సాక్షి సాక్షిగా.. నాగార్జునకు ఇచ్చే వెళ్తా..!
Breaking News
సాగుకు ఏఐ దన్ను
Published on Sun, 11/09/2025 - 02:09
న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా ఏడు టెక్నాలజీలు వ్యవసాయ రంగ ముఖచిత్రాన్ని మార్చివేయనున్నట్లు వరల్డ్ ఎకనమిక్ ఫోరం (డబ్ల్యూఈఎఫ్) ఒక నివేదికలో తెలిపింది. జనరేటివ్ ఏఐ, రోబోటిక్స్, శాటిలైట్ ఆధారిత రిమోట్ సెన్సింగ్, నానో టెక్నాలజీ, కంప్యూటర్ విజన్, ఎడ్జ్ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (ఐవోటీ) మొదలైనవి వీటిలో ఉన్నట్లు పేర్కొంది. గ్రామీణ ప్రాంతాల్లో జీవనోపాధికి భరోసా ఏర్పడటంతో పాటు ఉత్పాదకత పెరిగేందుకు కూడా ఈ సాంకేతికతలు దోహదపడతాయని వివరించింది. ఇటు పరిశ్రమ అటు విద్యావేత్తలతో సంప్రదింపుల మేరకు రూపొందించిన ఈ నివేదికలో భారత్లో కేస్ స్టడీస్ను డబ్ల్యూఈఎఫ్ ప్రత్యేకంగా ప్రస్తావించింది.
అంతర్జాతీయంగా వ్యవసాయం సంక్షోభాల్లో కొట్టుమిట్టాడుతున్న నేపథ్యంలో ఈ రిపోర్ట్ ప్రాధాన్యం సంతరించుకుంది. గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణ ప్రాంతాల్లోకి వలసలు పెరగడం, వాతావరణంలో పెను మార్పులు, నేల..నీరులాంటి సహజ వనరులు వేగంగా తగ్గిపోతుండటం మొదలైన అంశాలన్నింటి వల్ల ఉత్పాదకతకు, వ్యవసాయంపై ఆధారపడిన వారి జీవనోపాధికి ముప్పు ఏర్పడుతోందని నివేదిక తెలిపింది.
పెరుగుతున్న జనాభాకి తగ్గట్లుగా 2050 నాటికి ప్రపంచం మరింత భారీ స్థాయిలో ఆహారాన్ని ఉత్పత్తి చేయాల్సిన అవసరం ఉంటుందని ఐక్యరాజ్య సమితిలో భాగమైన ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ పేర్కొంది. రైతుల సగటు వయస్సు 60 ఏళ్లకు చేరుతుండటం, 71 శాతం జలాశయాల్లో నీటి నిల్వలు తగ్గిపోతుండటం, మూడో వంతు నేల సారం తగ్గిపోతుండటంలాంటి సవాళ్ల మధ్య దీన్ని సాధించాల్సిన పరిస్థితి ఏర్పడిందని వివరించింది.
ఐసీఎంఆర్ పరిశోధనలు, ఫసల్ బీమాతో ప్రయోజనాలు ..
ఇండియన్ కౌన్సిల్ ఫర్ అగ్రికల్చర్ రీసెర్చ్ (ఐసీఏఆర్) దేశీయంగా ప్రతికూల వాతావరణాన్ని తట్టుకుని నిలబడగలిగే వరివంగడాన్ని రూపొందించడాన్ని కేస్ స్టడీగా తీసుకోవచ్చని నివేదిక తెలిపింది. సంప్రదాయ పద్ధతిలో సాగును మెరుగుపర్చేందుకు ఉపయోగించే విధానాల్లో పెద్దగా కచి్చతత్వం లేకపోవడం, దిగుబడి రావడానికి సుదీర్ఘ సమయం పట్టేయడంలాంటివి ఉంటున్నాయి. దీన్ని అధిగమించేందుకు ఐసీఏఆర్ పరిశోధకులు సీఆర్ఐఎస్పీఆర్ ఆధారిత జీనోమ్ ఎడిటింగ్ను ఉపయోగించి రెండు వరి వంగడాలను తయారు చేశారు.
