ఆంధ్ర ప్రజలను తాకట్టు పెట్టి మరి ... బాబు అప్పుల చిట్టా ఆధారాలతో చూపించిన పేర్ని నాని
Breaking News
రైల్వే ప్రయాణికులకు అలర్ట్.. రెండు రోజులు రిజర్వేషన్లు బంద్!
Published on Fri, 03/13/2026 - 17:43
కోట్లాది మంది ప్రయాణికులకు సేవలు అందిస్తున్న భారత రైల్వే.. టికెట్ బుకింగ్ ప్రక్రియను సులభతరం చేయడానికి PRS అనే కంప్యూటరైజ్డ్ వ్యవస్థను ఉపయోగిస్తున్నారు. ఈ వ్యవస్థ ద్వారా దేశంలోని ఏ రైల్వే స్టేషన్ నుంచైనా రిజర్వేషన్ టికెట్లు బుక్ చేసుకోవచ్చు. అయితే ఈ సిస్టమ్ పనితీరును మెరుగుపరచడానికి.. సాంకేతిక నిర్వహణ పనులు చేపట్టాల్సి వచ్చింది.
సిస్టమ్ అప్గ్రేడ్ కారణంగా కొన్ని గంటల పాటు ముఖ్యమైన సేవలు అందుబాటులో ఉండవు. కాబట్టి ప్రయాణికులు ముందుగా ఈ విషయాన్ని తెలుసుకొని తమ ప్రయాణ ప్రణాళికలను సర్దుబాటు చేసుకోవాలని అధికారులు సూచించారు. ఢిల్లీ పీఆర్ఎస్ సిస్టమ్తో అనుసంధానమైన సేవలకు మాత్రమే ఇది వర్తిస్తుంది.
రైల్వే అధికారుల ప్రకారం.. మార్చి 14 అర్ధరాత్రి నుంచి, మార్చి 15 అర్ధరాత్రి వరకు.. అంటే ఈ రెండు రోజులు నిర్వహణ పనులు జరుగుతాయి. ప్రతి రాత్రి సుమారు మూడు గంటల పాటు PRS సేవలు అందుబాటులో ఉండవు. ఈ సమయంలో కొన్ని ఆన్లైన్ & టెలిఫోన్ సేవలు పనిచేయవు.
ఆన్లైన్ టికెట్ బుకింగ్, టికెట్ రద్దు, పీఎన్ఆర్ స్టేటస్ చెక్, కరెంట్ రిజర్వేషన్ సమాచారం, టికెట్కు సంబంధించిన ఇతర విచారణలు మాత్రమే కాకుండా.. ఇండియన్ రైల్వేస్ అందించే 139 పీఎన్ఆర్ విచారణ సేవ కూడా పనిచేయదు.
PRS అంటే?
PRS (ప్యాసింజర్ రిజర్వేషన్ సిస్టం) అనేది భారతీయ రైల్వే రూపొందించిన కంప్యూటరైజ్డ్ వ్యవస్థ. ఈ వ్యవస్థ ద్వారా రైల్వే టికెట్కు సంబంధించిన.. టికెట్ బుకింగ్, టికెట్ క్యాన్సిల్, తత్కాల్ టికెట్ జారీ, వెయిటింగ్ లిస్ట్ స్టేటస్, ట్రైన్ చార్ట్ తయారీ మొదలైన సేవలను అందిస్తుంది.
రెండు రోజుల అంతరాయాన్ని దృష్టిలో ఉంచుకుని.. అవసరమైన టికెట్లు ముందుగానే బుక్ చేసుకోవడం, అత్యవసర ప్రయాణాలకు ముందస్తు ప్రణాళిక చేయడం వంటివి ముందుగానే చేసుకోవాలని రైల్వే అధికారులు ప్రయాణికులకు సూచనలు జారీ చేశారు. ఈ తాత్కాలిక నిలిపివేత అనేది సిస్టమ్ పనితీరును మెరుగుపరచడం కోసం మాత్రమేనని అధికారులు తెలిపారు. భవిష్యత్తులో ప్రయాణికులకు మరింత వేగవంతమైన మరియు సులభమైన సేవలను అందించడమే ఈ నిర్వహణ పనుల లక్ష్యమని చెప్పారు.
Tags : 1