Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @పలమనేరు (చిత్తూరు జిల్లా)
Breaking News
అన్నీ బీజేపీ గుప్పిట్లోనే.. మాకు యాత్ర తప్ప మరో మార్గం లేదు
Published on Sat, 10/01/2022 - 07:10
సాక్షి, బెంగళూరు: చట్ట సభలు, ప్రసార, ప్రచార మాధ్యమాలు తదితర వ్యవస్థలను తమ గుప్పిట్లో పెట్టుకుని ప్రతిపక్షాల గొంతుకను అణచివేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తుండడంతో తమకు పాదయాత్ర తప్పలేదని ఏఐసీసీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తెలిపారు. యాత్ర శుక్రవారం తమిళనాడులోని గుడలూర్ నుంచి చామరాజనగర్ జిల్లా గుండ్లుపేట వద్ద కర్ణాటకలో ప్రవేశించింది. గుండ్లపేటలోని అంబేడ్కర్ భవన్ మైదానంలో జరిగిన ర్యాలీలో రాహుల్ మాట్లాడారు.
కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు పాదయాత్ర ఎందుకు అనే ప్రశ్న తమకు అడుగడుగునా ఉత్పన్నమవుతోందని రాహుల్ చెప్పారు. ప్రజాస్వామ్యంలో మీడియా, పార్లమెంట్, అసెంబ్లీ వంటివి ఉన్నాయని, అయితే అక్కడ ఎక్కడా తమ వాణి వినిపించకుండా ప్రభుత్వం అడ్డుకుంటోందని చెప్పారు. పార్లమెంట్లో తాము మాట్లాడుతుండగా మైక్ బంద్ చేస్తున్నారని, అసెంబ్లీల్లోనూ అదే పరిస్థితి ఉందన్నారు. మీడియాను సైతం అధికార పార్టీ గుప్పిట్లో పెట్టుకుందన్నారు.
వారి చర్యలకు నిరసనగా ఆందోళన చేపడితే అరెస్టులు చేస్తున్నారని, తమకున్న ఏకైక మార్గం ప్రజల ముందుకు వెళ్లి వారితో కలసి అడుగు వేయడమేనని చెప్పారు. తమ యాత్రను ఎవరూ అడ్డుకోలేరన్నారు. కర్ణాటకలోజరిగే ఈ పాదయాత్రలో ధరల పెంపు, అవినీతి, నిరుద్యోగం వంటి సమస్యల గురించి ప్రజలు తమ బాధలను చెప్పుకుంటున్నారన్నారు.
చదవండి: రాహుల్ పాదయాత్ర.. వయా గాంధీభవన్
Tags