బలవంతంగా ఫ్లూయిడ్స్: జగన్ దీక్ష భగ్నం

బలవంతంగా ఫ్లూయిడ్స్: జగన్ దీక్ష భగ్నం - Sakshi


రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచాలంటూ గత ఐదు రోజులుగా ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి నిమ్స్ వైద్యులు బలవంతంగా ఫ్లూయిడ్స్ ఎక్కించారు. భారీ సంఖ్యలో పోలీసులను కూడా వార్డులోకి అనుమతించారు. పోలీసులతో పాటు నర్సులు కూడా వైఎస్ జగన్ చేతిని గట్టిగా పట్టుకుని మరీ ఫ్లూయిడ్స్ ఎక్కించారు.


అంతకుముందు బుధవారం అర్ధరాత్రి సమయంలో పోలీసులు జగన్ మోహన్ రెడ్డిని బలవంతంగా నిమ్స్ ఆస్పత్రికి తరలించారు. దీక్ష ఐదో రోజుకు చేరుకోగా, జగన్ ఆరోగ్య పరిస్థితి బాగా విషమించింది. వెంటనే ఫ్లూయిడ్స్ తీసుకోవాలని వైద్యులు సూచించినా, ఆయన నిర్ద్వంద్వంగా తిరస్కరించారు. రాత్రి పదిన్నర గంటల ప్రాంతంలో పోలీసులు భారీ సంఖ్యలో దీక్షా శిబిరం వద్దకు చేరుకున్నారు. జగన్ను ఆస్పత్రికి తీసుకెళ్తామని చెప్పినా ఆయన ససేమిరా అనడంతో బలవంతంగా నిమ్స్ కు తరలించారు. అయితే, పోలీసుల ప్రయత్నాలను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, జగన్ అభిమానులు తీవ్రంగా ప్రతిఘటించారు. కొడాలి నాని తదితరులు అడ్డుకునే ప్రయత్నం చేసినా, పోలీసులు ఆయనను బలవంతంగా అంబులెన్సులో ఎక్కించి దీక్షా ప్రాంగణం నుంచి తరలించారు.



నెల రోజుల వ్యవధిలో రెండు సార్లు దీక్ష చేయడం వల్ల ఆయన ఆరోగ్యం బాగా క్షీణించింది. సమైక్య దీక్ష మొదలు పెట్టి నూట అయిదు గంటలు దాటిపోయింది. జగన్ను మధ్యాహ్నం పరీక్షించిన వైద్యులు హార్ట్ బీట్ 72గా ఉందని తెలిపారు.  సుగర్ లెవల్స్ నిన్నటికీ ఈరోజుకు తగ్గిపోయాయని చెప్పారు. జగన్ షుగర్‌ లెవల్స్ 54కు పడిపోయినట్లు,  బీపీ 120/90, కీటోన్స్‌ 4+ గా ఉన్నట్లు వివరించారు.  శరీర అవయవాలు దెబ్బతినే అవకాశం ఉందని   హెచ్చరించారు. ఏ క్షణంలోనైనా ఆయన అపస్మారక స్థితిలోకి వెళ్లే ప్రమాదం ఉందని డాక్టర్ హెచ్చరించారు. ఈ పరిస్థితులలో ఆయన దీక్ష విరమించడం మంచిదని సలహా ఇచ్చారు. అభిమానులు కూడా ఆయన చేత దీక్ష విరమింపజేసేందుకు కృషి చేయాలని కోరారు.



ఈ నేపధ్యంలో సతీమణి భారతి, మామ గంగిరెడ్డి వచ్చి జగన్ను పరామర్శించారు. ఆయన ఆరోగ్యం క్షీణించిడం పట్ల వారు ఆందోళన వ్యక్తం చేశారు. జగన్ ఆరోగ్యం పట్ల రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, బిజెపి జాతీయ అధ్యక్షుడు రాజ్నాథ్ సింగ్ దగ్గర నుంచి జాతీయ నాయకులు, పార్టీ నేతలు, బంధువులు, కార్యకర్తలు, అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీక్ష విరమించాలని కోరుతున్నారు.  ఆయన మాత్రం ససేమీరా అన్నారు. సమైక్య రాష్ట్రం కోసం దీక్ష కొనసాగిస్తానని చెప్పారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top