ప్రజాపంపిణీ అస్తవ్యస్తం.. | Sakshi
Sakshi News home page

ప్రజాపంపిణీ అస్తవ్యస్తం..

Published Sat, Mar 7 2015 9:04 AM

improper supply going on ration shops in nellore district

- తేదీ6 దాటిన చౌకదుకాణాలకు చేరని రేషన్
- ఈ-పాస్‌ను వ్యతిరేకిస్తున్న డీలర్లు
- కోర్టును ఆశ్రయించిన డీలర్లు
- ఇబ్బందుల్లో లబ్ధిదారులు


నెల్లూరు(రెవెన్యూ): ప్రజాపంపిణీ వ్యవస్థను గాడిలో పెట్టేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న ఈ-పాస్ విధానం అమలులో జాప్యం కారణంగా లబ్ధిదారులు రేషన్ అందక ఇబ్బందులు పడుతున్నారు. నెల్లూరు నగరంలో 1వ తేదీ నుంచి ప్రారంభించాల్సిన ప్రజాపంపిణీ ప్రక్రియ 6వ తేదీదాటినా ప్రారంభం కాలేదు. ఎంఎల్‌ఎస్ పాయింట్ల నుంచి రేషన్ ఇప్పటి వరకు చౌకధర దుకాణాలకు చేరలేదు. ఈ-పాస్ విధానాన్ని వ్యతిరేకిస్తున్న డీలర్లు రేషన్ దుకాణాల్లోకి అన్‌లోడ్ చేసుకోవడంలేదు. ఈ-పాస్ విధానాన్ని రేషన్ దుకాణాలలో అమలు చేసి, దానిపై డీలర్లకు పూర్తిస్థాయిలో అవగాహన కల్పించిన తర్వాతే ప్రక్రియను ప్రారంభించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డీలర్లు డిమాండ్ చేస్తున్నారు. ఈ-పాస్ విధానాన్ని వ్యతిరేకిస్తు డీలర్లు కోర్టును ఆశ్రయించారు.

జిల్లాలో 1,874 చౌకధర దుకాణాలు ఉన్నాయి. 8.24 లక్షల రేషన్‌కార్డుదారులు ఉన్నారు. ప్రతి నెల జిల్లాలో 18 ఎంఎల్‌ఎస్ పాయింట్ల నుంచి రేషన్ దుకాణాలకు సరఫరా చేస్తున్నారు. రేషన్ లో అక్రమాలను అరికట్టేందుకు పౌరసరఫరాల శాఖ ఈ-పాస్ విధానాన్ని ప్రారంభించింది. ముందు నుంచి ఈ విధానాన్ని డీలర్లు వ్యతిరేకిస్తున్నారు. జిల్లాలో మొదటి విడతలో కార్పొరేషన్, మున్సిపాలిటీల్లో ఈ-పాస్ విధానం ద్వారా రేషన్ పంపిణీ చేయాలని రాష్ట్ర అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. ముందస్తుగా పట్టణ ప్రాంతాల్లోని 350 చౌకదుకాణాల్లో ఈ-పాస్ యంత్రాలు ఏర్పాటు చేసి రేషన్ పంపిణీ చేయాలని ఉత్తర్వులు జారీచేశారు. జిల్లాకు 120 ఈ-పాస్ మిషన్లు రావడంతో అధికారులు ఇబ్బందుల్లోపడ్డారు. 750 రేషన్‌కార్డులకు పైగా ఉన్న దుకాణాల్లో ఈ-పాస్ మిషన్లు ఏర్పాటు చేసేలా చర్యలు చేపట్టారు. జిల్లాలో ఉన్న రేషన్ దుకాణాల్లో పూర్తిస్థాయిలో ఈ-పాస్ విధానాన్ని అమలుచేయాలని డీలర్లు డిమాండ్ చేశారు. ఈ విషయంపై టీడీపీ నాయకులు, ఎమ్మెల్యేలతో సిఫార్సులు చేయించారు. అధికారులు సిఫార్సులను పట్టించుకోకపోవడంతో డీలర్లు కోర్టును ఆశ్రయించారు. ఈ-పాస్ మిషన్లలో డేటా అప్‌లోడ్ చేయడం, సిమ్‌కార్డులు ఇవ్వడంలో జాప్యం జరిగింది. నెల్లూరు నగరం, రూరల్ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన 30కి పైగా ఈ-పాస్ మిషన్లలో అప్‌డేట్ చేయలేదు. ఈ-పాస్ విధానం అమలులో అనేక లోపాలు ఉన్నాయి. వాటిని పరిష్కరిస్తేనే తాము రేషన్ డౌన్‌లోడ్ చేసుకుంటామని డీలర్లు ఎదురుతిరిగారు.

ఎంఎల్‌ఎస్ పాయింట్ల నుంచి సరఫరా చేస్తున్న బియ్యం తూకంలో తేడాలు వస్తున్నయని దాంతో డీలర్లు నష్టపోవాల్సి వస్తుందని ఈ సమస్యకు పరిష్కారం చూపేంతవరకు రేషన్ దింపుకునేదిలేదని డీలర్లు భీష్మించుకుకూర్చున్నారు. అధికారులు, డీలర్ల మధ్య కార్డుదారులు ఇబ్బందులు పడుతున్నారు. నిత్యం చౌకదుకాణానికి రావడం షాపు తీయకపోవడంతో వెనుతిరుగుతున్నారు. ప్రతి నెల 1 నుంచి 15వ తేదీ వరకు రేషన్ పంపిణీ చేయవలసి ఉంటుంది. డీలర్లు మాత్రం స్టాక్ రాలేదని 5 నుంచి 15వ తేదీ వరకు రేషన్ పంపిణీ చేస్తున్నారు. ఇచ్చే 10 రోజుల్లో రెండు శనివారాలు సెలవు రోజులు కాగా, మిగిలిన 8 రోజులు మాత్రమే రేషన్ పంపిణీ చేస్తారు. సమస్యలను పరిష్కరించి త్వరగా రేషన్ పంపిణీ చేసేలా అధికారులు చర్యలు తీసుకోవాలని కార్డుదారులు కోరుతున్నారు.

రేషన్ పంపిణీ జరిగేలా చర్యలు తీసుకుంటాం :

ఈ-పాస్ మిషన్లు ఏర్పాటు చేసిన రేషన్ దుకాణాల్లో సరకుల పంపిణీ జరిగేలా చర్యలు తీసుకుంటాం. డేటా అప్‌డేట్ చేయడం త్వరగా పూర్తిచేసేలా చర్యలు తీసుకుంటాం. ప్రస్తుతం 120 చౌకదుకాణాల్లో ఈ-పాస్ మిషన్లు ఏర్పాటు చేశాం. వచ్చేనెలలో మిగిలిన చౌకదుకాణాల్లో ఈ-పాస్ మిషన్లు ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకుంటాం.
         -సంధ్యారాణి, డీఎస్‌ఓ


 

Advertisement
Advertisement