Breaking News

International Womens Day 2026: విజయ వర్ణాలు

Published on Sat, 03/07/2026 - 06:05

కాంతిపుంజంలో ఏడు రంగులు దాగి ఉంటాయి. స్త్రీ సామర్థ్యం ఒక కాంతి కిరణమే! ప్రసరించే ప్రతిచోటా వెలుతురై వెల్లివిరుస్తుంది. ప్రతి రంగూ మరో రంగుకు బలం ఇస్తుంది. స్త్రీలు ఆకాశంలో సగం మాత్రమే కాదు.. ఆకాశమంతా నిండిన ఏడు వర్ణాలు. ఇక్కడ ఏడు రంగాల్లో ఏడు గెలుపు కథలు చదవండి.

మ్యాథ్స్‌ మాస్ట్రో 
నళిని అనంత రామన్‌ 
రంగం గణితం
ప్రపంచ ప్రసిద్ధ గణిత శాస్త్రవేత్తలలో నళిని అనంత రామన్‌ ఒకరు. డైనమిక్‌ సిస్టమ్స్, క్వాంటంపై నళిని విశేష కృషి చేశారు. ఆమె పరిశోధన హెన్రీ పాయింకేర్‌ ప్రైజ్, ఇన్ఫోసిస్‌ ప్రైజ్‌తో పాటు అనేక అంతర్జాతీయ గుర్తింపులను సాధించింది. గణితంపై పని చేస్తున్న ప్రముఖ పరిశోధకులలో ఒకరిగా నిలిచింది. తల్లిదండ్రులిద్దరూ గణిత శాస్త్రవేత్తలు కావడంతో నళినికి అంకెలతో చిన్నప్పటి నుంచే అనుబంధం ఏర్పడింది. గణితానికి సంబంధించిన విశేషాలు వినడం అంటే కథలు విన్నంత సంతోషంగా ఉండేది. ‘గణితాన్ని బాగా ఇష్టపడేదాన్ని. అలా అని ఇతర సబ్జెక్‌లను నిర్లక్ష్యం చేయలేదు’ అని బాల్యాన్ని గుర్తు తెచ్చుకుంటారు నళిని. పదహారు సంవత్సరాల వయసులో ఫ్రాన్స్‌లో గణితానికి ప్రసిద్ధి చెందిన ‘ఎకోల్‌ నార్మల్‌ సుపీరియర్‌’ విద్యాసంస్థలో చేరింది. పీహెచ్‌డీ పూర్తి చేసిన తరువాత అనేక పరిశోధన సంస్థలలో పనిచేశారు నళిని. ప్రస్తుతం స్ట్రాస్‌బోర్గ్‌ యూనివర్శిటీలో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. సంక్లిష్టమైన గణిత సమస్యలను తేలికైన ఉదాహరణలతో అర్థం చేసుకునేలా చేయడం ఆమె ప్రత్యేకత. డైనమిక్‌ సిస్టమ్‌కు సంబంధించిన సారాంశాన్ని బిలియర్డ్స్‌ టేబుల్‌పై దొర్లే బంతిని ఉదాహరిస్తూ చెబుతుంటారు.

చరిత్ర సృష్టించిన విజయం
పూజా కృష్ణమూర్తి
రంగం క్రీడలు
బ్రెజిల్‌ 135 ఆల్ట్రాను పూర్తి చేయడం ద్వారా పూజా కృష్ణమూర్తి చరిత్ర సృష్టించింది. 135 మైళ్ల కఠినమైన రేసుకు అర్హత పొంది విజయం సాధించిన మొదటి భారతీయ మహిళగా నిలిచింది. 48 గంటలలోనే ఈ రేసును పూర్తి చేసింది. ఈ ఘనత ఆమెను ప్రపంచ ప్రఖ్యాత రన్నర్‌లలో ఒకరిగా నిలిపింది. పర్వతాలతో ప్రేమ పూజాకు చిన్న వయసు నుంచే మొదలైంది. పూజ ను, ఆమె సోదరి ప్రియాను వారి తల్లి హిమాలయాలలో ట్రెక్కింగ్‌కు తీసుకెవెళ్లేది. ‘ట్రెక్కింగ్‌ వల్ల నాకు కలిగిన ప్రయోజనం ఓర్పు, క్రమశిక్షణ’ అని చెబుతుంది పూజ. ముంబైలోని సెయింట్‌ జేవియర్‌ కాలేజీలో పొలిటికల్‌ సైన్స్‌లో డిగ్రీ చేసిన పూజ ఆ తరువాత ఫిల్మ్‌ మేకింగ్‌ కోర్సులో చేరింది. పరుగు అనేది ఆమె జీవితంలోకి అనుకోకుండా వచ్చింది. 2011లో తల్లి, సోదరితో కలిసి హాఫ్‌–మారథాన్‌కు వెళ్లింది. ‘ఐదు కిలోమీటర్‌ల నా మొదటి పరుగు ప్రయాణం అలా మొదలైంది’ అంటూ జ్ఞాపకాల దారులలోకి వెళుతుంది పూజ. హాఫ్‌–మారథాన్‌ తరువాత పది కిలోమీటర్‌ల రేసులలో పాల్గొనడం మొదలుపెట్టింది. సరదాగా మొదలైన పూజాకృష్ణమూర్తి పరుగు ప్రయాణం చరిత్ర సృష్టించే వరకు వెళ్లింది.

