కామన్వెల్త్ లో భారత్ పతకాల పంట.. 13 స్వర్ణాలతో 4వ స్థానం..
Breaking News
పెరిగిన కార్ల అమ్మకాలు.. హ్యుందాయ్కు ఆల్టైమ్ రికార్డు!
Published on Sun, 08/02/2026 - 16:14
ఇండియా కార్ల మార్కెట్కు 2026 జూలై నెల మంచి ఊపునిచ్చింది. దేశంలోని ప్రముఖ కార్ల తయారీ సంస్థలు దాదాపు అన్నీ కూడా.. గత ఏడాది జూలైతో పోలిస్తే మెరుగైన అమ్మకాలను నమోదు చేశాయి. ముఖ్యంగా హ్యుందాయ్ తన చరిత్రలోనే అత్యధిక నెలవారీ అమ్మకాలను సాధించగా, టాటా మోటార్స్ ఎలక్ట్రిక్ కార్ల విక్రయాల్లో భారీ వృద్ధిని నమోదు చేసింది. మహీంద్రాకంపెనీ ఎస్యూవీ విభాగంలో మరోసారి తన ఆధిపత్యాన్ని చాటుకోగా, కియా, టయోటా, ఎంజీ మోటార్, నిస్సాన్ కూడా బలమైన విక్రయాలను పొందాయి.
టాటా మోటార్స్.. జూలైలో మొత్తం 63,760 ప్యాసింజర్ వాహనాలను విక్రయించింది. గత ఏడాది ఇదే నెలలో అమ్ముడైన 40 వేల యూనిట్లతో పోలిస్తే ఇది 59 శాతం ఎక్కువ. ఇందులో దేశీయ మార్కెట్లోనే 62,611 వాహనాలు అమ్ముడయ్యాయి. ముఖ్యంగా.. ఎలక్ట్రిక్ వాహనాల విభాగంలో టాటా మరోసారి తన సత్తా చాటింది. జూలైలో 15,217 ఈవీలను విక్రయించి గత ఏడాది కంటే.. 114 శాతం వృద్ధిని నమోదు చేసింది.
మహీంద్రా కంపెనీ.. జూలైలో దేశీయ మార్కెట్లో 60,048 ఎస్యూవీలను విక్రయించింది. గత ఏడాదితో పోలిస్తే ఇది 20 శాతం అధికం. అన్ని రకాల వాహనాలను కలిపి చూస్తే మహీంద్రా మొత్తం 1,03,860 యూనిట్లను విక్రయించి 26 శాతం వృద్ధిని సాధించింది. విదేశీ మార్కెట్లకు చేసిన ఎగుమతులు కూడా గణనీయంగా పెరిగాయి.
హ్యుందాయ్ మోటార్ ఇండియా.. దేశీయ అమ్మకాలు, ఎగుమతులు కలిపి మొత్తం 75,360 వాహనాలను విక్రయించింది. ఇది హ్యుందాయ్ భారత చరిత్రలోనే అత్యధిక నెలవారీ అమ్మకాలుగా నిలిచింది. దేశీయంగా 54,210 కార్లు అమ్ముడవగా, ఎగుమతులు కూడా ఎనిమిదేళ్లలో అత్యధిక స్థాయికి చేరాయి. కంపెనీకి అత్యధిక అమ్మకాలు తెచ్చిపెట్టిన మోడల్గా క్రెటా నిలవగా, ఐ20 కూడా ఈ ఏడాదిలో అత్యుత్తమ నెలవారీ విక్రయాలను నమోదు చేసింది.
కియా ఇండియా కూడా.. జూలైలో రికార్డు స్థాయి అమ్మకాలను నమోదు చేసింది. మొత్తం 28,200 యూనిట్లను విక్రయించి గత ఏడాదితో పోలిస్తే 27.4 శాతం వృద్ధిని సాధించింది. ఈ ఏడాది ప్రారంభం నుంచి ఇప్పటివరకు కంపెనీ విక్రయాలు గణనీయంగా పెరిగాయి. ముఖ్యంగా కొత్త తరం సెల్టోస్కు మార్కెట్లో మంచి ఆదరణ లభిస్తోంది. సోనెట్, కారెన్స్ క్లావిస్, కారెన్స్ క్లావిస్ ఈవీ, సైరోస్ ఈవీ వంటి మోడళ్లు కూడా అమ్మకాలకు ఊతమిచ్చాయి.
టయోటా కిర్లోస్కర్ మోటార్ జులైలో మొత్తం 32,516 వాహనాలను విక్రయించి వృద్ధిలో నిలకడను చూపించింది. దేశీయ మార్కెట్లో 30,516 యూనిట్లు అమ్ముడయ్యాయి. గత ఏడాదితో పోలిస్తే.. కంపెనీ దేశీయ అమ్మకాలు 5 శాతం పెరిగాయి. అలాగే ఈ ఏడాది తొలి ఏడు నెలల్లో టయోటా మొత్తం విక్రయాలు 13 శాతం వృద్ధిని నమోదు చేశాయి.
జేఎస్డబ్ల్యూ ఎంజీ మోటార్ ఇండియా.. వరుసగా రెండో నెల అత్యధిక నెలవారీ అమ్మకాలను నమోదు చేసింది. జూలైలో 8,158 వాహనాలను విక్రయించిన కంపెనీ, తన మొత్తం అమ్మకాలలో 80 శాతానికి పైగా ఎలక్ట్రిక్ వాహనాలేనని వెల్లడించింది. దీంతో భారత ఈవీ మార్కెట్లో ఎంజీ తన స్థానాన్ని మరింత బలోపేతం చేసుకుంది.
ఇక నిస్సాన్ జూలైలో.. దేశీయ మార్కెట్లో 4,518 వాహనాలను విక్రయించి ఏకంగా 218 శాతం వృద్ధిని నమోదు చేసింది. ఇటీవల విడుదలైన కొత్త టెక్టాన్ ఎస్యూవీకి వినియోగదారుల నుంచి మంచి స్పందన రావడంతో కంపెనీ అమ్మకాలు ఒక్కసారిగా పెరిగాయి.
ఇదీ చదవండి: కొత్త రకం డీజిల్ వచ్చేసింది.. దీని స్పెషాలిటీ ఏంటంటే?
Tags : 1