డీఆర్ఆర్ 100 పేరిట రూపొందించిన మొదటి వెరైటీలో కరువు, వాతావరణంపరమైన ఒత్తిళ్లను తట్టుకునే సామర్థ్యం మెరుగ్గా ఉంది. దీంతో దిగుబడి 19 శాతం పెరిగి, ఉద్గారాలు 20 శాతం మేర తగ్గాయి. ఇక పూసా డీఎస్టీ రైస్ 1 వెరైటీలో చూస్తే ఉప్పు, క్షార గుణాలు ఎక్కువగా ఉన్న నేలల్లో సైతం ఇది వరుసగా 9.66 శాతం, 30.4 శాతం మేర దిగుబడులను సాధించింది. దీనితో దిగుబడి 20 శాతం పెరిగే అవకాశం ఉందని రిపోర్ట్ తెలిపింది.
అటు పంట బీమాకు సంబంధించి భారత్లో అమలవుతున్న ప్రధాన్ మంత్రి ఫసల్ బీమా యోజనను (పీఎంఎఫ్బీవై) కూడా నివేదిక ప్రస్తావించింది. రిమోట్ సెన్సింగ్ టెక్నాలజీ ఆధారిత సొల్యూషన్ .. మరింత వేగవంతంగా, కచి్చతత్వంతో క్లెయిమ్లను సెటిల్ చేయడానికి ఉపయోగపడుతోందని పేర్కొంది.
నివేదికలో మరిన్ని అంశాలు..
⇒ పంటల పెరుగుదల, పర్యవేక్షణ, సంరక్షణ విషయంలో సంప్రదాయ ధోరణులను మార్చే సామర్థ్యం ఏడు సరికొత్త టెక్నాలజీలకు ఉంది. ప్రతికూల పరిస్థితులను తట్టుకుని నిలబడే పంటలను తీర్చిదిద్దేందుకు, ఉత్పాదకతను పెంచేందుకు ఇవి దోహదపడగలవు.
⇒ స్వయంచాలిత రోబోటిక్స్, కచ్చితత్వంతో కూడుకున్న సాగు పర్యవేక్షణ మొదలైన వాటిల్లో ఈ టెక్నాలజీలన్నింటినీ మేళవించి ఉపయోగిస్తే మరింత మెరుగైన ఫలితాలు రావచ్చు.
⇒ ప్రతికూల వాతావరణాన్ని ఎదుర్కొనగలిగే సామర్థ్యంతో 20% తక్కు ఉద్గారాలను వెలువరించే వరి వంగడాలను రూపొందించడం, చెరకులో కచి్చతత్వంతో కూడుకున్న సాగును అమలు చేయడంతో దిగుబడులు 40 శాతం పెరిగాయి. సరఫరా వ్యవస్థ రిస్కులను అంచనా వేసేందుకు రిమోట్ సెన్సింగ్ ఉపయోగపడుతోంది.
⇒సాగు వ్యవస్థలను కొత్తగా తీర్చిదిద్దేందుకు, ఉత్పాదకతపరమైన ఒత్తిళ్లను తగ్గించేందుకు మరి న్ని డీప్–టెక్ ఆవిష్కరణల అవసరముంది. సాంకేతిక పురోగతిని సత్వరం అందిపుచ్చుకునే విధానాలను నియంత్రణ సంస్థలు అమలు చేయాలి.
⇒ వర్షపాతం ఒక పద్ధతిగా లేకపోవడం, ఉష్ణోగ్రతలు పెరిగిపోతుండటంతో ఇప్పటికే పలు హారి్టకల్చర్ పంటల్లో 65% మేర నష్టాలకు దారి తీస్తున్నాయి.
Tags : 1