శభాష్ జగన్ అంటున్న కూటమి నేతలు..
Breaking News
రెస్క్యూ మిషన్ వివరాలు లీక్ చేస్తే అంతే..
Published on Tue, 04/07/2026 - 08:20
ఇరాన్లో చిక్కుకున్న ఇద్దరు అమెరికన్ వైమానిక దళ పైలట్లను రక్షించేందుకు చేపట్టిన అత్యంత సాహసోపేతమైన సైనిక చర్యకు సంబంధించిన రహస్యాలను బహిర్గతం చేసిన జర్నలిస్టులపై డొనాల్డ్ ట్రంప్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. దేశ భద్రతకు ముప్పు కలిగించే విధంగా సమాచారాన్ని లీక్ చేసిన వారిని కనుగొని, వారికి సహకరించిన జర్నలిస్టులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఇటీవల ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ట్రంప్ ఈ రెస్క్యూ మిషన్కు సంబంధించిన కీలక వివరాలను వెల్లడించారు. ఈ ఆపరేషన్ను అమెరికా సైనిక చరిత్రలోనే ఒక చారిత్రాత్మక విజయంగా ఆయన అభివర్ణించారు. అయితే, ఇదే సమయంలో మీడియా తీరుపై ఆయన అసహనం వ్యక్తం చేశారు.
జర్నలిస్టులకు జైలు శిక్ష!
నిర్దిష్ట మీడియా సంస్థల పేర్లను ప్రస్తావించనప్పటికీ ఆపరేషన్ కొనసాగుతున్న సమయంలోనే వివరాలను ప్రచురించిన పత్రికలపై ట్రంప్ మండిపడ్డారు. ‘మొదటి పైలట్ను మాత్రమే రక్షించారనే సమాచారాన్ని ముందే బయటపెట్టడం ద్వారా ఇరానియన్లకు మనం క్లూ ఇచ్చినట్లయింది. ఇది రెండో పైలట్ ప్రాణాలను ప్రమాదంలోకి నెట్టింది’ అని ఆయన పేర్కొన్నారు. ‘మేము ఆ సమాచారాన్ని లీక్ చేసిన వాళ్లని పట్టుకుంటాం. అదొక వికృత మనస్తత్వం. సదరు వార్తను ప్రచురించిన జర్నలిస్టు తన సోర్స్ వెల్లడించకపోతే వారు కూడా జైలుకు వెళ్లాల్సిందే. ఈ మిషన్ను వారు ఎంతటి ప్రమాదంలోకి నెట్టారో ప్రపంచం అర్థం చేసుకోవాలి’ అని ట్రంప్ స్పష్టం చేశారు.
176 యుద్ధ విమానాలు
వారాంతంలో జరిగిన ఈ దాడి వివరాలను ట్రంప్ వివరించారు. ఈ రెస్క్యూ మిషన్ ఎంత భారీ స్థాయిలో జరిగిందో ఆయన వెల్లడించిన గణాంకాలు చెబుతున్నాయి. మొదటి పైలట్ రక్షణకు 21 యుద్ధ విమానాలు, రెండో పైలట్ రక్షణకు 155 యుద్ధ విమానాలు ఉపయోగించినట్లు చెప్పారు. ఇరాన్ దళాలను తప్పుదోవ పట్టించేందుకు డెకాయ్(మోసపూరిత) ఆపరేషన్ చేపట్టారు. ఇందులో భాగంగా విమానాలు ఏడు వేర్వేరు ప్రాంతాలపై చక్కర్లు కొట్టాయి. ఈ ఆపరేషన్లో ఎంతమంది సైనికులు పాల్గొన్నారని జాయింట్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ ఛైర్మన్ డాన్ కెయిన్ను ట్రంప్ ప్రశ్నించగా భద్రతా కారణాల దృష్ట్యా ఆయన మౌనం వహించారు. అయితే ట్రంప్ స్పందిస్తూ ఆ సంఖ్య వందల్లో ఉంటుందని చెప్పారు.
ఇరాన్ ప్రయోగించిన ‘హ్యాండ్-హెల్డ్ షోల్డర్ క్షిపణి’ ద్వారా అమెరికాకు చెందిన ‘ఎఫ్-15ఈ స్ట్రైక్ ఈగిల్’ కూలిపోయింది. ఆ విమానంలోని వెపన్ సిస్టమ్స్ ఆఫీసర్ ఇరాన్ పర్వత ప్రాంతాల్లో దాదాపు 48 గంటల పాటు శత్రువుల కంట పడకుండా ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని గడిపారు. శత్రు దళాలు గంటగంటకూ అతనికి దగ్గరవుతున్న తరుణంలో అమెరికా స్పెషల్ ఫోర్సెస్ హెలికాప్టర్ ద్వారా అతడిని సురక్షితంగా కాపాడినట్లు ట్రంప్ చెప్పారు.
విమానాల పేల్చివేత
రెస్క్యూ సమయంలో ఇసుకలో చిక్కుకుపోయిన అమెరికా సైనిక విమానాలను శత్రువుల చేతికి చిక్కకుండా ఉండేందుకు సైన్యం వాటిని పేల్చివేసింది. ‘మా దగ్గర ఉన్న అత్యుత్తమ సాంకేతికతను ఇరానియన్లు కాపీ కొట్టే అవకాశం ఇవ్వదలచుకోలేదు. అందుకే వాటిని ముక్కలుగా పేల్చేశాం’ అని ట్రంప్ వివరించారు.
ఇదీ చదవండి: ఇరాన్తో భారత్ సహా పలు దేశాల ఒప్పందాలు
Tags : 1