గ్రేటర్లో టీడీపీకి మరో షాక్
హైదరాబాద్: గ్రేటర్ ఎన్నికల నేపథ్యంలో టీడీపీకి మరో షాక్ తగిలింది. ఆ పార్టీకి మాజీ మంత్రి విజయ రామారావు రాజీనామా చేశారు. గతంలో ఖైరతాబాద్ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన ఆయన మాజీ సీఎల్పీ నేత దివంగత పి.జనార్ధన్రెడ్డి(పీజేఆర్) పై గెలిచి మంత్రి అయిన సంగతి తెలిసిందే. అంతేకాక గతంలో సీబీఐ డైరెక్టర్గా విజయరామారావు పనిచేశారు. ప్రస్తుతం అధికార పార్టీ టీఆర్ఎస్లో విజయ రామారావు చేరతారనే ఊహాగానాలు బలంగా వినిపిస్తున్నాయి.
ఒకవేళ విజయ రామారావు టీఆర్ఎస్ పార్టీ లో చేరితే ఆపరేషన్ ఆకర్ష్ మరోసారి ఊపందుకున్నట్లే. జీహెచ్ఎంసీ ఎన్నికల హడావిడి మొదలైన నేపథ్యంలో ఆయా పార్టీల నుంచి అధికార టీఆర్ఎస్ లోకి భారీ వలసలు వచ్చే అవకాశం ఉంది. ఈ నెలాఖర్లో జీహెచ్ఎంసీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశాలు కనబడుతున్నాయి.