మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు
Breaking News
గవర్నర్ తమిళిసైతో సీఎం కేసీఆర్ భేటీ
Published on Thu, 08/24/2023 - 16:20
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాజకీయాల్లో గురువారం ఆసక్తికరమైన పరిణామం ఒకటి చోటుచేసుకుంది. రాజ్భవన్కు వెళ్లిన ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు.. అటుపై గవర్నర్ తమిళిసై సౌందరరాజన్తో ప్రత్యేకంగా భేటీ కావడం ఆసక్తిని రేకెత్తించింది.
ఎమ్మెల్సీ పట్నం మహేందర్రెడ్డి కేబినెట్ మంత్రిగా ప్రమాణ స్వీకార కార్యక్రమం ఉండడంతో సీఎం కేసీఆర్ రాజ్భవన్కు వెళ్లారు. అక్కడ సీఎస్తో పాటు రాజ్భవన్ అధికారులు ఆయనకు స్వాగతం పలికారు. ఆపై ఆయన గవర్నర్తో భేటీ అయ్యారు. అయితే భేటీ సారాంశం అధికారకంగా బయటకు రాకపోయినా..
గవర్నర్తో ప్రత్యేక భేటీలో.. పెండింగ్లో ఉన్న గవర్నర్ కోటా ఎమ్మెల్సీలపై చర్చ జరిగినట్లు సమాచారం. అంతేకాదు.. పెండింగ్లో ఉన్న బిల్లులపైనా సీఎం కేసీఆర్ గవర్నర్తో చర్చించినట్లు తెలుస్తోంది. దాదాపు 20 నిమిషాల భేటీ తర్వాత.. పట్నం ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది. ఆపై సీఎం కేసీఆర్, కేబినెట్తో కలిసి గవర్నర్ గ్రూప్ ఫొటో దిగారు.

ఇదిలా ఉంటే.. బీఆర్ఎస్ ప్రభుత్వానికి, గవర్నర్ తమిళిసైకి మధ్య నెలకొన్న గ్యాప్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అధికారిక కార్యక్రమాలకు సైతం గవర్నర్ను ఆహ్వానించకపోవడం, ఆ చర్యపై ఆమె బహిరంగంగానే అసంతృప్తి వెల్లగక్కుతుండడం చూస్తున్నాం. అదే సమయంలో ఆమె ముఖ్యమైన బిల్లులనూ పెండింగ్లో పెడుతూ వస్తున్నారు.
Tags : 1