క్రూర మృగాల్లా వెంట పడుతున్న వీధి కుక్కలు
Breaking News
వంటగ్యాస్ కొరత.. కేంద్రం కీలక నిర్ణయం..
Published on Mon, 03/30/2026 - 15:10
దేశవ్యాప్తంగా ఎల్పీజీ సరఫరాలో ఏర్పడిన అంతరాయాలను అధిగమించేందుకు మోదీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. అంతర్జాతీయంగా ఇరాన్ వివాదం నేపథ్యంలో ముడి చమురు, ఇంధన సరఫరాలు దెబ్బతినడంతో.. సామాన్యులకు ఉపశమనం కలిగించేలా కిరోసిన్ నిబంధనలను సడలిస్తూ కేంద్ర పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖ ఇటీవల గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. గృహ అవసరాలకు, దీపాల కోసం కిరోసిన్ పంపిణీని వేగవంతం చేసేందుకు పెట్రోలియం భద్రత, లైసెన్సింగ్ నిబంధనల్లో కేంద్రం తాత్కాలిక మార్పులు చేసింది.
రాష్ట్రాల్లో తాత్కాలిక పునరుద్ధరణ
గతంలో కిరోసిన్ రహిత రాష్ట్రాలుగా ప్రకటించిన ప్రాంతాల్లో కూడా ఇప్పుడు దాని సరఫరాను ప్రభుత్వం పునరుద్ధరించింది. ఢిల్లీ, హరియాణా, ఉత్తర ప్రదేశ్, గుజరాత్ సహా మొత్తం 21 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ప్రజా పంపిణీ వ్యవస్థ (పీడీఎస్) ద్వారా సుపీరియర్ కిరోసిన్ ఆయిల్ (ఎస్కేఓ) అందుబాటులోకి రానుంది.
కొత్త నిబంధనల ముఖ్యాంశాలు
ప్రభుత్వ రంగ చమురు సంస్థలు (ఓఎంసీ) నిర్వహించే ఎంపిక చేసిన పెట్రోల్ బంకుల ద్వారా కిరోసిన్ విక్రయాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
ప్రభుత్వం గుర్తించిన ప్రతి అవుట్లెట్లో గరిష్టంగా 5,000 లీటర్ల కిరోసిన్ నిల్వ చేసుకోవచ్చు.
ప్రతి జిల్లాకు గరిష్టంగా రెండు సర్వీస్ స్టేషన్లకు మాత్రమే ఈ అనుమతి ఉంటుంది.
పెట్రోలియం రూల్స్, 2002 ప్రకారం డీలర్లు, రవాణా వాహనాలకు కొన్ని కఠినమైన లైసెన్సింగ్ నిబంధనల నుంచి మినహాయింపు ఇచ్చారు.
ఈ సడలింపులు తక్షణమే అమల్లోకి వస్తాయి. ఇవి 60 రోజుల పాటు లేదా తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు అమల్లో ఉంటాయి.
భద్రతలో రాజీ లేదు
నిబంధనలు సడలించినప్పటికీ భద్రత విషయంలో కేంద్రం కఠినంగా ఉన్నట్లు చెప్పింది. ‘పెట్రోలియం, పేలుడు పదార్థాల భద్రతా సంస్థ (పెసో) జారీ చేసిన భద్రతా ప్రోటోకాల్లు యధావిధిగా వర్తిస్తాయి. రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్రపాలిత ప్రాంతాలు సూచించిన నిర్దేశిత అవుట్లెట్ల ద్వారా మాత్రమే పంపిణీ జరుగుతుంది. ఈ కిరోసిన్ను కేవలం వంట, దీపాల వంటి గృహ అవసరాలకు మాత్రమే ఉపయోగించాలి’ అని నోటిఫికేషన్ స్పష్టం చేసింది.
ఇంధన భద్రతే లక్ష్యం
ప్రస్తుతం నెలకొన్న అంతర్జాతీయ సంక్షోభం దృష్ట్యా గృహాలపై వంటగ్యాస్ భారం పడకుండా ఉండాలని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. గతంలో పీడీఎస్ కింద కిరోసిన్ సరఫరాను నిలిపివేసిన చోట కూడా ప్రస్తుతం ఉన్న రిటైల్ నెట్వర్క్ను వాడుకుని తక్షణమే సరఫరాను పునరుద్ధరించడం ఈ చర్య వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశమని కొందరు చెబుతున్నారు.
ఇదీ చదవండి: సముద్రగర్భ కేబుళ్లపై ఇరాన్ నజర్!
Tags : 1