మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?
Breaking News
ఏఐ నిఘాను అందిపుచ్చుకుంటున్న స్మార్ట్ నగరాలు
Published on Mon, 09/22/2025 - 15:10
భారతీయ నగరాలు మరింత పట్టణీకరణతో మరింత రద్దీగా మారుతున్నాయి. వీటిలో మాల్స్, పార్కులు, రైల్వేస్టేషన్లు, రద్దీ రోడ్లు.. ఇలా అన్నిచోట్లా ట్రాఫిక్ పెరిగి భద్రతా సమస్యలు వస్తున్నాయి. అధిక రద్దీ వల్ల తొక్కిసలాటలు, లగేజి పోవడంతో ఖంగారు పడడం, చిన్నచిన్న దొంగతనాలు జరుగుతాయి. అందువల్ల మరింతగా భద్రతాచర్యలు చేపట్టడం చాలా అవసరం అవుతోంది. అందుకే నగరాలకు భద్రత కల్పించేందుకు ప్రాక్టికల్ పరిష్కారంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఆధారిత నిఘా వ్యవస్థ గణనీయంగా ఉపయోగపడుతోంది.
ఏఐ నిఘా: ఏమిటిది?
ఒకప్పుడు సీసీటీవీ కెమెరాల స్క్రీన్ల ముందు భద్రతా సిబ్బంది గంటల తరబడి కూర్చుని ఏదైనా అసాధారణంగా కనిపిస్తుందా అని చూసేవారు. కానీ ప్రస్తుతం ఏఐ నిఘా వ్యవస్థవల్ల కంప్యూటర్ విజన్, డీప్ లెర్నింగ్ ఆల్గరిథమ్స్, న్యూరల్ నెట్వర్క్లు ఉండి.. మరింత స్పష్టంగా చూస్తూ, మనుషులు చేయగలిగినదానికంటే ఇంకా వేగంగా స్పందిస్తున్నాయి.
కంప్యూటర్ విజన్ కెమెరాలు కేవలం వీడియో తీయడమే కాదు దాన్ని రియల్-టైంలో విశ్లేషిస్తాయి. నిషేధిత ప్రాంతంలో ఎవరైనా మూత్రవిసర్జన చేస్తున్నా, ఏదైనా జాతరలో ఎక్కువమంది జనాన్ని గమనించాలన్నా, రద్దీ మార్కెట్లో ఏదైనా వస్తువు పోయినా గుర్తిస్తాయి. ఇవి చాలా వేగంగా స్పందించి, సెకండ్లలోనే కంట్రోల్ సెంటర్లను అప్రమత్తం చేస్తాయి.
నగరాల్లోని నిఘా వ్యవస్థలలో ఏఐ కెమెరాలను ఉపయోగించడం ద్వారా కేవలం ఘటనలను గుర్తించడమే కాకుండా, ఒకే తరహాలో ఏఐనా జరుగుతున్నా ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలకు తెలుస్తుంది. ముఖాలను, అసాధారణ ప్రవర్తనను గుర్తించి, నేరచరిత్ర ఉన్నవారిని రియల్-టైంలో ఇట్టే పట్టేస్తాయి. తద్వారా వివిధ ప్రాంతాల్లో పదేపదే మోసాలు, నేరాలకు పాల్పడేవారిని గుర్తించడంలో పోలీసులకు సాయపడతాయి.
ఏఐ గుర్తిస్తే.. వెంటనే స్పందిస్తుంది
ఏఐ నిఘాకు ఉన్న పరిమితులేంటని ఒకసారి చూసుకుంటే, అది ఎక్కువమంది ప్రజలు గుమిగూడేచోట (అంటే రాజకీయ ర్యాలీలు, కచేరీలు, మతపరమైన కార్యక్రమాలు) కూడా స్పష్టంగా గుర్తిస్తుంది. రియల్ టైంలో రద్దీ నిర్వహణ, రద్దీప్రాంతాలలో పరిశీలనకు ఏఐ మాత్రమే ఉపయోగపడుతుంది. ఈ టెక్నాలజీలో ప్రెడిక్టివ్ ఎనాలసిస్, ప్యాటర్న్ ఎనాలసిస్ ఉపయోగించి ఎలాంటి ముప్పునైనా ముందుగానే అరికడుతుంది.
మనుషులను ఎక్కడ కావాలో అక్కడ పెట్టడం, సహాయాన్ని సరైన సమయంలో అందించడం కూడా దీనివల్ల సాధ్యమవుతుంది. రద్దీ నియంత్రణ కోసం పుణెలో ఒక పైలట్ స్మార్ట్ సిటీలో ఏఐని ఉపయోగించి, బహిరంగ కార్యక్రమాల్లో అత్యవసర పరిస్థితులను 42% తగ్గించారు.
విమానాశ్రయాలు, బస్టాండ్లలో పిల్లలు తప్పిపోయినా, చట్టవిరుద్ధ కార్యకలాపాలున్నా, లగేజి పోయినా ఏఐ కెమెరాలు గుర్తిస్తాయి. ఇవి కదలికలను, వస్తువులను, ఆడియోను కూడా గుర్తిస్తాయి. (ఉదా: రద్దీ ప్రాంతంలో అద్దం పగిలినా పట్టేస్తాయి) దీనివల్ల రాబోయే ప్రమాదాన్ని వెంటనే గుర్తుపట్టగలరు.
