ప్రధాని మోదీని కలిసిన క్రికెటర్ వైభవ్ సూర్యవంశి
Breaking News
అటు పీడీసీ మందుల దందా ఇటు నకిలీల జోరు!
Published on Thu, 05/29/2025 - 13:12
కర్నూలు(హాస్పిటల్): పీడీసీ(ప్రాపగండ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ) మందులను కొన్ని మెడికల్ షాపుల్లో విక్రయిస్తున్నారు. వాటిపై భారీగా ఎంఆర్పీలు ముద్రించి.. డిస్కౌంట్లు సైతం భారీగా ఇస్తున్నట్లు హంగామా చేస్తున్నారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో మూడు వేలకు పైగా రిటైల్, హోల్సేల్ మెడికల్ షాపులు ఉన్నాయి. ఇందులో కర్నూలు నగరంలోనే అధికంగా ఉన్నాయి. ఇక్కడి నుంచే హోల్సేల్ దుకాణాల ద్వారా జిల్లాలోని నలుమూలల్లో ఉండే రిటైల్ దుకాణాలకు మందులు వెళ్తుంటాయి. అయితే ఇటీవల కాలంలో సొంతంగా మందులు తయారు చేయించుకుని విక్రయించే విధానం తెరపైకి వచ్చింది. అంటే మార్కెట్లో లభించే బ్రాండెడ్ మందులే గాకుండా మందులు తయారు చేసే కంపెనీలతో మాట్లాడుకుని వారికి అవసరమైన ఔషధాలను తయారు చేయించుకుని విక్రయించుకునే అవకాశం వచ్చింది.
నాణ్యత అనుమానమే!
పీడీసీ(ప్రాపగండ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ) మందులను ఆయా ఫార్మాకంపెనీలతో మాట్లాడుకుని తయారు చేయించుకోవచ్చు. వాటిపై ఎంఆర్పీలు అవి తయారు చేయించుకునే వారి ఇష్టం. వాటిపై ఎంతైనా వేసుకోవచ్చు. ఎంతంటే బ్రాండెడ్ మందుల కంటే అధికంగా ఉండేటంత. ఏదైనా ఔషధాన్ని కనిపెట్టాలంటే సదరు ఫార్మా కంపెనీ ఎన్నో సంవత్సరాలు కష్టపడి తయారు చేస్తుంది. ఈ మేరకు కొన్ని నిర్ణీత సంవత్సరాల పాటు ఆ మందుకు పేటెంట్ తీసుకుంటుంది. ఆ పేటెంట్ కాలం ముగిసిన తర్వాత ఆ మందు ఫార్ములా తీసుకుని ఎవ్వరైనా తయారు చేసుకోవచ్చు. ఇతర బ్రాండెడ్ కంపెనీలతో పాటు ఊరు పేరు తెలియని కంపెనీలు కూడా మందులు తయారు చేసి జనంపైకి వదులుతున్నాయి. ఈ మేరకు భారీగా మందులపై ఎంఆర్పీలు ముద్రించి దోచుకుంటున్నాయి. ప్రస్తుత పోటీ ప్రపంచంలో కొన్ని ప్రధాన దుకాణాల్లో మందుల కొనుగోలుపై 10 శాతం డిస్కౌంట్ ఇస్తున్నారు. కానీ వైద్యులకు అటాచ్డ్గా ఉన్న మందుల దుకాణాల్లో లభించే ఈ పీడీసీ మందులపై ఎలాంటి డిస్కౌంట్స్ ఉండవు. పైగా సదరు డాక్టర్ రాసిన మందులు అక్కడ మాత్రమే లభిస్తాయి. అయితే ఈ మందులు ఎంత మేరకు పనిచేస్తాయి. వాటి నాణ్యత ఎంత అనేది ప్రతి దాన్ని ల్యాబ్లో పరీక్షిస్తే గానీ తెలియని పరిస్థితి.
అ‘ధన’పు లాభాలు
ఉదాహరణకు ఒక బ్రాండెడ్ ఔషధం ధర రూ.300లు ఉందంటే...అందులో కంపెనీకి సంబంధించి తయారీ ఖర్చులు, ప్రచార ఖర్చులు, మార్కెటింగ్ ఖర్చులు అన్నీ కలిపి ఉంటాయి. కానీ పీడీసీ కంపెనీకి ఇలాంటి ఖర్చులేమీ ఉండవు. ఆ మందులపై భారీగా తగ్గింపు ఉండాలి. అంటే ఆ ఔషధం రూ.100లోపు ఉండాలి. కానీ పీడీసీ విషయంలో మాత్రం ఆ మందు ధర రూ.400 నుంచి రూ.600 వరకు ఉంటోంది. దీనిని బట్టి ఈ మందులపై ఎంతమేరకు లాభం ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ఒకప్పుడు హోల్సేల్ ఏజెన్సీలు ఉన్న వారు ఇలాంటి మందులను వైద్యులున్న మెడికల్ షాపులకు పంపేవారు. ఇప్పుడు నేరుగా వైద్యులే ఏజెన్సీలు ఏర్పాటు చేసుకుని ఆ అదనపు లాభాలు కూడా వారే పొందుతున్నారు.
