BIG Question: ఉప్పొంగిన ఉత్తరాంధ్ర.. జనసంద్రం పోటెత్తితే ఎలా ఉంటుందో తెలుసా?
Breaking News
హనుమ విగ్రహం... రాతిలో చెక్కిన భక్తి తత్వం
Published on Thu, 07/30/2026 - 07:51
చింతల వెంకటరమణస్వామి ఆలయంలోని హనుమంతుడి శిల్పం విజయనగర శిల్పకళా వైభవానికి అద్భుతమైన నిదర్శనం. ఈ శిల్పం రామాయణంలోని సుందరకాండలో చోటుచేసుకున్న అత్యంత కీలకమైన ఘట్టాన్ని రాతిలో సజీవంగా ఆవిష్కరిస్తుంది.
సీతాదేవిని దర్శించి ఆమెకు శ్రీరాముని ఉంగరాన్ని అందజేసిన అనంతరం హనుమంతుడు అశోకవనాన్ని ధ్వంసం చేసి అనేకమంది రాక్షసులను సంహరించాడు. ఈ వార్త రావణునికి చేరడంతో అతడు తన కుమారుడైన ఇంద్రజిత్తును యుద్ధానికి పంపించాడు. దేవతలను సైతం జయించిన మహా యోధుడైన ఇంద్రజిత్తు సాధారణ ఆయుధాలతో హనుమంతుడిని జయించలేనని గ్రహించి బ్రహ్మదేవుని అనుగ్రహంతో పొందిన బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాడు.
వాల్మీకి రామాయణం ప్రకారం హనుమంతుడికి బ్రహ్మదేవుని వరప్రభావం వల్ల బ్రహ్మాస్త్రం శాశ్వతంగా హాని చేయలేకపోయినా బ్రహ్మాస్త్ర మహిమను గౌరవిస్తూ ఆయన కొంతసమయం దానికి లొంగిపోయాడు. తరువాత రాక్షసులు జనపనార తాళ్లు, నాగపాశాలతో ఆయనను అదనంగా బంధించిన వెంటనే బ్రహ్మాస్త్ర ప్రభావం దానంతట అదే తొలగిపోయిందని సుందరకాండ వివరించింది. అందువల్ల హనుమంతుడు నిజంగా ఓడిపోలేదు. వ్యూహాత్మకంగా రావణుని సభలో ప్రవేశించి అతనికి శ్రీరాముని సందేశాన్ని నేరుగా తెలియజేయాలనే సంకల్పంతోనే బంధితుడిగా ఉన్నాడు.
చింతల వెంకటరమణస్వామి ఆలయంలోని శిల్పంలో హనుమంతుడు పాముల వంటి బంధనాలతో చుట్టబడి నిలిచిన రూపంలో కనిపిస్తాడు. తన శరీరాన్ని బంధించినప్పటికీ తన మనోధైర్యాన్ని ఎవరూ బంధించలేరనే భావాన్ని అద్భుతంగా వ్యక్తీకరించాడు శిల్పి. కండరాలలో కనిపించే ఉద్రిక్తత, ముఖంలో కనిపించే ప్రశాంతత, కళ్లలో ప్రతిఫలించే ఆత్మవిశ్వాసం భక్తి, అపార శక్తి ఈ శిల్పానికి అసాధారణమైన జీవం పోశాయి. బాహ్యంగా బంధితుడిగా కనిపిస్తున్న హనుమంతుడు అంతర్గతంగా అజేయుడని ఈ శిల్పం స్పష్టంగా తెలియజేస్తుంది. ఇది శిల్పకళ మాత్రమే కాదు రాతిలో చెక్కిన ఒక తాత్విక సందేశం కూడా.
చింతల వెంకటరమణస్వామి ఆలయంలోని ఈ శిల్పం విజయనగర శిల్పుల అసాధారణ ప్రతిభను ప్రతిబింబిస్తుంది. కఠినమైన గ్రానైట్ రాయిలో శరీర నిర్మాణం కండరాల బలం పాముల చుట్టుకొలత వస్త్రాల మడతలు ముఖ కవళికలు వంటి సూక్ష్మ అంశాలను సైతం అత్యంత సహజంగా చెక్కడం వారి కళానైపుణ్యానికి నిదర్శనం. విజయనగర శిల్పకళలో శిల్పాలు అలంకారాలు మాత్రమే కాకుండా పురాణాలను ప్రజలకు బోధించే దృశ్య గ్రంథాలుగా కూడా రూపొందించబడ్డాయి. నిరక్షరాస్యులు కూడా ఈ శిల్పాలను చూసి రామాయణం మహాభారతం, పురాణాల్లోని కథలను సులభంగా అర్థం చేసుకునే విధంగా వాటిని రూపొందించారు.
ఈ హనుమంతుడి శిల్పం భక్తునికి గొప్ప జీవిత సందేశాన్ని అందిస్తుంది. జీవితంలో కష్టాలు బంధనలు అవమానాలు ఎదురైనా ధర్మాన్ని విడువకుండా భక్తిని కోల్పోకుండా ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగితే విజయం తప్పకుండా లభిస్తుందని ఇది బోధిస్తుంది. బాహ్య బంధనలు ఎంత బలంగా ఉన్నా దైవభక్తి ధైర్యం, జ్ఞానం, సంయమనం ఉన్న వ్యక్తిని ఎవ్వరూ శాశ్వతంగా బంధించలేరనే శాశ్వత సత్యాన్ని ఈ శిల్పం ప్రతిధ్వనిస్తుంది. అందుకే చింతల వెంకట రమణస్వామి ఆలయంలోని హనుమంతుడి శిల్పం కేవలం ఒక కళాఖండం మాత్రమే కాదు భారతీయ ధర్మం భక్తి తత్వం, విజయనగర శిల్పకళా వైభవం కలిసిన ఒక చిరస్మరణీయ వారసత్వ సంపదగా నేటికీ భక్తులను పరిశోధకులను, కళాభిమానులను సమానంగా ఆకర్షిస్తోంది.
– జిబి విశ్వనాథ, రిటైర్డ్ డిప్యూటీ కలెక్టర్, అనంతపురం
నిర్వహణ: డి.వి.ఆర్.
Tags : 1