నేరాలు గుర్తించడమే కాదు.. ఆపుతాయి కూడా!
నేరాల రేటును తగ్గించడం ఏఐ నిఘా వ్యవస్థల ప్రాథమిక పనుల్లో ఒకటి. హైదరాబాద్, బెంగళూరు లాంటి నగరాలు బహిరంగ స్థలాల్లో ఏఐ నిఘావ్యవస్థను ఏర్పాటుచేసి.. చైన్ స్నాచింగ్, ఆస్తినష్టం, ఏటీఎంల చోరీల్లాంటి ఘటనలను 30% తగ్గించగలిగాయి. ఇవి కేవలం నేరాలకు వెంటనే స్పందించడమే కాక.. గతంలో జరిగిన ఘటనల్లో పాల్గొన్నవారిని గుర్తించి ఏదైనా జరగడానికి ముందే భద్రతా దళాలను అప్రమత్తం చేస్తాయి.
ఏఐ కెమెరాలు ముఖాలను, నంబర్ ప్లేట్లను, చొరబాట్లను గుర్తించి ఏవైనా తేడా ఉంటే వెంటనే చెబుతాయి. అర్ధరాత్రి ఎవరైనా ప్రహరీ ఎక్కుతున్నా, స్కూలు గేట్లు దాటుతున్నా ఏదో తేడా ఉందని ఏఐ గమనించి, వెనువెంటనే చెప్పేస్తుంది.
అంచనాతో కాకుండా డేటాతో నగరప్రణాళికలు
ఏఐ నిఘా అనేది కేవలం అత్యవసర పరిస్థితుల్లోనే కాదు.. నగర ప్రణాళికల కోసం ఎక్కడెక్కడ ఎలాంటి పరిస్థితి ఉందో సమగ్ర డేటా ఇవ్వడానికీ ఉపయుక్తంగా ఉంటుంది. ఉదాహరణకు రాత్రిపూట పార్కులు నిర్మానుష్యంగా ఉంటే అక్కడ మెరుగైన లైటింగ్, నిఘాను ఏర్పాటుచేసుకోవచ్చు. శనివారం సాయంత్రం బస్టాపులో రద్దీ ఎక్కువగా ఉంటే అక్కడ సదుపాయాలు మెరుగుపరచడంపై దృష్టిపెట్టచ్చు. స్మార్ట్ సిటీ ఇనీషియేటివ్లను డిజైన్ చేయడంలో ఈ సమాచారం బాగా ఉపయోగపడుతుంది. కేవలం అంచనాల మీద ఆధారపడి నగర ప్రణాళికలు వేసేకంటే ఇలా చేయడం మంచిది.
గోప్యత, న్యాయ విషయాల సంగతేంటి
ఇన్నిరకాల ప్రయోజనాలు ఉన్నా, ఏఐ నిఘా వ్యవస్థ వల్ల గోప్యత విషయంలో కొన్ని సమస్యలున్నాయి. భద్రతకోసమైనా తమమీద నిఘా ఉందంటే వ్యక్తులు ఆందోళనకు గురవుతారు. ఆధునిక ఏఐ నిఘా వ్యవస్థలు చట్టసంస్థలు చెబితే తప్ప వ్యక్తుల మీద అనవసర పరిశీలన లేకుండా వాళ్ల పనులు మాత్రమే గుర్తించగలవు.
చట్టపరంగా చూస్తే, ఈ నిఘా వ్యవస్థలలో చాలా వాటిని నగరపాలక సంస్థలు లేదా చట్టాలను అమలుచేసే వ్యవస్థలు డేటా ప్రొటెక్షన్ మార్గదర్శకాల ఆధారంగానే తీసుకుంటాయి. అయితే, ఈ వ్యవస్థ ప్రజాభద్రతను వ్యక్తిగత హక్కులతో బ్యాలెన్స్ చేసేందుకు ఏఐ ఆధారిత పర్యవేక్షణ నియంత్రణకు కఠినమైన జాతీయస్థాయి నిబంధనలు అమలుచేయాలి.
దోపిడీలను నిరోధించడానికి ఏఐ నిఘాలో డేటామాస్కింగ్, రోల్ ఆధారిత యాక్సెస్, తాత్కాలికంగా వీడియోలను దాచడం లాంటివి చేయాలి. తరచు ఆడిటింగ్తో ఈ చర్యలు తీసుకుంటే చట్టాన్ని వ్యతిరేకించకుండాప్రజలు దీన్ని నమ్మే అవకాశం ఉంటుంది.
మెరుగైన భవిష్యత్తు
ఎవరో గమనిస్తున్నారు అనే విధానం మారింది. ఇది నియంత్రణ కాదు.. రక్షణ. ఏఐ నిఘా అనేది ప్రజల ఉద్యోగాలు తీసేసేది కాదు. ప్రజాభద్రతను మరింత స్మార్ట్గా, వేగంగా అందిస్తుంది. మనుషులు తీసుకునే నిర్ణయాలకు బదులు రియల్ టైం ఏఐ నిఘాతో మన నగరాల్లో ఉండే ట్రాఫిక్ జామ్లు, రద్దీ నిర్వహణ, అత్యవసర పరిస్థితులు, నేరాలు అన్నింటి విషయంలో సులభంగా నిర్ణయాలు తీసుకోవచ్చు.

బృహస్పతి టెక్నాలజీస్ ఎండీ రాజశేఖర్ పాపోలు
Tags : 1