కేజ్రీవాల్‌ పిటిషన్‌పై విచారణ వాయిదా | Sakshi
Sakshi News home page

ఈడీ సమన్లపై కేజ్రీవాల్‌ పిటిషన్‌.. ఢిల్లీ హైకోర్టులో విచారణ వాయిదా

Published Wed, Mar 20 2024 10:07 AM

Arvind Kejriwal Challenged ED Summons In Delhi High Court - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : మద్యం పాలసీ కుంభకోణం కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సమన్లను సవాల్‌ చేస్తూ.. ఆప్‌ కన్వీనర్‌, ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణను ఢిల్లీ హైకోర్టు వాయిదా వేసింది. కేజ్రీవాల్‌ పిటిషన్‌పై సమాధానం ఇవ్వాలంటూ రెండు వారాల గడువును ఈడీకి ఇచ్చింది. తదుపరి విచారణ ఏప్రిల్‌ 22వ తేదీన ఉంటుందని తెలిపింది. 

లిక్కర్‌ కేసులో తొలి నుంచి ఈడీ సమన్లను కేజ్రీవాల్‌ పట్టించుకోవడం లేదు. ఈలోపు ఈడీ కోర్టును ఆశ్రయించగా.. ఆయన బెయిల్‌ తెచ్చుకున్నారు. ఈలోపు మార్చి 21న తమ ముందు హాజరుకావాలంటూ ఈడీ నోటీసులు ఇచ్చింది. దీంతో ఈడీ నుంచి తొమ్మిదిసార్లు కేజ్రీవాల్‌కు సమన్లు జారీ అయినట్లైంది. 

అయితే.. ఈ సమన్లపై ఢిల్లీ సీఎం హైకోర్టును ఆశ్రయించారు. ఈడీ సమన్లు ​​చట్టవిరుద్ధమైనవని, రాజ్యాంగ విరుద్ధమని, నిబంధనలను ఉల్లంఘిస్తూ జారీ చేశారని కేజ్రీవాల్తన  పిటిషన్‌లో పేర్కొన్నారు. కేజ్రీవాల్‌ పిటిషన్‌ను విచారించిన హైకోర్టు జస్టిస్ సురేశ్ కైత్, మనోజ్ జైన్‌లతో కూడిన ధర్మాసనం.. చివరకు ఈడీని వివరణ కోరుతూ విచారణ వాయిదా వేసింది. 

రౌస్‌ అవెన్యూ కోర్టుకు ఈడీ 
అంతకుముందు లిక్కర్‌ కేసులో విచారణకు హాజరు కావాలంటూ ఈడీ సమన్లు జారీ చేయగా.. విచారణకు హాజరు కాకపోవడంతో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు ఢిల్లీ రోస్‌ అవెన్యూ కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. అరవింద్‌ కేజ్రీవాల్‌ కోర్టుకు హాజరయ్యేలా చూడాలని కోరారు. దీంతో రౌస్‌ అవెన్యూ కోర్టుకు హాజరైన కేజ్రీవాల్‌ బెయిల్‌ పొందారు. రూ.15వే వ్యక్తిగత బాండ్‌తో పాటు రూ.లక్ష సెక్యూరిటీ డిపాజిట్‌ చేయాలని న్యాయస్థానం ఆదేశించింది. అయినప్పటికీ ఈడీ మరోసారి సమన్లు జారీ చేయడం గమనార్హం.

Advertisement
Advertisement