సీఎం రేవంత్ మార్పు ఖాయం? BRS రాకేష్ కుమార్ షాకింగ్ కామెంట్స్
Breaking News
నరవణే పుస్తక వివాదం.. పెంగ్విన్ కీలక ప్రకటన
Published on Tue, 02/10/2026 - 11:59
ఢిల్లీ: నరవణే పుస్తకం రాజకీయ దుమారం రేపుతోంది. ఈ బుక్పై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మరోసారి వ్యాఖ్యలు చేశారు. ‘‘తన బుక్ అందుబాటులోకి వచ్చిందని నరవణె చెప్పారు. బుక్ విడుదలపై నరవణే అయినా అబద్ధం చెప్పాలి.. లేకపోతే పెంగ్విన్ అయినా అబద్ధం చెప్పాలి. మాజీ ఆర్మీ చీఫ్ అబద్ధం చెబుతున్నారని అనుకోను’’ అంటూ రాహుల్ వ్యాఖ్యానించారు.
కాగా, ఆర్మీ మాజీ చీఫ్ ఎం.ఎం.నరవణె పుస్తకం ఉదంతంపై లోక్సభలో కొనసాగుతోంది. ఆర్మీ మాజీ చీఫ్ ఎం.ఎం.నరవణె పుస్తకంలోని అంశాలను ప్రస్తావించేందుకు విపక్ష నేత రాహుల్గాంధీ ప్రయత్నించడం.. అందుకు మంత్రులు రాజ్నాథ్సింగ్, అమిత్ షా తీవ్ర అభ్యంతరం తెలపడం రగడకు దారితీసింది. నాటినుంచి సభలో ఆందోళనలు మినహా కార్యకలాపాలేవీ సాగడం లేదు.
పెంగ్విన్ ఏం చెప్పిందంటే?
ఇదిలాఉండగా.. నరవణే పుస్తక వివాదంపై పెంగ్విన్ సంస్థ వివరణ ఇచ్చింది. మాజీ ఆర్మీ చీఫ్ జనరల్ ఎం.ఎం. నరవణే రాసిన జ్ఞాపకాల సంకలనం 'ఫోర్ స్టార్స్ ఆఫ్ డెస్టినీ'పై పెంగ్విన్ రాండమ్ హౌస్ ఇండియా కీలక ప్రకటన విడుదల చేసింది. ఈ పుస్తక ప్రచురణకు సంబంధించి తమకే ప్రత్యేక హక్కులు ఉన్నాయని, ఇది ఇప్పటివరకు ఏ రూపంలోనూ అధికారికంగా విడుదల కాలేదని స్పష్టం చేసింది.
ముద్రణ రూపంలో గానీ, డిజిటల్ రూపంలో గానీ ఈ పుస్తకాన్ని తాము ఇప్పటివరకు పంపిణీ చేయలేదని.. డిజిటల్ కాపీలు చట్టవిరుద్ధమని, అవి కాపీరైట్ ఉల్లంఘన కిందకు వస్తాయని సంస్థ హెచ్చరించింది. ఇలాంటి అనధికారిక పంపిణీపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపింది.
ఢిల్లీ పోలీసుల విచారణ
మరోవైపు, అధికారికంగా విడుదల కాకముందే ఈ పుస్తకంలోని అంశాలు బయటకు ఎలా వచ్చాయనే దానిపై ఢిల్లీ పోలీసులు ఎఫ్ఆర్ఐ నమోదు చేశారు. స్పెషల్ సెల్ ఈ వ్యవహారంపై దర్యాప్తు చేస్తోంది.
Tags : 1