Breaking News

తక్కువ కరెంట్‌తో ఎక్కువ కూలింగ్‌

Published on Thu, 06/11/2026 - 00:06

ఎల్‌ నినో నేపథ్యంలో వర్షాకాలం మొద లైంది. వర్షపాతం సాధారణ స్థాయికన్నా తక్కువగా ఉండగలదని భారత వాతావరణ పరిశోధనా శాఖ (ఐఎండీ) అంచనా. పసిఫిక్‌ సముద్రంలో రూపుదిద్దుకుంటున్న ఎల్‌ నినో పరిస్థితుల దృష్ట్యా, భారత్‌లో వర్షపాతం ఈసారి దీర్ఘకాలిక సగటు (ఎల్‌.పి.ఏ.)లో 90% మేరకు మాత్రమే ఉండగలదని భావిస్తున్నారు. ఎల్‌ నినో ఉష్ణ ధోరణులు తేమతో నిండిన పవనాలను బలహీనపరుస్తాయి. ఫలితంగా వర్షపాతం కొన్నిచోట్ల మరీ ఎక్కువ, కొన్నిచోట్ల మరీ తక్కువగా ఉంటుంది. దక్షిణాసియాలో సగటుకన్నా తక్కువ వర్ష పాతం ఎల్‌ నినో ప్రపంచ ప్రభావాలలో ఒకటిగా ప్రపంచ వాతా వరణ సంస్థ (డబ్లు్య.ఎం.ఓ.) పేర్కొంది. 

మారుతున్న వాతావరణ పరిస్థితి అనివార్యంగా కొన్ని సమస్యలను సృష్టిస్తుంది. దోమలు, ఈగల వంటి ద్వారా సోకే బ్యాక్టీరియా, వైరస్‌ల జబ్బులు మొదలవుతాయి. ఆహారం, నీటి లభ్యతపై ఒత్తిడి పెరుగుతుంది. విద్యుదుత్పాదన దెబ్బతింటుంది. ఇప్పటికే దేశంలోని అనేక ప్రాంతాల నుంచి వడగాడ్పులు, రాత్రిపూట కూడా ఉష్ణో గ్రతలు ఎక్కువగానే ఉండటానికి సంబంధించిన వార్తలు చూస్తు న్నాం. ఇవన్నీ కలిసి శీతలీకరణ సాధనాలు, పద్ధతుల వైపు ప్రజలు మొగ్గేటట్లు చేస్తాయి. ఫ్యాన్లు, డిజర్ట్‌ కూలర్లు, సంచార ఎయిర్‌ కండిషనర్లు (కార్లు, బస్సులు, రైళ్ళలో), చిల్లర్లు, శీతల గిడ్డంగులు వంటివాటికి గిరాకీ పెంచుతాయి. 

గృహాలు, ఆఫీసులు, ఫ్యాక్టరీలకు వాటి డిమాండ్లకు అనుగుణంగా కూలింగ్‌ సిస్టంలు అవసరమవు తాయి. దీనికి విండో, స్లి్పట్, సెంట్రలైజ్డ్‌ ఏసీలను పెంచుకుంటూ పోవడం స్థిరమైన పరిష్కారం అనిపించుకోదు. కొత్త రూమ్‌ ఏసీలకు 2025–2035 కాలానికి మరో 13–15 కోట్ల యూనిట్లు జోడు కాగలవని అంచనా. ఇవి విద్యుత్‌ పంపిణీ వ్యవస్థపై భారాన్ని పెంచుతాయి. 2035లో ఉండగలదని భావిస్తున్న లోడులో వీటి వాటాయే దాదాపు 180 గిగావాట్లు! ప్రస్తుతం, వేసవిలో వినియోగం పతాక స్థాయిలో ఉన్న దశలో ఏసీ యూనిట్లు స్వాహా చేస్తున్న విద్యుత్తు సుమారు 60–70 గిగావాట్లని తేలింది. 

