విరోష్ వెడ్డింగ్ సూపర్ హిట్
Breaking News
విరోష్... సెలబ్రిటీ పెళ్లిళ్లలో ట్రెండ్ సెట్టర్..
Published on Wed, 03/04/2026 - 12:23
ఈ సంవత్సరంలో టాప్ హై ప్రొఫైల్ సెలబ్రిటీ ఈవెంట్ గా విజయ్ దేవరకొండ, రష్మిక ల వివాహం ‘ విరోష్’ను సినీ పండితులు అభివర్ణిస్తున్నారు అయితే అంతకు మించి విరోష్ అర్థవంతమైన వేడుకగా కూడా నిలుస్తోంది. ఇది సెలబ్రిటీ వేడుకలలో మనం ఇకపై చూడబోయే సరికొత్త సంప్రదాయాలకు నాందిగా మారనుంది.
స్టార్స్లో అరుదుగా కనిపించే మానవత్వాన్ని ప్రదర్శించిన ఈ జంట తమ ఆనందాన్ని ప్రైవేట్ ఉత్సవాలకు మించి విస్తరించారు, తమ ప్రయాణంలో తమకు మనస్ఫూర్తిగా మద్దతు ఇచ్చిన ప్రతీ ఒక్కరితో తమ ఆనందాన్ని పంచుకోవడం అందర్నీ ఆకట్టుకుంది. పెళ్లి చేసుకున్న నవదంపతులకు అందరూ కానుకలు ఇవ్వడం రివాజు. అయితే దీనికి భిన్నంగా ఈ జంట... నిరుపేదలకు తామే కానుకలు పంచి మనసులు గెలుచుకున్నారు.

నోరు తీపి చేశారు..
గత మార్చి 1న, హైదరాబాద్, ముంబై, ఢిల్లీ, చెన్నై, బెంగళూరు అహ్మదాబాద్తో సహా అనేక ఇతర ప్రధాన కేంద్రాలతో పాటు భారతదేశంలోని 23 నగరాల్లో వేలాది స్వీట్ బాక్స్లు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ప్రత్యేకంగా రూపొందించబడిన కస్టమ్–డిజైన్డ్∙కవర్లతో ప్యాక్ చేసిన స్వీట్ బాక్స్లు, కీలకమైన నగరాల మీదుగా అందంగా అలంకరించిన ట్రక్కుల ద్వారా పంపిణీ చేశారు, ప్రత్యేకంగా రూపొందించిన ‘‘వి అండ్ ఆర్’ ’ టీ–షర్టులు టోపీలు ధరించిన ఆన్–గ్రౌండ్ బృందాలు ప్రజలకు వ్యక్తిగతంగా స్వీట్లు అందించాయి, ఇది ఓ ప్రైవేట్ వేడుక ను పబ్లిక్ ఫెస్టివల్గా మార్చింది. అంతేకాకుండా ప్రతి స్వీట్ బాక్స్లో క్యుఆర్ కోడ్ ఏర్పాటు చేశారు, దీనిని స్కాన్ చేసి నేరుగా నవదంపతులకు ఆశీర్వాదాలు కూడా పంపవచ్చు.