నవ యువ స్వర సంచలనం 
హన్సికా పరీఖ్‌
రంగం సంగీతం
ఇండియన్‌ పాప్‌ మ్యూజిక్‌లో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది హన్సికా పరీఖ్‌. అజ్మీర్‌లోని సంగీత కళాకారుల కుటుంబంలో పుట్టిన హన్సికా పరీఖ్‌కు సంప్రదాయ సంగీతం మాత్రమే కాదు నవతరం సంగీతం అంటే కూడా ఇష్టం. చిన్నప్పటి నుంచి హిందుస్థానీ శాస్త్రీయ సంగీతంలో మునిగి తేలింది హన్సిక. అలా అని అక్కడే ఉండి పోలేదు. ఆన్‌లైన్‌లో ఎప్పటికప్పుడూ కొత్త కొత్త సంగీత ధోరణుల గురించి తెలుసుకునేది. ఆమె పాట ప్రస్థానం ఎలా ప్రారంభం అవుతుంది అంటే.. మొదట ఏదైనా మ్యూజికల్‌ ఇన్‌స్ట్రుమెంట్‌ ద్వారా ట్యూన్‌ క్రియేట్‌ చేస్తుంది. ఆ ట్యూన్‌ను మెల్లగా మనసు పొరల్లోకి తీసుకుంటూ పదాలు అల్లుతుంది. ‘కొత్త సంగీత ధోరణుల గురించి ఎప్పటికప్పుడు తెలుసుకోవడం ఎంత ముఖ్యమో, కొత్త ఆర్టిస్ట్‌లతో పనిచేయడం కూడా అంతే ముఖ్యం’ అంటుంది హన్సికా పరీఖ్‌.

చిత్ర సంచలనం
 గీతా గంభీర్‌
రంగం సినిమా
ఈ సంవత్సరం ఆస్కార్‌ డాక్యుమెంటరీ రేసులో సంచలనం సృష్టించారు భారత సంతతికి చెందిన ఫిల్మ్‌ మేకర్‌ గీతా గంభీర్‌. రెండు వేర్వేరు చిత్రాలకు రెండు నామినేషన్లు సాధించారు. ‘ది పర్‌ఫెక్ట్‌ నైబర్‌’ అనే ఆమె చిత్రం ఫీచర్స్‌ విభాగంలో ‘బెస్ట్‌ డాక్యుమెంటరీ’కి నామినేట్‌ అయింది. మరో చిత్రం ‘ది డెవిల్‌ ఈజ్‌ బిజీ’ బెస్ట్‌ డాక్యుమెంటరీ షార్ట్‌కు నామినేట్‌ అయింది. నామినేషన్‌లకు ముందే ఈ రెండు చిత్రాలు అకాడమీ 15 షార్ట్‌ లిస్ట్‌లో ఉన్నాయి. ‘రెండు చిత్రాలను చాలా ప్రేమతో, శ్రద్ధతో నిర్మించాను. ఈ చిత్రాలకు వచ్చిన స్పందన సంతోషంగా ఉంది’ అంటున్నారు గీత. గీతా గంభీర్‌ బోస్టన్‌లో జన్మించారు. ఆమె తండ్రి శరద్‌ ఇంజినీరింగ్‌ చదవడానికి భారతదేశం నుండి అమెరికాకు వెళ్లి అక్కడే స్థిరపడి పోయారు. హార్వర్డ్‌ యూనివర్శిటీలో చదువుకున్న గీత డాక్యుమెంటరీ ఫిల్మ్‌మేకింగ్‌తో తన చిత్ర ప్రయాణాన్ని ప్రారంభించారు. ఫిల్మ్‌ ఎడిటర్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్న గీత నాన్‌ ఫిక్షన్‌ ప్రోగ్రామింగ్‌ విభాగంలో అత్యుత్తమ పిక్చర్‌ ఎడిటింగ్‌లో రెండు ఎమ్మీ అవార్డ్‌లను గెలుచుకున్నారు.

