పాలేరు, నాగార్జున సాగర్ ఆయకట్టుకు సాగునీరు విడుదల
Breaking News
రూ.వెయ్యి కోట్లతో శంకర్ కొత్త సినిమా!
Published on Sat, 07/12/2025 - 08:00
దర్శకుడు శంకర్ తెరకెక్కించిన ఇండియన్ 2, గేమ్ ఛేంజర్ రెండు చిత్రాలు భారీ డిజాస్టర్లుగా ముగిశాయి. దీంతో ఈ చిత్రాలకు సంబంధం ఉన్న వారందరికీ భారీ నష్టాలు వచ్చాయి. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, దర్శకుడు శంకర్ ఈ రెండు చిత్రాల ఫలితం గురించి ఒక్క మాట కూడా మాట్లాడలేదు. చాలా మంది నెటిజన్లు కూడా ఈ వైఫల్యాలకు శంకర్ బాధ్యత వహించాలని భావించారు. కానీ, ఆయన ఎక్కడా కూడా ఇంతవరకు నోరెత్తలేదు. గేమ్ ఛేంజర్ నిర్మాత దిల్ రాజు వంటి ఇతర సినీ ప్రముఖులు పరోక్షంగా దర్శకుడు శంకర్ను తప్పుబట్టారు. పేలవమైన అవుట్పుట్తో పాటు శంకర్లో సరైన ప్లానింగ్ లేకపోవడం వల్ల ఎక్కువ నష్టపోయినట్లు చెప్పారు. అలాంటి వ్యాఖ్యలు వైరల్ కావడంతో అతనిపై మరింత ట్రోలింగ్ పెరిగింది. అయితే, ఆయన తాజాగా మరో సినిమా గురించి మాట్లాడి అందరినీ ఆశ్చర్యపరిచారు.

శంకర్ తన తదుపరి చిత్రం తమిళ ఎపిక్ నవల ‘వెల్పరి’ ఆధారంగా తెరకెక్కిస్తానని చెప్పారు. అయితే, వరుసగా రెండు భారీ చిత్రాలతో ఆర్థిక నష్టాలను మిగిల్చిన ఆయనతో మరో సినిమా చేసేందుకు ఎవరు ముందుకొస్తారని అందరూ ఆలోచించారు. తాజాగా జరిగిన ఒక కార్యక్రమంలో 'వెల్పరి' సినిమా గురించి శంకర్ మాట్లాడారు. కొద్దిసేపటికే అవి ట్రోల్ కావడం జరిగింది. శంకర్ మాట్లాడుతూ.. ' రోబో సినిమా నా మునుపటి కలల ప్రాజెక్ట్. ఇప్పుడు, 'వెల్పరి' కూడా నా కలల చిత్రం. హాలీవుడ్ చిత్రాలు గేమ్ ఆఫ్ థ్రోన్స్, అవతార్ వంటి కొత్త టెక్నాలజీలను భారతీయ సినిమాలకు పరిచయం చేసే అవకాశం దీనికి ఉంది. 'వెల్పరి' ప్రాజెక్ట్ తమిళ సినిమాతో పాటు భారతీయ సినిమాకు గర్వకారణంగా మారే అవకాశం ఉంది. ఇది ప్రపంచ గుర్తింపును పొందగలదు. నా కల నిజమవుతుందని ఆశిస్తున్నాను.' అని ఆయన అన్నారు.
(ఇదీ చదవండి: ఛి…ఛీ.. అంటూ 'పవన్'పై ప్రకాష్ రాజ్ ఫైర్.. లక్షల్లో ట్వీట్లు)
అయితే, శంకర్ మాటలపై ట్రోల్స్ కూడా వస్తున్నాయి. ఒకప్పుడు దూరదృష్టి గల దర్శకుడిగా ఉన్నప్పటికీ, శంకర్ ఇప్పుడు వాస్తవికతకు దూరంగా ఉన్నట్లు కనిపిస్తున్నాడని చెబుతున్నారు. ఇండియన్2, గేమ్ ఛేంజర్ సినిమాలను చూస్తే గతంలో అనేక ఐకానిక్ చిత్రాలను అందించిన దర్శకుడు ఇతనేనా అనే సందేహం వస్తుంది. కోట్ల నష్టాలను మిగిల్చిన ఆయనతో సినిమా చేసేందుకు నిర్మాతలు ముందుకు వస్తారా..? హీరోలు శంకర్కు ఛాన్స్లు ఇస్తారా..? అనే కామెంట్లు చేస్తున్నారు.
శంకర్ ఇకనుంచైనా పాటల కోసం అధికంగా ఖర్చు చేయడం మానేసి.. కథ, స్క్రీన్ప్లేపై ఎక్కువ దృష్టి పెట్టాలని చాలామంది సూచిస్తున్నారు. గేమ్ ఛేంజర్ , ఇండియన్ 2 సినిమాల వల్ల కమల్ హాసన్తో పాటు రామ్ చరణ్ వంటి స్టార్ల ఖ్యాతి కూడా తీవ్రంగా దెబ్బతింది. అలాంటప్పుడు భారీ ఖర్చుతో కూడిన వల్పరి వంటి ప్రాజెక్ట్కు ఖచ్చితంగా ఒక స్టార్ హీరో అవసరం. కానీ శంకర్ ప్రస్తుత ఫామ్ను చూస్తే, ఏ అగ్ర నటుడు అతనితో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉంటాడో లేదో చూడాలి.
హీరో, నిర్మాతలు
'వెల్పరి' సినిమా కోసం కన్నడ స్టార్ యశ్ను శంకర్ సంప్రదించారని తెలుస్తోంది. సుమారు రూ. 1000 కోట్ల బడ్జెట్తో ఈ చిత్రం ఉంటుందని టాక్ వైరల్ అవుతుంది. అత్యంత ఖర్చుతో కూడుకున్న ఈ చిత్రాన్ని కరణ్ జోహార్, నెట్ఫ్లిక్స్ ఇండియా, పెన్ మీడియా సంస్థలు కలిసి నిర్మించే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. సు.వెంకటేశన్ రాసిన 'వెల్పరి' నవల సాహిత్య అకాడమీ అవార్డును దక్కించుకుంది. అత్యంత ప్రజాదరణ పొందిన నవలగా గుర్తింపు పొందింది. అందుకే శంకర్ ఈ చిత్రంపై ప్లాన్ చేస్తున్నారు.
Tags : 1