అంతటా వేడి వాడలే!
పట్టణాలు, నగరాల్లో కొన్ని ప్రాంతాలు ‘వేడి వాడలు’గా పేరు మోస్తున్నాయి. జనాభా తక్కువగా ఉన్న ప్రాంతాలకన్నా జనసాంద్రత ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఉష్ణోగ్రత కొన్ని డిగ్రీలు ఎక్కువగా ఉంటోంది. నగరాల్లో ఏసీలు పరిసరాల్లోకి మరింత వేడిని విడుదల చేస్తున్నాయి. ఫలితంగా, శీతలీకరణ యంత్రాలకు డిమాండ్‌ మరింత పెరుగుతోంది. అదొక విష వలయం. వీలైనంత తక్కువ విద్యుత్తును గ్రహించి వాతావరణాన్ని చల్లబరచే సిస్టంలను గుర్తించేందుకు మన దేశంలో స్టార్‌ రేటింగ్‌ కొలమానం ఉంది. ఏసీలకు ఈ రేటింగ్‌ సిస్టంను 2009లో ప్రవేశ పెట్టారు. మొదట్లో ఇది స్వచ్ఛంద లేబుల్‌గా ఉండేది. తర్వాత, తప్పనిసరిగా పేర్కొనాలని నిబంధన తెచ్చారు. 

తదనంతరం, కనిష్ఠ శక్తి వినియోగ ప్రమాణాల (ఎం.ఇ.పి. ఎస్‌.)ను ప్రవేశపెట్టారు. తర్వాత, ఇండియన్‌ సీజనల్‌ ఎనర్జీ ఎఫిషి యన్సీ నిష్పత్తి (సీర్‌)ని 2015లో అమలులోకి తెచ్చారు. ఈ ప్రమా ణాలు ఏసీ మార్కెట్‌పై కొంత ప్రభావాన్ని చూపాయి. సదరు సాధ నానికి లభించిన స్టార్లను బట్టి వినియోగదారులు రకరకాల ఏసీలు కొనడానికి ప్రాధాన్యం ఇస్తున్నారు. వస్తూత్పత్తి సంస్థలు కూడా ఇన్‌ వెర్టర్‌ టెక్నాలజీ వంటి మెరుగుదలలతో కొత్త వస్తువులను మార్కెట్లోకి తెస్తున్నాయి.  

వాతావరణం పట్టని ఏసీలు
అంతవరకు బాగానే ఉందిగానీ, సాంకేతికపరంగానూ, అమలు లోనూ కొన్ని లోపాలు కొనసాగుతున్నాయి. బర్కిలీలోని యూనివ ర్సిటీ ఆఫ్‌ కాలిఫోర్నియాలో ఇండియా ఎనర్జీ అండ్‌ క్లైమేట్‌ సెంటర్‌ పరిశోధకులు 2025లో ఒక అధ్యయనం నిర్వహించారు. పరీక్షా విధానాలు ప్రాథమికంగా పొడి వాతావరణంలో శీతలీకరణను మదింపు చేస్తున్నాయనీ, భారతదేశంలోని హాట్‌–హ్యూమిడ్‌ వాతా వరణంలో కీలకమైన అంశంగా మారే గాలిలో వేడితేమను తగ్గించే లేదా తొలగించే అంశాన్ని పరిగణనలోకి తీసుకోవడం లేదనీ వారు పేర్కొన్నారు. దానివల్ల ఏమవుతుందంటే, ల్యాబొరేటరీ పరీక్షల్లో ఏసీలు బాగా పనిచేస్తాయి. వాస్తవిక పరిస్థితుల్లో పనితీరు పేలవంగా ఉంటుంది. లేదా విద్యుత్తును ఎక్కువ స్వాహా చేసి ప్రదేశా లను అతి శీతలంగా మారుస్తాయి. జపాన్, దక్షిణ కొరియా వంటి దేశాలతో పోలిస్తే అమలుచేస్తున్న ఎం.ఇ.పి.ఎస్‌.ల విషయంలో కూడా ఇండియా వెనుకబడే ఉందని ఈ అధ్యయనం పేర్కొంది. భారత్‌లోని సగటు యూనిట్‌తో పోలిస్తే ఆ దేశాల్లోని ఏసీలు దాదాపు రెండింతల ఇంధన వినియోగ సామర్థ్యాన్ని కనబరుస్తున్నా యని అధ్యయనంలో వెల్లడైంది. 