గేమ్‌ చేంజర్‌
 ఆశా శర్మ
రంగం గేమింగ్‌
తమ గేమింగ్‌ విభాగానికి ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ ప్రెసిడెంట్, సీయీవోగా ఆశా శర్మను నియమించింది మైక్రోసాఫ్ట్‌. యూనివర్శిటీ ఆఫ్‌ మిన్నెసోటాలోని కార్ల్‌సన్‌ స్కూల్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌లో చదువుకున్న ఆశాశర్మకు టెక్నాలజీ, ప్రాడక్ట్, ఆపరేషన్‌ లీడర్‌షిప్‌లకు సంబంధించి పదిహేను సంవత్సరాల అనుభవం ఉంది.  2011లో మైక్రోసాఫ్ట్‌ మార్కెటింగ్‌ విభాగంలో తన కెరీర్‌ ప్రారంభించింది ఆశ. రెండు సంవత్సరాల తరువాత  పోర్చ్‌ గ్రూప్‌లో చీఫ్‌ ఆపరేటింగ్‌ ఆఫీసర్‌గా బాధ్యతలు చేపట్టింది. ప్రొడక్షన్, ఇంజినీరింగ్, అమ్మకాలు, మార్కెటింగ్‌... మొదలైన వాటికి సంబంధించిన బాధ్యతలు చూసేది. ‘ఏ బాధ్యత తీసుకున్నా విజయవంతం చేస్తుంది’ అని పేరు తెచ్చుకున్న ఆశాశర్మ సరికొత్త బాధ్యతతోనూ తిరుగులేని విజయాన్ని సాధిస్తుందనడంలో సందేహం లేదు.
 

ఏ.ఐ. ఐకాన్‌ 
అశ్వినిఅశోకన్‌
రంగం ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌
సిలికాన్‌ వ్యాలీలో పది సంవత్సరాలు పని చేసిన అశ్విని అశోకన్‌ కంప్యూటర్‌ విజన్‌ టెక్నాలజీని ప్రజలకు చేరువ చేయాలనే లక్ష్యంతో ఇండియాకు వచ్చి, ఏఐ ప్లాట్‌ఫామ్‌ ‘మ్యాడ్‌ స్ట్రీట్‌ డెన్‌’ ప్రారంభించింది. అత్యంత ఆధునిక ఏఐ ఉత్పత్తులను నిర్మించడంలో ఈ కంపెనీ ప్రపంచ ప్రసిద్ధి చెందింది. ‘మన దేశంలో అద్భుతమైన ప్రతిభ ఉంది. అదే సమయంలో నిరుద్యోగం ఉంది’ అంటున్న అశ్విని తన కంపెనీ కోసం ప్రతిభావంతులను వెదకడంలో ఎప్పుడూ ముందుంటుంది. కార్నెగీ మెలన్‌ యూనివర్శిటీలో ఇంటరాక్షన్‌ డిజైన్‌లో మాస్టర్స్‌ చేసింది అశ్విని. ‘ప్రపంచ వ్యాప్తంగా వస్తున్న ట్రెండ్స్‌ను గమనించడం మంచిదేగానీ, వాటిని మనం గుడ్డిగా అనుసరించలేం. మన దేశ నిర్దిష్ట పరిస్థితులను పరిగణనలోకి తీసుకోవాలి’ అంటున్న అశ్విని ఏ.ఐ నాడి తెలిసిన నిపుణురాలు. ఏ.ఐ.ని సామాన్య ప్రజలకు ఎలా చేరువ చేయాలో తెలిసిన ఎంటర్‌ప్రెన్యూర్‌.