ఆలయాల్లో... అన్నదానం...
అదే సమయంలో, అన్నదానం – ఆహారాన్ని పవిత్రంగా సమర్పించడం – భారతదేశంలోని అనేక దేవాలయాలలో నిర్వహిస్తున్నారు. ఈ ఆధ్యాత్మిక సేవ... ఆ దేవుళ్ల ఆశీర్వాదాలను కోరుతూనే తమ వంతుగా సమాజానికి తిరిగి ఇవ్వాలనే రష్మిక విజయ్ ల ఉద్దేశ్యాన్ని నొక్కి చెబుతుంది, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్ ఇతర రాష్ట్రాలలోని పదహారు దేవాలయాలలో ‘అన్నదానం‘ నిర్వహించారు. వీటిలో బెంగళూరులోని శివోహం ఆలయం, బృందావనంలోని శ్రీ శ్రీ కృష్ణ బలరాం మందిర్ వంటివి ఉన్నాయి.
తమ వివాహాన్ని ఒక ఖరీదైన వేదికకు మాత్రమే పరిమితం చేయకుండా దేశవ్యాప్తంగా ఉన్న నగరాలకు విస్తరించడం ద్వారా, ప్రముఖుల వివాహ వేడుక అర్ధాన్ని ఈ జంట పునర్నిర్వచించారు. ఇది కేవలం ఇద్దరు తారల మధ్య కలయిక మాత్రమే కాదు, సామూహిక ఆనందంతో మేళవించిన జాతీయ అనుభవంగా మార్చారు. నేషనల్ క్రష్ అనే బిరుదును ఆనందించడం మాత్రమే కాదు ఆ స్థాయి ఇచ్చిన వాళ్లను గుర్తుంచుకోవడం కూడా తనకు తెలుసని విజయ్ తోడుగా రష్మిక తెలియజెప్పారు. ‘ఈ దేశంలోని అందరు అందమైన ప్రజలకు, మీరు ఎల్లప్పుడూ మా ప్రయాణాలలో మా ప్రేమలో భాగమయ్యారు. మీ అందరికీ సన్నిహితంగా మా వివాహాన్ని జరుపుకోవడం మాకు నిజంగా సంతోషంగా ఉంటుంది’’ అంటూ వీరు సోషల్ మీడియాలో ఇచ్చిన తమ వివాహ ప్రకటన రికార్డులను బద్దలు కొట్టింది, ఆసియాలో అత్యధికులు లైక్ చేసిన పోస్ట్గా విరాట్ కోహ్లీ గత రికార్డును అధిగమించింది.

విద్యాదానం...
తెలంగాణలోని తుమ్మన పేటలో విద్యార్థుల కోసం స్కాలర్షిప్లను ఈ విరోష్ జంట ప్రకటించారు. పెళ్లి తర్వాత నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట డివిజన్లోని విజయ్ స్వస్థలాన్ని ఈ జంట సందర్శించారు, నిరుపేదలకు విద్యాదానం చేయడానికి తమ వంతు సాయం అందించారు.
దేవరకొండ ఛారిటబుల్ ట్రస్ట్ ద్వారా అందించిన ఈ స్కాలర్షిప్లు, ఈ ప్రాంతంలోని 44 ప్రభుత్వ పాఠశాలల్లోని 9, 10 తరగతుల విద్యార్థులకు ప్రయోజనం చేకూరుస్తాయి. ఆర్థిక సవాళ్లను ఎదుర్కొంటున్న టీనేజర్లకు సహాయం చేయడం వారి చదువును కొనసాగించడానికి ప్రోత్సహించడం, ముఖ్యంగా వారు కీలకమైన పాఠశాల పరీక్షలకు సిద్ధమవుతున్నప్పుడు వారికి ఆసరాగా నిలవడం ఈ కార్యక్రమ ప్రాథమిక లక్ష్యం.
తరచుగా ఆ గ్రామాన్ని సందర్శించి గ్రామాభివృద్ధి కోసం తమ వంతు సాయం చేస్తామ ని ఈ సందర్భంగా ఈ జంట జనం సాక్షిగా ప్రతిజ్ఞ చేశారు. స్కాలర్షిప్ కార్యక్రమం ప్రత్యేకతలను వివరిస్తూ, విజయ్ గ్రామస్తులను ఉద్దేశించి ప్రసంగించినప్పుడు జనంలో నుంచి వచ్చిన హర్షాతిరేకాలకు విజయ్ దేవరకొండ తల్లి మాధవి పొంగిపోయారు. మరి ఇది కదా పుత్రోత్సాహం అంటే...
మార్చి 4న హైదరాబాద్లో ఈ జంట రిసెప్షన్ వేడుక నిర్వహించనుంది. మరోవైపు సెప్టెంబర్లో విడుదల కానున్న ’రణబాలి’ చిత్రంలో రష్మిక విజయ్ ఇద్దరూ కలిసి కనిపించనున్నారు. గీత గోవిందం తర్వాత ఇది వారి మూడవ చిత్రం కాగా పెళ్లి తర్వాత వీరు కలిసి నటించిన తొలి చిత్రం కానుంది. తారలంటే తెరమీద నుంచి ఆనందం పంచేవారు మాత్రమే కాదు తమను ఆదరించిన సమాజానికి కృతజ్ఞత పంచేవారు కూడా అని నిరూపించిన వీరిద్దరికీ ప్రేక్షక దేవుళ్ల ఆశీర్వచనాలు ఎప్పుడూ ఉంటాయని ఉండాలని కోరుకుందాం.
Tags : 1