AP: దారుణంగా పెరిగిపోతున్న హత్యలు నెల్లూరులో ఏం జరిగిందంటే..
Breaking News
భారతీరాజా, రజనీకాంత్ మధ్య వివాదం ఏంటి? అసలేం జరిగింది?
Published on Wed, 06/10/2026 - 13:53
దిగ్గజ దర్శకుడు భారతీరాజా(84) మరణంతో కోలీవుడ్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన బుధవారం ఉదయం చెన్నైలోని ఆయన నివాసంలో తుదిశ్వాస విడిచారు. తమిళనాడు సీఎం విజయ్తో పాటు పలువురు సినీ, రాజకీయ ప్రముఖలు ఆయనకు నివాళులుల అర్పించారు. మరికొంతమంది సోషల్ మీడియా వేదికగా ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ ఎమోషనల్ అవుతున్నారు. ఈ క్రమంలో భారతీరాజాకు సంబంధించిన కొన్ని విషయాలు నెట్టింట వైరల్గా మారాయి. అందులో ప్రధానంగా సూపర్స్టార్ రజనీకాంత్తో ఆయనకు ఉన్న వివాదం గురించి చర్చిస్తున్నారు.
భారతీరాజా దర్శకత్వం వహించిన తొలిచిత్రం '16 వయదినిలే' (తెలుగులో 'పదహారేళ్ల వయసు') లో రజనీకాంత్ ప్రధాన పాత్ర పోషించాడు. 1977లో వచ్చిన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది. ఆ తర్వాత దాదాపు పదేళ్లు గ్యాప్ తీసుకొని కోడి పరాకుత్తు(1988) అనే మూవీతోనూ ప్రేక్షకులను అలరించారు. ఇలా రెండు సినిమాలు తీసినప్పటికీ విరిద్దరి మధ్య దాదాపు ఐదు దశాబ్దాలుగా సైద్ధాంతిక విభేధాలు ఉన్నాయి. రజనీకాంత్పై పలుమార్లు భారతీరాజా బహిరంగంగా విమర్శలు చేశారు. అసలు రజనీకాంత్ది అసలు తమిళనాడు కాదని.. ఆయన కర్ణాటక వ్యక్తి అంటూ ఆరోపణలు చేశాడు.

కావేరీ జలవివాదంతో మొదలు..
రజనీకాంత్, భారతీరాజాల మధ్య ఒప్పుడు మంచి అనుబంధం ఉండేది. అయితే 2002లో జరిగిన కావేరి జలవివాదమే వీరిద్దరిని దూరం చేసింది. అప్పట్లో కావేరి జలాల కోసం తమిళ నటీనటులంతా కర్ణాటకకు వ్యతిరేకంగా దీక్ష చేశారు. ఈ నిరసనలకు భారతీరాజా న్యాయకత్వం వహించారు. అయితే శాంతియుతంగా చేపట్టిన నిరసనలు కాస్త ఘర్షణకు దారి తీసింది. కొంతమంది పోలీసులపై దాడి చేశారు. ఈ దాడిని రజనీకాంత్ బహిరంగంగా ఖండించాడు. తమిళనటులు చేపట్టిన దీక్షకు కూడా మద్దతు ప్రకటించలేదు. అదే భారతీరాజా కోపానికి కారణం అయింది. కావేరీ ఉద్యమ కమిటీ కన్వినర్గా ఉన్న భారతీరాజా.. తమిళ ప్రజలకు రజనీకాంత్ ద్రోహం చేస్తున్నాడని బహిరంగంగా ఆరోపించాడు. ఆయనను సూపర్ స్టార్గా చేసిన తమిళప్రజలకు వెన్నుపోటు పొడిచాడంటూ తీవ్ర విమర్శలు చేశాడు. ఒకానొక దశలో అసలు రజనీకాంత్ తమిళవాడు కాదనీ, కర్ణాటకకు చెందిన వ్యక్తి అని ఆరోపించాడు.
రజనీ రాజకీయ ఎంట్రీపై కూడా..
ఇక రజనీకాంత్ రాజకీయాల్లోకి రాబోతున్నాడనే వార్తలు వచ్చినప్పుడు కూడా భారతీరాజా ఆయనపై విమర్శలు చేశాడు. తమిళనాడు రాజకీయాల్లో ఎవరైనా పాల్గొనవచ్చని, కానీ రాష్ట్ర నాయకత్వం మాత్రం తమిళనాడుకు చెందిన వారి చేతుల్లోనే ఉండాలని ఆయన వాదించారు. కొన్ని సందర్భాల్లో సూపర్స్టార్ పేరును నేరుగా ప్రస్తావించకుండా, రజనీకాంత్ రాజకీయ ప్రవేశం కోసం పెరుగుతున్న డిమాండ్ను భారతిరాజా తీవ్రంగా ఖండించాడు. రాజకీయాల్లోకి రావాలని బయటివారిని ప్రజలు 'యాచించకూడదు' అని సూచించారు. అలాగే 2018లో జరిగిన ఐపీఎల్ నిరసన వివాద సమయంలోనూ రజనీకాంత్ని ‘కర్ణాటక కాషాయ రాయబారి’అని విమర్శించాడు.
చివరిదశలో ఇలా..
భారతీరాజా ఎన్ని సార్లు విమర్శలు చేసినా రజనీకాంత్ మాత్రం ఆయనను ఎప్పుడు ఒక్క మాట అనలేదు. ఒకే ఒక్కసారి మాత్రం ఓ ఈవెంట్లో.. భారతీరాజాని నేను గొప్ప దర్శకుడు అని ఒప్పుకుంటాను, పొగుడుతాను కానీ ఆయన మాత్రం నన్ను నటుడిగా గుర్తించరు అని కౌంటర్ వేశారు రజనీకాంత్. భారతీరాజా కూడా తన మాటలతో కొన్ని సందర్భాల్లో రజనీకాంత్ని ఇబ్బంది పెట్టానని ఒప్పుకున్నాడు. అయితే తాను ఎన్ని మాటలు అన్నా..ఆయన ఒక్కసారి కూడా తిరిగి అనలేదని..అది అతని గొప్పదనం అని పొగిడాడు. ‘నేను అతడిని చాలా బాధపెట్టాను. కానీ అతను అదంతా మర్చిపోయి నాపై ఆప్యాయత చూపించాడు. అతనికి ప్రతీకార మనస్తత్వం లేదు. అతను గొప్ప వ్యక్తి’ అని ఓ ఇంటర్వ్యూలో భారతీరాజా అన్నాడు. అలా తమిళనాడులో భారతీరాజా – రజినీకాంత్ వివాదం చాలా ఏళ్ళు నడిచింది. చివరి దశలో మాత్రం భారతీరాజాని రజని పలుమార్లు కలుసుకొని ఒకర్నొకరు అభినందించుకున్నారు.
Tags : 1