Weather: ఏపీకి భారీ వర్ష సూచన
Breaking News
దృఢ సంకల్పానికి కేరాఫ్ అడ్రస్ ఈ పారాసైక్లిస్ట్..!
Published on Tue, 07/15/2025 - 17:50
ధృఢ సంకల్పం ఎంతటి వైకల్యాన్ని అయినా అధిగమించి లక్ష్యాన్ని చేరుకునేలా చేస్తుంది. అందుకు ఎన్నో ఉదంతాలు ఉదాహరణగా నిలిచాయి. తాజాగా ఈ పారాసైక్లిస్ట్ కూడా ఆ కోవలోకి చేరిపోయారు. ఆయన తన రాష్ట్ర అభ్యున్నతి కోసం అనితరసాధ్యమైన యాత్ర చేపట్టారు. ఆ జర్నీ అతడి శారీరక స్థితి రీత్యా అత్యంత సవాలుతో కూడినది. అయినప్పటికీ అన్ని కష్టాలను ఓర్చుకుంటూ లక్ష్యాన్ని చేధించి దృఢ సంకల్పానికి మారుపేరుగా నిలిచారాయన.
ఆయనే పారాసైక్లిస్ట్ రాకేష్ బానిక్. అతను తన శారీరక అసమానతలు, కఠినమైన వాతావరణ పరిస్థితులను పలు అవాంతరాలు అధిగమించి మరి ఏకంగా ఏడు వేల కిలోమీటర్లు చుట్టొచ్చారు. అదంతా ఎలా సాధ్యమైందో ఆయన మాటల్లోనే విందామా..!.
అస్సాంకి చెందిన ఆయన ఇది వ్యక్తిగత విజయం కాదని తన రాష్ట్రాన్ని, భారతదేశాన్ని ప్రపంచ వేదికపై నిలబెట్టడానికి చేసిన చిన్న ప్రయత్నమని అన్నారు. తాను ఈ యాత్రను అస్సాం పర్యాటక మంత్రిత్వ శాఖ విదేశాంగ మంత్రిత్వ శాఖ మద్దతుతో ఏప్రిల్ 29న మాస్కోలోని భారత రాయబార కార్యాలయం నుంచి ప్రారంభించినట్లు తెలిపారు.
దాదాపు మూడు నెలల పాటు, రష్యా, కజికిస్తాన్, ఉజ్బెకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, నేపాల్ గుండా సైకిల్ తొక్కుతూ దాదాపు 6 వేల కిలోమీటర్లు ప్రయాణించారు. ఒంటికాలితో తొక్కుతూ ఈ యాత్రను విజయవంతంగా పూర్తి చేయడం విశేషం. తాను ఈ నాలుగు దేశాలలోని విశ్వవిద్యాలయాలు, కళాశాలల్లోని విద్యార్థులతో సంభాషించారట. వారికి భారతీయ సంస్కృతి, వారసత్వం, ఆతిథ్యం గురించి పరిచయం చేశారట.
ఎదురైన ఇబ్బందులు..
విదేశీ భూభాగంలో కృత్రిమ కాలుతో సైక్లింగ్ చేయడం చాలా కష్టమైన పని. ప్రతికూల వాతావరణంలో చేస్తున్న కఠినమైన ప్రయాణంలా ఉందని అన్నారు. రష్యాలో మైనస్లలో ఉష్ణోగ్రతలు పడిపోతుంటే..ఉజ్బెకిస్తాన్లో ఏకంగా 45 డిగ్రీల ఉష్ణోగ్రతని ఎదుర్కొంటూ సైక్లింగ్ చేయాల్సి వచ్చిందని అన్నారు. ఆ విధమైన వాతావరణ మార్పులకు తట్టుకుంటూ ప్రయాణించడం అత ఈజీ కాదని అన్నారు. పైగా సరైన ఫుడ్ దొరకక పడ్డ ఇబ్బందులు అంత ఇంత కాదని కూడా అన్నారు.
ఈ పరిస్థితులన్నింటికి తోడు చైనా వీసా తిరస్కరణ ఎంతగానో బాధించిందన్నారు. దాంతో నేపాల్ గుండా వెళ్లేలా జర్నీని ప్లాన్ చేసుకున్నట్లు తెలిపారు. పర్యాటక ప్రమోషన్ లక్ష్యంగా చేస్తున్న ఈ యాత్ర చైనా ప్రభుత్వానికి నచ్చకపోవడంతోనే టిబెట్లోకి అడుగుపెట్టనివ్వలేదని బానిక్ తెలిపారు. ఇక అఫ్ఘనిస్తాన్ గుండా సైక్లింగ్ చేస్తూ వెళ్లడం అన్నది అత్యంత సవాలుతో కూడినది. తాలిబాన్ నుంచి నేరుగా రాలేకపోయినా..అక్కడకు ఒక అద్దె కారులో 150 కిలోమీటర్లు ప్రయాణించి తాలిబాన్ చెక్పోస్ట్లు దాటి కాబూల్కి వెళ్లినట్లు తెలిపారు.
కాబూల్లోని భారత రాయబార కార్యాలయం తన ప్రతి కదలికను చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసినట్లు వివరించారు. అక్కడ ఏకంగా ఏడెంచల కట్టుదిట్టమైన భద్రత ఏదోలా అనిపించిందన్నారు. అయితే అక్కడ తాలిబాన్ల నుంచి తనకు ఎలాంటి ముప్పు వాటిల్లకపోయినా..హై సెక్యూరిటీ నడుమ బానిక్ని త్వరగా పంపిచేయాలన కాబోల్లోని భారత రాయబార కార్యాలయం భావంచిందట.
అదీగాక ఆయన ఆహార్యం కూడా ఈజీగా విదేశీయుడని గుర్తించేలా ఉండటంతో, హోటల్ నుంచి బయటకు వెళ్లేలా కాబూల్ భారత రాయబార కార్యాలయం ప్లాన్ చేసినట్లు వివరించారు. చివరికి భారత రాయబార కార్యాలయం సురక్షితమైన వాహనంలో విమానాశ్రయానికి చేర్చిందని తెలిపారు. తాను ఇక అక్కడి నుంచి నేపాల్కి పయనమైనట్లు తెలిపారు.
ఓ పెనువిషాదంలో..
2012లో అస్సాంలోని కాలిబోర్ సమీపంలో జరిగిన ఒక విపత్కర ప్రమాదంలో రాకేష్ బానిక్ తన కాలును కోల్పోయాడు. దాంతో రెండేళ్లు మంచానికే పరిమితమయ్యాడు. అయితే 2014లో కృత్రిమ కాలుని పొంది.. ఆ వైకల్యాన్ని తన బలంగా మార్చుకోవాలని గట్టిగా నిర్ణయించుకున్నాడు. అలా పారాసైక్లిస్ట్గా మారి ఖార్దుంగ్ లా పాస్ (17,582 అడుగులు) ఎత్తు నుంచి బ్యాంకాక్, గౌహతి మధ్య తేమతో కూడిన మైదానాల వరకు విభిన్న యాత్రలు చేశారు. పైగా సుమారు 21 వేల కిలోమీటర్లు సైకిల్పైనే చుట్టొచ్చారు.
(చదవండి: ఎవరీ సంధ్యారాణి మాఝి..? ఏకంగా ప్రభుత్వ వాహన మహిళా డ్రైవర్గా..)
Tags : 1