ఆరోగ్య భాగ్యం 
సౌమ్య స్వామినాథన్‌
రంగం హెల్త్‌
శిశు వైద్యురాలు, క్లినికల్‌ సైంటిస్ట్‌ సౌమ్య స్వామినాథన్‌ ప్రజా ఆరోగ్యానికి సంబంధించిన అంశాలపై విశేష కృషి చేశారు. ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ మెడికల్‌ రీసెర్చ్‌ డైరెక్టర్‌ జనరల్, డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ హెల్త్‌ రీసెర్చ్‌ సెక్రెటరీగా పనిచేశారు. ఆ తరువాత ప్రపంచ ఆరోగ్య సంస్థలో డిప్యూటీ డైరెక్టర్‌గా చేరారు. అదే సంస్థలో చీఫ్‌ సైంటిస్ట్‌ అయ్యారు. కోవిడ్‌ కాలంలో శాస్త్రీయ పరిశోధనలకు సంబంధించి కృషి చేశారు. 2009 నుండి 2011 వరకు యూనిసెఫ్, యూఎన్‌డీపి/ వరల్డ్‌ బ్యాంక్, వరల్డ్‌ హెల్త్‌ ఆర్గనైజేషన్‌ల ‘రీసెర్చ్‌ అండ్‌ ట్రైనింగ్‌ ఇన్‌ ట్రాపికల్‌ డిసీజెస్‌’ అనే స్పెషల్‌ ప్రోగ్రామ్‌కు కో ఆర్డినేటర్‌గా పనిచేశారు. ‘మన దేశంలో అందరికీ  పోషకాహారం అందడం లేదు’ అంటారు. ఆమె తరచూ ‘హిడెన్‌ హంగర్‌’ అనే మాట అంటుంటారు. అంటే... తగినంత ఆహారం తీసుకుంటున్నప్పటికీ శరీరానికి అవసరమైన విటమిన్‌లు, మినరల్స్‌ అందక పోవడం. పిల్లలకు తగినంత  పోషకాలు లభించక పోతే జరిగే దీర్ఘకాలిక నష్టాల గురించి ఎన్నో వేదికలపై నొక్కి చె΄్పారు. చెన్నైలో పుట్టిన సౌమ్య ప్రఖ్యాత శాస్త్రవేత్త ఎం.ఎస్‌.స్వామినాథన్‌ కూతురు.

Videos

ఇరాన్ లో భూకంపం

విజయవాడలో షాకింగ్ ఘటన.. పోలీసులపై దుండగుడి కాల్పులు..?

నాకు ప్రాణహాని ఉంది.. కొలికపూడి సంచలన వ్యాఖ్యలు

యుద్ధ ప్రభావం ఉన్నా గోల్డ్, సిల్వర్ రేట్ పడిపోవడానికి కారణం ఏమిటి..?

అసెంబ్లీ సాక్షిగా అబద్దాలు.. మంత్రి సవితకు అంగన్వాడీ వర్కర్స్ కౌంటర్

బస్సులో బ్రష్.. కండక్టర్ పై సీరియస్

కుల, మతాలు అంటూ.. పవన్ కొత్త రాజకీయం

స్కూల్ దగ్గర బాంబు దాడి.. విద్యార్థులు పరుగులు

వెనక్కి తగ్గిన ట్రంప్.. భారత్ కు గుడ్ న్యూస్

పాత ఓటమికి ప్రతీకారం? టీమిండియా ఫైనల్ పోరు

Photos

+5

రెండో శ్రీశైలంగా పిలిచే శివాలయం మన హైదరాబాద్‌లో ఎక్కడుందో తెలుసా? (ఫొటోలు)

+5

మేము సాధించాం.. పతకం వచ్చింది (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో గ్రాండ్‌గా అల్లు శిరీష్ పెళ్లి వేడుక (ఫొటోలు)

+5

ఒకప్పటి హీరోయిన్ సుమలత ఫ్యామిలీ ఫొటోలు

+5

జాన్వీ కపూర్ బర్త్ డే సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

నయనిక పెళ్లి కూతురి వేడుక.. అల్లు ఫ్యామిలీ సందడి (ఫొటోలు)

+5

తిరుమల శ్రీవారి సేవలో ప్రముఖ హీరోయిన్లు (ఫొటోలు)

+5

పెళ్లి వేడుకలో విజయ్‌, త్రిష సందడి.. ఫోటోలు వైరల్

+5

నిజామాబాద్‌లో సందడి చేసిన సినీనటి నిధి అగర్వాల్‌ (ఫొటోలు)

+5

నాగచైతన్య 'వృషకర్మ' గ్లింప్స్‌ రిలీజ్‌ ఈవెంట్ (ఫొటోలు)