భారీగా తగ్గిన బంగారం ధర
Breaking News
మెల్బోర్న్లో అద్భుతంగా అష్టావధాన కార్యక్రమం
Published on Tue, 09/02/2025 - 17:20
మెల్ బోర్న్ (ఆస్ట్రేలియా) నగరంలో అష్టావధాన కార్యక్రమం అద్భుతంగా జరిగింది. జనరంజని రేడియో సంస్థ, శ్రీవేదగాయత్రి పరిషత్, సంగీత భారతీ న్యూజిలాండ్ తెలుగు సాంస్కృతిక సంస్థల ఆధ్వర్యంలో ఆగస్టు 30న నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆస్ట్రేలియా అవధాని, అవధానార్చనా భారతి, కవిరాజహంస, శారదామూర్తి తటవర్తి శ్రీకళ్యాణ శ్రీచక్రవర్తి చేసిన అవధానం అందర్నీ ఆకట్టుకుంది. ఈ అవధాన కార్యక్రమానికి న్యూజిలాండ్ ప్రప్రథమ శతకకర్తగా రికార్డులు సాధించిన డాక్టర్ తంగిరాల నాగలక్ష్మిగారు సంచాలకురాలిగా నిర్వహించారు.

సమస్య, దత్తపది, వర్ణన, నిషిద్ధాక్షరి, న్యస్తాక్షరి, ఆశువు, కృతిపద్యం, చిత్రానికి పద్యం, అప్రస్తుత ప్రసంగం అనే అంశాలతో ఉత్కంఠతో సాగిన ఈ అష్టావధానం ప్రేక్షకులను ఆద్యంతం ఆకట్టుకుంది. ఈ కార్యక్రమం ఉన్నత సాహిత్య ప్రమాణాలతో కొనసాగింది. తెలుగుభాషను, సాహిత్యాభిమానాన్ని పెంచడానికి ఇటువంటి కార్యక్రమాలను తరచు నిర్వహించాలని పలువురు ప్రేక్షకులు సూచించారు.
ఈ కార్యక్రమము ఆధ్యాత్మిక కేంద్రమైన సంకట మోచన మందిరంలో విచ్చేసిన ప్రముఖులు ఆసాంతం వీక్షించి అవధాని గారిని, సంచాలకులను, నిర్వాహక సంస్థలను అభినందిస్తూ, తెలుగు సాంస్కృతిక కార్యక్రమాలకు తగిన ప్రోత్సాహాన్ని కల్పించారు. అప్రస్తుత ప్రసంగంలో పాల్గొన్న 11 ఏళ్ళ చిరంజీవులు కృష్ణ సుహాస్ తటవర్తి ధ్రువ్ అకెళ్ళ అప్పటికప్పుడే అద్భుతమైన ప్రశ్నల వర్షం కురిపించడం అవధానాలలోనే ప్రత్యేకంగా నిలిచింది. కృతిపద్యము అనే అంశంలో చిన్నారులు గాయత్రి నందిరాజు, తన్వి వంగల సభాసదుల మనసులను చూరగొన్నారు. సాంకేతిక సహకారం శరణ్ తోట అందించారు.
(చదవండి: YSR Vardhanthi: విదేశాల్లో వైఎస్సార్కు ఘన నివాళులు)
Tags : 1