ఒప్పందం ఉల్లంఘిస్తే యుద్ధానికి రెడీగా ఉన్నాం
Breaking News
సమయం ఇవ్వండి.. సౌత్ ఫ్యాన్స్కు కయదు లోహర్ రిక్వెస్ట్
Published on Thu, 04/09/2026 - 10:42
డ్రాగన్ చిత్రంతో కోలీవుడ్కు ఎంట్రీ ఇచ్చిన ఈ అస్సామీ భామ కయాదు లోహర్. ఆ చిత్రం అనూహ్య విజయంతో ఈమె పేరు సినీ వర్గాల్లో మారుమోగింది. అంతే ఇతర భాషల్లోనూ అవకాశాలు రావడం మొదలెట్టాయి. మలయాళం, తెలుగు, కన్నడం, మరాఠి భాషల్లో నటిస్తున్నారు. ఈమె తెలుగులో నటించిన ఫంకీ చిత్రం ఇటీవల విడుదలైంది. ఆశించిన విజయాన్ని సాధించలేదు. ఇకపోతే మలయాళంలో నటించిన పళ్లిచటంబి చిత్రం త్వరలో తెరపైకి రానుంది.
ఇలా పలు భాషల్లో చుట్టేస్తున్న కయదు లోహర్(Kayadu Lohar) ఇటీవల ఒక భేటీలో పేర్కొంటూ తమిళంలో స్పష్టంగా మాట్లాడటం లేదే అని అడుగుతున్నారనీ, ఇప్పుడే ఒక్కో భాషల్లో చిత్రాలు చేస్తున్నానని, అయితే తాను దక్షిణాదికి చెందిన అమ్మాయిని కాదని అన్నారు. అయినా తనవల్ల అయినంత వరకూ ఒక్కో భాషను నేర్చుకోవడానికి యత్నిస్తున్నానని అన్నారు. ఏ భాషలో నటించినా, ఆ భాషలో మాట్లాడటమే ముఖ్యం అన్నారు. అందుకే ఇతర భాషలను నేర్చుకోవడానికి నూరు శాతం ప్రయత్నిస్తున్నానని చెప్పారు. కొంచెం సమయం ఇవ్వండి తమిళం, తెలుగు, మలయాళం తదితర దక్షిణాది భాషల్లో సరళంగా మాట్లాడతానన్నారు.
డ్రాగన్ చిత్రం తరువాత కోలీవుడ్లో వరుసగా నటించకపోవడానికి కారణం ఏమిటన్న ప్రశ్నకు తాను మంచి కథా చిత్రం కోసం ఎదురు చూస్తున్నానని, మంచి సక్సెస్ఫుల్ చిత్రంతో మళ్లీ వస్తానని చెప్పారు. డ్రాగన్ చిత్రంతో తమిళ ప్రేక్షకులు తనపై చూసిన ప్రేమాభిమానాలు చాలా ఎక్కువ అన్నారు. కాబట్టి వైవిధ్యభరిత కథా చిత్రాల్లో నటించి వారిని అలరించాలని కోరుకుంటున్నానన్నారు. కాగా తెలుగులో ఈ అమ్మడు నానికి జంటగా ది పారడైజ్ చిత్రంలో నటిస్తున్నారు. అదే విధంగా ఇంతకు ముందు తమిళంలో నటించిడానికి అంగీకరించిన ఇమ్మార్టల్, ఇదయం మురుళి చిత్రాలు విదుదల కావలసి ఉంది. కాగా నటుడు శింబుకు జంటగా ఆయన 49వ చిత్రంలో నటించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీనితో పాటు మరో మలయాళ చిత్రంలోనూ నటిస్తున్నారీ బ్యూటీ.
Tags : 1