ఒంటరైన గంభీర్ రోహిత్ కోసం రెండుగా చీలిన బీసీసీఐ
Breaking News
మండలి చైర్మన్పై మంత్రులు, టీడీపీ ఎమ్మెల్సీల ప్రవర్తన అవమానకరం
Published on Thu, 03/05/2026 - 02:34
సాక్షి, అమరావతి: శాసనమండలిలో బుధవారం చోటుచేసుకున్న ఘటనల కారణంగా ప్రజాస్వామ్య చరిత్రలో చీకటి రోజుగా నిలిచిపోతుందని వైఎస్సార్సీపీ నేతలు మండలిలో ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ, మాజీ మంత్రి మేరుగు నాగార్జున, మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్బాబు ఆవేదన వ్యక్తం చేశారు. శాసనమండలి చైర్మన్ కొయ్యే మోషేన్రాజు పట్ల మంత్రులు, టీడీపీ సభ్యులు అమానవీయంగా, అవమానకరంగా ప్రవర్తించారని బుధవారం విడుదల చేసిన ప్రకటనలో మండిపడ్డారు.
రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న వ్యక్తిని గౌరవించాల్సింది పోయి కులం, మతం పేరుతో లక్ష్యంగా చేసుకోవడం చట్టసభల సంస్కృతికి విరుద్ధమన్నారు. సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకే ఈ దాడులు జరిగాయని స్పష్టమైందని ఆరోపించారు. మంత్రి అచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్యలు యాదృచ్ఛికం కాదని, దీనివెనుక స్పష్టమైన దురుద్దేశం ఉందన్నారు. మంత్రి లోకేశ్ సభలో ఉండగానే ఈ ఘటన జరగిందన్నారు. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న దళిత వ్యక్తిని మతం, కులం పేరుతో అవమానించడం కేవలం వ్యక్తిగత దాడి మాత్రమే కాకుండా సామాజిక న్యాయం, సమానత్వంపై దాడి అని స్పష్టం చేశారు.
చైర్మన్ను ఏ మతానికి చెందినవారు అని ప్రశ్నించడం చట్టసభల గౌరవాన్ని మంటగలిపిందని పేర్కొన్నారు. తిరుమల లడ్డూ వ్యవహారాన్ని రాజకీయ దుమారంగా మార్చి.. ఆ నీడలో హెరిటేజ్ ఫుడ్స్ అనుమానాస్పద లావాదేవీలపై వస్తున్న ఆరోపణలను దారి మళ్లించేందుకు అధికార పక్షం ప్రయత్నిస్తోందని ఆరోపించారు. తిరుమల నెయ్యి కొనుగోళ్లలో అవకతవకలపై ఆధారాలతో ప్రశ్నలు లేవనెత్తగానే అధికార పక్షం అసహనానికి లోనైందన్నారు.
మార్కెట్ ధరకంటే అధిక ధరలకు నెయ్యిని సరఫరా చేస్తూ హెరిటేజ్ యూనిట్ ద్వారా లాభాలు పొందుతున్నారనే అంశాలపై సమాధానం చెప్పలేకపోయినందుకే సభను గందరగోళానికి గురిచేసే ప్రయత్నం జరిగిందని విమర్శించారు. మండలిని వారి చేతుల్లోకి తీసుకోవాలన్న దురుద్దేశంతోనే చైర్మన్పై వ్యక్తిత్వ హననానికి పాల్పడ్డారని అన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థకు హానికరంగా వ్యవహరించిన మంత్రి అచ్చెన్నాయుడిపై తక్షణ చర్యలు తీసుకుని, ఆయనను మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు.
Tags : 1