కేసులు నమోదు చేశాం
మార్కెట్లో లభించే అన్ని మందుల కంపెనీలు అనుమతి తీసుకునే తయారు చేస్తాయి. వాటిపై ఎంఆర్పీలు ఆయా కంపెనీలు ఇష్టం. ఎంఆర్పీలు, డిస్కౌంట్లను ప్రశ్నించలేం. ఎంఆర్పీ కంటే ఎక్కువ విక్రయిస్తే కేసులు నమోదు చేస్తాం. పీడీసీ మందుల నాణ్యతపై తరచూ శాంపిల్స్ తీసి పంపిస్తున్నాం. ఇందులో ఇటీవల నంద్యాలలో రెండు, ఆదోనిలో ఒక శాంపిల్ సబ్ స్టాండర్డ్(నాణ్యతా ప్రమాణాలు లేనివి) అని నివేదికలు వచ్చాయి. ఈ మేరకు ఆయా దుకాణాలు, కంపెనీలపై కేసులు నమోదు చేశాం. –రమాదేవి, ఔషధ నియంత్రణ శాఖ ఏడీ, కర్నూలు
ఇలా చేయాలి..
నకిలీ మందుల మోసాలను అరికట్టేందుకు సదరు కంపెనీలు ఇటీవల మందుల స్ట్రిప్పై క్యూఆర్ కోడ్ను ముద్రిస్తున్నాయి. ఈ క్యూ ఆర్ కోడ్ను స్కాన్ చేస్తే అవి నకిలీవా అసలువా అనేది తెలిసిపోతుంది.
నకి‘లీలలు’
ఒకవైపు పీడీసీ మందుల దందా జోరుగా సాగుతున్న వేళ ఇమిటేషన్ డ్రగ్స్(నకిలీ) కొత్త వ్యాపారాన్ని ప్రారంభమైంది.
మార్కెట్లో బాగా పేరున్న బ్రాండ్ల మందులను అచ్చుగుద్దినట్లు తయారు చేసి విక్రయిస్తున్నారు.
గతంలో జాన్సన్ కంపెనీకి చెందిన అ్రల్టాసెట్ మాత్రలను విజయవాడ కేంద్రంగా తయారు చేసి తెలుగు రాష్ట్రాల్లో విక్రయించి పట్టుబడ్డారు.
మూడు రోజుల క్రితం హైదరాబాద్లో ఓ వ్యక్తి అబాట్ కంపెనీ తయారు చేసిన థైరోనామ్ అనే థైరాయిడ్ టాబ్లెట్లను నకిలీవి తయారు చేసి విక్రయిస్తూ పట్టుబడ్డాడు.
ఇటీవల కర్నూలులో ఓ దుకాణంలో సిస్టోపిక్ కంపెనీ గ్యాస్ట్రబుల్ కోసం తయారు చేసిన సైరా–డి అనే క్యాప్సుల్ను నకిలీగా తయారు చేశారు. ఎంఆర్పీ మాత్రం తప్పుగా ముద్రించి పట్టుబడ్డాడు.
ఇటీవల కాలంలో నకిలీ మందుల వ్యాపారం కూడా జోరుగా సాగుతోంది. అచ్చుగుద్దినట్లు బ్రాండ్ను పోలి ఉండటంతో సామాన్య ప్రజలతో పాటు వ్యాపారులు కూడా గుర్తించలేని విధంగా ఆ మందులు ఉంటున్నాయి.
భారీగా ఆఫర్లు
పీడీసీ మందుల క్రయ విక్రయాలు ఎక్కువ కావడం, పోటీ పెరగడంతో ప్రస్తుతం వాటిపై భారీ డిస్కౌంట్లు అందిస్తున్నారు. డాక్టర్ అటాచ్డ్ కౌంటర్లలో ఈ మందులు ఎంఆర్పీకి ఇస్తుండగా, కొన్ని కార్పొరేట్ మందుల దుకాణాలు, స్థానిక ఏజెన్సీలు నేరుగా రిటైల్ దుకాణాలు ఏర్పాటు చేసి భారీగా డిస్కౌంట్లు ప్రకటిస్తున్నాయి. ఈ మేరకు కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాల, మెడికల్ కాలేజీ, రాజ్విహార్, పాతబస్టాండ్, వెంకటరమణ కాలనీ, కొత్తబస్టాండ్ వంటి ప్రాంతాల్లో షాపు బోర్డుపైనే 25శాతం వరకు డిస్కౌంట్లు ప్రకటిస్తున్నారు. పీడీసీ మందులు విక్రయించే దుకాణాలకు సైతం సదరు ఏజెన్సీలు భారీగా ఆఫర్లు ఇస్తున్నాయి. పది స్ట్రిప్పులు కొంటే పది ఫ్రీ అంటూ ఆఫర్లు ఇచ్చేస్తున్నారు.
Tags : 1