కేంద్రీకృత కూలింగ్‌ మెరుగు
ఇండియా కూలింగ్‌ కార్యాచరణ ప్రణాళిక అనేది మరో ప్రయత్నం. దీనికి 2019లో శ్రీకారం చుట్టారు. ఈ ప్రణాళిక కింద వివిధ ఐడియాలను పరీక్షించి చూస్తున్నారు. డిస్ట్రిక్ట్‌ కూలింగ్‌ సిస్టం (డీసీఎస్‌) వాటిలో ఒకటి. కొన్ని ఐరోపా నగరాల్లో వాడుకలో ఉన్న సెంట్రలైజ్డ్‌ హీటింగ్‌ సిస్టంల తరహాలో దానికి రూపకల్పన చేశారు. డీసీఎస్‌ కింద కొన్ని భవనాల సముదాయానికి సెంట్రలైజ్డ్‌ కూలింగ్‌ సిస్టం పెడతారు. నీరు, విద్యుత్, గ్యాస్‌ సరఫరా చేసే పైపుల మాదిరి గానే కూలింగ్‌ కూడా గొట్టాల ద్వారా పంపిణీ అవుతుంది. అది సమర్థమైన సిస్టంగా పేరు తెచ్చుకుంది. వ్యర్థ జలాలను శుద్ధి చేసి ఆ నీటిని సెంట్రల్‌ ప్లాంట్‌ వినియోగించుకుంటుంది. వ్యర్థంగా బయట కొచ్చే వేడిని చిల్లర్లు గ్రహించుకుంటాయి. అదే ఇంట్లోని ఏసీలకైతే రిఫ్రిజిరెంట్‌ గ్యాసులు అవసరమవుతాయి. 

కేంద్రీకృత వ్యవస్థ కావడం వల్ల, కూలింగ్‌ డిమాండ్‌ను మరింత సమర్థంగా నిర్వహించవచ్చు. విమానాశ్రయాలు, ఐటీ సంస్థల సముదాయాలు, పారిశ్రామికవాడలు, విశ్వవిద్యాలయాల ప్రాంగణాలు వంటిచోట్ల డీసీఎస్‌ అనువైనది. సింగపూర్, దుబాయ్, ఖతార్, యూఏఈలలో ఇది ప్రయోజనకరమైనదిగా తేలింది. మన దేశంలో ‘శీతలీకరణను కూడా ఒక సేవ’ కింద మార్చడానికి రెగ్యులేటరీ, లీగల్, ఫినాన్షియల్‌ పరంగా, ఇతరత్రా కొన్ని ప్రతిబంధకాలున్నాయి. కొన్నేళ్ళ క్రితం ఢిల్లీలోని కనాట్‌ ప్లేస్‌లో డీసీఎస్‌ ఏర్పాటుకు ప్రయత్నాలు సాగాయిగానీ, వివిధ క్షేత్ర స్థాయి సమస్యల వల్ల అవి ఫలించలేదు. సాపేక్షంగా చూస్తే, గుజరాత్‌లోని గిఫ్ట్‌ సిటీలో మాదిరిగా కొత్త ప్రాజెక్టులలో వాటిని అమలులోకి తేవడం తేలిక. ఆంధ్రప్రదేశ్‌ నూతన రాజధాని అమరావతిలో కూడా డీసీఎస్‌ను పొందుపరచనున్నారు. వివిధ నగరాల్లో ఆకాశ హార్మ్యా లతో కొత్త జనావాస ప్రాంతాలు పుట్టుకొస్తున్నాయి. వాటిలో డీసీఎస్‌ను ప్రోత్సహించేందుకు ఇది సరైన సమయం. 

