భువనగిరిలో ఉద్రిక్తత ఎమ్మెల్యే, సీఎం రేవంత్ ఫ్లెక్సీపై నల్ల రంగు
Breaking News
Karnataka Assembly Elections 2023: కర్ణాటకలో మాదే విజయం
Published on Mon, 04/24/2023 - 05:22
సాక్షి, బళ్లారి/విజయపుర: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో తాము ఘన విజయం సాధించబోతున్నామని, 224 స్థానాలకు గాను 150 స్థానాలు కచ్చితంగా గెలుచుకుంటామని కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీ ధీమా వ్యక్తం చేశారు. ఆయన ఆదివారం కర్ణాటకలోని విజయపురలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. శివాజీ సర్కిల్ నుంచి కనకదాస సర్కిల్ వరకూ జరిగిన భారీ రోడ్డు అనంతరం ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ‘40 పర్సెంట్ బీజేపీ సర్కారు’కు ఈ ఎన్నికల్లో 40 సీట్లు మాత్రమే వస్తాయని జోస్యం చెప్పారు. ప్రధాని మోదీతోపాటు బీజేపీ నాయకులు 12వ శతాబ్దపు సంఘ సంస్కర్త బసవణ్ణ బోధనల గురించి మాట్లాడుతున్నారు గానీ వాటిని ఏమాత్రం ఆచరించడం లేదని రాహుల్ ఆక్షేపించారు.
బసవేశ్వరుడికి రాహుల్ నివాళులు
సంఘ సంస్కర్త బసవేశ్వరుడి జయంతి సందర్భంగా రాహుల్ గాంధీ ఆదివారం కర్ణాటక రాష్ట్రం బాగల్కోట జిల్లాలోని కూడల సంగమంలోని బసవణ్ణ సమాధిని దర్శించుకున్నారు. నివాళులర్పించారు. కూడల సంగమంలో సంగమనాథ దేవాలయాన్ని దర్శించుకుని విశేష పూజలు చేశారు. నుదుటిన విభూతి ధరించారు. విశ్వగురు బసవణ్ణ సమసమాజ స్థాపన కోసం కృషి పడ్డారని, ఆనాడే చట్టసభ ద్వారా అన్ని వర్గాల ప్రజలను అందలమెక్కించాలని తపనపడ్డారని రాహుల్ కొనియాడారు. సమాజాన్ని సన్మార్గంలో నడిపించడానికి బసవణ్ణ చేసిన కృషి ప్రశంసనీయమని పేర్కొన్నారు. అనంతరం అసెంబ్లీ ఎన్నికల ప్రచారం గురించి కాంగ్రెస్ నేతలతో రాహుల్ చర్చించారు. హుబ్లీకి వెళ్లి ఇటీవల కాంగ్రెస్లో చేరిన మాజీ సీఎం జగదీశ్ శెట్టర్తో మాట్లాడారు.
Tags : 1