీ మంత్రులు
Pagination
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
తప్పక చదవండి
- అధికారం చేపట్టగానే అగ్నివీర్ రద్దు.. రాహుల్ కీలక వ్యాఖ్యలు
- కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలపై ప్రధాని సంచలన వ్యాఖ్యలు
- పెట్టుబడుల సునామీ.. టాటా మోటార్స్ కీలక నిర్ణయం
- హీరామండి హీరోయిన్.. వేలకోట్ల అధిపతిని పెళ్లాడిన భామ!
- సభలో గందరగోళం.. మధ్యలోనే వెళ్లిపోయిన రాహుల్, అఖిలేష్
- T20 WC Trophy: ఈ పొట్టోడిని గెలవడమే అందరి టార్గెట్
- నాణ్యతలేని ‘పతంజలి సోన్పాపిడి’.. ముగ్గురికి జైలు, జరిమానా
- మేమిద్దరం ఎక్కువగా కలిసుండము.. అందుకే! :నటి ఆసక్తికర వ్యాఖ్యలు
- RCB: అమెరికాలో అంబరాన్నంటిన సంబరాలు.. ఎందుకంత స్పెషల్?
- పరారీలో చింతమనేని.. పోలీసుల గాలింపు
Advertisement