దేశానికి ఒక సమగ్ర శీతలీకరణ విధానం అవసరం. అది తక్కువ విద్యుత్తుతో ఎక్కువ శీతలీకరణను అందించేందిగా ఉండాలి. వివిధ ప్రాంతాల్లోని పరిస్థితులకు తగ్గట్లుగా శీతలీకరణ సాధనాలకు కొత్త డిజైన్లు అవసరం. నూతన శీతలీకరణ టెక్నాల జీలపై పరిశోధన సాగాలి. అదే సమయంలో, వడగాడ్పులకు ఎక్కువ అవకాశం ఉన్న ప్రాంతాల్లో చల్లదనాన్ని ఇచ్చే పైకప్పుల వంటి కొత్త ప్రయత్నాలకు సామూహిక స్థాయిలో ప్రయత్నాలు చేయాలి.

దినేశ్‌ సి. శర్మ
వ్యాసకర్త సైన్స్‌ అంశాల వ్యాఖ్యాత 

Videos

భువనగిరిలో ఉద్రిక్తత ఎమ్మెల్యే, సీఎం రేవంత్ ఫ్లెక్సీపై నల్ల రంగు

పుష్ప శ్రీవాణి పై అంత నీచంగా ప్రవర్తిస్తారా? పోలీసుల ఓవర్ యాక్షన్... వరుదు కళ్యాణి అరెస్ట్

సుప్రీం కోర్టు కీలక నిర్ణయం..CJP నిరసనకారుల FIRలు రద్దు

పవన్ కళ్యాణ్ బర్త్ డే ఫ్లెక్సీ..జనసేన,టీడీపీ మధ్య కొట్లా

అడ్డంగా పడుకుని నీ పబ్లిసిటీ స్టంట్లు.. చంద్రబాబును ఏకిపారేసిన జడ శ్రవణ్

ఒకే ఇంట్లో 23 మృతదేహాలు 1000కి చేరిన మృతులు

YS జగన్ కు ఘన స్వాగతం

AP: మేము అస్సలు తగ్గం..! పల్లె-పల్లెకు రైతులతో వంట వార్పు కార్యక్రమం

ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి కుమారుడు అరెస్ట్

కొబ్బరికాయ కొట్టేస్తా. గుమ్మడికాయ కట్టేస్తా.. అప్పనంగా క్రెడిట్ నొక్కేస్తా...

Photos

+5

ట్రేడిషనల్ శారీలో బిగ్‌బాస్‌ బ్యూటీ ఆర్జే కాజల్.. ఫోటోలు

+5

మెరుపుతీగలా మారిపోయిన హెబ్బా పటేల్ (ఫొటోలు)

+5

తమిళ బ్యూటీ ఆండ్రియా పారిస్ ట్రిప్ (ఫొటోలు)

+5

హీరోగా రవితేజ తమ్ముడి కొడుకు.. 'మారెమ్మ' ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

అనిరుధ్ కన్సర్ట్ కోసం జోనితా గాంధీ రెడీ అయిందిలా (ఫొటోలు)

+5

కీర్తి సురేశ్ కలర్‌ఫుల్ ఓనం సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

యాపిల్ సీఈఓగా 15ఏళ్లు.. టిమ్ కుక్ అరుదైన (ఫోటోలు)

+5

పార్వతీపురం మన్యం జిల్లా...శిఖపరువులో జలసవ్వడి (ఫొటోలు)

+5

యుగానికొక్కడు.. మెస్సీ అరుదైన జ్ఞాపకాలు! (ఫొటోలు)

+5

‘ఐ యామ్‌ గేమ్‌’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌...ముఖ్య అతిథిగా నాగ్‌ అశ్విన్‌ (ఫొటోలు)