YSRCP నేతలతో గుడివాడ అమర్నాథ్ అత్యవసర మీటింగ్
Breaking News
టోల్ వసూళ్లకు కొత్త ప్లాన్.. గడ్కరీ కీలక ప్రకటన!
Published on Fri, 09/11/2026 - 14:54
భారతదేశంలో ప్రారంభమైన ఫాస్ట్ట్యాగ్ విధానం రవాణా వ్యవస్థలో గణనీయమైన మార్పును తీసుకు వచ్చింది. టోల్ ప్లాజాల వద్ద వాహనాలు ఎక్కువసేపు వేచి ఉండకుండా.. నగదు చెల్లింపుల అవసరం లేకుండా, టోల్ ఫీజును స్వయంచాలకంగా వసూలు చేయడం ఫాస్ట్ట్యాగ్ ద్వారా సాధ్యమైంది. ఈ విధానం టోల్ వసూళ్లను మరింత సులభంగా, వేగంగా, పారదర్శకంగా మార్చిందని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు.
ఫాస్ట్ట్యాగ్ను ప్రభుత్వం 2016లో ప్రారంభించింది. రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ (RFID) టెక్నాలజీ ఆధారంగా పనిచేసే ఫాస్ట్ట్యాగ్ వాహనం ముందు భాగంలో అమర్చుతారు. వాహనం టోల్ ప్లాజా వద్దకు చేరుకున్నప్పుడు, అక్కడి సెన్సర్లు ఫాస్ట్ట్యాగ్ను గుర్తించి, వాహనానికి సంబంధించిన టోల్ మొత్తాన్ని అనుసంధానించిన ఖాతా నుంచి ఆటోమేటిక్గా తీసుకుంటుంది. దీంతో వాహనదారులు టోల్ కౌంటర్ వద్ద ప్రత్యేకంగా క్యాష్ చెల్లించాల్సిన అవసరం ఉండదు.
2021లో ఫాస్ట్ట్యాగ్ను తప్పనిసరి చేయడం ద్వారా.. ప్రభుత్వం డిజిటల్ టోల్ చెల్లింపులను మరింత వేగంగా విస్తరించింది. దీని వల్ల నగదు ఆధారిత టోల్ వసూళ్లు తగ్గి, జాతీయ రహదారులపై ఎలక్ట్రానిక్ టోల్ కలెక్షన్ విస్తృతంగా అమలులోకి వచ్చింది. వాహనాల రాకపోకలు సులభతరం కావడంతో పాటు.. టోల్ వసూళ్లలో పారదర్శకత కూడా పెరిగింది.
ఇప్పుడు ప్రభుత్వం ఫాస్ట్ట్యాగ్తో పాటు వెహికల్ నంబర్ ప్లేట్ గుర్తింపు కోసం కావలసిన టెక్నాలజీని ప్రవేశపెట్టడానికి సన్నద్ధమవుతోంది. ఈ విధానం ద్వారా.. టోల్ చెల్లించకుండా వెళ్లే వాహనాలను గుర్తించడం, వాహనాల కదలికలను పర్యవేక్షించడం, టోల్ వసూళ్లలో జరిగే లీకేజీలను తగ్గించడం మరింత సులభం కావచ్చు.
ఫాస్ట్ట్యాగ్, నంబర్ ప్లేట్ రెండింటినీ కలిపి ఉపయోగించే కొత్త టోల్ వ్యవస్థ ద్వారా ఏటా అదనంగా సుమారు రూ.10,000 కోట్ల టోల్ ఆదాయం సమకూరే అవకాశం ఉంది. దీని ద్వారా.. ప్రభుత్వం ప్రస్తుతం వసూలు కాకుండా మిగిలిపోతున్న టోల్ మొత్తాన్ని కూడా సమర్థవంతంగా సేకరించగలదని భావిస్తోందని గ్లోబల్ ఫిన్టెక్ ఫెస్ట్ 2026లో గడ్కరీ వెల్లడించారు.
ఇదీ చదవండి: జియో రూ.149 రీఛార్జ్ ప్లాన్.. 90 రోజుల జియోహాట్స్టార్!
Tags : 1